16, అక్టోబర్ 2020, శుక్రవారం

తులసీ

 : *శ్రీ తులసీ మాహాత్మ్యమ్*

(తులసి కోయునపుడు అనుసంధానము చేయదగిన శ్లోకము)


*తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవ ప్రియే!*

*కేశవార్థం లునామి త్వాం వరదాభవ! శోభనే!*


శుభాలను ఇచ్చే ఓ తులసీ! నీవు పరమాత్మకు ఎప్పుడును చాలా ఇష్టమైన దానవు. నీవు అమృత జన్మవు. అందువలన నిన్ను కేశవార్చనకై తుంచుచున్నాను శుభాలను ఇవ్వమ్మా!.


*శ్రీకృష్ణార్పణమస్తు*

[: _*

శ్రీ దేవి భాగవతం - 62 వ అధ్యాయము*_




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️




*వ్యాసమునిచంద్రు డిట్లనియె :* ఈ ప్రకారముగ రామలక్ష్మణులు విచారించి మౌనముగ నుండిరి. అంతలో గగన సీమనుండి నారద భగవాను డేతెంచెను. ఆ మహర్షి షడ్జాది స్వరములతో నొప్పారు మహతీ వీణను మీటుచు బృహద్రథ సామగానము సేయుచు రాముని సమీపించెను. తేజశ్శాలి యగు రాము డతనిని వీక్షించి యతనికి శుభాసనము నర్ఘ్యపాద్యములు నొసంగి పరమపూజ లాచరించి యంజలి ఘటించి యతని యనుమతితో నతని సన్నిధి నుపవిష్టు డయ్యెను. రాముడు తన తమ్మునితో గూడి మదిలో గుందుచు దిగులుతో గూరుచున్న శ్రీరాముని మహర్షి కుశల మడిగెను: ఓ రాఘవేంద్రా! ఒక ప్రాకృత నరుని పగిది శోకింతు వేల? క్రూరుడు రావణుడు సీతను హరించుట నే నెఱుంగుదును. అతడు తన చావు తా నెఱుగలేక మోహవశమున సీత నపహరించెను. ఇదంతయును నేను సురలోక మందుండియే వింటిని. ఓ కాకుత్థ్సా! నరాధిపా! నీవు రావణ వినాశమునకే యవతరించితివి. అందులకే యతడు సీత నపహరించెను. పూర్వజన్మమున సీత యొక ముని కుమారిగ జన్మించెను. ఆమె వనములందు ఘోర తప మొనరించుచు రావణుని కంటబడెను. అత డామెను తనకు భార్యగ గమ్మని వేడుకొనెను. కాని, యామె యతనిని తిరస్కరించెను. అత డామె కేశపాశములు బట్టి బలిమితో లాగెను. ఓ రామా! ఆ దుష్టాత్ముని స్పర్శము చేత తన శరీరము కళంకితమైనదని యెంచి యామె తన తనువు చాలింపదలచెను. ఆమె వెంటనే కోపమునంఓరీ దురాత్మా! నేను నీ వినాశమునకై భూమిపై నయోనిజగ సంభవింపగలను'' అని శపించి యామె తన మేను చాలించెను.


ఆ యీ సీత లక్ష్మ్యంశ సంభూతురాలు. నాగుపామును పూలమాల యను భ్రాంతితో బట్టినట్లుగ నతడు తన కులనాశనమునకు సీత నపహరించెను. ఓ సుజన మనోనయనాభిరామా! రామా! అతని సర్వనాశమునకే నీవును సంభవించితివి. ఎల్లదేవతలును ప్రార్థింపగా జన్మములేని నీవు నారాయణాంశమున నజుని వంశమునందు అవతరించింతివి. మహాబాహూ! ధైర్యము వహింపుము. అచ్చట సీతయును ధర్మరతయు సతియునై అవశయై రేయింబవళ్ళు నిన్నే తన మదిలో ధ్యానించుచు నున్నది. దేవేంద్రుడు స్వయముగ నొక పాత్రలో నమృత మధురములైన కామధేనువు పాలు పోసి త్రాగుట కామె కంపించెను. ఆ దివ్య గోక్షీరము త్రాగుటచే నా కమలదళనయన యాకలి దప్పులు పాసి సుఖ ముండెను. ఇదంతయును నేను గంటిని. రాఘవా! రావణుడు చచ్చుటకు నీకొక వ్రతము దెల్పుదును. అదేమన, నీ వాశ్వయుజ మాసమున శ్రద్ధతో శ్రీదేవీ నవరాత్ర వత్ర మాచరింపుము. రామా! నవరాత్రములం దుపవసింపుము. దేవిని జపహోమాది విధులతో బూజింపుము. నీకు సర్వసిద్ధులు కరతలామలకము లగును. దేవికి యాగ పశువును బలి యొసంగుము. జపదశాంశము వేల్చుము. దీనివలన నీ వధిక శక్తిమంతుడవు గాగలవు. పూర్వము శ్రీ మహావిష్ణువు శివుడు బ్రహ్మ సురలోకమందలి యింద్రుడును యథావిధిగ నీ దేవీ నవరాత్ర వ్రతము జరిపిరి. నీలమేఘశ్యామా! రామా! ఈ నవరాత్ర వ్రతమును సుఖములు బొందువారు సేయవలయును. కష్టములలో బాధపడువారు చేయుట మరింత యవసరము. తొల్లి వసిష్ఠుడు భృగువు కశ్యపుడు విశ్వామిత్రుడు నీ దేవీ నవరాత్ర వ్రతము సల్పి సుఃంచి రనుటలో లేశమయినను సందియము లేదు. మునుపు బృహస్పతి భార్య యపహరింపబడెను. అపు డత డీ దేవీ నవరాత్ర వ్రత మాచరించెను. నీవును రావణ వధార్థము దీని నాచరింపుము. మున్ను దేవపతి వృత్ర సంహారమునకును శివుడు త్రిపుర వినాశమునకును ఈ దేవీ నవరాత్ర వ్రత మాచరించిరి.



సీతాపతి! మహామతీ! శ్రీహరి తొలిసారిగ మధు సంహారమునకు మేరుగిరిపై శ్రీదేవీ మహావ్రతము యథావిధిగ నప్రమత్తతతో నొనరించెను. రామభద్రుడిట్లనియెను : ఓ దయానిధీ! సర్వజ్ఞా! ఆ మహాదేవి యెవరు? ఆమె పేరేమి? ఆమె యెట్లు ప్రాదుర్భవించెను? ఆమె ప్రభావ మెట్టిది? ఆ దేవీ వ్రతమేది? నా కంతయు యథావిధి నెఱిగింపుము. నారదు డిట్లనియెను. ఓ రామా! శ్రద్ధగ నాలింపుము. ఆ దేవి నిత్య - సనాతని - ఆద్యశక్తి- విశ్వపూజిత-సర్వదుఃఖనాశని - అభీష్ట ప్రదాయిని. గడ్డిపోచ మొదలుకొని బ్రహ్మవఱకు గల సకల జంతువుల కామె కారణభూతురాలు. ఆమె చేతనశక్తి తోడులేనిచో నెవడును కదలనైన నోపడు. బ్రహ్మలోని పుట్టించు శక్తియు విష్ణు నందలి పాలనశక్తియు రుద్రుని యందలి సంహారశక్తియు నివన్నియు నా మహాశక్తి యొక్క ప్రతిరూపములే. ఆ మహాశక్తియే పరాశివశక్తి యన చెలువు మీరును. ఈ రేడు లోకాలలో సదసదాత్మక రూపమున భాసిల్లు ప్రతి చిన్న వస్తువులోని శక్తియు నా పరాచైతన్య మహాశక్తి నుండియే కలుగుచున్నది. ఈ సకల సృష్టికి పూర్వము హరిహరబ్రహ్మలు సూర్యుడు సురపతి భూమి గిరులు మొదలగు దేవతలు ఎవరును - ఏమియు నుండలేదు. అట్టి సమయమున ఆ పరమ ప్రకృతి శక్తి పరమపురుషునితోడి పరమ బ్రహ్మానంద సంగమమున పరిపూర్ణయై నిర్గుణ శివ స్వరూపమున విలసిల్లెను. సృష్టి ప్రారంభమున నా ప్రకృతి మహాశక్తి సగుణ రూపము దాల్చును. ఆ శక్తి యీ భువనత్రయమును సృజించును. బ్రహ్మాదులను పుట్టించి, వారిని సర్వశక్తి సంపన్నులను జేయుము. ఆ యెల్ల లోకముల నేలెడి తల్లి - మహావిద్య - వేదాద్య - వేదకారిణి - యని యెఱిగినవాడు జన్మమరణ సంసార సాగర బంధనముల నుండి విముక్తు డగును. ఆ మహాదేవి యొక్క గుణకర్మ విభాగములు బట్టి బ్రహ్మాదు లామెకు పెక్కు నామము లుంచిరి. ఆ దేవీ నామము లనంతములు. అకారాది క్షకారాంతములగు స్వర వర్ణఘటనలతో నా దేవీ సుధామధుర నామములు శతసహస్రాధికములు గలవు.



అనగా రాముడిట్లనియెను: ఓ దేవర్షీ! నా కా దేవీ వ్రత విధానము సంక్షేమముగ దెల్పుము. నే నిపుడే శ్రద్ధా భక్తులతో దేవీ వ్రత మాచరింతును. అన నారదుడిట్లనియెను. ఓ రామభద్రా! ఒక సమతల ప్రదేశమున నొక పీఠమేర్పరచవలయును. దానిపై జగదంబికను స్థాపించవలయును. ఉపవసించి యథావిధిగ దేవీ నవరాత్ర వ్రత మాచరింప వలయును. ఈ దేవీ శుభవ్రత మహోత్సవమునం దాచార్యుడుగ నేనే యుందును. నాకు దేవీ కార్య నిర్వహణమున నమితోత్సాహము గల్గుచుండును.''



వ్యాసుడిట్లనియెను: ముని పలుకులు విని అవి లోన గట్టిగ నమ్మి మహావీరుడగు రాము డొక యున్నతమైన పీఠము చేయించెను. దానిపై నంబికను ప్రతిష్ఠించెను. రాము డా గిరిపై నుండగనే యంతలో నాశ్వయుజ మాసము సమీపించెను. శ్రీరాముడు యథావిధిగ దేవీ నవరాత్ర పూజ లోనరించెను. రాము డుపవాసముతో నుత్తమ దేవీ వ్రత మాచరించెను. యథా విధిగ పూజా హోమ బలి విధానము లొనరించెను. ఆ యిరువు రన్నదమ్ములును నారదానుమతముతో దేవీ వ్రతము సలిపిరి. అష్టమినాడు నడిరేయి శ్రీ భగవతీదేవి వారి భక్తిభావమునకు సుప్రసన్నయై సింహాసనాసీనయై గిరిశిఖర మందుండి వారికి దర్శన భాగ్య మొసంగి మేఘగంభీర నాదమున సానుజుడగు రామున కిట్లనియెను:


రామా! రామా! ఓ మహాబాహూ! నీ వొనరించిన వ్రతమునకు సంతుష్టి జెందితిని. నీ మన మందలి యేదేని వరము గోరుకొనుము. నీవు నారాయణాంశ సంభూతుడవు. పావన మను వంశ పంజాతుడవు. అమరులు నిన్ను రావణ వధార్థము ప్రార్థించిరి. మున్ను నీవు మత్స్యరూపము దాల్చి క్రూర దనుజుని హతమార్చితివి. దేవతల మేలు గోరి వేదములను గాపాడితివి. కూర్మ రూపము దాల్చి మందరగిరి నెత్తితివి. పాలసంద్రము మధించునపుడు విబుధులకు సంతసము గల్గించితివి. వరాహావతార మెత్తి కొనకోఱలపై భూమిని ధరించితివి. హిరణ్యాక్షుని వధించితివి. భీకర నరసింహావతారము ధరించి హిరణ్యకశిపుని పరిమార్చితివి. రామా! భాగవతోత్తముడగు ప్రహ్లాదుని గాచితివి. వామన రూపమున బలి గర్వ మడగించితివి. దేవకార్యము నిమిత్త మింద్రునకు సోదరుడ వైతివి. విష్ణువంశమున జమదగ్నికి తనయుడవై యుద్భవించితివి. క్షత్రియుల నెల్ల సంహరించితివి. బ్రాహ్మణులకు భూమి నంతయును దాన మొసంగితివి. ఓ కాకుత్థ్సా! అట్టి నీవే యిపుడు దశరథుని నందనుడవై యవతరించితివి. రావణ పీడితులైన దేవత లెల్లరును నిన్ను శరణు వేడిరి. ఇచటి కపివీరులు దేవాంశజులు. మహాబలవంతులు. వీరు నీకు సాయ మొనరింపగలరు.


నీ యీ రూపములన్నియును నా మహాశక్తితో సంపన్నములై సంభవించినవి. లక్ష్మణుడు శేషు నంశమున నుద్భవించెను. అతడు రావణుని కుమారుని పరిమార్చగలడు. నా మాటలందు నీ కెంతమాత్రమును సందేహము వలదు. ఇదే విధముగ నీవు వసంత నవరాత్రములను జరిపి శ్రద్ధతో దేవీపూజ లొనరింపుచుండవలయును. నీవా పాపాత్ము డగు రావణాసురుని దునుమాడి భూమిపై పదునొక్కండు వేలేండ్లు సుఖశాంతులతో రామరాజ్యము నెలకొల్పుదువు. ఆ పిదప నీవు స్వర్గలోక మేగుదువు అని యీ విధముగ దేవి పలికి యంతర్ధాన మొందెను. శ్రీరాముడు సంతుష్టాంతరంగు డయ్యెను. శ్రీరాము డీ విధముగ శ్రీ మద్దేవీ నవరాత్ర వ్రతము పరిసమాప్తము గావించి దశమినాడు విజయా (దశమీ) పూజ లొనరించి అనేక దాన ధర్మము లొనరించెను. జైత్రయాత్ర సాగించెను. ఆ రణశూరుడు కోదండ రాముడు నగు రాముడు కపిపతి యగు సుగ్రీవ బలము సాయముతో లక్ష్మణుని గూడి పరమశక్తి ప్రేరితుడై పూర్ణకాముడై సముద్రముపై సేతువు గట్టెను. సురవైరి యగు రావణు నంతమొందించెను. సుగుణకీర్తిధాముడై స్థిరముగ విలసిల్లెను. ఏ పుణ్యాత్ముడు డీ యుత్తమోత్తమమైన దేవీ చరిత్ర మాకర్ణించునో యతడు విపుల భోగములంది పిదప పరమసౌఖ్యము లనుభవించును. ఎన్నెన్నో పురాణములు విపులములు గలవు. కాని యవన్నియు శ్రీ మద్దేవీ భాగవతముతో సరిపోలజాలవనియు నా దృఢ విశ్వాసము అని వ్యాసముని జనమేజయునితో పలికెను.



*ఇది శ్రీదేవీ భాగవతమందలి తృతీయ స్కంధమందు ముప్పదవ యధ్యాయము.*



*ఇట్లు శ్రీ దేవీభాగవతమందలి తృతీయస్కంధమున 1746 శ్లోకములను శ్రీ వ్యాస మహర్షి రచించెను.*


*శ్రీ దేవీ భాగవత తృతీయ స్కంధము సమాప్తము.*


*రేపటి నుండి చతుర్థ స్కంథము ప్రారంభం*

కామెంట్‌లు లేవు: