31, డిసెంబర్ 2022, శనివారం

వైదిక యజ్ఞం - జీవ హింస

 వైదిక యజ్ఞం - జీవ హింస


1957లో పరమాచార్య స్వామివారు అప్పుడు చెన్నైలోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నారు. అడయార్ థియోసొఫికల్ సొసైటి ఆధ్వర్యంలో శాఖాహార సదస్సు జరిగింది. ఆ సమావేశానికి ప్రపంచ నలుమూలల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. కారణమేదైనప్పటికి జంతువులను చంపడం పాపం అని తీర్మానించారు. కాబట్టి మాంసాహారాన్ని వదలి అందరూ శాఖాహారులుగా మారాలి అని చెప్పారు. అహింస, శాఖాహార ప్రాముఖ్యతపై జనంలో అవగాహన కలిగించడానికి చర్యలు కూడా చేపట్టాలని సూచించారు. 


ఆ సదస్సు ముగిసిన తరువాత థియోసొఫికల్ సొసైటి అధ్యక్షుడు శ్రీ శంకర మీనన్ కొంతమంది పాశ్చాత్యులని పరమాచార్య స్వామి అనుమతితో వారి దర్శనానికి తీసుకుని వచ్చారు. స్వామి వారిని కలవాలని ఆ ప్రతినుధులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. 


శంకర మీనన్ అందరిని పేరు ఊరుతో సహా స్వామి వారికి పరిచయం చేసారు. వారిని పరిచయం చేసిన తరువాత స్వామివారి గురించి వారికి చెప్పబోతుండగా మహాస్వామి వారు వారించి, “నా గురించి నువ్వు ఏమి చెప్పనవసరం లేదు. నా గురించి వాళ్ళకు తెలిసింది చాలు” అని అన్నారు. 


కొంతమంది ప్రతినిధులు స్వామి వారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నారు. స్వామి వారు దానికి అంగీకరించగానే మొదటగా వచ్చిన ప్రశ్న “వైదిక యజ్ఞాలలో ఇచ్చే జంతుబలి ఎలా సమర్థిస్తారు? అది పాపం కాదా?”


అందుకు మహాస్వామి వారు “అవును అది చేయతగినదే. అది పాపం కాదు” అని బదులిచ్చారు. ఇది వినగానె వారందరూ ఫక్కున నవ్వారు. స్వామి వారిని అవమానపరిచారు అని మీనన్ గారికి కోపం వచ్చింది. వారివైపు తిరిగి ఆవేశంతో, “నేను మిమ్మల్ని ఇక్కడకు తీసుకుని వచ్చింది స్వామి వారి ఆశీస్సులకోసం. మీరు ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తారు అని తెలిసుంటె నేను ఈ పనికి పూనుకునేవాణ్ణి కాదు” అని అరిచారు. 


స్వామివారు మీనన్ ను శాంతపరిచారు. “వాళ్ళపై కోపం పడవద్దు. వారు ఒక స్పష్టతతో ఇక్కడికి వచ్చారు. జీవహింస పాపం అని అది ఏ కారణానికి అమోదయోగ్యం కాదని నిర్ధారణకు వచ్చారు. కాని నా సమాధానం దాన్ని వ్యతిరేకించడం వలన వాళ్ళు నవ్వారు. నన్ను అవమాన పరచలాని వాళ్ళకు ఆలోచన లేదు. మనం వారికి అర్థం అయ్యే లాగా సమాధానం చెప్పాలి” అని శాంతంగా చెప్పారు. 


మీనన్ కోపం తగ్గిన తరువాత మళ్ళా స్వామి వారు ఇలా చెప్పారు “ఒక హంతకుడు ఒక వ్యక్తిని చంపుతాడు. కోర్టు ఆ విషయాన్ని నిర్ధారించి ఆ హంతకుడికి మరణ శిక్ష విధిస్తుంది. ఆ హంతకుడు పాపభీతి లేక ఆవేశంలో ఒకణ్ణి చంపాడు. మరి అతణ్ణి కోర్టు ఉరితీయడం జీవహింస కాదా? మరి న్యాయమూర్తి చెసినది పాపం కాదా?”


స్వామి వారి మాటలు వారిని అలోచనల్లో పడేసాయి. వారు చాలా విద్యావంతులు. సత్యప్రమాణములైన మాటలు స్వామి వారు చెప్తున్నారని అర్థం చేసుకుని వారి మాటలు వినడానికి ఉత్సాహం చూపారు. 


మరలా మహాస్వామి వారు “నాలుగు రోడ్ల కూడలిలో ఒక ఆంబులెన్స్ వస్తే, అందరిని ఆపి ప్రాణాలు నిలబెట్టే ఆంబులెన్సును ముందు పంపిస్తాము. అంటే అంతమంది ప్రయాణం కంటే ఒక ప్రాణం గొప్పది. వేరొక సందర్భంలో ఒక ఆంబులెన్సు, ఒక అగ్నిమాపక వాహనం వచ్చాయనుకుందాం. అప్పుడు ముందు అగ్నిమాకప యంత్రాన్ని పంపిస్తాం. అంటే ఒక్కడి ప్రాణం కంటే పది మంది ప్రాణాలు గొప్పవి. మరొక్క సంఘటనలో ఒక అగ్నిమాపక వాహనం, అత్యవసరంలో ఉన్న మిలటరి వ్యాను వస్తే ముందు మిలటరి వ్యానును పంపిస్తాం. కొంతమంది ప్రాణాల కంటే దేశ రక్షణ గొప్పది. కాబట్టి అలాంటి సందర్భంలో దేశరక్షణ కోసం కొంతమంది ప్రాణాలను లెక్కచెయ్యము.

 

రాజ్యాన్ని రక్షించుకోవడానికి రాజు యుద్ధాలు చేస్తాడు. ఆ యుద్ధంలో కొన్ని వేలమందిని చంపుతాడు. ఒకర్ని చంపితేనే మరణదండన విధిస్తే, మరి ఆ రాజుకు ఎన్ని మరణ దండనలు విధించాలి? కాని యుద్ధంలో గెలిస్తే పండగ చేసుకుంటారు. ఈ అన్ని సంఘటనల్లో మనం జీవహింసను అమోదిస్తాం. ఇలాంటి నియమాలణ్ణి మనం ఏర్పరుచుకున్నవే. అలాగే యజ్ఞాలలో ఇచ్చే జంతుబలులు పాపం కాదు. ప్రపంచశాంతి కోసం మానవాళి క్షేమం కోసం ఇలా చేసినా పాపం కాదని వేదాలు ఘోషిస్తున్నాయి.


వేదం అపౌరుషేయం. అది పరమాత్ముని ఊపిరి కాబట్టి ఈశ్వరునకు వేదాలకు అభేదం లేదు. వేదము శాశ్వతము, సత్య ప్రమాణము. ‘శాస్త్రాయ చ సుఖాయ చ’. వేదాలు, శాస్త్రాలు మంచినే బోధిస్తాయి. జగదాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఇదే చెప్పాడు. 


దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః 

పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ


మనం యజ్ఞ యాగాదులను చేసి దేవతలను సంతృప్తి పరిస్తే, దేవతలు మనకు సకాల వర్షమును మంచి జీవితాన్ని ఇస్తారు. కాబట్టి వైదిక యజ్ఞములలో చేసే జీవహింస సరిఅయినదే. దాని వల్ల పాపము లేదు. అంతేకాదు. సనాతన ధర్మంలో యజ్ఞము చేయిట హింస, పాపము అని కూడా చెప్పబడింది కాబట్టి చేయకూడదు. కాని ఎవరు చేయుకూడదు అనే విషయం మనం తెలుసుకొని ఉండాలి. 


వ్యాస భగవానుడు రచించిన భాగవతంలో దీనికి సంబంధించిన ఒక ఉపాఖ్యానము ఉంది. ‘ప్రాచీన బర్హి’ అను ఒక రాజు ఉండేవాడు. అతనికి ఆచార్యకాండ యందు విపరీతమైన అభిమానం మక్కువ. కాబట్టి లోకక్షేమం కోసం తరచుగా యజ్ఞయాగాదులు చేసేవాడు. తరువాత అతనికి జ్ఞానం కలిగి అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయాడు. అటువంటి స్థితి పొందిన వాడు ఆ స్థాయిలో ఉన్న సన్యాసి యజ్ఞయాగాదులు చెయ్యరాదు. కాని అతనికి వాటిపైన ఉన్న ఇష్టం వల్ల చేస్తున్నాడు. నారదమహర్షి వచ్చి అతనికి అతనికి జ్ఞానోదయం కలిగించాడు. అప్పటినుండి అతను యజ్ఞయాగాదులు మానేసాడు. 


కాబట్టి, “ఏది హింస, ఏది కాదు, ఎవరు ఏమి చెయ్యాలి?, ఏమి చెయ్యకూడదు” అని చెప్పవలసినవి వేదాలు మాత్రమే నువ్వు నేను కాదు. మనకు వేదమే ప్రమాణం. చట్లకు కూడా ప్రాణం ఉందని ఈరోజు అందరికి తెలుసు. విత్తనం నుండి మొలకెత్తి చెట్టుగా మారి మళ్ళా ఎన్నో విత్తనాలను ఇస్తుంది. కాబట్టి విత్తనాలు తినడం కూడా హింసే. కాయగూరలు, ఆకుకూరలు కూడా జీవహింస కదా. అందుకే సన్యాసులు కూరగాయలు కూడా తీసుకోరు. జ్ఞానులు ఎండుటాకులు, నీరు, గాలి తీసుకుని బ్రతికేవారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. 


కాబట్టి వీటన్నిటి వల్ల మనకు తెలిసేదేమంటే కేవలం ఋషులు, సాధకులు తప్ప పూర్తి అహింస ఎవరూ పాటించలేరు. కాబట్టి అహింస అనేది వారి వారి ఆశ్రమాన్ని బట్టి పాటించాలి. కాబట్టి గృహస్తు చేసే యజ్ఞయాగాదుల వల్ల జరిగే హింస పాపం కాదు. ఇది వేదప్రమాణం. కాబట్టి ఈ నియమాలను మనం ఉల్లంఘించరాదు. 


--- థిల్లైనాథన్, చెన్నై. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 4

కామెంట్‌లు లేవు: