24, జనవరి 2023, మంగళవారం

మాఘ పురాణం -* *1 వ అధ్యాయము*

 తేదీ 22-01-2023 ఆదివారం నుండి 20-02-2023 సోమవారం వరకు మాఘ మాసం సందర్భంగా 

*మాఘ పురాణం* రోజుకు ఒక అధ్యాయం చొప్పున పారాయణం చేయడానికి వీలుగా ఒకరోజు ముందు పోస్ట్ చేయడం జరుగుతుంది... తప్పకుండా పారాయణం చేస్తారని కోరుకుంటూ....


🌷🌷🌷🌷🌷🌷🌷🌷


*మాఘ పురాణం -*

*1 వ అధ్యాయము*

*22-01-2023 ఆదివారం*


🌷🌷🌷🌷🌷🌷🌷🌷


*మాఘమాస మహిమ*


🌷🌷🌷🌷🌷🌷🌷🌷


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |

నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||


ప్రపంచ దేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశం లో హిమాలయాది  పర్వతములు, గంగాది నదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాడం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకు రానిది.


పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి..'స్వామీ ! స్నానానికీ, ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ, పావనమూ, సిద్ది ప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా ! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట.., ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాస మేర్పరచుకొన్నారు. 


వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూ వుండేవారు. అలాగే రోమహర్షుణుడో , ఆయన కుమారుడు సూతమహర్షియో  అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పేంపొందించేవి.


ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగము నొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో *సూత మహర్షి* వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూత మహర్షి ! మీ తండ్రి గారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల  సమర్థులు, రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్ట వశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.


సూత మహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి.., పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి  వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత , నాకు తెలిసిన విషయాన్ని , మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని యధాశక్తి  వినిపించి మీ ఆనందాశీస్సులనీ, భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను, మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. 


అప్పుడు మునులు 'సూతమహర్షి లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని కోరారు.

అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రి గారిని, గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు.


మహర్షులారా.! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది.. విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువు కొన్నవారు కొద్దిమంది అయినా, యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే  విషయాన్ని అడిగింది.  గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.


పార్వతీదేవి పరమేశ్వరునితో.."విశ్వాత్మకా ! సర్వలోకేశ్వరా ! సర్వభూతదయానిధీ ! ప్రాణేశ్వరా ! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ_మాస మహిమను వివరింప గోరుచున్నానని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు.. "కళ్యాణీ ! జగన్మంగళా ! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది.. నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమి ఉండును ? తప్పక చెప్పెదను ,  వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘ_మాసము న ప్రాతఃకాలస్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినొందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జల ప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వ పాపములను పోగోట్టును. రెండవ స్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీ మహావిష్ణువు ఆలోచనలో పడును. ప్రయాగలో మాఘ_మాసం లో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలో గాని, సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు , నూయి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా.. , తెలిసి కాని , తెలియక కాని , బలవంతంగా కాని మాఘ_మాసము న ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియు పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.


మాఘస్నానమును మాని, విష్ణువు నర్చింపక, దానము చేయక పురాణమును వినక మాఘ_మాసము ను గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపము లెట్లుపోవును ? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మద గర్వముచే మాఘస్నానము మానిన అధముడు, నీచజన్మలను పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘ స్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మల నొందుదురు సుమా.., దరిద్రులైనను , బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామ స్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘ స్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.


ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను , #మాఘ_మాస ప్రాతఃకాలము యందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘ స్నానము చేసిన వానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకు గాని  భయముచే గాని, బలవంతముగా గాని మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘ స్నానము చేయలేక పోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నాన ఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గాని కంబళ దానము గాని చేసిన స్నానఫలము నొంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని , చేయించిన వారికిని పుణ్యము కల్గును. ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలెను. మాఘ స్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను, నివారించినను మహాపాపములు కలుగును.


పార్వతీ ! మాఘ స్నానము సద్యోముక్తి ప్రదము.. దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని , ఆచమనము చేసి పురాణమును విన్నను వారికి స్నాన ఫలము కలుగును. అన్ని మాసములలో మాఘ_మాసము ఉత్తమము. శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు. అన్ని మాసములలో మాఘ మాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్త వృక్షము ఉత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘ మాస స్నానము చేయువారిని నిందించినను , నివారించినను మహాపాపములు కలుగును. నాలుగు వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. పర్వతములలో మేరుపర్వతము ఉత్తమము. కావున మాఘ మాస స్నానము అంత పుణ్యప్రదము సుమా.


దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకు పోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సు నొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారాజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు..'మహారాజా ! పరమ పవిత్రమైన మాఘ మాసము న నీ సరస్సున స్నానము చేయకుండ పోవుచున్నావేమి. మాఘ మాసమున చేయు నదీస్నానము కాని , సరస్సు స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా ? యని ప్రశ్నించెను. రాజు మాఘ స్నాన మహిమను చెప్పుడని కోరగానతడు... రాజా.. నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము.. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.


దిలీప మహారాజు మాఘ మాస స్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కుల గురువైన వశిష్ట మహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘ మాస స్నాన మహిమను తెలుప గోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా ! నీకోరిక విశిష్టమైనది. 

మాఘ_మాసము చాలా విశిష్టత కలిగినది.  మాఘ మాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యము నిచ్చును. #మాఘ_మాసమున ప్రాతఃకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగోట్టి అక్షయములైన పుణ్యఫలము లనిచ్చును. స్నానమే యింత అధికమైన పుణ్యము నిచ్చునో పూజ, పురాణ శ్రవణాదుల వలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘ స్నానము వలన సర్వ దుఃఖములను పోగట్టుకొని శుభ లాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘ మాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము. 


పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము (వానలు లేకపోవుట, పంటలు పండకపోవుట మొదలైన లక్షణము గల కరువు) వింధ్య - హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి.. అట్టి వారిలో భృగు మహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశము నందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము, మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు, కిన్నరులు మున్నగు దేవజాతుల వారును వచ్చుచుండిరి.. అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.


ఒకనాడు గంధర్వుడోకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై, మనోహరమై, విచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులి మొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగా నున్నను పులి మొగము వలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా ! నాకు భోగభాగ్యము లన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరి కదా ! ఈమె సౌందర్యము, గుణసంపద నిరుపమానములు., నేను గంధర్వుడను మానవుల కంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులి మొగము నాకు బాధాకరముగ నున్నది. దీనిని పోగొట్టుకొనుట యెట్లో తెలియరాకున్నది. ఈ వికారము వలన నాకు గల సుఖములు, భోగములు నన్ను సంతోషపరచుట లేదు. దయయుంచి నాకీ వికార రూపము పోవు ఉపాయమును చెప్పుడని ప్రార్థించెను.


భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది.. వానికి సాయపడవలయు ననుకొన్నాడు. నాయనా.. పురాకృతకర్మము యెవనిని విడువదు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము , దురదృష్టము , పేదరికమూ ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వానిని పోగొట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయును. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను #మాఘ_మాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికము చేసినచో వచ్చు ఫలితము.., #మాఘ_మాసము లో నదిలో గాని, సముద్రములో గాని, కాలువలో గాని, సెలయేరులో గాని యే స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘ స్నానమును యే ప్రవాహమున చేసినను సర్వతీర్థముల యందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. ఏ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభము.. కావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘ స్నానమును,  యిష్టదేవతా పూజను అచట నున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘ స్నానమును, తీరమున యిష్టదేవతా పూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులి మొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించెను. కృతజ్ఞడై, మునికి భార్యతో బాటు నమస్కరించెను. అతని యాశీర్వాదము నొంది తన భార్యతో బాటు తన లోకమున కెగెను. 


దిలీప మహారాజా..! మాఘస్నాన మహిమను గమనించితివా ? మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను...


*మాఘ పురాణం 1వ అధ్యాయం పారాయణం సంపూర్ణం..*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*🅰️🅿️SRINU*

కామెంట్‌లు లేవు: