24, జనవరి 2023, మంగళవారం

మాఘ_పురాణం* *4_వ_అధ్యాయము

 *మాఘ_పురాణం* *4_వ_అధ్యాయము*

*25-01-2023 బుధవారం*


🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳


*సుమిత్రుని_కథ*


పార్వతీదేవియు శివుని మాటలను విని స్వామీ మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు, సుదేవుని శిష్యుడు అతడేమయ్యెనో వాని వృత్తాంతము నెరుగ గోరుచున్నాను, దయయుంచి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను.


 పార్వతీ..! సరియైన ప్రశ్ననడిగితివి వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురు పుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను, చనిపోదునని గురు పుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరింతినని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి యిట్లు పలికెను. గురువర్యా! పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిధలు మున్నగువాటికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని.. మీ కుమార్తెయు బంతితో నాడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగ బలవంతపెట్టినది. నేనందుకు అంగీకరింపలేదు. అప్పుడామె ఓయీ! నీవు నామాట విని నన్ను కూడనిచో నేనిచట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగ నాత్మహత్య చేసికొందును. నేను లేకుండ నీవింటికి పోయినచో నాతండ్రి నా కుమార్తె యెక్కడయని అడిగిన నీవేమని చెప్పగలవు. నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా! యిప్పటికైనను నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగ కౌగలించు కొనుము.. రమ్ము. నా కోరికను దీర్చుమని యనేక విధములుగ నిర్భందించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున మీ పుత్రికతో రమించి ఆమె కోరికని తీర్చితిని. తరువాత నీ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని. మీకుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందితిని. దయయుంచి క్షమించి ఇట్టి పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను.


సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి యిట్లు పలికెను. ఓయీ! నీవు యితరుల ఒత్తిడికిలోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము నడుగుచున్నావు. వినుము అన్ని నదులలో మిక్కిలి యుత్తమ నదియైన గంగా తీరము నకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపమాచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడును గురువుచె ప్పిన యుపదేశము ను పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో ఒకచోట నొక దివ్యమైన ఆశ్రమమును జూచెను. ప్రయాణము చేయవలసిన యతడు అచట విశ్రమించ దలచెను. అచటి వారందరును శిష్యులు, మిత్రులు, కుటుంబసభ్యులు మున్నగువారితో మాఘ స్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘ పురాణమును వినుచుండిరి.


సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయు వ్రతమెట్టిది దయయుంచి వివరింపుడని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో నేలోకము కల్గును. మీరు పూజించునది యే దైవమును దయయుంచి చెప్పుడని యడిగెను. వారు సుమిత్రుడడిగిన ప్రార్థన విని తమలో నోకడైన సత్యవ్రతుడను వానిని విషయము వివరింపుమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను, ఓయీ శ్రద్దగా వినుము. 


సూర్యుడు మకర రాశిలో నుండగ మాఘ మాసమున ప్రాతఃకాలమున నది, సరస్సు మున్నగువాని యందు స్నానము చేసినవాడు శ్రీహరికి యిష్టుడగును. ఇట్లు మాఘమున ప్రాతఃకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘ మాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘ స్నానము మానినవాడు సత్యశౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు, అబద్దపు సాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు స్త్రీ సాంగత్యలోలుడు మాఘ మాస స్నానము మానినవాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే యగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను, అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగ కొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యము నపహరించువాడు, తానిచ్చిన దానినే దొంగలించువాడు, మద్యపాన లోలుడు, ఆడిన మాటను తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు, తల్లిదండ్రులను దేషించువాడు, వీరందరును పాపాత్ములే సుమా.. మేము చేయుచున్న యీ మాఘమాస వ్రతమును పాటించినచో యీ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యముల నందుదురు. మాఘస్నానము చేసి తీరమున తులసీ దళములతో మాధవునర్చించిన వాని పుణ్యo అమితమైనది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫల ప్రదము. ఈ వ్రత మాచరించిన వానికి పునర్జన్మ యుండదు అని సత్యవ్రతుడు మాఘ స్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగ వివరించెను.


 సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘ స్నానమును మూడు దినములు చేసిన సర్వపాపములు నశించును. కావున యీ మాసమున యింకను మూడు దినములు మిగిలియున్నది. ఈ మూడు దినములును మాఘస్నాన మాచరించి ప్రాయశ్చిత్తముగ గంగాతీరమున తపము చేయుమని సుమిత్రునకు హితము పలికిరి.


సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘ మాసము చివరలో మిగిలిన మూడు దినములును మాఘ స్నానమును చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపము నారంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో నుండెను. ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణి యగు, శ్రీ హరి కృపా విశేషము నంది అనుగృహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చితమునే గాక, మోక్షమును కూడా పొందెను. పార్వతీ నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తంతమును పూర్తిగ చెప్పితిని. సుమిత్రుని పాప వినాశమును, పుణ్యప్రాప్తిని వివరించు యీ కథను మాఘ స్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృ దేవతలును తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠము నందుదురు. చందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను..


ఇతి శ్రీ మాఘ పురాణే చతుర్థోధ్యాయః పారాయణం సంపూర్ణం...


🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*🅰️🅿️SRINU*

కామెంట్‌లు లేవు: