6, సెప్టెంబర్ 2021, సోమవారం

వినాయక చవితి సందేశం - 2

 ॐ వినాయక చవితి సందేశాలు 

      

                   -----------------------     


                                  సందేశం - 2


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం

                              చతుర్భుజమ్ I


ప్రసన్నవదనం ధ్యాయేత్ 

               సర్వవిఘ్నోపశాంతయే ॥


         ఇది అందఱూ అన్ని సందర్భాలలోనూ ప్రార్థనా శ్లోకంగా చదువుతాం.


       ఈ శ్లోకం 


1. వినాయకునికి సంబంధించి,


శుక్ల + అంబరధరమ్ = తెల్లని వస్త్రాలని ధరించినవాడు,


శశివర్ణం = చంద్రునిలా తెల్లనైన శరీరం కలవాడు,


చతుర్భుజమ్ = నాలుగు చేతులతో ఉండేవాడు,


ప్రసన్న వదనమ్ = అనుగ్రహ దృష్టితో చూచే ముఖం కలవాడు,


విష్ణుమ్ = సర్వవ్యాపి అయినవాడు,


సర్వ విఘ్న + ఉపశాంతయే = అన్ని విఘ్నాలనుంచీ బయటపడేసి, శాంతి పొందించేవాడు,

     అయిన "వినాయకు"ని


ధ్యాయేత్ = ధ్యానిస్తున్నాను.


      అని అర్థం.


   మరొక అన్వయం

   -----------------------

  

         ఈ శ్లోకంలో "చతుర్భుజమ్", "విష్ణుమ్" అనే మాటతో ఇది విష్ణువుకి సంబంధించింది అంటారు. కానీ,

* తెల్లవస్త్రాలు ధరించి అని ఉంటే, మరి విష్ణువు పసుపుబట్టలు ధరించే "పీతాంబర ధారి" కదా!

* చంద్రునిలా తెల్లని రంగుగలవాడు అని ఉంటే, మరి విష్ణువు "నీలమేఘశ్యాముడు" కదా!

* విఘ్నాలు తొలగించేవాడు అని ఉంటే, మరి "సృష్టి స్థితి లయా"లలో స్థితికి సంబంధించి , విష్ణువు "పుట్టిన వాడిని పోషించడం వరకే బాధ్యతగా కలవాడు" కదా! , ---------- ఇలా అంటూ,

         ఈ శ్లోకం విష్ణువుకు వర్తించదు అంటారు.


         మరి విష్ణువుకు ఎలా అన్వయిస్తాము?


2. విష్ణువునకు సంబంధించి,


* శుక్ల + అంబరధరమ్ 

- తెల్లనైన ఆకాశాన్ని(అంబర) ధరించేవాడు.

 ( విష్ణువునకు,

   నాభిర్వియత్ - ఆకాశం బొడ్డు

    ఆ బొడ్డులోనుంచీ సృష్టికర్త "బ్రహ్మ" వచ్చాడు.


      ఆకాశాద్వాయుః - వాయోరగ్నిః - అగ్నేరాపః - అబ్భ్యః పృథివీ - పృథివ్యా ఓషధయః - ఓషధీభ్యోన్నమ్ - అన్నాత్పురుషః - స ఏవా పురుషో అన్నరసమయః -

       ఆ ఆకాశం నుండీ వాయువూ - వాయువు నుండీ అగ్నీ - అగ్ని నుండీ నీరూ - నీటి నుండీ భూమీ - భూమి నుండీ ఓషధులూ - ఓషధుల నుండీ అన్నమూ - అన్నము నుండీ ప్రాణులూ కలుగుతాయి)


* విష్ణుమ్ 

    — అంతటా వ్యాపించినవాడు

   ( విశ్వం వ్యాప్నోతీతి విష్ణుః )


* శశివర్ణమ్ 

  "శశము" అంటే కుందేలు.

   కుందేలు ఒక అడుగువేసి, మళ్ళీ గంతువేసి, మళ్ళీ దూకుతూ నడుస్తుంది.

   అలాగే 'కాలం' కూడా రోజు - పక్షం - నెల - సంవత్సరం అని కొలవబడుతూ, సంవత్సరాన్ని ప్రమాణంగా కొలవబడుతూంటుంది.

     విష్ణువు 'కాలాన్ని' అధీనంలో ఉంచుకున్నవాడూ, 'కాల స్వరూపుడు'గా "శశివర్ణమ్"


* చతుర్భుజమ్ 

    నాలుగు చేతులలో 

శంఖ - చక్ర - గద - పద్మాలు కలవాడు.


గద - అహంకారాన్ని అణుస్తుంది.

పద్మం - చిత్తాన్ని వికసింపచేస్తూ, విశ్లేషింపజేస్తుంది.

చక్రం - సంశయాత్మకమైన మనస్సులో సంశయనివృత్తి చేస్తుంది.

శంఖం - నిర్ణయాత్మకమైన బుద్ధిని ప్రామాణికమైన జ్ఞానంతో సరియైన నిర్ణయాన్నిస్తుంది.

 

శంఖ - చక్ర - గద - పద్మాలు నాలుగు చేతులలో మారుతూ 24 రకాలుగా( Factorial 4 = 4x3x2x1 = 24) కనబడే మూర్తులే

     కేశవ - నారాయణ - మాధవ - గోవింద - విష్ణు - మధుసూదన - త్రివిక్రమ - వామన - శ్రీధర - హృషీకేశ - పద్మనాభ - దామోదర - సంకర్షణ - వాసుదేవ - ప్రద్యుమ్న - అనిరుద్ధ - పురుషోత్తమ - అధోక్షజ - నారసింహ -అచ్యుత - జనార్దన - ఉపేంద్ర - హరయ - శ్రీకృష్ణ.


     "మనో బుద్ధి చిత్త అహంకారాల"నే నాలుగు భాగాలుగా ఉండే "అంతఃకరణ" శుద్ధి అనుగ్రహించే స్వామి "విష్ణువు".


* ప్రసన్న వదనం

     భృగు మహర్షి వచ్చి కాలుతో తన్నినా వదనంలో మార్పులేదు.

 ( చేయవలసిన పనిని హావభావాలు కనబడనీయక నిశ్శబ్దంగా చేస్తాడు)


* సర్వవిఘ్నాలు పారద్రోలి శాంతి కల్గించే "స్థితి కారకుడై"న "విష్ణుమూర్తి"ని 


* ధ్యాయేత్ 

- ధ్యానిస్తాను. 


          పార్వతీపరమేశ్వరులకు దేవతలు విఘ్నం కల్గించడంవల్ల సంతానం కలుగలేదు. ఆదిదంపతుల ప్రార్థనతో విష్ణువే పుత్రుడుగా జన్మిస్తాడు. శని దృష్టివలన ఆతని శిరస్సు ఖండింపబడితే, గజశిరస్సు అమర్చారు. గజాననుడు సాక్షాత్తూ విష్ణువు అవతారమే 

                            - బ్రహ్మ వైవర్త పురాణం 



            వినాయకుడూ విష్ణువూ ఒకరే కాబట్టి స్వామిని "లక్ష్మీ గణపతి" విగ్రహ రూపంలో ఆరాధిస్తాం.


                    =x=x=x=


    — రామాయణం శర్మ

             భద్రాచలం

కామెంట్‌లు లేవు: