16, అక్టోబర్ 2020, శుక్రవారం

త్రిపురారహస్య

 **దశిక రాము**


**త్రిపురారహస్య జ్ఞానఖండసారము**


అమ్మదయ గలవారు మాత్రమే దీనిని చదవగలరు 


PART-10


మాటమాత్రముననే శ్రీరాముఁడు శరచాపములను గైకొని శరసంధానము గావించినంతనే భార్గవుఁడు తనశక్తి యంతయు ఉడిగిపోయినట్లు నిశ్చేష్టఁ డయ్యెను. విష్ణుధనువును గైకొని విరాజిల్లుచున్న శ్రీరామచంద్రుని జూచుటకు ఇంద్రాదిదేవతలును వచ్చియుండిరి. ఆసన్నివేశమును చూచినంతనే భార్గవునకు విష్ణుదేవుఁడే ఆబాలుఁడుగా అవతరించెనని స్ఫురించి మెల్లగా నిటన్లనెను. ''నీవు విష్ణుదేవుఁడవు. లోకేశ్వరుఁడవైన నీవలన నేను పరాజయము నొందుట నాకు అవమానకరము కాదు. కశ్యపున కిచ్చినమాట చొప్పున నేను రాత్రియగునప్పటికి మహేంద్రగిరికి చేరవలె. కావున నాగమనమును నిరోధింపకుము. నేను ఆర్జించిన పుణ్యలోకములు పెక్కు కలవు. వానిని ఆబాణమునకు లక్ష్య మొనరింపుము. ఇంక విలంబము వలదు. ఇదిగో నీవిక్రమమును వీక్షించుటకు దేవతలును వచ్చియున్నారు. బాణమును వదులుము. ఆపుణ్యలోకములు దగ్ధములగుటఁ జూచి నేనును సెలవు తీసికొందును''.

రామునిబాణమున భార్గవుని పుణ్యలోకములు భస్మమయ్యెను. వెంటనె భార్గవుఁడు శ్రీరామునకు విష్ణుదేవుఁడే అనుభావముతో ప్రదక్షిణ మాచచించి బయలుదేరెను. శ్రీరాముఁడు ఆయనకు ప్రణమిల్లి సాగనంపెను. అటనుండి తిరిగివచ్చుచు భార్గవుఁడు తనపూర్వచరిత్రమునంతయు తలపోయుచు చాలనిర్వేదము నొందెను. ఆసమయమున దైవికముగా అవధూతయైన సంవర్తుఁడు ఎదురుపడెను. ఆమహాత్ముని యాదేశము ననుసరించి భార్గవుఁడు దత్తాత్రేయు నాశ్రయించి త్రిపురాదేవి నుపాసించెను. తత్ఫలముగా ఆయనకు దేవీస్వరూపమునుగూర్చి జగత్తునుగూర్చి తన్నుగూర్చి పెక్కు సంశయములు కలిగెను. వెంటనే ఆయన మరల గురువు నాశ్రయించి సంశయములను అడిగి తత్త్వమును తెలిసికొని జీవన్ముక్తుఁ డయ్యెను.

ఇందు గమనింపవలసిన యంశములు అనేకములు కలవు. గురువరేణ్యుఁడైన దత్తాత్రేయు నాశ్రయించి సంవర్తుఁడు అవధూతయయ్యెను; భార్గవరాముఁడు జీవన్ముక్తుఁడయ్యెను. మఱి ఆయననే సేవంచిన కార్త వీర్యుడు అసూయాపరుఁడై బ్రాహ్మణుని ధేనువు నేల హరించెను? గురువు ఒక్కఁడే యైనను శిష్యుల యధికారములలోని భేదములనుబట్టి విద్యలయందును భేదమేర్పడును. కార్త వీర్యుఁడు విర్తక్తుఁడు కాదు; జిజ్ఞాసువు కూడ కాదు. అతఁడు శక్తి సంపదను పెంపొందించుకొనటకై దత్తాత్రేయు నాశ్రయించి యోగవిద్య నభ్యసించి అణిమాద్యష్టసిద్ధులను సంపాదించెను. అంతే కాని అతఁడు తత్త్వమునుగూర్చి అడుగలేదు. గురువు బోధింప లేదు. కావున అతఁడు తత్త్వజ్ఞుఁడు కాలేదు. అతఁడు ఐహికమైన యైశ్వర్యమునే అనుభవించుచు సంతోషించుచుండెను. అందువలన ఒకబ్రాహ్మణుఁడు హోమధేనువువలన తనకన్న అధికమైన యైశ్వర్యము కలవాఁడై ప్రకాశించుచుండట ఆమహారాజునకు సహిపరాని దయ్యెను. కావున ఆధేనువును హరించుటకు పూనుకొని వినాశ మొందెను.

కార్త వీర్యునిపుత్రలు జమగద్నిని సంహరింపఁగా భార్గవుఁడు వారిని వధించుటతో ఆగక క్షత్రియులను ఇరువది యొక్క పర్యాయములు వధించినప్పుడు శమంతపంచకములోఅయిదు రక్తపుమడుగు లేర్పడినవి. భార్గవుఁడు కార్తవీర్యుని పుత్రులను మాహిష్మతిలో సంహరించెను. అది నర్మదానదీతీరమున నున్నది. శమంతపంచకము కురుక్షేత్రములో నున్నది. అనఁగా క్షత్రియులను సంహరింపఁబూనుకొనినప్పుడు ఆయన పుణ్యక్షేత్రముననే రణరంగమును ఏర్పఱచెనన్నమాట సంహరింపఁబడినవారికి ఉత్తమ మగతులు కలుగవలయునని ఆయన ఇట్లు ఏర్పఱచియుండును. రక్తము గడ్డకట్టకుండ మడుగులుగా ఏర్పడునా? ఆభూమిలోని ధాతువుల గుణమువలనచుట్టునున్న వృక్షమూలికల ప్రభావమువలన అట్లు సంభవించి యుండవచ్చను.


 PART-10

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: