17, ఏప్రిల్ 2021, శనివారం

ఇతిహాసాలు

 *📖 మన ఇతిహాసాలు 📓*


*సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఆలయాలే లేవెందుకు? త్రిమూర్తుల్లోకెల్లా చిన్నవాడయిన బ్రహ్మ ఎప్పుడూ వృద్ధుడుగానే ఉంటాడెందుకు?*


పద్మపురాణం ప్రకారం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోని తామరపూవునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజుని సంహరించాడట సృష్టికర్త. ఆ సందర్భంగా పూవునుంచి రేకులు మూడుచోట్ల రాలి మూడు సరస్సులు ఏర్పడ్డాయట. వాటినే జ్యేష్ట పుష్కర్‌, మధ్య పుష్కర్‌, కనిష్ట పుష్కర్‌ అని పిలుస్తున్నారు. పైగా బ్రహ్మ భూమ్మీదకి వచ్చి తన చేతి(కరం)లోని పుష్పం నుంచి రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్‌ అని పేరు పెట్టాడట. ఆ తరవాత లోకకల్యాణం కోసం అక్కడే యజ్ఞం చేయాలనీ సంకల్పించాడట. ఎలాంటి ఆటంకాలూ లేకుండా యజ్ఞం ప్రశాంతంగా నిర్వహించేందుకు రాక్షసులు దాడి చేయకుండా సరస్సుకి దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, పశ్చిమాన సంచూరా, తూర్పున సూర్యగిరి అనే కొండల్ని సృష్టించి దేవతలందరినీ ఆహ్వానించాడు. సుమూహుర్తం ఆసన్నమయింది. ఆహూతులంతా విచ్చేశారు. సావిత్రీదేవి(ఈమెనే సరస్వతి అని పిలుస్తారు)ని తీసుకుని రమ్మని కుమారుడైన నారదుడిని పంపిస్తాడు బ్రహ్మ.


నారదుడు వెళ్లేసరికి ఆమె రావడానికి సిద్ధంగానే ఉంది. కానీ కలహభోజనుడు వూరికే ఉంటాడా... 'నువ్వు ఒక్కదానివే అప్పుడే వచ్చి ఏం చేస్తావు. నీ స్నేహితులతో కలిసిరమ్మ'ని సలహా ఇస్తాడు. దాంతో తన సహచరులైన లక్ష్మీ, పార్వతిలతో కలిసి వద్దామని ఆగిపోతుంది సావిత్రి. యజ్ఞవాటిక దగ్గర మూహూర్తం మించిపోతోంది. సావిత్రీదేవి జాడ లేదు. దేవతలు, రుషులు అంతా సిద్ధంగా ఉన్నారు. అనుకున్న మూహూర్తానికే యజ్ఞం జరగాలన్న తలంపుతో బ్రహ్మదేవుడు ఇంద్రుడితో 'వెంటనే ఓ అమ్మాయిని చూడు. వివాహం చేసుకుని యజ్ఞం నిర్వహిస్తాను' అనడంతో సమీపంలోని గుజ్జర్ల కుటుంబానికి చెందిన పాలమ్ముకునే ఓ అమ్మాయిని తీసుకొస్తాడు ఇంద్రుడు. శివుడు, శ్రీమహావిష్ణువు సలహాల ప్రకారం గోవులోకి పంపించడం ద్వారా ఆమెను శుద్ధి చేస్తారు. ఇలా చేస్తే ఆమె పునర్జన్మ ఎత్తినట్లేనని చెప్పి అభ్యంగన స్నానం

చేయించి సర్వాభరణశోభితురాలిని చేస్తారు. గోవుతో శుద్ధిచేయబడినది కాబట్టి ఆమెకు గాయత్రి అని నామకరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంభిస్తారు. పూర్తవుతున్న సమయంలో అక్కడకు వచ్చిన సావిత్రీదేవి బ్రహ్మదేవుడికి పక్కన మరో స్త్రీ ఉండటం చూసి ఉగ్రరూపం దాలుస్తుంది. బ్రహ్మదేవుడితోసహా అక్కడున్న వారందరినీ శపిస్తుంది. భర్తని వృద్ధుడై పొమ్మనీ ఆయనకు ఒక్క పుష్కర్‌లో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవనీ శపిస్తుంది. అన్ని యుద్ధాల్లోనూ ఓటమి తప్పదని ఇంద్రుడినీ, మానవజన్మ ఎత్తి భార్యావియోగంతో బాధపడతావని విష్ణుమూర్తినీ, శ్మశానంలో భూతప్రేతగణాలతో జీవించమని ఈశ్వరుణ్ణీ, దారిద్య్రంతో ఇల్లిల్లూ తిరిగి భిక్షాటన చేసుకొమ్మని బ్రాహ్మణులనీ ధనమంతా దొంగలపాలయి నిరుపేదగా మారమని కుబేరుణ్ణీ శపిస్తుందట. తరవాత ఆమె రత్నగిరి పర్వతాల్లోకి వెళ్లి తపస్సమాధిలోకి వెళ్లిపోయిందనీ ఆపై నదిగా మారిందనీ చెబుతుంటారు.


దీన్ని సూచిస్తూ రత్నగిరి కొండమీద సావిత్రీమాత ఆలయంతోపాటు ఓ చిన్న నీటిప్రవాహం కూడా ఉంది. దీన్ని సావిత్రీనది అని పిలుస్తారు స్థానికులు. ఆమెను పూజించిన స్త్రీలకు నిత్యసుమంగళి వరాన్ని ప్రసాదిస్తుందన్న నమ్మకంతో పుష్కర్‌ను సందర్శించిన భక్తులంతా ఆమె ఆలయాన్ని కూడా తప్పక దర్శిస్తారు.


సావిత్రీదేవి వెళ్లిన తరవాత బ్రాహ్మణులను యజ్ఞం పూర్తిచేయమని కోరతాడు బ్రహ్మదేవుడు. అందుకు వారంతా తమకు శాపవిముక్తి చేయమనీ ఆ తరవాతే యజ్ఞక్రతువు చేస్తామనీ అంటారట. అప్పటికే యజ్ఞఫలంతో సిద్ధించిన శక్తులతో గాయత్రీదేవి పుష్కర్‌ ప్రముఖ తీర్థక్షేత్రంగా వర్ధిల్లుతుందనీ ఇంద్రుడు మళ్లీ స్వర్గాన్ని గెలుచుకుంటాడనీ విష్ణుమూర్తి రాముడిగా జన్మిస్తాడనీ బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని అందుకుంటారంటూ శాపతీవ్రతని తగ్గిస్తుందట. బ్రహ్మదేవాలయం పుష్కర్‌లో మాత్రమే ఉండటానికి ఇదే కారణమట. అయితే బ్రహ్మదేవాలయాలు అత్యంత అరుదుగానయినా అక్కడక్కడా లేకపోలేదు.


*chandrasekharrallabhandhiastrloger🎣*

కామెంట్‌లు లేవు: