16, అక్టోబర్ 2020, శుక్రవారం

ధర్మసూక్ష్మములు

 ధర్మసూక్ష్మములు


పరమాచార్య స్వామి వారితో ఒక భక్తుడు ఇలా అన్నాడు, “పెరుగన్నం ఎక్కువగా మిగిలిపోయింది. దాన్ని ఆవుకు పెట్టాను. అది ఎంతో తృప్తిగా ఆరగించింది”.

వెంటనే స్వామివారు, “పెరుగన్నం కాని, పాలు కలిపిన అన్నం కాని ఆవుకు పెట్టరాదు. పెరుగు పాల నుండి వస్తుంది, పాలు ఆవు నుండి వస్తాయి.”


ఆ భక్తుడు బాధపడుతూ, “నేను అపచారం చేశాను, నన్ను క్షమించండి పెరియవా” అని వేడుకున్నాడు.


“సరే జరిగిపోయింది; ఇక ఎప్పుడూ అలా చెయ్యకు. ఇతర ప్రాణులకు పాలు, పెరుగు లేదా నెయ్యి కలిపిన అన్నం పెట్టవచ్చు. కాని గోవులకు మాత్రం పెట్టరాదు”.


మనస్సులో నటుకునేలా ధర్మసూక్ష్మములను చెప్పడం కేవలం పరమాచార్య స్వామివారికి మాత్రమే సాధ్యం.


**************************************************


పరమాచార్య స్వామివారు చిన్న కాంచీపురంలో ఉన్నప్పుడు, ప్రతిరోజూ తప్పక వరదరాజ స్వామి దేవాలయ ప్రదక్షిణ చేసేవారు. ఒకరోజు ఉదయం దేవాలయ ప్రదక్షిణ పూర్తైన తరువాత, చుట్టూ ఉన్న భక్తులు విష్ణు సహస్రం పఠిస్తుండగా మహాస్వామి వారు ఒక వీధిలో నడిచి వెళ్తున్నారు.


ఒక ఇంటి ముందర చిన్న అమ్మాయి ముగ్గు వేస్తూ ఉంది.


పరమాచార్య స్వామివారు ఆగారు. “నువ్వు ముగ్గు చాలా బాగా వేశావు. భేష్! కాని ముగ్గును కేవలం బియ్యపు పిండితో మాత్రమే వెయ్యాలి. అప్పుడే ఈగలు, చీమలు, పక్షులు ఆ పిండిని తింటాయి; ముగ్గు వేసిన నీవైపు సంతోషంతో చూస్తాయి. ముగ్గు పిండితో ముగ్గు వెయ్యడం వల్ల ఏ జీవికి ఉపయోగం లేదు, తెలిసిందా?” అని అన్నారు.


ఆ అమ్మాయి సరే అన్నట్టు తలాడించి, స్వామివారికి పంచాంగ సంస్కారం చేసింది.


పరమాచార్య స్వామివారి ఈ ఆదేశం కేవలం ఆ అమ్మాయికి మాత్రమేనా లేక అందరు ఆడ పిల్లలకా? ఈ విషయం తల్లులు కాస్త గమనించాలి.


--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

కామెంట్‌లు లేవు: