12, ఏప్రిల్ 2024, శుక్రవారం

మౌనం - శక్తిసామర్థ్యాలు

 *మౌనం - శక్తిసామర్థ్యాలు*


 మౌనం అనేది దైవభాష. లిపి లేని విశ్వభాష. ధార్మిక దివ్యత్వానికి ద్వారం. సనాతన భాషా స్రవంతి. మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు. నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు.  


 *మౌనమంటే - అంతరింద్రియ విజ్రుంభణను ఆపడం.*

 (మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణములను అంతరింద్రియమంటారు.) 


 మౌనమంటే - ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోశములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం. 


 మౌనమంటే - నిరంతర భాషణ. చింత, చింతన లేని తపస్సు. అఖండ ఆనందపు ఆత్మస్థితి. విషయశూన్యావస్థ. 


*యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః* 

అన్నారు శ్రీ శంకరులు. 


 మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది. 


 *పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదు శాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి. అహం వృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితినే మౌనం అంటారు.*


 *ఈ మౌనం మూడు రకాలు.*


*1. వాజ్మౌనం : 

 వాక్కుని నిరోదించడం. ఈ రకమైన మౌనం వలన కటువుగా మాట్లాడుట, అసత్యమాడుట, పరనింద చేయుట, చాడీలు చెప్పుట, అసందర్భ వ్యర్ధ ప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి.ఆదిత్యయోగీ..


*2. అక్షమౌనం :

 కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక ఏకాగ్రనిష్టలో ఉండుట. ఈ మౌనం వలన ఇంద్రియాల నియంత్రణ ద్వారా ధ్యాన వైరాగ్యాలు బాగా అలవడుతాయి. 


*3. కాష్ఠ మౌనం :

 దీనిని మానసిక మౌనం అంటారు. మౌన ధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠమౌనం అంటారు. ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. దీనినే 40 సంవత్సరములు మౌనదీక్షలో గడిపిన శ్రీ మెహర్ బాబా గారు ఇలా తెలిపారు - 


*'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది. మనస్సు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'.* 


 *మౌనం* 


 *దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.* 

 *గురువు మౌనం జ్ఞానానుగ్రహం.* 

*జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.* 

 *భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన.* 


 ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది. అంతర్యామిని దర్శింపజేస్తుంది. మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది. ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది. 


*మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధ సంభాషణ* -  అని శ్రీ రమణులు అంటారు. 


 మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష. అనేక సంవత్సరములు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు. మాటలకు ఆటుపోట్లు ఉంటాయి కానీ మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞాన స్రవంతి. మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోను మాట్లాడువారిని సదా మహామౌనులే అని మహాత్ములు పేర్కొంటారు. 


*పలుకుల కందక భావమునంటక భాసిలు బ్రహ్మము దానగుచుం* 

*బలుమరు బల్కగ పల్కినచో నవి పల్కితినంచు దలంపక యే* 

*తలపులు లేక నిరంతర సౌఖ్యసుధారస మానుచు నుండుట ని* 

*ర్మలమగు మౌనము మారుత నందన! మానక దీవి భజింపదగున్.* 

(శ్రీ సీతారామాంజనేయ సంవాదం.) 


 ఓ వాయుపుత్రా! అవాజ్మానసగోచరమైన బ్రహ్మమే స్వరూపభూతమైనదని నిశ్చయించి యెప్పటికైనను ఏ మాటలనైనను మాటలాడక యోగి సదా యాత్మానుభవనిష్ఠుడై యుండును. ఒకవేళ మాట్లాడినను 'నేను మాట్లాడితిని' అని తలంపడు. ఇంత యేల? అతనికి సంకల్పములే ఉండవు. ఇట్టి స్థితిగలిగి సర్వకాలములయందును స్వస్వరూపానందానుభావమును చెందుచుండుటయే మౌనం. 


*'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం'* 


 వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది. 


 *భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ధ ప్రపంచం కంటే అందమైనది, అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే అఖండానందం. ఇదే ఆత్మసాక్షాత్కారం, ఇదే మోక్షం.*

.

*అయిదూ నీలోనే అదుపు నీతోనే!*


 *నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం... జగత్తంతా నిండిన పంచభూతాలివి...* 


 వాటిని పరిశోధించాలి... పరిరక్షించాలి.. ఆరాధించాలి... ఎందుకంటే అవి ప్రకృతికి ప్రతిరూపాలు... మనుగడకు ఆలంబనలు... వాటిని స్వచ్ఛంగా ఉంచుకోవడం మనిషి ధర్మం. వాటికి ప్రణమిల్లుదాం. 


 పంచభూతాలకు ప్రతీక అయిన ప్రకృతిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. 


 *మనం చేసే పూజలు భూతత్త్వానికి,* 

 *అభిషేకాదులు జలతత్వానికి,* 

  *యజ్ఞయాగాది క్రతువులు అగ్నితత్వానికి,* 

  *మంత్రోచ్చారణ వాయు తత్త్వానికి,* 

 *ధ్యానం మొదలైన సాధనలు ఆకాశ తత్వానికి ప్రతీకలు.* ఆదిత్యయోగీ*


 మొత్తంగా మనిషి మనిషిగా మారడానికి, ప్రకృతితో అనుబంధం పెంచుకోవడానికి, అంతిమంగా మోక్షాన్ని సాధించటానికి పంచభూతాత్మకమైన ప్రకృతే ఆలంబన అనే సందేశం ఇందులో దాగి ఉంది.


 భూమండలాన్ని ఆవరించి ఉన్న పంచభూతాలు మనిషిలోనూ ఉన్నాయి. వాటి వల్లే మనిషి సుఖంగా జీవించగలుగుతున్నాడు. అవి తమ శక్తులు ప్రసారం చేయటంతో పాటు కర్తవ్యాన్ని ఏమరుపాటులేకుండా నిర్వహిస్తుంటాయి. అందువల్లనే మానవ జీవన వ్యవస్థతో పాటు మొత్తం ప్రాణి వ్యవస్థ నడుస్తోంది. ఈ విషయాన్ని మనిషి గుర్తించాలి. ఈ జీవనచక్రం సవ్యంగా సాగిపోవటానికి ప్రకృతితో, తనని తానను సమన్వయం చేసుకోవాలి. ప్రకృతిని ఆశ్రయించాలే కానీ ఆక్రమించకూడదు. ఈ సూత్రం ఆధారంగానే సనాతన భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థ రూపుదిద్దుకుంది.


  మనిషిలో పంచకోశాలు ఉంటాయి. అవి - *అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు.* వీటిలో..... 


 *అన్నమయ కోశం భూ తత్త్వానికి,* 

 *ప్రాణమయ కోశం జలతత్వానికి,*

 *మనోమయకోశం అగ్నితత్వానికి,* 

 *విజ్ఞానమయకోశం వాయుతత్వానికి*

 *ఆనందమయకోశం ఆకాశతత్త్వానికి* సంబంధించి ఉంటాయి. 


 వీటితో పాటు *పంచభూతాల ప్రతీకలుగా మానవ శరీరంలో ఐదు నాడీకేంద్రాలు ఉంటాయి. వీటిని శక్తిచక్రాలు అంటారు.* వీటిలో 


 *మూలాధార చక్రం భూ తత్వాన్ని,*

 *స్వాధిష్టాన చక్రం జలతత్వానికి,* 

 *మణిపూరక చక్రం అగ్నితత్వానికి,* 

 *అనాహతచక్రం వాయుతత్త్వానికి,*

 *విశుద్ధిచక్రం ఆకాశతత్త్వానికి* ప్రతీకలుగా ఉంటాయి. 


 ఈ ఐదు చక్రాలు కాకుండా శరీరంలో ఉండే *ఆజ్ఞ, సహస్రార చక్రాలు అన్ని తత్త్వాలకు అతీతం.* మనిషి ఆలోచనలు, నడవడిక, సంస్కారం, ప్రారబ్ధకర్మ వల్ల ఇవి ప్రభావితమవుతుంటాయి.


 ప్రకృతిలోని పంచభూతాలను పరిరక్షించుకోవడం, కలుషితం కాకుండా చూడడం, భావితరాలకు ప్రాకృతిక వారసత్వ సంపద అందించడం మొదలైన అంశాల గురించి రుక్‌, యజుర్‌, అధర్వణ వేదాల్లో విస్తారంగా ఉంది.


 *‘ఓం భూఃశ్శాంతి ఓం భువఃశ్శాంతి..’* - భూమికి శాంతి కలుగుగాక. భూమ్యాకాశాల మధ్యలో ఉండే మొత్తం ప్రదేశమంతటికీ శాంతి కలుగుగా అంటుంది కృష్ణయజుర్వేదం.


 అధర్వణవేదం వాయువును మొత్తం ప్రపంచానికి వైద్యుడిగా పేర్కొంది. రుగ్వేదంలో *‘యదతో వాత తే గృహే అమృతస్య నిధిరిత: తేన నో దేహి జీవాసి...’* అంటూ ప్రార్థన మంత్రం ఉంది.  *‘నీతో అమృతనిధి ఉంది... ఓ వాయు దేవా! నీవు మాకు దీర్ఘ జీవనాన్ని ప్రసాదించము’* అని దీని అర్థం. మొత్తంగా ప్రకృతిలోని వాయుతత్త్వ ప్రాధాన్యాన్ని ఈ మంత్రాలు వివరిస్తున్నాయి.


 జలవనరుల పరిరక్షణ ప్రాధాన్యం అధర్వణవేదంలో కనిపిస్తుంది. నీటిని పాడుచేయటం మహాపాపమని, వర్షపునీరు అత్యంత పరిశుభ్రమైందని, ఈ నీటికి ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి ఉందని చెబుతుంది. ఇదే వేదంలో చెప్పిన *‘సముద్రే అంతర్నిహితాని నాభి’,* రుగ్వేదంలోని *‘ఆప ఓషధుతః.. అవస్తు ద్యౌర్వనగిరయో హృషీకేశః’* తదితర మంత్రాలు జలవనరుల ప్రాధాన్యత, సంరక్షణ గురించి వివరిస్తాయి. నదుల్లో ఉమ్మి వేయడాన్ని కూడా నిషేధించాయి మన శాస్త్రాలు.


  *ఐదు వేళ్లు...* 


 మన చేతి వేళ్లలో కూడా పంచభూత తత్త్వం నిక్షిప్తమై ఉంది. ఆ శక్తిని జాగృతం చెయ్యగలిగితే మన చేతికి ఎంతో శక్తి ఏర్పడుతుంది. ‘ఆ చేతిలో ఏదో మహత్తు ఉంద’ని చెప్పిడానికి ఏర్పడటానికి కారణం ఇదే. 


 *బొటన వేలు అగ్నితత్త్వానికి,* 

 *చూపుడు వేలు వాయుతత్త్వానికి,*

 *మధ్యవేలు ఆకాశ తత్త్వానికి,*

 *ఉంగరపు వేలు భూతత్త్వానికి,*

 *చిటికిన వేలు జలతత్త్వానికి సంకేతం.* 


 మంత్రజపాలు చేసేటప్పుడు అంగన్యాస, కరన్యాసాలు చేస్తారు. ఈ ప్రక్రియలో చేతివేళ్ల మొదలు నుంచి కొన వరకు సున్నితంగా తాకుతారు. దీనిద్వారా ఆ వేళ్లలో ఉండే పంచభూతశక్తులు ఉద్దీపనం చెందుతాయి. తద్వారా మనిషిలో ఆత్మచైతన్యశక్తి జాగృతమవుతుంది. అలాగే, ఆశీర్వచనం తీసుకునేటప్పుడు కూడా హస్త మస్తక సంయోగం ద్వారా శక్తి ప్రసారం జరుగుతుంది. అందుకే సాధకులైన పెద్దల నుంచి ఆశీర్వచనం తీసుకోవాలని చెప్పారు.ఆదిత్యయోగీ..


* ఈ సృష్టి మొత్తం పంచభూతాల కలయికతో ఏర్పడిందే. సృష్టికి ఆధారమైన ఈ పంచభూతాలు మానవ శరీరం వాటితోనే ఏర్పడింది. శరీరంలోని వివిధ భాగాల్లో వివిధ తత్త్వాలు, శక్తుల రూపంలో ఇవి కేంద్రీకృతమై ఉంటాయి. మనిషి స్థూల దేహానికే కాదు సూక్ష్మ దేహానికి కూడా ఇవే ఆధారం.


 *1. పృథివి (భూమి) :

వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనే కర్మేంద్రియాలు పృథివీ తత్త్వం ద్వారా ఏర్పడతాయి.


 *2. జలం :

ఇది శరీరంలో రక్తరూపంలో ఉంటుంది. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే పంచతన్మాత్రలు జలతత్త్వానికి ప్రతీకలుగా ఉంటాయి.


 *3.అగ్ని :

జఠరాగ్ని రూపంలో శరీరంలో ఉంటుంది. చర్మం, ముక్కు, కళ్లు, చెవులు, నాలుక అనే ఐదు జ్ఞానేంద్రియాలు అగ్ని తత్త్వం ఆధారంగా ఏర్పడ్డాయి.


 *4.వాయువు *

శరీరంలో ప్రాణం వాయురూపంలోనే ఉంటుంది. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమాసం అనే పంచప్రాణాలు ఈ తత్త్వం ద్వారా ఏర్పడ్డాయి.


 *5.ఆకాశం :

అంతఃకరణంగా ఆకాశతత్త్వం మనిషిలో ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారం అనే అంతరింద్రియాలు దీని ద్వారా ఏర్పడతాయి.....*

.

కామెంట్‌లు లేవు: