నిర్వాణ షట్కం
శ్రీ కైవల్య స్థితిని పొందటం అనేది కేవలం మన హిందూ ధర్మంలోనే సాధ్యం అంటే అందులో లేశమైన అసత్యము లేదు. అనాదిగా బుద్ది, జ్ఞానం కలిగిన మానవుడు ఈ సృష్టికి కారణభూతుడు ఎవరు అనే ప్రశ్నతో తన జీవనాన్ని గడుపుతూ ఆ ప్రశ్న సమాధానంగా మన మహర్షులు, ఋషులు అనేక విధాలుగా తప్పస్సులు చేసి వారి అద్వితీయ మహోన్నత శక్తితో మనకు భగవంతుని ఉనికిని సాక్ష్కాత్కరింపచేసారు. మనిషి జీవితము కేవలము ఇతర ప్రాణుల లాగ ఇంద్రియ సుఖాలను పొందటమే కాదు, జీవన సాఫల్యాన్ని అంటే మోక్షాన్ని చేరుకోవాలని సూచించారు. అంతేకాదు మోక్ష సాధన ఎలా చేయాలో కూడా మనకు తెలియ చేశారు. అటువంటి మహర్షుల కోవలో జన్మించిన జగత్ గురువు అది శంకరాచార్య మన జీవితాలకు ఒక దిశ, లక్ష్యాన్ని ఏర్పాటు చేసిన మహానుభావులు. అది శంకరాచార్యుల మార్గంలో పయనిస్తే తప్పకుండా మోక్షం సిద్దిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. శంకరులు మనకు అందించిన అనేక వేదాంత రచనలలు వున్నాయి. ప్రతిదీ ఒక ఆణిముత్యం.ఆ కోవకు చెందిన ఒక రచన నిర్వాణ షట్కం కేవలం ఆరు శ్లోకాలలో మోక్ష సారాన్ని మనకు అందించారు. ఈ ఆరు శ్లోకాలే నిర్వాణ షట్కం గా పేరుగాంచాయి.
నిర్వాణం అనేది వేదాంతపరంగా చాలా గొప్ప భావన. ఈ షట్కమును ప్రతి వక్కరు జాతి,కుల,మత బేధాలు లేకుండా తప్పకుండా కంఠతా చేసి అవగాహన చేసుకొని, తమ జీవితాలకు అనుసంధానించు కోవచ్చు. ఎందుకంటే,ఆత్మతత్త్వం మనుషుల అందరికీ ఒకే విధంగా ఉంటుంది. నిర్వాణం అంటే సూక్ష్మంగా చెప్పాలంటే మోక్షం! ఆరు శ్లోకాలలో ఆత్మ స్వరూపాన్ని గురించి అద్భుతంగా బోధ చేసారు ఆదిశంకరులు. ఈ ఆరు శ్లోకాలని ఆత్మషట్కం అని కూడా కొందరు అంటారు.షట్కం అంటే ఆరు. ప్రపంచ వేదాన్త సాహిత్యం మొత్తం మీద ఇలా వేదాంత సారాన్ని ఇంత సరళంగా,క్లుప్తంగా చెప్పిన జ్ఞాని మరెవ్వరూలేరు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ! వేదాంత సారమంతా ఈ ఆరు శ్లోకాలలో నిక్షిప్తం చేసిన ఆది శంకరులకు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాను!
1.మనోబుధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్త్రే
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయు:
చిదానంద రూప: శివోహం శివోహం
అర్ధం-మనస్సు,బుద్ధి,చిత్తము,అహంకారము అనేటటువంటివి ఏమీ నేను కాను. .చెవి,నాలుక,ముక్కు, నేత్రములు మొదలైన ఇంద్రియాలను నేను అసలు కాను.ఆకాశము,భూమి,అగ్ని,వాయువు,నీరు లాంటి పంచభూతాలను నేను కానే కాను . ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
వివరణ: ఈ శ్లోకంలో ఆది శంకరులు మనకు భగవంతుని స్వరూపము మన చిత్త ప్రవ్రుత్తి కాదు, అలాగని ఈ పంచభూతాత్మక జగత్తు కాదు అని పేర్కొంటున్నారు. అంటే ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసింది. శివుడు సదా ఆనందాన్ని కలిగించే స్వరూపం అని పేర్కొంటున్నారు.
2.న చ ప్రాణ సంజ్నో న వై పంచవాయు:
న వా సప్తధాతు ర్న వా పంచకోశ:
న వాక్పాణిపాదౌ న చోపస్థపాయు:
చిదానంద రూప: శివోహం శివోహం
అర్ధం-ప్రాణమనే పేరు కలవాడను కాను.ఐదు రకములైన వాయువును కాను, .సప్తధాతువులను కానే కాను.పంచకోశములను కాను.మాట,చేయి,పాదములను కాను.సహాయపడే ఇంద్రియాలను కానే కాను.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
వివరణ: ఈ శ్లోకంలో ఆది శంకరులు మనకు భగవంతుడు మనం అనుకునే పంచ ప్రజాలు కాను, అలాగే ఏడు ధాతువులు అంటే
ధాతువు
అంటే దేహమునకు ఆఱంభకమైన రసము లోనగునది, వ్యు.
ధీయతే అస్మిన్ - ధా + తున్, కృ.ప్ర., జవసత్వాదులు ఇందుండును.
ఇవి సప్తసంఖ్యలో ఇలా చెప్పుదురు
అ)వసాదులు (వస, అసృక్కు, మాంసము,
మేధస్సు, అస్థి, మజ్జ, శుక్లములు)
ఆ) రోమాది (రోమ, త్వక్, మాంస,
అస్థి, స్నాయువు, మజ్జ, ప్రాణములు)
ఇ) త్వగాది (1త్వక్, మాంస, రుధిర, మేధో,
మజ్జ, అస్థి, శుక్లములు)
(అ)1వస (బొడ్డుక్రిందనుండు ఉల్లి
పొర వంటి క్రొవ్వు) 2అసృక్కు
(రక్తం) 3మాంసము 4మేధస్సు (మెదడు) 5అస్థి (ఎముక) 6మజ్జ (ఎముకలలోని కొవ్వు)
7శుక్లములు (రేతస్సు)
(ఆ)
1రోమ (వెంట్రుక) 2త్వక్ (చర్మము) 3మాంస 4అస్థి (ఎముక)
5స్నాయు (సన్నపు నరము) 6మజ్జా (ఎముకలలోని కొవ్వు) 7ప్రాణములు (ప్రాణవాయువు)
(ఇ) 1త్వక్ (చర్మము) 2మాంస (మాంసము) 3రుధిర (రక్తము) 4మేధో (మెదడు) 5మజ్జ (మూలుగ) 6అస్థి (ఎముకలు) 7శుక్లములు (వీర్యము) కాదని
అదే విధంగా పంచ కోశాలు అంటే
1. అన్నమయ కోశం. 2. ప్రాణమయ కోశం .
కర్మేంద్రియ పంచకం: 1) వాక్కు 2) పాణి 3) పాదం 4) పాయువు 5) ఉపస్థ ఇక
జ్ఞానేంద్రియ పంచకం: 1) త్వక్కు = చర్మం 2) చక్షువు = కన్ను 3) రసన = నాలుక 4) శ్రోతం = చెవి 5) ఘ్రాణం = ముక్కు ఇవి ఏవి కూడా నేను కాను అని అంటున్నారు. అయితే మరి ఎవరు అంటే ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసింది. శివుడు సదా ఆనందాన్ని కలిగించే స్వరూపం అని పేర్కొంటున్నారు.
3.న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదోనైవ మే నైవ మాత్సర్యభావ:
న ధర్మో న చార్ధో న కామో న మోక్ష:
చిదానంద రూప: శివోహం శివోహం
అర్ధం-రాగద్వేషాలంటే నాకు తెలియదు.లోభమోహాలు అంటే అసలు తెలియవు. మద మాత్సర్యములు నాకు లేనే లేవు.ధర్మ,అర్ధ,కామ మోక్షములు నాకు అసలు లేనేలేవు. ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
వివరణ: ఈ శ్లోకంలో ఆది శంకరులు మనకు భగవంతుడు మానవ స్వభావాలైన్ గుణాలు, అదే విధంగా పురుషార్ధాలు నేను కాను. సదా ఆనంద స్వరూపమైన్ శివుడను నేను అని పేర్కొంటున్నారు.
4. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా:
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూప: శివోహం శివోహం
అర్ధం–పుణ్యపాపాలు,సుఖదు:ఖములు నాకు లేనే లేవు.మంత్రంలేదు,క్షేత్రములు లేవు.వేదములు,యజ్ఞములు అసలు లేనే లేవు.నేను భోజనాన్ని కాను,భోజ్యమును కాను,భోక్తను కూడా కాను.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
వివరణ: ఈ శ్లోకంలో ఆది శంకరులు మనకు భగవంతుడు మానవుడు ఆచరించే కర్మ ఫలితాలు అంటే పాప పుణ్యాదులు కాదు. అంతేకాదు వేదవిహిత కర్మలు కానీ మానవుడు భుజించు భోజనము కానీ తినే వాడిని కాను నేను కాదని పేర్కొంటున్నారు. మరి ఎవరు అంటే సదా ఆనంద స్వరూపమైన్ శివుడను నేను అని పేర్కొంటున్నారు.
5.న మృత్యు ర్న శంకా న మే జాతి భేద:
పితో నైవ మే నైవ మాతా న జన్మ
న బంధు ర్నమిత్రం గురుర్నైవ శిష్య:
చిదానంద రూప: శివోహం శివోహం
అర్ధం–నాకు మరణంలేదు.మృత్యుభయం,సందేహం లేదు.జాతిభేదములు లేనేలేవు.తండ్రిలేడు,తల్లి లేదు.అసలు నాకు పుట్టుకయే లేదు.బంధుమిత్రులు,గురుశిష్యులు లేనేలేరు.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
వివరణ: ఈ శ్లోకంలో ఆది శంకరులు మనకు భగవంతుడు మానవుడికి కలిగే జనన మరణాదులు లేవంటున్నారు. అందుకే తల్లి దండ్రులు కూడా లేరు అంటున్నారు. జననము ఉంటేనే కదా తల్లి ఉండేది. జన్మే కానప్పుడు జన్మతో ఏర్పడే సంబంధాలు కూడా తనకు లేవని అంటున్నారు. మరి ఎవరు అంటే సదా ఆనంద స్వరూపమైన్ శివుడను నేను అని పేర్కొంటున్నారు
6.అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ్ఛ సర్వత్ర సర్వేంద్రియాణాం
న చా సంగతం నైవ ముక్తి ర్నమేయ:
చిదానంద రూప: శివోహం శివోహం
అర్ధం–నాకు ఎటువంటి వికల్పములు,బేధములు నాకు లేవు.నేను,నా ఇంద్రియాలు విశ్వమంతా వ్యాపించినట్లు అనిపించుట వలన నాకు సంబంధించని వస్తువులు కానీ,విషయములు కానీ లేనేలేవు.నేను తెలుసుకొన వలసినది మరియూ పొందవలసిన మోక్షమూ లేదు.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
వివరణ: ఈ శ్లోకంలో ఆది శంకరులు ఇంకా ముందుకు వెళ్లి మనకు మనము కోరుకునే మోక్షం కన్నా భిన్నంగా ఆనంద స్వరూపాన్ని సాక్షాత్కరిస్తున్నారు. కొన్ని విషయాలు వివరణకు అందవు, కేవలము అనుభవం మీదనే తెలుసుకోగలుగుతాము. ప్రత్యక్షానుభవం కలగాలంటే సాధన చేయాలి. సాధన ద్వారానే మనిషి తన నిజ స్వరూపమైన ఆత్మ స్థితిని తెలుసుకోగలుగుతాడు. అదే నిత్యానంద స్వరూప స్థితి. ఆ స్థితికి చేరుకోవటమే ముముక్షువు అంతిమ లక్ష్యం.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
మీ
భార్గవ శర్మ.
1 కామెంట్:
చాలా బాగుంది భార్గవ శర్మ గారు
కామెంట్ను పోస్ట్ చేయండి