7, ఏప్రిల్ 2021, బుధవారం

పుల్లాపంతుల సోదరులు-*

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

*పుల్లాపంతుల సోదరులు-* 

ముక్కు తిమ్మనగారి తలనొప్పి

      (వింజమూరి వెంకట  

      అప్పారావుగారి పోస్టు)

                😡                          

           🌷🌷🌷

👉ఒకసారి నంది తిమ్మన గారికి విపరీతమైన తలనొప్పి పట్టుకుంది.

అది వచ్చినప్పుడు పిచ్చి పట్టినట్టుగా వుండేది (మైగ్రేన్)

రాయలవారు ఎంతో మంది వైద్యులకు చూపించారు ఎన్నో మందులు వాడారు.

అప్పటికి ఉపశమనమే తప్ప మళ్ళీ కొన్నాళ్ళకు వచ్చేది.

ఇలా కాదు కాశీకి వెళ్లి చూపించుకుంటాను, అని తన పరివారంతో సహా కాశీకి ప్రయాణం కట్టారు. అలా వెడుతూ వెడుతూ మధ్యలో 

శిరోభారం ఎక్కువైపోయి నెల్లూరి ప్రాంతానికి చెందిన దరిశి మండలములో 

వున్న 'బోదనంపాడు' అనే గ్రామ శివార్లలో డేరాలు వేసుకొని బస చేశారు.

తిమ్మన గారికి తలనొప్పి ఎక్కువై పోయి పెద్దగా మూలగా సాగారు. అది విని ఆదారిలో వెళుతున్న యిద్దరు వైద్య సోదరులు ఆ డేరా దగ్గరికి పోయి అక్కడ కాపలాగా వున్నవారిని మేము ఘన వైద్యులము, యిక్కడెవరో బాధతో మూలుగుతున్నారు, మేము లోపలి వెళ్లి చూస్తాము అన్నారు. మేము యిద్దరూ అన్నదమ్ములం. ఈ బోదనంపాడు గ్రామానికి చెందిన వాళ్ళం. మాపేర్లు పుల్లాపంతుల పుల్లన్న, సూరన్న. యిక్కడెవరో జబ్బు పడినట్టున్నారు, మూలుగులు బయటికి వినిపిస్తున్నాయి.

మేము వారికి వైద్యం చేస్తాము అన్నారు.

సరే ఆశీనులు కండి అని సైగ చేస్తూ నాకీ శిరోవేదన చాలా ఏళ్ళుగా వుంది. ఈ మధ్య మరీ ఎక్కువగా వుంది.

ఒక్కోసారి తల గోడకేసి బద్దలు కొట్టుకోవాలని పిస్తుంది. తలలో ఏదో తొలుస్తున్నట్టు బాధ, అన్నారు తిమ్మన.

మీరు సెలవిస్తే మేము మిమ్మల్ని పరీక్షిస్తాం. మాకున్న పరిజ్ఞానంతో, మా పూర్వీకుల ఆశీస్సులతో మీకు మంచి వైద్యం అందించ గలమని 

మా నమ్మకం. అన్నాడు పుల్లన్న. ఆయన వేదన సోదరులకు అర్థమైంది.

ఆర్యా! ఆ బాధ నిజంగా వర్ణనాతీతం. గజరాజు కుంభస్థలం లోకి పాము ప్రవేశించినప్పుడు ఆ గజం ఎంతగా విల విల లాడి పోతుందో, అది ఎన్ని కొండల్ని ఢీకొంటుందో, అందుకు వెయ్యి రెట్లు వుంటుందీ శిరోవేదన. భరించడం ఎవరికైనా కష్టమే.

ఒకసారి చెయ్యి యివ్వండి నాడి పరీక్షిస్తాం. అన్నాడు సూరన్న.

తిమ్మన చెయ్యి అందించారు. సూరన్న, అతి జాగ్రత్తగా నాడి పరీక్ష చేశాడు. విషయం పుల్లన్నకు వైద్య పరి భాషలో వివరించాడు. ఆ రోజునుంచీ వరుసగా మూడు రోజులు ఆ వైద్య సోదరులు తిమ్మన ముక్కులో చుక్కల పసరు పిండుతూ వచ్చారు. నాలుగో రోజు ఆ వైద్యానికి కావలిసిన 

పదార్థాలన్నీ ఒక జాబితా తయారు చేసి యిచ్చారు. అందులో విశేషంగా వైద్యానికి మాకు కావలిసిన వస్తువులేమీ లేవు. పుట్టెడు బియ్యం మాత్రం కావాలన్నారు.

"పుట్టెడు బియ్యమా? అంటూ వూరందరికీ సమారాధన చేస్తారా? ఏమి" అన్నాడు రాజవైద్యుడు వెటకారంగా.

కాదు అవసరం వుంది తెప్పించండి. అలాగే 20 మంది వంటవాళ్లు కూడా కావాలి అన్నారు వైద్య సోదరులు. "ఉప్పు,పప్పు కూరగాయలు కూడా తెప్పించండి. వండి వూళ్ళో పోలేరమ్మ జాతర జరిపించండి సరిపోతుంది దెప్పి పొడిచాడు" రాజవైద్యుడు. కాదు, కాదు 

మా వైద్యానికి ఇది చాలా అవసరం అన్నాడు పుల్లన్న.

ఏమి అవసరమో యేమో! మా తిమ్మన గారితో ముక్కు పట్టించి మూడు చెరువుల 

నీళ్ళు త్రాగిస్తున్నారు.

మరుదినం గాలి కూడా చొరరాని దట్టమైన బాగా ఎత్తైన గుడిసె నొక దానిని నిర్మించారు. బయట వంటవాళ్ళతో పుట్టెడు బియ్యం వండిస్తున్నారు.

అనదరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. తిమ్మనను గుడిసె లోకి పిలుచుకొని వెళ్ళారు, సోదరులు. మిమ్మల్ని ఈ గుడిసె లో తలక్రిందులుగా వేలాడ దియ్యాల్సి వుంటుంది అన్నారు. తిమ్మనకు దిక్కు తోచలేదు. భయపడకండి, ఇది వైద్య ప్రక్రియలో భాగమే, అన్నారు వైద్య సోదరులు సరే వైద్యానికి ఒప్పుకున్నాక తప్పుతుందా ఏదైతే అది అవుతుంది అని కానివ్వండి అన్నారు తిమ్మన. వెంటనే ఆయనకు లావు కంబళ్ళు శరీరమంతా చుట్టి తలకు ముక్కు మాత్రం బయటకు ఉండేలా ఒక దట్టమైన తొడుగు తగిలించి ఆ గుడిసెకు ఒక మూలగా ఆయన్ను తలక్రిందులుగా వేలాడ దీశారు.

ఒక్కో వంటవాడు అప్పుడే హండాలలో వండి వార్చిన అన్నాన్ని గుడిసె లో గుమ్మరించారు, వారి సహాయకులు. గుడిసె అంతా ఆవిరి సెగలతో నిండిపోయింది.

తిమ్మన శరీరం ముక్కు పుటాల ద్వారా వేడి వేడి అన్నపు ఆవిరి సెగలు 

నషాళానికి అంటాయి. రెండు క్షణాలలోనే ఆయన ముక్కు పుటాలనుంచి, రెండు విష క్రిములు గిజ గిజ లాడుతూ ఆ అన్నపు రాశి పై పడ్డాయి. వెంటనే స్మృతి తప్పిన ఆయన్ను క్రిందికి దించి బయటకు తీసుకొని వచ్చి శీతలోపచారాలు చేశారు.

క్రమంగా ఆయనను తెలివిలోకి తెచ్చారు. రెండు వారాల్లో పూర్తిగా కోలుకునేలా మంచి మందు లిచ్చారు.

క్రమేపీ కవిగారి శిరోభారం తగ్గి రోగం నయమైంది. ఈ శుభ సమాచారాన్ని రాయలవారికి 

అండ జేశారు. రాయలు ఎంతో సంతోషించి రాజసభకు ఆహ్వానించి తీసుకొని రావలిసిందని తిమ్మనకు కి కబురు పంపారు.

పుల్లాపంతుల వైద్య సోదరుల ఖ్యాతి అప్పటికే విజయనగరం పరిసర ప్రాంతాలకు పాకిపోయింది.

ఆ వైద్యులను దర్శించు కోవడానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చారు. కాసేపటికి కృష్ణదేవరాయల వారూ వచ్చారు.

వైద్యులిద్దరూ రాయలవారిని ప్రస్తుతించారు.

"శ్రీ వేంకటగిరి వల్లభ

సేవా పరతంత్ర హృదయ! చిన్నమదేవి 

జీవితనాయక! కవితా 

ప్రావీణ్య ఫణీశ కృష్ణ రాయ మహీశా!

ప్రభూ మేము వైద్యులమేగానీ కవులము కాదు. అందుకే ముక్కు తిమ్మన గారి 

పద్యాన్నే ఒప్పజెప్పాం. అందుకు మమ్మల్ని మన్నించండి. వంశ పారంపర్యంగా వస్తున్న వైద్య వృత్తినే సేవాధర్మంగా భావించి మా బోదనంపాడు లోనే నిర్వహిస్తున్నాం. మా గ్రామం తమరి ఏలుబడిలోని నెల్లూరు ప్రాంతానికి చెందిన దరిశి మండలంలో వుంది.

ఈ నాటికి ఆ గ్రామానికి ఖ్యాతి రావడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తూంది.

తిమ్మన గారంతటి వారికి వైద్యం చేసే మహద్భాగ్యం కలగడం మా పూర్వీకుల వల్ల మాకు లభించిన పుణ్య ఫలం. వారి ఆశీస్సులు మాకు సదా వుండగలవని విశ్వసిస్తూ మా వైద్య విద్య యిలాగే రాయలవారి అనుగ్రహం తో పదికాలాలపాటు శాశ్వత కీర్తి పొందాలని విన్నవించు కుంటున్నాము. అన్నారు,

పుల్లాపంతుల సోదరులు.

ప్రభువుల ఆజ్ఞతో తిమ్మన లేచి ప్రభూ శతాధిక వందనాలు.

"కాశ్యాన్తు మరణానురక్తి" అని నిశ్చయించుకొన్న నేను ఈ ఘన వైద్యుల చలువతో పునర్జన్మ ఎత్తాను వీళ్ళు నా పాలిట అశ్వినీ దేవతలే.

పర్వతము తేవలిసిన పని వుండేది కాదేమో. కుగ్రామం లో నిస్వార్థంగా 

వైద్యసేవల నందిస్తూ గ్రామములో వారినందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచుతున్న వీరి సేవకి ఎంత యిచ్చినా తక్కువే వీరి ఋణం ఎలా తీర్చుకోగలం?రాయలవారు వీరిని తమ ఆస్థాన వైద్యులుగా నియమిస్తే సాహిత్యం తో బాటు వైద్యశాస్త్రాన్ని కూడా పోషించి నట్లుంటుంది అని నా అభిప్రాయం. ఆ తర్వాత రాయలవారి చిత్తం అన్నారు.

కవీశ్వరుల సూచన ఆమోదదాయకమే మరి వారి సమ్మతం మాకు సంతోషదాయకం అన్నారు రాయలవారు. సభలో కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి.

"ప్రభూ! మీ ఆజ్ఞ శిరోధార్యమే కానీ మా వంశీకుల నియమానుసారం మేము స్వస్థలం లోనే వైద్యం చెయ్యాలి. మరో చోటుకు పోగూడదు. ధన సంపాదనకూ, స్వలాభాపేక్షకు లోనుకాకూడదు. మా గ్రామం వైద్యానికి పెట్టింది పేరుగా శాశ్వత కీర్తి ఆర్జించాలని మా పెద్దల ఆశయం. దీన్ని ప్రభువులు వేరుగా తలచరాదని ప్రార్థన" అన్నారా సోదరులు.

భేష్ ! మీ పూర్వీకుల ఆశయం మన్నింప దగిందే. వైద్యుడి కోసం రోగి అన్వేషించడమే ధర్మం. అప్పుడే వైద్యానికి విలువ. మీ గ్రామాన్ని వైద్య కేంద్రంగా పరిగణిస్తూ బోదనంపాడును ఓ అగ్రహారంగా మీకు దాన శాసనంతో వ్రాయించి ఇస్తున్నాం. సంతోషమే కదా! అన్నారు రాయలు గంభీరంగా. సభలో మరోసారి హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. తర్వాత వైద్య సోదరులను ఘనంగా సత్కరించారు, రాయలవారు. ఆశీర్వాద నవరత్న పద్యమాలికలతో ఆ సోదరులను మెప్పించి తన ఋణం తీర్చుకున్నారు తిమ్మన. ఆనాటి నుంచీ బోదనం పాడు అగ్రహారంలో పేరు నిల్పగల వైద్యులు 'మడుగుపట్టు చెలమ' అన్నట్టు ఖ్యాతి వహించారు.

అందుకే వేమన యిలా అన్నాడు.

మాటలాడ గల్గు మర్మము లెరిగిన 

పిన్న పెద్దతనము లెన్నవలదు 

పిన్నచేతి దివ్వె పెద్దగా వెలుగదా

విశ్వదాభిరామ వినురవేమ 

🤲

తక్కువవాడని ఎవరినీ హేళన చెయ్యరాదు. చిన్నవాడి చేతిలోని దీపముకూడా వెలుగు నిస్తుంది కదా! వేమన నోటినుండి ఈ ఆటవెలది రాక పూర్వమే ఈ నీతికి పట్టం గట్టే ఈ చారిత్రిక గాథకు తెలుగునేల వేదికైంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: