29, జూన్ 2024, శనివారం

శీతలాష్టమి

 *నేడు శీతలాష్టమి (శీతలాదేవి పూజ)*


"వన్దే౽హం శీతలాం దేవీం సర్వ రోగభయాపహామ్ 

యమాసాద్య నివర్తేత విస్ఫోటకభయం మహత్"


జ్యేష్ట బహుళ అష్టమినాడు శివుడిని త్రిలోచనునిగా పూజించాలి. ఆయనతో పాటుగా జగన్మాతను శీతలాదేవిగా పూజించాలి. స్కాందపురాణంలోని శీతలాష్టకాన్ని పారాయణం చేయాలి. అందువల్ల రోగాలు తగ్గుతాయని ఫలశ్రుతి చెబుతోంది.హైందవులుఈరోజున శీతలా మాతను పూజిస్తారు. అంటు వ్యాధులు సోకకుండా తమను, తమ పిల్లలలను తమ కుటుంబ సభ్యులను రక్షించమని శీతలా మాతను వేడుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా జరుపుకుంటారు. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో ఎంతో పవిత్రంగా, వైభవంగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో శీతలా సప్తమి రోజు అక్కడి గ్రామ దేవతలను పూజిస్తారు.


శీతల సప్తమి పండుగ ఔచిత్యం స్కాంద పురాణంలో స్పష్టంగా వివరించారు. పురాణాల ప్రకారం పార్వతి దేవి మరో అవతారమే శీతలా దేవి. శీతలా దేవి ప్రకృతి వైపరిత్యాలనుండి ప్రజలను కాపాడుతుందని విశ్వసిస్తారు. 'శీతలా' అనే పదానికి చల్లదనం అని అర్థం. ఆ తల్లిని నమ్మి కొలిచిన వారిని, వారి కుటుంబాలను శీతలా మాత చల్లగా చూస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. అనేక ప్రాంతాల్లో ఈ రోజున భక్తులు శీతలా మాతకు పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేస్తారు. అనంతరం పూజలు చేస్తారు. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని పొందేందుకు శీతలా దేవతకు ప్రార్థనలు చేస్తారు. కొందరు శీతల వ్రతం పాటించి శీతల మాత వ్రత కథను చదువుతారు. శీతలా మాతను ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో భక్తులు తలనీలాలు సమర్పించుకుంటారు.


శీతల సప్తమి రోజున, భక్తులు వంట చేయడం మానుకుంటారు. ఒక రోజు ముందు తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తింటారు. ఈ ప్రత్యేక రోజున వేడి, తాజాగా తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా నిషేధిస్తారు. మహిళలు ప్రధానంగా తమ పిల్లల శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కోసం ఉపవాసం చేస్తారు.


🌺పురాణ కథనం: 🌺


శీతల సప్తమికి సంబంధించిన పురాణ కథనం ఒకటి ప్రచారంలో ఉంది. ఇంద్రయుమ్న అనే రాజు ఉదారవంతుడు. సద్గుణశీలి. అతనికి ప్రమీల అనే భార్య, శుభకరి అనే కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కూడా జరిగింది. ఇంద్రయుమ్నుని రాజ్యంలో ప్రతి సంవత్సరం శీతల సప్తమి వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరించేవారు. ఒకసారి శుభకరి కూడా ఆ ఉత్సవంలో పాల్గొంది. పూజలు చేయడానికి శుభకరి తన స్నేహితులతో కలిసి సరస్సుకు బయలుదేరింది. కానీ దారి తప్పడంతో వారు సరస్సుకు చేరుకోలేక పోయారు. ఆ సమయంలో ఒక వృద్ధురాలు వారికి సహాయం చేసి సరస్సుకు దారి చూపింది. అంతేకాదు శీతల సప్తమి పూజా నిర్వహణలో, ఉపవాసం పాటించడంలో తదితర ఆచార వ్యవహారాలను వారికి వివరిస్తూ తగు సూచనలు ఇచ్చింది. అంతా బాగా జరిగింది, శీతలా దేవి చాలా సంతోషించి శుభకరికి వరం ఇచ్చింది. కానీ తనకు అవసరం వచ్చినప్పుడు ఆ వరాన్ని ఉపయోగించుకుంటానని శుభకరి దేవితో చెప్పింది. వారు రాజ్యానికి తిరిగి వస్తుండగా ఒక పేద కుటుంబంలో పాము కాటు కారణంగా వారి కుటుంబ సభ్యులలో ఒకరు మరణించినందుకు దుఃఖిస్తున్నారు. ఆ దృశ్యం చూసిన శుభకరీ తనకు లభించిన వరాన్ని గుర్తుచేసుకుంది. చనిపోయిన ఆ వ్యక్తికి ప్రాణం పోయమని శీతలా దేవిని ప్రార్థించింది. ఆ వ్యక్తి తన జీవితాన్ని తిరిగి పొందాడు. శీతల సప్తమి వ్రత మహత్యం తెలుసుకున్న ప్రజలందరు అప్పటి నుండి ప్రతి సంవత్సరం అచంచలమైన భక్తి ప్రవత్తులతో, అంకిత భావంతో వ్రతం ఆచరిస్తున్నారు.

కామెంట్‌లు లేవు: