24, అక్టోబర్ 2020, శనివారం

శుకమహర్షి

 ⚜️ *దేవీ కథలు - 1*⚜️ *శుకమహర్షి*


*పరాశర పుత్రుడైన వ్యాసమహర్షి ఒకనాడు సరస్వతీ నదీతీరంలో సంచరిస్తూ , తనకు సంతానం లేదని చింతాక్రాంతుడై ఉన్నాడు. అలా ఉండగా, సమీపంలోని ఒక చెట్టు కొమ్మపై రెండు చిలుకలు అతనికి కనిపించాయి. తల్లి చిలుక తన సంతానమైన చిన్ని చిలుకకు తన నోటితో ఆహారం అందిస్తూ, తన రెక్కలతో పిల్ల చిలుక శరీరం నిమురుతూ, పదేపదే ముద్దాడుతూ, తన వాత్సల్యాన్ని అందిస్తోంది. ఆదృశ్యాన్ని చూచిన వ్యాసునికి అంతరంగంలో దాగి ఉన్న పుత్ర ప్రేమ వెల్లువలా పెల్లుబికింది. "ఓహూ! ఈ చిలుక తన బిడ్డను లాలిస్తూ ఎంత మురిసిపోతోంది! పశు పక్ష్యాదులకే ఇంతటి ప్రేమ ఉంటే, ఇక మానవులకు తమ సంతతిపై ఎంతటి ప్రేమ ఉంటుందో కదా !పుత్రుని ముద్దుమోము చూచి ఆనందించే తండ్రి ఎంతటి అదృష్టవంతుడో !వివాహం కేవలం దాంపత్యసుఖం కోసమే కాదని, అది సంతాన ప్రాప్తికి సాధనమని శాస్త్రాలు చెప్తున్నాయి. పుత్రులు లేని వారికి వార్ధక్యంలో ఎవరు సేవలు చేస్తారు? వయస్సుమళ్ళి, శరీరబలం తగ్గి ఇతరుల సహకారంతో గడువలసిన శేషజీవితానికి పుత్రుడే ఆధారం కదా! తండ్రిమరణిస్తే, కుమారుడు శ్రాద్ధకర్మలు ఆచరించి, తండ్రికి ఉత్తమ గతులు కలిగిస్తాడు. అందువల్లనే*


*"అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ|*


*పుత్రాదన్యతరం నాస్తి పరలోకస్య సాధనమ్‌||"*


     *అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. "నేను కూడా దైవానుగ్రహంతో పుత్ర సంతతిని పొందగలిగితే ఎంత తృప్తిగా ఉంటుందో కదా! " అని వ్యాసునిలో అంతర్మథనం ప్రారంభమైంది. ఈ ఆలోచనతో అతడు తపస్సు చేయాలని సంకల్పించి , మేరు పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. సంతానం కోసం ఏ దైవాన్ని ఆరాధించాలో అతనికి తోచలేదు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, గణపతి, కుమారస్వామి , అగ్ని, వరుణుడు మొదలైన దేవతలలో తనకు అభీష్టసిద్ధిని ప్రసాదించగల వారెవ్వరో? అని తనలో తాను తర్కించుకుంటున్నాడు. ఇంతలో తన మహతీవీణపై మధురగానం ఆలపిస్తూ దేవర్షి అయిన నారదుడు వ్యాసునికి ఎదురు పడ్డాడు. వ్యాసుడు నారదునికి ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించి, కుశల ప్రశ్నలు వేశాడు*.


 *అపుడు నారదుడు, "వ్యాసమహర్షీ! వేల సంవత్సరాలు నిశ్చల తపోదీక్ష సాగించి అద్వైతామృతాన్ని ఆస్వాదించిన అదృష్టశాలివి కదా! పురాణ వాఙ్మయాన్ని సృష్టించి మానవాళికి అందించిన ధన్య చరితుడవు కదా! ఇలా దుఃఖంలో మునిగి ఉన్నావేమిటి? "అని ప్రశ్నించాడు. అందుకు వ్యాసుడు "నారదా! పుత్రులు లేని వారికి ఇహలోకంలో సుఖశాంతులు, పరలోకంలో సద్గతులు లేవని తెలుసుకున్నాను. సంతతిలేని నాకు సద్గతులు కలిగే అవకాశం లేదు కదా! కనుక, సంతతి పొందాలనే కోరిక కలిగింది. సంతతి పొందాలంటే దైవానుగ్రహం కావాలి. మీరు సర్వజ్ఞులు కదా! ఎవరిని ప్రార్థిస్తే*

                *నా కోరిక నెరవేరుతుందో సెలవీయండి. " అని ప్రాధేయ పడ్డాడు*.


           *నారదుడు, " వ్యాసమహర్షీ! ఇపుడు నీ వడిగిన ప్రశ్న వింటుంటే నా తండ్రి అయిన బ్రహ్మ తన తండ్రి అయిన శ్రీ మహావిష్ణువును ప్రార్థించిన సన్నివేశం నా తలపులలో మెదలుతోంది. ఆ వృత్తాంతం వివరిస్తాను. సావధాన చిత్తుడవై విను " అన్నాడు*.


 *వ్యాసుడు శ్రద్ధాళువై వింటూండగా, నారదుడు వివరించ సాగాడు*.


                  *" ఒకసారి బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి అక్కడ శ్రీమహావిష్ణువు ధ్యానముద్రలో ఉండడం చూచి, ఆశ్చర్యపోయాడు*.


   *" దేవాదేవా ! నీవే జగన్నాథుడవు కదా! నీవు ఇంకెవరిని ధ్యానిస్తున్నావో నాకు తెలియడంలేదు. నీ నాభి కమలం నుండి పుట్టిన నేను ఆ సృష్టికి కర్తను అనుకొంటున్నాను. సృష్టికర్తనైన నాకే జన్మనిచ్చిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడవు. నీ కంటే గొప్పవారు ఇంకెవరు ?సమస్త జగత్తునకూ నీవే మూలకారణం. ఈజగత్తునకు కర్తవు, భర్తవు, హర్తవు, కూడ నీవే కదా! నీ ఆజ్ఞచేతనే సూర్యుడు సంచరిస్తాడు. వాయువు ప్రసరిస్తాడు. అగ్ని ప్రజ్వలించినా, మేఘుడు వర్షించినా నీ కనుసన్నలకు లోబడే కదా! ఇలాంటి నీవు దైవాన్ని ఆరాధిస్తున్నాలో వివరించు" అని*


      *విష్ణువును ప్రార్థించాడు*.


         *అపుడు శ్రీహరి చిరునవ్వుతో "విరించీ! నీ సందేహం సమంజసమైనదే. లోకులందరూ నిన్ను సృష్టి కర్తగా, నన్ను స్థితికారకునిగా, రుద్రుణ్ణి సంహారశీలిగా భావిస్తూ ఉంటారు. కాని మనం సర్వస్వతంత్రులం కాము. మనం ముగ్గురమూ 'పరాశక్తి ' ప్రభావం చేతనే మన కర్తవ్యాలను నిర్వర్తించ గలుగుతున్నాము. నువ్వు భావిస్తున్నట్లుగా నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి అయితే, చేపగా, తాబేలుగా, పందిగా జన్మిస్తానా? జంతువుగా జన్మించాలని ఎవరు కోరుకుంటారు? ఆ పరాశక్తి సంకల్పబలం చేతనే నేను వివిధ వేషాలు ధరించి. ఆ జగన్మాత ఆజ్ఞకు బద్ధుడనై సంచరిస్తూ ఉంటాను, నేను నిరంతరమూ ధ్యానించేది ఆ పరాశక్తినే.మనం అందరమూ ఆ జగన్మాతను ఆరాధింప వలసిన వారమే " అని సమాధానం చెప్పాడు*.


 *కనుక, మహర్షీ ! సకల దేవతలకూ ఆరాధ్య అయిన ఆ పరాశక్తినే నీవూ ఆరాధించి కామితార్థాన్ని నెరవేర్చుకో*! "


  *నారదుని ప్రేరణతో వ్యాసుడు దేవి పాదపద్మాలను సేవించటానికి తపస్సు ప్రారంభించాడు*.


    *మేరుపర్వత ప్రాంతంలో తపస్సు చేస్తున్న వ్యాసుడు ఒకనాడు అగ్నిని రగిలించడానికి. 'అరణి' (ఒక కొయ్యను మరో కొయ్యముక్కతో) మథనం చేస్తుండగా , 'ఘృతాచి' అనే దేవకాంత చిలుక రూపంలో అతనికి కన్పించింది. ఆమెను చూడగానే వ్యాసుని మనస్సు క్షణకాలం పాటు చలించింది. మరుక్షణం లో అతని దేహం నుంచి ఒక తేజోకణం ఆరణిపై పడింది. ఆఅరణి నుండి ఒక దివ్య మూర్తి ఆవిర్భవించాడు. ఆడ చిలుక రూపాన్ని దాల్చిన ఘృతాచిని చూచి వ్యాసుని మనస్సు చలించగా జన్మించిన ఆ దివ్యమూర్తియే శుకమహర్షి*.


 *వ్యాసుడు ఆ బాలుణ్ణి తన ఒడిలో కూర్చొబెట్టుకొని, ముద్దాడి, పరమానంద భరితుడయ్యాడు. అపుడు దేవదుందుభులు మ్రోగాయి. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. అప్సరసలు నాట్యం చేశారు. గంధర్వులు గానం చేశారు. తుంబుర నారదాది మహర్షులు ఎంతో ఆనందించారు. అంతలో ఆకాశంనుండి శుకమహర్షి కోసం కృష్ణాజినము, దండకమండలాలూ దిగి వచ్చాయి. రెప్పపాటు కాలంలో అందరూ చూస్తూండగానే శుకమహర్షి పెరిగి పెద్దవాడయ్యాడు. వ్యాసుడు శుకునికి ఉపనయనం చేసి వేదవిద్యలన్నీ నేర్పించాడు. శుకుడు గురువుల వద్ద వేదవేదాంగాది విద్యలనూ సమస్త శాస్త్రాలను సమగ్రంగా అధ్యయనం చేశాడు*.


    *సమస్త విద్యా పారంగతుడై, తన వద్దకు తిరిగి వచ్చిన పుత్రుణ్ణి చూసి వ్యాసుడు ఆనందంతో పొంగిపోయాడు. శుకునికి వివాహం చేయాలని సంకల్పించాడు. నాయనా! యోగ్యురాలైన కన్యను వివాహమాడి, పవిత్రమైన గృహస్థ జీవితాన్ని ప్రారంభించు. గృహస్థాశ్రమంలో దేవ, పితృ, ఋషి ఋణాలను తీర్చుకొని సార్థక జీవితాన్ని సాగించు." అని కుమారునికి బోధించాడు*.


*జన్మతః జ్ఞాని, వైరాగ్య సంపన్నుడు అయిన శుకుడు" తండ్రీ! బంధ హేతువైన ఈ సంసార సాగరంలో నన్ను పడద్రోయాలని ఎందుకు భావిస్తున్నారు ?వైవాహిక జీవితం గొలుసులుతో కట్టబడిన బద్ధజీవితమే. లోహపాశమైన గొలుసులతో బంధింపబడినవాడు కొన్నాళ్ళకైనా బంధ విముక్తుడు కాగలిగే అవకాశం ఉంది. కాని, ఆలుబిడ్డలనే మోహపాశంతో బంధింపబడినవాడు ఎన్నటికీ మోక్షసామ్రాజ్యాన్ని పొందలేడు. అయోనిజుడనైన నాకు సంసార వాంఛలేదు. రక్తమాంసాదులతో, మలమూత్రాదులతో కూడిన నికృష్ఠమైన ఈ సంసారిక జీవనాన్ని నేను అంగీకరించలేను. గృహ, దారా, పుత్రాది వ్యామోహమనే సాగరంలో మునిగిన మానవుడు ఎన్నటికీ ఒడ్డుకు చేరలేడు. వేద శాస్త్రాలను అభ్యసించి కూడా జ్ఞాన వైరాగ్యాలను సంపాదించలేక, సంసారంలో పడి వ్యామోహంతో కాలం గడిపితే, అతని జీవితం , అతని విద్య అంతా నిరర్థకమే! కనుక, గృహస్థ జీవితం స్వీకరింప వలసినదిగా నన్ను నిర్బంధించకండి-" అని తండ్రి ప్రార్థించాడు*.


 *శుకుని మాటలను వ్యాసుడు అంగీకరించలేకపోయాడు*

*"కుమారా! మోక్షానికి గృహస్థాశ్రమం ప్రతిబంధకం కాదు నాయనా బంధమోక్షాలకు కారణం మనస్సే. గృహాస్థే అయినా, ధర్మాన్ని నిర్వర్తిస్తూ, పుణ్యకార్యాలు ఆచరించి, దైవానుగ్రహం పొంది, అభ్యాసబలంతో క్రమంగా ఇంద్రియాలను జయించి, చివరకు మోక్షాన్ని పొందవచ్చు. నాలుగు ఆశ్రమాలలోనూ గృహస్థాశ్రమమే శ్రేష్ఠమైనది. బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు గృహస్థ జీవితమే ఆధారం*.


               *అంతేగాక, మోక్షసౌధాన్ని అధిరోహించడానికి ఈ నాలుగు ఆశ్రమాలూ నాలుగు సోపానాలు, నాయనా! ఒక్కొక్క ఆశ్రమ ధర్మాన్నీ క్రమంగా పాటిస్తూ, చివరకు మోక్షాన్ని సంపాదించవచ్చు. బ్రహ్మచర్యాశ్రమంలో విద్యా వినయ సంపన్నుడై , సకల ధర్మవేత్తయై, జీవితం విలువను గుర్తించిన మానవుడు గృహస్థాశ్రమ స్వీకారానికి అర్హుడవుతాడు. గృహస్థ జీవితంలోని కష్టనష్టాలను ఓర్పుతో భరిస్తూ, అందలి అనుభవసారాన్ని గ్రహిస్తూ, ఇంద్రియాల తీరుతెన్నులను, భ్రమ ప్రమాదాలను లోనయ్యే పరిస్థితినీ గుర్తిస్తూ, అభ్యాస వైరాగ్యాలను అలవరచుకోవాలి. గృహస్థ ధర్మనిర్వహణలో తన బాధ్యతలన్నింటిని నెరవేర్చి, వైరాగ్య సంపన్నమైన మనస్సుతో మానవుడు వానప్రస్థ, సన్న్యాస ఆశ్రమాలకు అర్హుడుకాగలుగుతాడు. సన్యాస జీవితంలో సర్వసంగ పరిత్యాగం చేసి మోక్షపదవిని కైవసం చేసుకుంటాడు సాధకుడు*.


      *కుమారా! క్రమసోపాన పరంపర అయిన ఈ మార్గాన్ని అతిక్రమిస్తే, ఒక్కొక్కప్పుడు ఇంద్రియాలు బలీయమై మానవుణ్ణి పెడత్రోవలు పట్టించే అవకాశం ఉంది. మూడువేల సంవత్సరాలు నిరాహారిగా ఉండి ఉగ్ర తపస్సు చేసిన విశ్వామిత్రుడంతటివాడే దేవకాంత అయిన మేనకను చూచి, వ్యామోహితుడై కాలం గడిపి, శకుంతల అనే పుత్రికకు జన్మనిచ్చి, సంసార బంధంలో చిక్కుకొని , తన తపఃశ్శక్తిని వ్యర్థం చేసుకున్నాడు కదా !కనుక, క్రమసోపాన పరంపరను అనుసరించి మోక్షసాధనాన్ని చేరుకోవడానికి గృహస్థ జీవితమే సర్వోత్తమమైనది. నా మాట విని, గృహస్థాశ్రమాన్ని అంగీకరించవయ్యా" !అని పరిపరి విధాల నచ్చచెప్పాలని చూశాడు వ్యాసుడు*.


*తండ్రి ఎన్ని రీతులలో వివరించినా, ఎంతగా బోధించినా, శుకమహర్షికి ఆ మాటలు రుచించలేదు. సంసార జీవితంలోని దుఃఖాలను, క్లేశాలను తండ్రికి వివరించి, వివాహం పట్ల తన వ్యతిరేకతను స్పష్టం చేశాడు శుకుడు. సాగరంలో ఉన్నవాడి రక్తాన్ని జలగలు పీల్చినట్లుగా, సంసార సాగరంలో ఉన్న మానవుని సమస్త శక్తులనూ ఆలుబిడ్డలు పీల్చి పిప్పిచేసి, ఆ మానవుణ్ణి ఆధ్యాత్మిక సాధనకు అయోగ్యునిగా చేస్తారని- నిష్కర్షగా నిర్ణయించాడు శుకుడు .కనుక తనకు గృహస్థజీవితం వద్దని ఖండితంగా చెప్పాడు*.


 *గృహస్థాశ్రమం పట్ల పూర్తి వ్యతిరేక భావంతో ఉన్న తన పుత్రుడైన శుకునికి తాను ఎంత చెప్పినా, ఇక ప్రయోజనం శూన్యమని గుర్తించాడు. వ్యాసమహర్షి, "నాయనా! మిధిలానగరాధిపతి అయిన జనకమహారాజును నీవు ఒకసారి సందర్శించాలి. తత్త్వవేత్త, రాజర్షి అయిన జనకునితో నీ అభిప్రాయాన్ని ముచ్చటించు "అని సూచించాడు*.


         *తండ్రి ఆదేశాన్ని అనుసరించి శుకమహర్షి మిధిలానగరం చేరి, జనక మహారాజును కలుసుకున్నాడు. సమర్థుడై రాజ్యపాలన, సాగిస్తూ, పరమ ప్రశాంతమైన గృహస్థ జీవితాన్ని నిర్వహిస్తూ, జనకమహారాజు మహోత్కృష్టమైన తాత్త్విక సంపన్నుడై ఉండడం చూచిన శుకుడు*


 *"ఆశ్చర్యపోయాడు." ఇది ఎలా సాధ్యం?" అని తనలో తాను తర్కించుకున్నాడు. ఆ మాటే ఆ మహారాజును అడిగాడు*.


         *జనకుడు వ్యాసుని శిష్యుడు. శుకుని కుతూహలాన్ని చూచి జనకుడు ముచ్చటపడ్డాడు. తత్త్వజ్ఞాన సముపార్జనా కాంక్షతో తన గురుపుత్రుడే స్వయంగా తన చెంతకు నడచి రావడం తన పుణ్య పరిపాకమనుకున్నాడు. జిజ్ఞాసువైన శుకునికి ఓర్పుతో నేర్పుగా బోధించాడు. తన అనుభవానికి అక్షరరూపాన్ని కల్పించి వివరించాడు. "శుభాశుభ కర్మలకు మనస్సే ప్రధాన కారణం. మనస్సును అదుపుచేసుకున్నవాడు ఎక్కడ ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా మోక్షార్హుడే. గృహస్థుడైనా, మనస్సును స్వాధీనం చేసుకొని సన్యాస స్థితిలో నిలువవచ్చు. సన్యాసి అయినా మనస్సును జయించలేక పోతే పతనమై పోతాడు. జ్ఞాని కాలేడు*.


*"బలవాన్‌ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి"*


                 *బలవత్తరమైన ఇంద్రియ సమూహం పండితుణ్ణి సైతం ఆకర్షించగలదని ఆర్షసూక్తి. గృహస్థ జీవితంలో ఇంద్రియ వాంఛలను తీర్చుకొని, క్రమంగా వైరాగ్యం పొందితే, అలాంటి సాధకుని మనస్సు ఎన్నడూ వికలత్వం పొందదు. సంకల్ప వికల్పాలకు మనస్సే కారణం. అలాంటి మనస్సే సంసార వ్యామోహాన్ని కలిగించి జనన మరణ చక్రంలో పడవేస్తుంది. మనస్సు ఇంద్రియాలలోనికి జారిపోతే, అదే సంసారం. అదే బంధం. మనస్సు బుద్ధితో యోగాన్ని పొంది ఆత్మ దిశగా ప్రయాణిస్తే, అదే జ్ఞానం .అదే మోక్షహేతువు*.


    *శుక మహర్షీ!"గృహస్థ జీవితంలో నిష్కామ బుద్ధితో సత్కర్మ లాచరించాలి. యజ్ఞయగాదులతో దేవతలను, సత్సంతానం పొంది పితృదేవతలను ఆరాధించి వానప్రస్థ జీవితానికి అర్హతను సంపాదించు కోవాలి. పుణ్యకర్మాచరణం ద్వారా ఋషి ఋణం తీర్చుకోవాలి. ఋణత్రయ విముక్తిని పొందనిదే మోక్షానికి అర్హత సిద్ధించదు. కనుక గృహస్థుడవై ఋణత్రయ*


           *విముక్తిని పొంది, సన్యాసివై  మోక్షాన్ని పొందు"*.


               *జనకుని మాటలు శుకుని హృదయాన్ని సూటిగా తాకాయి. సున్నితంగా మీటాయి. జనకుని ప్రతిమాటా ఒక ఆణిముత్యం. ఒక అనుభవ సత్యం*.


        *మబ్బులు తొలగిన ఆకాశంలా శుకుని మనస్సు సందేహ నివృత్తిని పొంది ప్రశాంతమై వెలిగింది. అతడు జనకుని నుండి వీడ్కోలు పొంది, తండ్రి వద్దకు వచ్చి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి సుముఖతను వ్యక్తం చేశాడు. రాజర్షి అయిన జనకుని వద్ద తన పుత్రునికి కావలసిన ధర్మ సమన్వయం లభించినందుకు వ్యాసుడు సంతోషించాడు*.


      *అనురూపవతి అయిన కన్యతో శుకుని వివాహం జరిగింది. కొంత కాలానికి శుకునకు నలుగురు కుమారులు కలిగారు. వారిని పెంచి, పెద్దచేసి, యోగ్యులుగా తీర్చిదిద్ది, వారిపట్ల తన కర్తవ్యాన్ని నిస్సంగుడై నిర్వహించి, శుకమహర్షి వారికి జ్ఞానోపదేశం, చేసి తాను తపస్సు చేసే సంకల్పంతో ఏకాంత ప్రదేశానికి చేరి యోగ్యాభ్యాసబలం తో ఊర్ధ్వముఖంగా ప్రాణాలు వదలి, సర్వవ్యాపకమైన పరబ్రహ్మ తత్త్వంలో లీనమయ్యాడు*.


 *సర్వసంగ పరిత్యాగి, మహాతపస్వి అయిన వ్యాసునకు పుత్రవాంఛకలగడం , చిలుక రూపంలో ఉన్న ఘృతాచి అనే దేవకాంతను చూచి అతని మనస్సు చలించడం, శుకమహర్షి ఆవిర్భవించడం, వైరాగ్య సంపన్నుడైన శుకునికి జనకుని ద్వారా గృహస్థాశ్రమాన్ని గూర్చి సత్యసందర్శనం కలగడం అతడు గృహస్థ జీవితాన్ని అంగీకరించి, సంతతిని పొందడం ఇదంతా పరాశక్తి ప్రభావమే. ఆ తల్లి మాయా విలాసానికి అందరూ లోబడవలసిందే కదా!*


*" పరమాద్వైత రసానుభూతి సుఖసంపన్నుండటే వ్యాసుఁడి*


*వ్వరుసన్‌ సంసరణోచిత వ్యసన భావంబూనె నొండేల? య*


*ప్పర దేవీ కుహనాబ్థి మజ్జనము దప్పన్‌, ద్రోయనెవ్వారికిన్‌*


*దరమే? స్థావర జంగమాత్మకము నేతద్విశ్వమందెప్పుడున్‌. "* 


🕉⚛⚛🕉☸☸


సేకరణ; హిందూ ధర్మ చక్రం వాట్స్ అప్ గ్రూప్ వారీ నుంచి...

కామెంట్‌లు లేవు: