24, జనవరి 2023, మంగళవారం

కాశీ ఖండం - 6*

 *కాశీ ఖండం - 6*


🏮🏮🏮🏮🏮🏮🏮🏮 


 *యమపురి వర్ణనం*



 సాధ్వి లోపాముద్ర, భర్త అగస్త్య మునిని - ‘’శివశర్మ హరిద్వారం లో మరణించినా, మోక్షం పొందకుండా, విష్ణులోకానికి ఎందుకు వెళ్లాడు ?"అని ప్రశ్నించింది . దానికి మహర్షి వివరించి చెబుతున్నాడు. అన్ని క్షేత్రాలు ముక్తి క్షేత్రాలు కావనియు, దాని గురించిన వివరాలను చెప్పాడు. 


 శివశర్మ ను ముందుగా యమలోకానికి తీసుకొనివెళ్లారు,  విష్ణు దూతలు. అక్కడ 

వికృతాకారులు కన్పించారు. అది పిశాచలోకమని, పాప కర్మలు చేసినవారు, పరిశుద్ధమైన మనస్సు లేనివారు ఇక్కడికి వస్తారని చెప్పారు. ఆ తర్వాత కొంత దూరంలో మనోహరాకారులు, శ్యామలాకారులు కనిపించారు.  అది గుహ్య లోకమని, న్యాయంగా డబ్బు సంపాదించిన వారు ఇక్కడికి వస్తారని, చెప్పారు. సంపాదించిన డబ్బును దాస్తారు కనుక, గుహ్యకలోకం అంటారు. వీరికి  దానధర్మాలు తెలియవు. సుఖంగా మాత్రం ఉంటారు. బ్రాహ్మణులను పూజించి గోదానం ఇస్తారు. దేవతల్లాగా స్వర్గ సౌఖ్యం పొందుతారు. 


 కొంత దూరం పోయిన తర్వాత, గాంధర్వ లోకం కనిపించింది.  డబ్బున్న వారిని, సంగీతంతో సంతోషపెట్టినవారు ఇక్కడికి వస్తారు. ఈ గాంధర్వ విద్యతోనే, నారదుడు దేవర్షి అయ్యాడు.  వీరంతా శివుని సంతోషపెడతారు. హరిహరుల సమక్షంలో పాడిన వారు మోక్షం పొందుతారు. తర్వాత విద్యాధరలోకం చేరారు.  అన్ని విద్యలలో నిష్ణాతులు, ఈ లోకంలో ఉంటారు. 


 ఇంతలో యమధర్మరాజు అనుచర గణంతో అక్కడికి చేరాడు. ఆయన సౌమ్యమైన ఆకారంతో, తెల్లని వస్త్రాలతో కనిపించాడు. యముడంటే అందరు భయపడతారు కదా? ఇంత సాధువు లాగా ఉన్నాడేమిటి ? అని, శివశర్మకు సందేహం కలిగింది.  అప్పుడు విష్ణు దూతలు పాపాత్ములకు యముడు భీకరంగా,  సజ్జనులకు సౌమ్యుడుగా దర్శనమిస్తాడని, హరిద్వారం లో చనిపోవటం, ధర్మశాస్త్రాధ్యయనం చేయటం వల్ల, శివ శర్మకు మంచిగా కనిపించాడని చెప్పారు.

(ఒకప్పుడు బళ్ళారి రాఘవ గారు సావిత్రి నాటకం లో సావిత్రి వద్దకు ఆమె భర్త సత్య వంతుని ప్రాణాలను తీసుకొని వెళ్ళే సందర్భంలో ధవళ వస్త్రాలతో చాలా సౌమ్యంగా రంగ ప్రవేశం చేసి నటించారట. ఆ నాటకం అయిన తర్వాత, విశ్లేషకులు, "అలా ఎందుకుఅలా చేశారు?" అని అడిగారట. దానికి రాఘవ – నేను యమధర్మ రాజుగా సతీసావిత్రి అనే పతివ్రత దగ్గరకు వస్తున్నాను. యముడు  ధర్మాధర్మాలు తెలిసినవాడు కనుక, ధర్మరాజు అని పిలువబడుతాడు. మంచి వారికీ మంచిగా, దుష్టులకు భయంకరంగా కనిపిస్తాడని శాస్త్రాలు చెప్పాయి" అని వివరించారట. నిజంగా ఆయన పసుపు పచ్చని నేత్రాలు కలవాడు. కోపంతో అవి యెర్ర గా ఉంటాయి .అక్కడున్న వారికి, వారి పాపాలననుసరించి, శిక్షలు ప్రకటిస్తున్నాడు యమ ధర్మ రాజు.

దుఖితుల దుఖాన్ని పోగొట్టే రాజులు, యమధర్మ రాజు సభాసదులుగా ఉంటారు. ఉసీనరుడు, సుధాన్వుడు, వృషపర్వుడు, జయద్రధుడు, రాజసహస్ర జిత్తు, దృఢ దానవుడు, రిపుంజయుడు, యవనాశ్వుడు, దంతవక్త్రుడు, నాభాగుడు, రిపుమంగళుడు, కరంధముడు, ధర్మసేనుడు,  పరమర్ధనుడు, పరాన్తకుడు, మొదలైన నీతి మంతులైన రాజులు, ధర్మా ధర్మాలు తెలిసినవారు, సుధర్మ సభలో ఉంటారు. 


 శివ, విష్ణు నామాలను సదా జపించేవారు, యమునికి దూతలుగా పని చేస్తారు. వీరు విష్ణు శివ కీర్తనలను చేసే వారి దగ్గరకు పోరాదని, యమ శాసనం.

  

 యమ ధర్మ రాజు రచించిన ‘’లలిత ప్రబంధం‘’ అనే మహాగ్రంధం నామాన్ని స్మరించేవారికి కూడా, పునర్జన్మ ఉండదు అని, విష్ణు దూతలు, శివశర్మకు చెప్పినట్లు, అగస్త్య ముని, లోపాముద్రకు, తెలియ జేశాడు. 


 అక్కడి నుండి విష్ణు దూతలు, శివశర్మను అప్సరలోకానికి, ఆ తర్వాత సూర్య లోకానికి, తీసుకొని వెళ్లారు. 


(రేపు ఆలోకాల వివరాలు తెలుసుకొందాం.)


 *కాశీఖండం సశేషం..*

🏮🏮🏮🏮🏮🏮🏮🏮

*🅰️🅿️SRINU*

కామెంట్‌లు లేవు: