13, జనవరి 2024, శనివారం

శ్రీ చౌరాసి( 84) ఆలయాలు

 🕉 మన గుడి : నెం 298


⚜ హిమాచల్ ప్రదేశ్  : భార్మోర్


⚜ శ్రీ చౌరాసి( 84) ఆలయాలు


💠 చౌరాసి టెంపుల్  అనేది 84 విభిన్న పుణ్యక్షేత్రాలను కలిగి ఉన్న ఆలయ సముదాయం, ఇది చంబా జిల్లాలోని భర్మూర్ పట్టణం మధ్యలో ఉంది.  

సుమారు 1400 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాల కారణంగా ఇది అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.

చౌరాసి ఆలయం అంచున నిర్మించిన 84 మందిరాల కారణంగా ఆ పేరు వచ్చింది.  చౌరాసి అనేది ఎనభై నాలుగు అనే హిందీ పదం. 


💠 యముడిని కాలదేవుడు అని పిలువబడే  ఈ దేవునికి తమిళనాడులో కొన్ని ఆలయాలలో ప్రత్యేక సన్నిధులు వున్నాయి.

అలాగే హిమాచల్ ప్రదేశ్ భార్మోర్ నగరం లో  వున్న ధర్మశ్వర్ మహాదేవ్ ఆలయం యమధర్మరాజుకు ఆతని సహాయకుడైన చిత్రగుప్తునికి ప్రశస్తి చెందినది.

ఈ యముని ఆలయాన్ని ఒక ప్రత్యేకమైన ఆలయంగా కాకుండా 84 ఆలయాల

ఆవరణలో వున్నందున చౌరాసీ 84 ఆలయాల మందిరంగా పిలుస్తారు.


💠 యమధర్మరాజు యొక్క న్యాయ రక్షణా కార్యాలయం కూడా యిదే అని, ఆయుస్సు తీరిన వారి ఆత్మలని  ఇక్కడికి రప్పించి  యమధర్మరాజు న్యాయమైన తీర్పులు యిచ్చి వాటికి సద్గతులు కల్పిస్తాడని అంటారు.


💠 సుమారు 1400  సంవత్సరాలకి ముందు

మరు వంశానికి చెందిన రాజా సాహిల్ వర్మ ఈ బార్మోర్ ను పాలించిన కాలంలో ఈ 84 ఆలయాలు నిర్మించబడినవి. 

సాహిల్వర్మకు సంతానం లేక మనోవేదనతో వున్న కాలంలో కురు క్షేత్రం నుండి తీర్ధయాత్రలు చేస్తున్న 84 మంది  సిధ్ధపురుషులు

యీ ప్రాంతానికి వచ్చారు.

ఆ మహాత్ములకి ఇక్కడ శివ దర్శనమైనది.

ఆ మహాత్ములను మహారాజు  ఆదరించాడు.

ఆ బృందానికి నాయక యోగి యైన

బత్నాధ్ జీ ని గురువుగా

స్వీకరించిన మహారాజు, ఆ గురువుగారి ఆదేశం ప్రకారం  వారి ఆది గురువులు  9 మందిని

మట్టి కుండలలోకి ఆవాహన చేసి 9 శివలింగాలను ప్రతిష్టించాడు. 


💠 సంప్రదాయబధ్ధంగా పూజాపునస్కారాలు జరిపించడానికి 84 ఆలయాలు నిర్మించాడు.

ఆవాహన చేయబడిన యోగులు తృప్తిచెంది

మహారాజుకి సంతాన భాగ్యం కలగాలని ఆశీర్వదించారు.

ఫలితంగా మహారాజుకి

పదిమంది పుత్రులు , ఒక పుత్రిక జన్మించారు.


💠 తరువాత కాలంలో కుమార్తె చంపావతి కోరిక ప్రకారం ముఖ్యపట్టణాన్ని

రాజ్యం పేరు మార్చుకొని చంపా అనే

పేరు పెట్టాడు. 

రాజకుమార్తె   యోగినియై అంతిమకాలాన పరంజ్యోతిలో కలిసి పోయినది.   

ఆ రాజకుమర్తె  చంపావతికి రాజ గురువు సర్బత్ నాధ్ జీ కి ఇక్కడ ప్రత్యేక సన్నిధులు వున్నాయి.

ప్రసిద్ధి చెందిన మణి మహేష్ యాత్ర చేపట్టేవారు ముందుగా ఇక్కడికి వచ్చి గురూజీని

దర్శించి   తమ యాత్ర ఆరంభించాలని నియమం.


💠 కాశ్మీర్, గాంధార శిల్ప శైలిలో అందమైన నగిషీ నైపుణ్యంతో ఈ ఆలయాలు నిర్మించబడినవి.


💠 ఆలయ ఆవరణం మధ్యలో  మణిమహేష్ శివలింగం నిర్మించబడినది. 

ఆ శివలింగాన్ని దర్శిస్తున్న విధంగా ఒక పెద్ద ఇత్తడి  నందీశ్వరుని మూర్తి. 

దీనిని శిల్పిగుహా  అనే గొప్పశిల్పి  మలచినట్లుగా అతని పేరు  ఆ విగ్రహం క్రింద చెక్కబడి వున్నది. 


💠 దేవాలయానికి ఎదురుగా పెద్ద ఎత్తైన దేవదారు వృక్షం వున్నది.

దాని క్రింద అర్ధగంగ, అర్ధగయ అని పిలువబడే

పవిత్రమైన నిర్మలమైన తటాకం వున్నది. పార్వతీ దేవి కోసం వినాయకుడు

ఏర్పాటు చేసినదిగా చెపుతారు.

ఏడు నదుల సంగమమైన యీ తటాక జలాలలో  స్నానం చేస్తే సకల

పాపాలు తొలగిపోతాయి అని చెప్తారు. 

దీని కుడి ప్రక్కన  విష్ణు పాదాలు వున్నవి.  

ఆ దివ్యపాదాలు దర్శించి  తటాకంలో స్నానంచేస్తే గయ వెళ్ళిన పుణ్యం లభిస్తుందని అంటారు.


💠 ఇక్కడ ధర్మేశ్వర్  మహాదేవ్ పేరుతో

లింగరూపంలో దర్శనమిస్తున్న యమధర్మరాజుని స్థానిక భక్తులు నిర్భయంగా పూజిస్తారు.

అయితే ఇతర ప్రాంతాల యాత్రికులు మాత్రం యమధర్మరాజుని చూడడానికి భయపడి వెలుపల నుండి చూసి వెళ్ళిపోతారు.


💠 ఈ పుణ్యక్షేత్రాన్నికి  ఇద్దరు  భైరవులు  అదృశ్యరూపంగా రక్షకులుగా వుంటారని

అంటారు. 


💠 సన్నిధికి వెలుపలి గోడమీద  నచికేతుడు యమధర్మరాజు ని స్తుతించిన శ్లోకం వ్రాసి వున్నది. 

ఆలయ లోపలి ప్రాంతం చాలా చల్లగా వుంటుంది.

ఆలయం లోపల ప్రవేశించగానే శిలలతో వృక్షాలతో ముఖమండపం వుంటుంది.  

ఒక అటక మీదకి ఎక్కుతున్నట్లు ఐదు మెట్లు ఎక్కి ,ప్రవేశ ద్వారం వద్ద ఒంగుని  గర్భగుడి లోనికి వెళ్ళాలి.


💠 మధ్యలో ఒక వేదిక మీద  ధర్మశ్వర్ మహాదేవ్, పొడవైన త్రినేత్రంతో,చుట్టచుట్టుకుని వున్న ఒక సర్పం మీద  కొలువు తీరివుంటాడు. ఆ సర్పమే  మూలమూర్తికి పైన ఛత్రం పడుతూవుంటుంది.

దానికి పైన వ్రేలాడేటట్టు వుండే మరియొక  ఛత్రంతో  ధర్మేశ్వరుడు రమ్యంగా దర్శనమిస్తున్నాడు.


💠 యమధర్మరాజు యొక్క యీ సన్నిధానానికి

" ఢాయీ పౌడీ" అంటే రెండున్నర మెట్లు అని పేరు. అంటే  అటు స్వర్గానికో  లేక ఇటు నరకానికో  వెళ్ళడానికి కొన్ని అడుగుల

దూరంలో వున్నామని.


💠 ఆలయానికి ముందు  చెక్కలతో అడ్డం కట్టబడిన  ఒక రాతి తొట్టి వున్నది. పాప పుణ్యాల లెక్కలు చూసే చిత్రగుప్తుని కార్యాలయం అంటారు. దాని మధ్యలో వున్న చక్రం ఆత్మని సూచించే  చిహ్నం.


💠 సమీప రైలు మార్గం: పఠాన్‌కోట్.

పఠాన్‌కోట్ నుండి చంబా 120 కి.మీ

చంబా నుండి భర్మూర్ 59.5 కి.మీ

కామెంట్‌లు లేవు: