25, జూన్ 2024, మంగళవారం

మోక్షము సిద్ద వస్తువా లేక సాద్య వస్తువా

 

 మోక్షము సిద్ద వస్తువా లేక సాద్య వస్తువా 

చాలామంది సాధకులను తొలచివేసే ప్రశ్న ఇది దీనిని గురియించి వివరంగా తెలుసుకుందాం. భక్తి మార్గంలో వుండే సాధకునికి నిరంతర భక్తి వలన ఒక విషయం అవగాహనకు వస్తుంది అదేమిటంటే భక్తికన్నా భిన్నంగా మరియు గొప్పగా మరేదో వున్నదని భావన భావన కలిగిన సాధకుడు మాత్రమే మోక్షం వైపు వెళ్లగలడు. అప్పుడు ఆలోచనలో పడతాడు ఆలోచన ఎలావుంటుందంటే ఏమిటి నేను నిత్యం ఈశ్వరునికి పూజ చేస్తున్నానే ఎలా చేస్తున్నాను శివలింగానికి జలంతో, పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాను, పుష్పాలతో అలంకరిస్తూ ఆనందిస్తున్నానే ఇదేనా పరమార్ధం లేక ఇంకా వేరే ఏమైనా ఉన్నదా అనే మీమాంసలో పడతాడు. అప్పుడు మొదలౌతుంది తెలుసుకోవాలనే తృష్ణ వెంటనే ఉపనిషత్తుల వద్దకు వెళతాడు. ముందుగా ఆవిర్భవించినది తరిమ్పచేసేది అయినా " ఈశావాసోపనిషత్'" మొదటి మంత్రం చదివేసరికి తలా తిరిగిపోతుంది సాధకునికి ఎందుకంటె మంత్రం ఏమి చెప్పుతున్నదంటే

1. ఓం ఈశా వాస్య మిదగ్గ్ సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుఞ్ఙీథా మాగృధః కస్యస్విద్ ధనం
అర్థం:

జగత్తులో ఏవేవైతే ఉన్నవో అన్నీ భగవంతుడై వున్నాయి. భగవంతుడు కానిది ఏదిలేదు ఇక్కడి సంపదలు, ధనము సర్వము కూడా భగవంతునివై వున్నాయి. అప్పుడు సాధకుని ఆలోచనలో కొత్త విషయాలు ఆవిశృభవిస్తాయి. నేను యెంత ముర్కుడిని నేను నీళ్లతో, పాలతో పంచేంద్రియాలతో ఈశ్వరుడి అభిషేకించానని అనుకుంటున్నానే, పూలతో భగవంతుని అలంకరించానని అనుకుంటున్నానే భగవంతుడు కానిది, భగవంతునిది కానిది ఏది లేదని కదా మంత్రము చెపుతున్నది. అట్టి తరి నేను నీళ్లు, పాలు, పంచామృతాలు ఎక్కడినుండి ఎవరివి తీసుకొని వచ్చాను. నేను నా ద్రవయంతో కొన్నాను అని సమాధానం చేసుకుంటే నాకు ద్రవయం ఎలావచ్చింది అనే ప్రశ్న ఉదయిస్తుంది. నేను కష్టపడ్డాను కాబట్టి అని సమాధాన పరచుకుంటాను. అప్పుడు మొదలవుతుంది అసలు ప్రశ్న నేను ఎవరును. జగత్తు మొత్తము ఈశ్వరుడే అయితే నేను ఈశ్వరునికన్నా బిన్నంగా ఎలావున్నాను. లేనుకదా అటువంటప్పుడు నేను కూడా ఈశ్వరుడినిలో అంతర్భాగం కదా మరి నేను కష్టపడటం ఏమిటి. అది ఎలా సాధ్యం. ఇటువంటి ఆలోచన సాధకుని మరొక మెట్టు ఎక్కిస్తుంది

సాద్య వస్తువుసామాజిక అర్ధంలో వస్తువు అంటే ఒక పదార్ధ నిర్మితమైనది అని పదార్ధము కానిది వస్తువు కాదు అని మనము అర్ధము చెప్పుకుంటాము. ఎవరైనా సాధకుడు సాద్య వస్తువు, సిద్ధవస్తువు అని నీవు అంటున్నావు కదా మోక్షము నీ దృష్టిలో వస్తువా అని ప్రశ్నించవచ్చు. అందులకు సందేహం లేదు. కానీ ఆధ్యాత్మిక అర్ధంలో వస్తువు అనే దానిని మనం ఎలా అర్ధం చేసుకోవాలంటే సాద్య వస్తువు అంటే సాధ్యం అనగా సాధనావల్ల లభించునది అని సిద్ధవస్తువు అంటే అది అంతకుముందే నీ వద్ద వున్నది కేవలము నీవు దానిని తెలుసుకోవటమే. మీ ప్రాంతంలో వర్షాలు పడటంలేదు అప్పుడు వరుణ యాగం చేశారు యాగ ఫలితంగా వెంటనే అక్కడ వర్షాలు పడ్డాయి అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఏమిటంటే వరుణ యాగం చేయటం అంటే వరుణ యాగము అనే ఒక కర్మ చేశారు వారికి కర్మ ఫలితంగా వర్షాలు పడ్డాయి. అంటే వర్షాలు పడతాము అనేది సాద్య వస్తువు. ఇదే విధంగా నీకుమార్తె  వివాహం కాలేదు   నీ మిత్రుడు సత్యనారాయణ వ్రతం చేయమని నిన్ను ప్రోత్సహించాడు. నీవు వ్రతాన్ని ఆచరించవు వ్రత ఫలితంగా నీ కుమార్తె వివాహం అయ్యింది ఇవ్వన్నీ సాద్య వస్తువులుగా ఆధ్యాత్మిక జ్ఞానులు అభివర్ణించారు

సిద్ధవస్తువు.: సిద్ద వస్తువు అంటే సిద్ధంగా ఉన్నదానిని నీవు తెలుసుకోవటమే. తెలుసుకోవటమే కదా ఇందులో కష్టం యేమివున్నది అని నీవు అనుకోవచ్చు. కానీ అందులో కష్టంకాదు వున్నది అజ్ఞానం అజ్ఞానాన్ని పారద్రోలితే అప్పుడు నీకు ఆత్మ జ్ఞానం కలుగుతుంది. ఒక చిన్న ఉదాహరణతో దీనిని తెలుప ప్రయత్నిద్దాము

నీవు వీధిలో ఏదో వస్తువు కొనటానికి వెళ్ళావు వస్తువును కొని దాని మూల్యం చెల్లించటానికి నీ జేబుచుసుకున్నావు అక్కడ నీ పర్సు కనిపించలేదు. వెంటనే నీకు ఇంట్లో నీవు పర్సు పెట్టుకున్న ప్యాంటు కాకుండా ఇంకొక ప్యాంటు వేసుకున్నట్లు మనస్సుకు తట్టింది. అప్పుడు ఏమిచేయాలా అని నీవు అనుకుంటున్నప్పుడు నీ మదిలో ఇంకొకటి స్ఫురణకు వచ్చింది నీకు బెల్టులోపల వుండే జేబులో కొంత ద్రవ్యాన్ని అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడేటట్లు పెట్టుకునే అలవాటు  వుంది. వెంటనే నీవు అక్కడ తడిమి చూసావు నీకు వంద నోట్లు తగిలాయిబ్రతుకు జీవుడా అని డబ్బులు ఇచ్చి నీవు కొనుక్కున్న వస్తువుతో ఇంటికి వెళ్లవు. ఇక మోక్షంకుడా నీలోనే వుంది అది ఎలావుందంటే నీ బెల్టు క్రింద జేబులో వంద నోట్లు వున్నట్లుగా నీవు చేయవలసిందల్లా కేవలం దానిని గుర్తించటమే. అది యెట్లా వున్నది అనేది గుర్తించటానికి మనకు జ్ఞానం కావలి. జ్ఞానం మనకు శాస్త్రం నుండి లభ్యమవుతుంది

 

ధర్మశాస్త్రములు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *శ్రుతిః స్మృతిః సదాచారః*

       *స్వస్య చ ప్రియమాత్మనఃl*

       *ఏతచ్చతుర్విధం ప్రాహుః*

       *సాక్షాత్ ధర్మస్య లక్షణమ్ll*


తా𝕝𝕝 *వేదములు, ధర్మశాస్త్రములు, సదాచారములు, వ్యక్తికి, సమాజానికి శాశ్వత శ్రేయస్సు కలిగించేవి అనే నాలుగు రకాలుగా ధర్మం యొక్క లక్షణాలు ఉంటాయి*.....

శృంగార శాకుంతలము!



పిల్లల మఱ్ఱివారి శృంగార శాకుంతలము!


తెనుగు సాహిత్యం ఒక మహా సాగరం. అందులో యెన్ని అపురూపమైన రత్నాలున్నాయో? ఆరత్నాలే మనకవులు. వారిచ్చిన కావ్యాలు వెలగొనలేనివి. అట్టి మహాృకవులలో ' పిల్లల మఱ్ఱి పినవీరభద్రుడు బహుధా గణనీయుడు. ప్రతిభా వ్యుత్పత్తులు రెండును సమేళణ నములై యితని కవిత్వానికి వన్నెలుదిద్దాయి. పిల్లల మఱ్ఱివారి శృంగార శాకుంతలము. యితని ప్రతిభకు ప్రతీక! అందులోఞయెన్ని మెరుపులో, యెన్నితళుకులో,

.

దుష్యంతుడు వేటకోసం అడవికి వచ్చాడు. డస్సి, ఆయలుపుఁదీర్చుకొనుటకు కణ్వాశ్రమానికి వచ్చాడు. ఆయాశ్రమ ప్రాంతంలోని ప్రకృతికి పరవసిస్తూ , అడుగులు ముందుకు సారించాడు. ఇంతలో బాలపాదపాల దాహార్తిదీరుస్తూ, నీటికడవ నెత్తుకొనివచ్చు కన్యను గాంచాడు. అంతే మతిపోయింది ఆపిల్ల అందానికి. దివ్యాదివ్యసౌందర్య దర్శనం ప్రదర్శనచేసే ఆమెసౌందర్యం ఆరాజుకు విభ్రమ దాయకమైనది. 

ఆమె సౌందర్య వీక్షాదక్షమైన చక్షుః ప్రీతివలన యిలా అనుకుంటున్నాడు. 

దుష్యంతుని భావనకు ముకురాయమానమైన యీపద్యాన్ని చిత్తగించండి!

.

సీ: సురకన్య కాఁబోలు; సురకన్య యయ్యెనే 

ఠీవిమై రెప్పలాడించు టెట్లు?

పుత్తడి కాఁబోలు, పుత్తడి యయ్యనే 

హంసీ గతుల నడయాడుటెట్లు?

వనలక్ష్మి కాఁబోలు, వనలక్ష్మి యయ్యెనే? 

కటి వల్కలంబులు గట్టు టెట్లు?

రతిదేవి కాఁబోలు , రతియయ్యెనే 

వలరాజు నెడబాసి వచ్చు టెట్లు?

కన్నుగవ యార్చుటను సురకన్య కాదు; 

నడి యాడెడుఁ గానఁ బుత్తడియు గాదు; 

లలిఁ దపశ్చిహ్నమున వనలక్ష్మి కాదు; 

ప్రసవశర ముక్తైనది రతియుఁ గాదు;

.

దుష్యంతుడు ప్ర ప్రధమంగా శకుంతలను కణ్వాశ్రమంలో చూచాడు. ఆమెయెవరో తెలియదు. కణ్వుడా వయోవృధ్ధుడు. పైగా బ్రహ్మచారి. ఆయనకు కూతురెలాఉంటుంది? అదీ అనుమానం. మరి యెవరైయుంటుంది? పరపరి విధాలమనస్సు ఆలోచన చేస్తోంది.నిర్ధారణజరిగేదాకా మనః పరిభ్రమణంతప్పదుగదా! అదేయీపద్యంలో ని చిత్రణ!

.

ఫలానా కావొచ్చు అనుకోవటం, ఆలక్షణంలేదుకాబట్టి కాదనుకోవటం. అనేది , పృధక్కరణ! యిదోకావ్య కళాశిల్పం. 

(దీనినే ఆలంకారికులు అపహ్నవాలంకారంగా పేర్కొన్నారు.)

ఆశిల్పమే అనల్పంగా యీ పద్యంలోకనిపించే విశేషం!

దేవతలేమో అనిమిషులు, మరి యీపిల్లను చూతామా రెప్పలాడిస్తోంది. కాబట్టి దేవకన్యకాదు. పోనీ బంగారం అందామా అది చలనంలేని లోహం. కానీ యీమెనడుస్తోంది. 

కాబట్టి పుత్తడి యనటానికీ వీలులేదు. పోనీ వనలక్ష్మియనుకుందామా? వస్త్ర ధారణ చేసినది కదా! కాబట్టి వనలక్మీ యనలేము. రతీదేవిృయని యనుకుందామా? పక్కన మనమధుడు లేడు. కాబట్టి అదీ కుదరదు. కానీ యిక్కడ కవియిక్కడ మన్మధుడు లేని రతిగా నామెను చెప్పుటచే, సమీప భవిష్యత్తులో ఆనాయకుని స్థానం మనం పూరించ వచ్చునులేయని దుష్యంతుని యభిప్రాయమైనట్లుగా ధ్వని. యిదండీ పిల్లల మఱ్ఱివారు చేసిన గారడీ!🙏🙏🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷

ఆయుర్దాయం

  *ఆయుర్దాయం*

            ➖➖➖


*“శతమానం భవతి  శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి!”* 

మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం.


అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో “పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం” అని చెప్పబడింది.


“నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి. నిండా నూరేళ్ళు జీవించాలి. ఆది కూడ ఆనందంగా జీవించాలి” అని ఆకాంక్షిస్తాం.


ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. “గుడ్ మార్నింగ్” అని చెప్పడం, “గుడ్ నైట్” చెప్పటంలోనూ లౌకికంగా కూడ అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం.


మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు, శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది.


దాని వలన మేలూ జరుగుతుంది. ఇది పూర్వకాలపు విషయమే కాదు, నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలం.


“బ్రతికి యుండిన శుభములు బడయవచ్చు.” కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది.


అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం. అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే.


కోట్ల సంపద లభించినా అయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేమిటి?


అందువలనే మొదట కోరదగినది ఆయుర్దాయం.


నిజమే! ఆయుర్దాయమనేది కోరుకొంటే వచ్చేదా? అనేది ప్రశ్న.


“దీర్ఘాయుష్మాన్ భవ” అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా? ఆని సందేహం.

          

*ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధన మేవ చ ।*

*పంచైతా న్యపి సృజ్యంతే గర్భస్థస్తైవ దేహినః||*

అంటే “ఆయుష్షు, వృత్తి, ధనం, విద్య, చావు అనేవి ఐదూ జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటా”యని దాని అర్థం.


ఆయుర్దాయం, మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కాని, మరే జాగ్రత్తల వల్ల కాని ప్రయోజనమేమిటని ప్రశ్న.

*“లలాట లిఖితా రేఖా  పరిమాష్టుం న శక్యతే”*  

“ఏది నిజం” అనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న. ఆయుష్షుకు వృద్ధి, క్షీణతలు ఉంటాయా? ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకొనటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడా యత్నమే వ్యర్థం కదా! 


ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు ఉన్నది. ఆయుర్వేదమనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు. వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం. అంటే ఆయువును గూర్చి తెలిసికొనదగిన విజ్ఞానం అది. అందువల్ల ఆయువునకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడ పరిగణింపదగినవే అని తెలుస్తుంది.


లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యదార్థమైనా మార్కండేయుడు, శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకొనటం చూస్తాం. అంతే కాదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా వరమందటమూ చూస్తాం. ఇంకా విశేషం... ద్వాపర యుగంలో చనిపోయిన ‘సాందీపని’ గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు, త్రేతాయుగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడ ఇతిహాసాల ద్వారా తెలిసికొన్నాం.


కాబట్టి దైవానుగ్రహం వలన కాని, అమోఘవచనులైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కాని, ఆయుర్దాయం పెంచుకొనటం సాధ్యమే అని తెలుస్తుంది.


కాబట్టే మన పూర్వజులు “ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం” అని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని, “శతమానం భవతి” అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది.


అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల యెడ వినయ విధేయతలతో ఉండాలి.


(ఈ వ్యాసం అరణ్యస్పందన నుండి గ్రహించబడినది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సౌజన్యంతో డా॥అన్నదానం చిదంబర శాస్త్రి గారు వ్రాసారు)

🙏 🌹🌴🪔🌴🌹🙏

_జూన్ 25, 2024_*

 ॐశుభోదయం  ॐ  

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

     *_జూన్ 25, 2024_* 

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*గ్రీష్మ ఋతువు*

*జ్యేష్ఠ మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *చవితి* రా1.17

వారం: *భౌమవాసరే*

(మంగళవారం)

నక్షత్రం: *శ్రవణం* సా4.53

యోగం: *వైధృతి* ఉ11.43

కరణం: *బవ* సా3.20

*బాలువ* రా1.17

వర్జ్యం: *రా8 43-10.14*

దుర్ముహూర్తము: *ఉ8.07-8.59*

*రా10.56-11.40*

అమృతకాలం: *ఉ6.53-8.25*

రాహుకాలం: *మ3.00-4.30*

యమగండం: *ఉ9.00-10.30*

సూర్యరాశి: *మిథునం*

చంద్రరాశి: *మకరం*

సూర్యోదయం: *5.31*

సూర్యాస్తమయం: *6.34*

  ⚜️ *సంకష్టహర చతుర్థీ* ⚜️

*లోకాః సమస్తాః*

 *సుఖినోభవంతు*

Support this blog

 Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145

సాధించగలడు

 శ్లోకం:☝️

*శరీరనిరపేక్షస్య*

 *దక్షస్య వ్యవసాయినః ।*

*బుద్ధిప్రారబ్ధకార్యస్య*

 *నాస్తి కిఞ్చన దుష్కరమ్॥*


భావం: దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరం, ఎల్లప్పుడూ శ్రమిస్తూ, తెలివితేటలతో, దక్షతతో పనిచేసే వ్యక్తికి ఏదీ కష్టం కాదు. అతను ఏ పనినైనే చేపట్టి సాధించగలడు.

పంచాంగం 25.06.2024

 ఈ రోజు పంచాంగం 25.06.2024  Tuesday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష చతుర్ధి తిధి భౌమ వాసర: శ్రవణా  నక్షత్రం వైధృతి యోగ: బవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


చవితి రాత్రి 11:10 వరకు.

శ్రవణం మధ్యాహ్నం 02:31 వరకు.


సూర్యోదయం : 05:47

సూర్యాస్తమయం : 06:50


వర్జ్యం : సాయంత్రం 06:16 నుండి 07:47 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:24 నుండి 09:16 వరకు తిరిగి రాత్రి 11:13 నుండి 11:57 వరకు.


అమృతఘడియలు : తెల్లవారుఝామున 04:42 నుండి 06:12 వరకు తిరిగి రాత్రి 03:18 నుండి 04:48 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

వేదములు

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 *శ్రుతిః స్మృతిః సదాచారః*

       *స్వస్య చ ప్రియమాత్మనఃl* *ఏతచ్చతుర్విధం ప్రాహుః*

 *సాక్షాత్ ధర్మస్య లక్షణమ్ll*


తా𝕝𝕝 *వేదములు, ధర్మశాస్త్రములు, సదాచారములు, వ్యక్తికి, సమాజానికి శాశ్వత శ్రేయస్సు కలిగించేవి అనే నాలుగు రకాలుగా ధర్మం యొక్క లక్షణాలు ఉంటాయి**.....


 ✍️💐🌷🌺🙏

24, జూన్ 2024, సోమవారం

వైకుంఠపాళి

 *"వైకుంఠపాళి" - కొంచెం పెద్దదే, కానీ "చదివితే జీవితం తెలుస్తుంది."*


తెలుగు తోటలో పండిన విక్రమకేళి - వైకుంఠపాళి


 కేవలం నాలుగు గవ్వలతో మూడో నాలుగో చింత పిక్కలతో (ఆడేవాళ్ళ సంఖ్యను బట్టి) జీవితాన్ని ఆస్వాదించగలిగే, అనుభవించగలిగే, ఎదిరించగలిగే ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే ఈ ఆట తెలుగు వారి సృష్టి. తెలుగు సంస్కృతిలో పుత్రకామేష్టి.


ఇందులో 11 వరుసలుంటాయి. ఒక్కో వరుసలో 11 గడులుంటాయి. మొత్తం 121 గడులు పూర్తయ్యాక 11 గడులలో ‘పరమపదసోపానపటము’ అక్షరాలు రాసి ఉంటాయి. ఆ పైన “ధరసింహాసనమైనభంబు గొడుగై తద్దేవత భృతులై...సిరిభార్యామణియై” అన్నట్లుగా పదిమంది దివ్య పురుషుల మధ్యలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. చివరకు చేరుకోవల్సిన స్థానం అది. అక్కడకు చేరుకొనే వరకు (జీవితమనే) ఆట ఆడుతూ ఉండవలసిందే. ఈలోగా ఒకటి నుంచి 121 వరకు ఎక్కుతూ దిగుతూనే ఉండాలి. పడుతూ లేస్తూనే ఉండాలి. అంటే పరమపదాన్ని చేరుకునే వరకు ఈ జనన మరణ సంసార చక్రంలో పడుతూ లేస్తూ ఉండటం తప్పదని హెచ్చరిక.


పదకొండు అంటే సంస్కృతంలో ఏకాదశి. ఏకాదశీవ్రతం భారతీయులందరికీ ఆచరణీయం. ఏకాదశి మహా పర్వదినం. ఆ రోజు ఉపవాసం, జాగరణ, దైవస్మరణం అనే మూడూ తప్పని సరి. అలా 11 ఏళ్ళు వరుసగా ఏకాదశీ వ్రతం చేస్తే పరమపదం చేరుకోవచ్చనేది పురాణ కథనం. అయితే ఇదంతా ఆధ్యాత్మికం.


గెలుపోటములు మానసికానుభూతులు. పరమపదం చేరుకోవడం ఆధ్యాత్మిక పరమార్ధం. ఇదొక రకంగా అరచేతిలో వైకుంఠం. ఇందులో గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రాలున్నాయి. నీ ఉన్నతి నీ చేతిలోనే ఉందని చెప్పడం. గవ్వలతో గెలవగలవని జీవితం కోసం ‘రవ్వ’ పెట్టుకోవద్దని ఉపదేశం.


ఇందులో చాలా గళ్ళలో ఏదో ఒక బొమ్మ, దానికో పేరు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని గళ్ళు అడ్డంగా దాటేస్తూ నిచ్చెనలు ఊరిస్తాయి. కొన్ని గళ్ళు అమాంతం దించేస్తూ ఉంటాయి. అంతలో ఉత్సాహం అంతలోనే నిరుత్సాహం. అంతిమంగా ద్వంద్వాతీతమైన పరమశాంతి. ఇదీ ఆట నడిచేతీరు.


ఈ ఆటలో పాములు, నిచ్చెనల గడుల్లోని పేర్లను నిశితంగా పరిశీలిస్తే అద్భుత రహస్యాలు కనిపిస్తాయి. ఉదాహరణకు 75వ గడిలో ఒక పాము తల దగ్గర కర్కోటకుడు అని రాసి ఉంటుంది. దాని తోక 10వ గడిలోకి పాకుతుంది. అక్కడ పంది బొమ్మ ఉంటుంది. పాము కరవడం వల్ల కిందికి రావడం అనేది పైకి కనిపించే విషయం. జీవితంలో కర్కోటకంగా వ్యవహరిస్తే వచ్చే జన్మలో పందైపుడతావనేది ఆధ్యాత్మిక హెచ్చరిక. పందిలా హీనంగా చూస్తారనేది వ్యక్తిత్వ పాఠం.


అలాగే 55వ గడిలో ఒక పాము తల ఉండి దుర్యోధనుడు అని రాసి ఉంటుంది. దాని తోక 12 వ గడిలోకి పాకుతుంది. 43 గడులు కిందికి జారిపోవడం పైకి కనిపించే ఓటమి. దుర్యోధనుడు అసూయకు ప్రతిరూపం. దాని వల్లే కురు వంశ క్షయం. అలానే... మనమూ అసూయపడితే జీవితం నరకప్రాయమవుతుందని, సుఖ శాంతులు నశిస్తాయని హెచ్చరిక.


పాముల అమరిక ఇంత అర్ధవంతంగా ఉంటే నిచ్చెనల ఏర్పాటు మరింత పరమార్ధ బోధకంగా ఉంటుంది. 63వ గడిలో ఒక నిచ్చెన అడుగు భాగం ఉంటుంది. అక్కడ భక్తి అని రాసి ఉంటుంది. ఒక భక్తుని బొమ్మ ఉంటుంది. దాని కొస 83వ గడి వరకూ సాగుతుంది. అక్కడ బ్రహ్మలోకం అని రాసి ఉంటుంది. బ్రహ్మదేవుని చిత్రం ఉంటుంది. భక్తిగా ఉండటమే బ్రహ్మలోకానికి చేరే ఉపాయమన్నది పరమైతే..ఏ పనైనా దాని మీద భక్తితో చేస్తేనే మంచి ఫలితాలొస్తాయన్నది ఇహం.


అలాగే 65వ గడిలో ఒక నిచ్చెన మొదలు ఉంటుంది. అక్కడ చిత్తశుద్ధి అని ఉంటుంది. దాని కొస 105వ గడిలో ఉంటుంది. అక్కడ మహాలోకం అని ఉంటుంది. మొత్తం వైకుంఠపాళిలో ఇదే పెద్ద నిచ్చెన. 40 గడులు అమాంతం ఎగబాకవచ్చు. ఇదంతా పైకి ఆశ పెట్టే విధానం. చిత్తశుద్ధి ఉంటే మహాలోకాలు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాయని అంతరార్ధం. లోకంలో మహానుభావుడిగా కీర్తిపొందుతారని విశేషార్ధం. ఏ చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఇవాళ దేశం అవినీతి ఊబిలో కూరుకుపోయిందో అటువంటి చిత్తశుద్ధి ప్రాధాన్యాన్ని చిన్నతనంలోనే పిల్లలకు ఆటల రూపంలో నేర్పిన ఏకైక జాతి మన తెలుగుజాతి.


ఇంత గొప్ప విషయాన్ని చెబుతూనే చెంతనే పొంచి ఉన్న ముప్పును గుర్తించి జాగ్రత్త పడమనడం ఈ ఆట ప్రత్యేకత. సాధారణంగా 105వ గడి వరకు రాగానే ఆటగాడికి కొంచెం గర్వం వస్తుంది. ఇంక 16 గడులు దాటితే పండిపోయినట్లే కదా అనుకుంటాడు. అక్కడే ఎదురవుతుంది పెద్ద ప్రమాదం. 106వ గడిలో అరుకాషుడు అనే అతి పెద్ద సర్పం ఉంటుంది. దాని నోట్లో పడితే అమాంతం కిందికి జారి మొదటి గడిలోకి అంటే కోతి లోకి వచ్చి పడతాడు. అంటే ప్రముఖుణ్ణి (సెలబ్రిటీ) అయ్యాను కదా అని గర్వించి ఒక్క పొరపాటు (ఒకటి వెయ్యడం)చేసినా మళ్ళీ ఆట మొదటికి రావడం ఖాయం అని హెచ్చరించడం అన్నమాట. పైగా వైకుంఠపాళి పరిభాషలో ఒకటిని గుడ్డి అంటారు. అంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా గర్వించి ఒక్క గుడ్డి పనిచేసినా మళ్ళీ కిందకి జారిపోవడం తప్పదని చెప్పడం.


ఇంత జరిగినా ఆట మానకూడని పరిస్థితి ఇందులో విచిత్రమైన విషయం. ఒకడు పెద్దపాము నోట్లో పడినా ఇంకొకడు ఇంకా పడలేదు కాబట్టి అతను ఇతన్ని ఆడమని ప్రోత్సహిస్తాడు. ప్రత్యర్ధిని సైతం బాగా ఆడమని ప్రోత్సహించే ఏకైక క్రీడ బహుశా వైకుంఠపాళీయే నేమో!


ఇంతకీ చివిరిదైనా చిన్నది కాని విషయం మరొకటుంది. చివర 121 వ గడిలో కూడా ఒక పాము ఉంటుంది. దానిపేరు అహంకారం. దానితోక 99 వ గడిలోకి ఉంటుంది. అంటే 106 లో అరుకాషుణ్ణి దాటినా, 115లో వైకుంఠంలో ప్రవేశించినా, 117లో కైలాసంలో దివ్యానుభూతి పొందినా చివరలో 121 లో అహంకారానికి లోనయితే తిరిగి రాక్షస జన్మ తప్పదు అని హెచ్చరిక. బ్రహ్మరుద్రాది దేవతల్ని తపస్సులతో ప్రసన్నం చేసుకొని మహాభోగాలు అనుభవించి లోకాలన్నీ జయించిన హిరణ్యకశిప, రావణాసురాది వీరులు చివరకు రాక్షసులై దుర్మరణం పాలుకావడానికి ఈ అహంకారమే కారణం కదా!


అంతిమంగా అహంకారం, మమకారం అనే రెండిటినీ జయించినవాడే పరమపదం చేరుకోగలడని సారాంశం.


జీవితమే ఒక వైకుంఠపాళి

నిజం తెలుసుకో భాయి!

ఎగరేసే నిచ్చెనలే కాదు

పడదోసే పాములు ఉంటాయి

చిరునవ్వులతో విషవలయాలను

ఛేదించి ముందుకు పోవోయి.


ఈ చలనచిత్రగీతం ఒక ప్రాచీన శ్లోకంలా, ఒక ప్రబంధ పద్యంలా, ఒక భావకవితలా, ఒక అభ్యుదయ గేయంలా ఎప్పుడూ తెలుగువారి చెవుల్లో మారుమోగుతూ గెలుపుకోసం వెన్ను తడుతూనే ఉంటుంది.🙏👏🤝👍🦜