1, మార్చి 2023, బుధవారం

మానవుడెంత పురాతనుడో

 మానవుడెంత పురాతనుడో అంత పురాతనులు వారు


ప్రబలుతున్న భౌతికవాదం వల్లగానీ, విస్తరిస్తున్న పారిశ్రామీకరణం వల్లగానీ, సంకీర్ణంగావున్న ఆధునిక జీవన పద్ధతుల వల్ల గానీ, భారతదేశంలోని ఆధ్యాత్మికతకు ఎలాంటి హాని కలగదని శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర యతీంద్ర సరస్వతీ పరమాచార్య స్వామి వారన్నారు. మతంలో ఔత్సుక్యమూ, నిష్టా ప్రస్తుతం తగ్గిపోతున్నట్లు కనబడినప్పటికీ, యోగులూ, ఋషులూ పుట్టి హిందూమతాన్ని తప్పక సముద్దరిస్తారని తమ అభిప్రాయం కచ్చితంగా చెప్పారు.


రెండవ ఆగమసదస్సు సందర్భంగా మధుర సమీపంలోని నారాయణవరంలో స్వామివారు విడిదిచేసి వున్నప్పుడు ఒక సోమవారం రాత్రి మద్రాసులోని అమెరికా కాన్సల్ జనరల్ గా ఉద్యోగం చేస్తున్న డాక్టర్ ఆల్బర్ట్ డి. ఫ్రాంక్లిన్ తో సంభాషిస్తూ ప్రసంగవశాన వారు వెలిబుచ్చిన అభిప్రాయం ఇది.


అమెరికా కాన్సల్ జనరల్ స్వామి విడిదికి వచ్చి సంభాషించారు. వారి గోష్ఠి దాదాపు అరగంట సేపు సాగింది. ఆ గోష్ఠిలో శ్రద్ధాళువైన ఒక వ్యక్తికి, ఆధునిక జీవన విధానాల్లోని అనేకానేక సంకీర్ణతల వల్ల మతసంప్రదాయాలకు ఎలాంటి ప్రమాదం కలుగుతుందోనని సహజంగా కలిగే భయాన్ని డాక్టర్ ఫ్రాంక్లిన్ వ్యక్తం చేశారు. కాని, చివరకు వారు తమ భయాలన్నీ విడిచి తృప్తిగా, నిశ్చింతగా సెలవు తీసుకున్నారు.


పళ్లూ, కొబ్బరికాయలూ స్వామివారికి సమర్పించి వారిని దర్శించే భాగ్యం తనకు కలిగినందుకు ఎంతటి ధన్యభావంతో మనస్సంతా నిండిపోయిందో ఫ్రాంక్లిన్ వ్యక్తం చేశారు. స్వామివారు ఉదారంగా నవ్వి ఊరుకున్నారు.


డాక్టర్ ఫ్రాంక్లిన్ స్వామివారిని నిశితంగా ప్రశ్నించి అనేక విషయాల మీద వారి ఉపదేశాన్ని అర్థించారు. ముందుగా క్రైస్తవుడైనా తనకితర మతాల మీద గౌరవం వుందనీ, యితర మత సిద్ధాంతాలు అవగాహన చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. తమకున్న కొన్ని సందేహాలు తీర్చవలసిందిగా స్వామివారిని కోరారు.


మానవుల శ్రేయస్సు కోసమే ప్రవక్తలందరూ మతాలు స్థాపించారనీ, అందువల్ల సర్వమతాలకు లక్ష్యం ఒకటేనని, ఇతర మతాల మీద డాక్టర్ ఫ్రాంక్లిన్ ఆసక్తి చూపటం తనకు సంతోషం కలిగిస్తున్నదనీ స్వామివారన్నారు. 


డాక్టర్ ఫ్రాంక్లిన్ : కాలం గడిచేకొలది ప్రపంచ ప్రజలు దగ్గరౌతున్నారు. రేడియోలాంటి ఆధునిక సమాచార సాధనాల మూలంగా ఈనాడు ఒక క్రైస్తవుడు తన హైందవ సోదరునితో సులభంగా మాట్లాడగలుగుతున్నాడు. దీనివల్ల ప్రపంచమతాలు ఒకదాని కొకటి క్రమేణా సన్నిహితం కావా?


స్వామివారు : ఈనాడు ప్రపంచమంతటా అనేక రాజకీయ సిద్ధాంతాలు కనబడుతున్నాయి. ప్రతి సిద్ధాంతమూ తానే సర్వోత్తమమైన సిద్ధాంతమనీ, ఇతర సిద్ధాంతాలనుండి తాను నేర్చుకోవలసిందేమీ లేదని అంటున్నది. చైనా వంటి దేశాలు తమదే అత్యుత్తమమైన రాజకీయ వ్యవస్థ అని చాటుకుంటున్నాయి. కాని మత విషయంలో అలాంటి అరమరికలకు తావులేదు. ఏ మతంనుండైనా, ఎవరైనా ఏదైనా గ్రహించవచ్చు. అలా గ్రహించటాన్ని ఏమతమూ నిషేధించదు. మతోన్మాదులు మాత్రమే ఇతర మతాల అధ్యయనం మీద ఆంక్షలు విధించేది! కాని శ్రద్ధాళువులైన మతాభిమానులు ఈ ఆంక్షలు పాటించరు. ఈనాటి సమాచార సాధనాలవల్ల ఒక మతస్థుడు మరొక

మతానికి చెందిన విషయాలు సులభంగా గ్రహించగలుగుతున్నాడు. 


డాక్టర్ ఫ్రాంక్లిన్: ఆధునిక జీవితం ఎంతో సంకీర్ణమై పోయింది. వాణిజ్యంగానీ, సమాచార ప్రసారాలుగానీ అతివేగంగా జరుగుతున్నాయి. వ్యామోహా లెక్కువైనాయి. హిందూమతం కొన్నివేల సంవత్సరాలనాటిదని విన్నాను. తన మౌలిక లక్షణాలు వదలక, పెద్దగా మారక పురాతన కాలంనుంచీ యిప్పటివరకూ అది అలాగే నిలిచివుందనికూడా విన్నాను. స్వామివారు నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నారనీ, అతి సామాన్యమైన ఆహారం తీసుకుంటారనీ, పాదచారులై ప్రయాణిస్తారనికూడా విన్నాను. అయితే అనుక్షణం పెరుగుతున్న రద్దీ, జీవనవేగం, వ్యామోహాలూ, హిందూమతానికీ, ఆధ్యాత్మికతకూ ప్రమాదం కలిగించవంటారా? సామాన్యుడు వీటి ప్రలోభాలకు లోబడకుండా మనగలడంటారా? 


స్వామివారు : పురాతన కాలంలోనూ ప్రలోభాలు లేకపోలేదు. కాని మతాభినివేశం కల సత్పురుషులు ఎన్నో త్యాగాలు చేసి వచ్చే ఆపదలు తప్పించారు. అప్పటికన్నా ఇప్పుడు ప్రలోభా లెక్కువయ్యాయి. వాటినుండి తప్పించుకోవాలంటే ప్రజలు ఇంకా గొప్ప త్యాగాలు చెయ్యాలి. 

డాక్టర్ ఫ్రాంక్లిన్: ఎప్పటినుండో భారతదేశం ఆధ్యాత్మికంగా ప్రసిద్ధికెక్కింది. ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. భౌతికమైన ఈ పురోగతివల్ల దాని ఆధ్యాత్మికత సడలిపోదా? ప్రజల జీవిత విధానంలో ఇంతవరకూ మతం వహిస్తున్న పాత్రలో మార్పు రావాలా?


స్వామివారు : భారతదేశంలో ఇంతకన్నా ఎక్కువమంది యోగులూ, మతాచార్యులూ వుండివుంటే, ఆధ్యాత్మికతకు కలిగిన ముప్పు సులభంగా తొలగిపోయేది. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులనూ, పొలాల్లో పనిచేసే కర్షకులనూ సహితం ఉత్తేజపరచగల మహానుభావులు ఇప్పుడెందరో అవసరం. అలాంటి మహానుభావులు సామాన్యజనాన్ని కూడా భగవంతుని వైపు మళ్లించగలరు. అప్పుడు పారమార్థికతకు ఏ అపాయమూ వాటిల్లదు. 


పారిశ్రామీకరణంవల్ల గ్రామాలూ, పట్టణాలూ, నగరాలూ ఎంతగా మారినా ప్రజల్లో రక్తగతమైవున్న పారమార్థికత అలాగే వుంది. మతాచారాలు పాటించటంలో ప్రస్తుతం కొన్ని మార్పులు వచ్చాయి. కాని మౌలికమైన మతసిద్దాంతాల్లో ఏమార్పూ రాలేదు. ఈ వాస్తవం ఒక్క హిందూ మతంలోనే కాదు. అన్ని మతాల్లోనూ కనబడుతుంది. 


డాక్టర్ ఫ్రాంక్లిన్: హిందూమతం ఒకప్పుడు ఉచ్చస్థితిలో వుండేదనీ, హిందువులు ఉదాత్తంగా జీవించేవారనీ, కలిపురుషుడు ప్రవేశించాక పతనం ప్రారంభమైందనీ విన్నాను. కల్కి అవతారానికి ఇంకెంతకాలం పడుతుంది? 


స్వామివారు : మతానికి మళ్లీ మళ్లీ ప్రాణంపోసిన మహానుభావులు భారతదేశంలో ఎందరో పుట్టారు. ముఖ్యంగా గడచిన మూడు నాలుగు శతాబ్దాల్లో అలాంటి వారవతరించి ప్రజల్లో మత చైతన్యాన్ని కలిగించారు. వచ్చే శతాబ్దాల్లో కూడా ఇది సంభవించవచ్చు. 


పూర్వయుగాల్లో భగవంతుడు సాక్షాత్కారించాలంటే తపస్సుచేయవలసి వుండేది. కాని కలియుగంలో భగవత్ సాక్షాత్కారానికి నామజపం చాలు. భగవత్ భక్తివుంటే చాలు.


కృష్ణచైతన్య స్వామి గాఢమైన మధురభక్తి ప్రతిపాదించారు. భగవంతుణ్ణి ప్రేమించమన్నారు. భగవంతునికోసం తపించమన్నారు. భగవంతునకు సర్వస్వమూ అర్పించుకోమన్నారు.


ఇలాటి భక్తి ఎంతో కోమలమైంది. సులభమైంది. ఇదికూడా అలవరచుకోని వారున్నారు. ఆచారపరంగా కొంత శైథిల్యం కనబడుతున్నా మొత్తం మీద ఆధ్యాత్మికతకు భంగం కలగదు. ఈ యుగానికి సంబంధించిన సులువులు ఈ యుగానికున్నాయి. ఒకవైపు సముద్రం భూమిని కోసేస్తుంటే మరొకవైపు భూమి సముద్రంలోకి చొచ్చుకుపోతోంది. 


డాక్టర్ ఫ్రాంక్లిన్: మిమ్ము దర్శించే భాగ్యం కలిగినందుకు ఎంతో సంతోషంగా వుంది. మీ ఆశీర్వాదాలు పొందాను. మీ సన్నిధిలో ఇంతసేపున్నాను. ఎంతో ధన్యుణ్ణి. 


స్వామివారు : శ్రద్ధాళువులైనవారు అరుదు. శ్రద్ధాళువులైన కొంతమంది నన్ను చూడటానికి వస్తారు. వారిలో మీరొకరు. మీకూ, మీ శ్రీమతికీ నా ఆశీస్సులు. మీరు నన్నెప్పుడు కలుసుకోవా లనిపించినా వచ్చి కలుసుకోవచ్చు. 


ఆగమ శిల్ప సదస్సు సందర్భంగా ఏర్పాటైన శిల్పాల, పంచలోహ విగ్రహాల దేవాలయ ఛాయాచిత్రాల ప్రదర్శన విభాగాన్ని ఫ్రాంక్లిన్ దంపతులు సందర్శించారు.


మధురలో జరిగిన మీనాక్షీ దేవాలయ కుంభాభిషేకం మహోత్సవానికి ఆహ్వానింప బడినవారిలో, అప్పుడే మద్రాసులో అమెరికా కాన్సల్ జనరల్ గా పదవీ స్వీకారం చేసిన డాక్టర్ ఆల్బర్ట్ బి. ఫ్రాంక్లిన్ కూడా ఒకరు. 1963వ సంవత్సరం డిసెంబరు మాసంలో వెలువడిన “స్పాన్” అనే అమెరికన్ పత్రికలో కుంభాభిషేకాన్ని గురించి వారిలా వ్రాశారు.


“మీనాక్షీదేవి కోసం అపరంజి పూతపూసిన ఒక క్రొత్త విమానాన్ని నిర్మించారు. అందులోకి దేవి వెళ్లవలసివుంది. విమాన గోపురం ముందు బహిరంగ ప్రదేశంలో జనం క్రిక్కిరిసి వున్నారు. ఉన్నట్లుండి వారిలో ఒక సంచలనం బయలుదేరింది. గుమిగూడిన ప్రముఖ వ్యక్తులు ప్రక్కకు తప్పుకుని గౌరవంగా దారియిస్తున్నారు. ఒక వృద్ధుడు, పలితశ్మశ్రుముఖుడు చేతిలో దీర్ఘదండం పుచ్చుకుని వారి మధ్యగుండా నడిచి విమాన గోపురానికి వేసిన నిచ్చెన దగ్గరకు వెళ్లారు. వారే కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకరాచార్యులవారు. మధ్యమధ్య ఆగుతూ చుట్టూ చూస్తూ, పరిసరాలలో వున్న వ్యక్తులనూ గమనిస్తూ వెళ్లారు వారు. వారెవరు? వారి కొక పేరుంది. ఒక నివాసస్థానముంది. ఒక వయస్సుంది. కాని నిజానికి వారు ప్రతిమనిషీ, మానవుడెంత పురాతనుడో అంత పురాతనులు వారు. మానవుడి ఆలోచన ఎంత పురాతనమైందో వారి ఆలోచనలూ అంత పురాతనమైనవి. వారొక మతశాఖకు ప్రతినిధి. తన సర్వస్వమూ వదిలి ఆ మతశాఖ చూపిన దారిలో పయనిస్తున్నవారు. ప్రతి మతమూ కోరే సర్వసంగపరిత్యాగానికి వారు చిహ్నం. క్రీస్తంతటివారు సంపన్నుడైన యువకుడొకడు తన దగ్గరకు వచ్చి “రక్షణకోసం నే నెవరి నాశ్రయించాలి"? అని అడిగినప్పుడు సర్వసంగపరిత్యాగా న్నాశ్రయించాలని ఆదేశించారు.


“ఇక్కడ ఈ సమయంలో ఈ దేవాలయంలో ప్రముఖవ్యక్తులందరికన్నా వారే ప్రముఖ వ్యక్తి. ఆ వయసులో వున్న వారిలో కనబడనంత చైతన్యంతో, ఉత్సాహంతో సన్నటి పొడుగాటి చేతివేళ్ల మధ్య నిచ్చెన గట్టిగా పట్టి చురుగ్గా ఏడెనిమిది మెట్లు క్షణంలో ఎక్కేశారు. తన హస్తదండంతో విమాన శిఖరాన్ని అందుకోదగినంత ఎత్తుకు అందరూ చూస్తుండగానే ఇట్టే చేరారు. ఆనాటి కార్యక్రమంలో అంతమంది జనంలోనూ, అందరు ప్రముఖుల మధ్యా వారే వారొక్కరే కేంద్ర భూమిక వహించారు.”


--- డాక్టర్. ఎ.బి. ఫ్రాంక్లిన్


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: