15, జూన్ 2023, గురువారం

ప్రణయ రాయబారం !

 ప్రణయ రాయబారం  !

--------------------------------

కావ్యరచన ఒక శిల్పం. తిక్కనకూడా ఇదేమాట యన్నాడు." అమలోదాత్త మనీష నేనుభయ కావ్య ప్రౌఢిఁ బాటించు శిల్పమునన్ బారగుడన్ అన్నాడు. (చూ: భారతం విరాటపర్వం అవతారిక) అనల్పరచనా విన్యాసమే శిల్పం. అట్టిరచనతో రసజ్ఙులను మెప్పించిన కవులరుదు. అట్టివారిలో ప్రథమ గణ్యుడు శ్రీనాధుఁడు.


అతని రచన లనువాదములే ! అయిన నేమి ?స్వతంత్ర రచనలను దలపింపఁజేయును. నిజమారసినచో అనువాదము బహు కష్టమైనపని. మూలాను సరణము చేయక తప్పదు. ఇక యనువాదకుని ప్రతిభ కనఁడునవకాశములెవ్వి? అయినను శ్రీనాధరచనలు అనువాదములే యైనను స్వతంత్రగ్రంధముల వలెభాసించు చున్నవి.దానికాతని ప్రతిభా వ్యుత్పత్తులే కారణమనక తప్పదు.


ఆంధ్ర సాహిత్యమున కొన్ని వింతలున్నవి. అట్టివానిలో తిర్యక్కులైన పక్షులొనర్ఛిన ప్రణయ రాయభారములు. పేర్కొన దగినవి .శృంగార నైషథములోని హంస రాయభారము మొదటిది.కాగా పింగళిసూరనగారి ప్రభావతీ ప్రద్యుమ్నములోని శుచిముఖియను చిలుక రాయభారము రెండవది. మనమిప్పుడు హంసరాయభారమును తెలిసికొందము.


నైషధమున హంస ప్రణయ రాయభార ఘట్టము రసజ్ఙుల మన్ననల నందుకొన్నది. అదిమామూలు పక్షికాదు.మాటలు నేర్చిన పక్షి! మనుజుల హృదయాలలో మరులు నింపఁగల దిట్ట. నిషధ రాజు ఉద్యావమున నతనిచే బట్టువడి యతవినిని మాటలతో మెప్పించి యాయందగానికి తగిన యందగత్తె కుండిన పురాధీశుని కుమార్తె దమయంతియేనని యామెసౌందర్యమును బొగడి నలున కామెపై ప్రేమరగిల్చి, వారిరువురకు పెండ్లి గూర్చెద నని నమ్మబలికినది. తోడనే పెండ్లిండ్ల పేరయ్యవలె కార్యాచరణమున కుపక్రమించినది.


నిషధ లోనెగిరి , విదర్భలో దమయంతి యంతః పురమున వ్రాలినది. రమణీయమైన దానినడకలకు ముచ్చట పడి దమయంతి చెలికత్తెలచే దానిని  తెప్పించినది. ఇక నక్కడితో దాని చాతుర్యము ప్రారంభమైనది. "ఏమమ్మో! దమయంతీ! నేను చతుర్ముఖుని వాహనమగు హంసను. మంచివారితో స్నేహమే నానైజము. నీకు మహదుపకారమొనర్ప కుతూహల మగుచున్నది. నాసామర్ధ్యమును తక్కువగా నెంచకుము.


మ: స్మర వాత్స్యాయన కూచిమార కృత శాస్త్ర గ్రంధ సందర్భముల్ 

పరిశీలించిన వాఁడ; దంపతుల కుత్పాదింతు సారస్యముల్ ;

మురి పంబొప్పగ మంద మంద గమనంబుల్ నేర్పుదున్ మేదినీ

శ్వర శుధ్ధాంత నితంబినీ జనులకున్ ; సంపూర్ణ చంద్రాననా!


శృం: నైషధము 2 ఆశ్వా 56 పద్యం ; శ్రీనాధమహాకవి;


నాకు మన్మధశాస్త్రృసంబంధమైన విషయాలన్నీ తెలుసు. ఆలుమగల మధ్య యనురాగ మును పెంపుజేయు సామర్ధ్యము గలవాఁడను. అంతఃపుర కాంతలకు మంద గమనంబులను నేర్పు సామర్ధ్యము గలవాడను. నన్ను తక్కువగా నెంచబోకుమీ? అవును నీకు ఉపకారమేదైన చేయవలె ననుకొంటిని గదా!


కన్నియలకు ప్రియమైనదేమైయుండును? వేరేమి యందాల మగడే గదా!'కన్యావరయతేరూపం'. ఆహాఁ! గుర్తువచ్చినది. అందాల రాకుమారీ! నీకొఱకొక యందాల రాకుమారుని వెదకి యుంచితి నమ్మా! నిషధ నేలు నలుఁడే నీకు తగిన భర్త. ఆయందము. ఆవైభవము నింతింతని యనజాలము.నీభాగ్యము పండినదిలెమ్ము. 


నలుని వరించి తరింపుము. బ్రహ్మకు సరూప ఘటన చేయజాలని వాడను నపనింద గలదు.దానిని తొలగింప గోరి యతడేమీ యిరువురకు సంగతిని కూర్చుటకు నిర్ణయించినాడమ్మా ! నామాట నమ్ముము. నేడోరేపో ప్రకటింపగలఁడు.


చ: అడిగితి నొక్కనాడు ,కమలాసను తేరికి వాహనంబ నై

నడచుచు , నుర్విలో నిషధ నాధున కెవ్వతె యొక్కొ భార్యయ

య్యెడునని , చక్ర ఘోషమున నించుక యించుక గాని, యంత యే

ర్పడ విన నైతి ' నీవ యను చందము తోచెడి నమ్మ భామినీ!


శృం; నైష : 2ఆశ్వా 58 పద్యం -శ్రీనాధుఁడు;


హంస యెంత చమత్కారం చేసిందో చూడండి. " మేంప్రయాణంలో ఉండగా విరించిని స్వయంగా నేనడిగానమ్మా ఈధరలో నలునకు భార్యగా నెవరిని సృష్టించితిరని. మాయదారిమోత రథచక్రాలు నీవేనని చెప్పినట్లు గుర్తు.


ఉ: నిర్ణయ మానృపాలునకు నీకును సంగతి ; నెల్లి నేటిలోఁ

దూర్ణము సేయఁగా గలఁడు తోయజ సూతి ; తదన్యధా వృధా

దుర్ణయ వృత్తికిన్ మనసు దూర్చిన యేని ,జగజ్జనాపవా

దార్ణవ ముత్తరించుటకు నాతని కెయ్యది తెప్ప చెప్పుమా?


నీకు , నలునికీ బ్రహ్మముడి పడిపోయింది. తప్పించుకోవాలని జూచావో మధ్యలో బ్రహ్మగారి పరువు పోతుంది. బ్రహ్మ వ్రాతకు తిరుగు లేదు అనేమాట వట్టిదే నని ప్రజలు నిందిస్తే, ఆ అపవాద సముద్రమును దాటేందుకు బ్రహ్మకు తెప్పేది?దారేముంటుంది. అందువల్ల నలుని పెండ్లాడి బ్రహ్మ మాట నిలబెట్టవమ్మా! "- అంటోంది రాయభారి హంస!


మాటలతోనే సరిపెట్టక " నలుని మాత్రమే పెండ్లాడెద నని"- యామెచేత ప్రమాణమునుగూడ చేయించి తనమాటను నెగ్గించుకొన్నది హంస!

                     స్వస్తి!

కామెంట్‌లు లేవు: