20, సెప్టెంబర్ 2021, సోమవారం

సంస్కృత భాష

 


"పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మము"

@@@@@@@@@@


"సంస్కృత భాష

సంస్కృతము - దేవనాగరి".


◆ సంస్కృతం అంటే 'సంస్కరించబడిన', ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన అని అర్థం. ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతం ఉపజీవ్యం. 


◆ సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి మొదలగు పేర్లు ఉన్నాయి. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. 


◆ సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు ఉన్నాయి. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు, శబ్దములనియును, క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులనియును వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు. కాలక్రమేణ ఇది బ్రాహ్మీ లిపిగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది.

భారతదేశానికి చెందిన ప్రాచీన భాష, భారతదేశ 23 ఆధికారిక భాషలలో ఒకటి. సంస్కృతం హిందూ, బౌద్ధ, జైన మతాలకు ప్రధాన భాష. 


◆ నేపాలు లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయియే ఉంది. 


◆ ఆధునిక భారతదేశంలో సంస్కృతం వాడుక క్రమేపి తగ్గినా కూడా ఇప్పటికీ ఏడు గ్రామాలలో సంస్కృతమే మాట్లాడతారు. ఆ గ్రామాలు, కర్ణాటక లోని మత్తూరు, హోసహల్లి, మధ్యప్రదేశ్ లోని జిరి, మొహద్ మరియు బాఘువర్ గ్రామాలు, ఒరిస్సా లోని ససనా గ్రామం, రాజస్థాన్ లోని గనోడా గ్రామం.


◆ మత్తూరు, కర్ణాటక, షిమోగా జిల్లా లోని గ్రామం. శివమొగ్గ పట్టణానికి 8 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ ఊరి జనాభా 5,000 మందిలో అత్యధికులు సంస్కృత భాషను ఎక్కువ ఉపయోగిస్తుండటం వలన ఈ గ్రామం సంస్కృత గ్రామంగా గుర్తింపు పొందింది.


◆ ఈ ఊరి వారికి ఇతర భాషలు వచ్చినా సంస్కృతంలో మాట్లాడటానికే మొగ్గు చూపిస్తారు. ఇక్కడి స్కూళ్లలో ప్రతి పాఠ్యాంశమూ సంస్కృతంలోనే బోధిస్తారు. అలాగని అక్కడి వాళ్లందరికీ సంస్కృతం తప్ప మరొక భాష రాదేమో, వారికి నాగరికత తెలియదేమో అనుకోటానికి వీల్లేదు. 


◆ ఎందుకంటే అనేక మంది యువకులు ఈ గ్రామంలో సంస్కృతంలో పాఠాలు చదివి, ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, డాక్టర్లు అయ్యారు. ఇక్కడి ముస్లిములు కూడా సంస్కృతమే మాట్లాడతారు. దాదాపు 500 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఇదే పరంపర కొనసాగుతుంది..


◆ మత్తూరులో రామాలయం, శివాలయం, సోమేశ్వరాలయం, లక్ష్మీకేశవాలయం ఉన్నాయి..


◆ మత్తూరుకు కవల గ్రామం లాంటి హొసహళ్ళికి కూడా మత్తూరు లక్షణాలు ఉన్నాయి. హొసహళ్ళి తుంగ నదికి ఆవలి ఒడ్డున ఉంది.ఈ రెండు గ్రామాలనూ జంటగా ప్రస్తావిస్తూంటారు.


◆ మత్తూరు, హొసహళ్ళి రెండు గ్రామాల ప్రజలు గమక కళా ప్రక్రియను అనుసరిస్తారు. ఈ రెండు గ్రామాలు దక్షిణ భారతదేశంలో రోజువారీ వ్యవహారంలో సంస్కృతం మాట్లాడే అరుదైన గ్రామాలు. 


◆ పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా జర్మనీ , నార్వే , ఇంగ్లండ్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలలో క్రమేపి సంస్కృత భాష యొక్క ప్రాధాన్యత పెరుగుతోంది..మన నవ భారతంలో కూడా పిల్లలు తప్పనిసరిగా సంస్కృతం నేర్చుకుని మన పూర్వీకులు మనకు అందజేసిన అపారమైన విజ్ఞానాన్ని , మేధా సంపత్తిని అందిపుచ్చుకోవాలి..

కామెంట్‌లు లేవు: