1, జూన్ 2023, గురువారం

కాలం-వినియోగం*

 

              *కాలం-వినియోగం*

                   ➖➖➖✍️


*ప్రతీ పనికి అనువైన కాలం అనేది ఉంటుంది.*

*ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తేనే, దానివల్ల ప్రయోజనం. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా వుండాలంటే, వర్షాకాలంలో ఎక్కువ నీటిని నిల్వ చేసుకోవాలి. ఎక్కువ నీరు నిల్వ ఉండాలంటే, వానలకు ముందే చెరువుల్లో పూడికను తీసివేయించాలి.*


*ఇలా మనిషి చేసే ప్రతి పని కాలానుగుణంగా ఉండాలి. క్రమం తప్పని సృష్టి నియతిని చూసి, మనిషి నేర్చుకోవాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమంటే ఇదే. గతించిన కాలం గురించి చింతించి ప్రయోజనం లేదు. వర్తమానాన్ని నిర్లక్ష్యం చేసి, భవిష్యత్తుపై ఆశలు పెట్టుకోవడంలో అర్థం లేదు.*


*పుట్టిన తరవాత మనిషి కాలానుగుణంగా పొందేవాటిలో ముఖ్యమైనది యౌవన దశ. మనోవికాసానికి కావాల్సిన వనరులన్నీ యుక్తవయసులోనే పుష్కలంగా ఉంటాయి.*


*వికాసం అంటే- జీవితంపై సుస్పష్టమైన అవగాహన ఏర్పరచుకుని లక్ష్యంతో జీవించడం. సృష్టిలో మిగతా ఏ ప్రాణికీ దక్కని అవకాశం ఇది.*


*పట్టువిడవకుండా నిరంతరం కృషిచేసే సామర్థ్యం, యువశక్తిలో మెండుగా ఉంటుంది. వృద్ధాప్యంలో ఇంద్రియ పటుత్వం తగ్గుతుంది. శరీరం సహకరించనప్పుడు ఏ ఉన్నత కార్యాల్నీ తలపెట్టలేరు. గడించిన అనుభవం గొప్ప ఆస్తిగా మిగులుతుంది. తనకు తానుగా ఉన్నత కార్యాలకు పూనుకోకపోయినా, విజయపథంలో దూసుకుపోయేవారికి చిరునామా అవుతారు.*


*యుక్తవయసులో ఉన్నప్పుడు లభించిన శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకున్న వారికే వృద్ధాప్యం గొప్ప వరమవుతుంది. యౌవనాన్ని వ్యర్థం చేస్తే వృద్ధాప్యం బాధించక మానదు.*


*ఉపాధ్యాయుడు గొప్ప అనుభవజ్ఞుడైనా- విద్యార్థిలో క్రమశిక్షణ, చదువుపై శ్రద్ధ లేకపోతే అతడు రాణించలేడు. ద్రోణాచార్యులు విలువిద్యను శిష్యులందరికీ ఒకే విధంగా నేర్పించారు. అర్జునుడి స్థాయికి మిగతావారు ఎదగలేకపోయారు.*


*విలువిద్యపై పార్థుడికి ఉన్న తీవ్ర ఆసక్తే దీనికి కారణం. అందుకే గురువుకు తగ్గ శిష్యుడు, శిష్యుడికి తగిన గురువు ఉండాలంటారు పెద్దలు. దేనినైనా నేర్చుకోవాలన్న కుతూహలం శ్రద్ధాసక్తులు, బాల్యంలోనే ఏర్పడాలి.*


*బాల్యంలో మనసు శుద్ధంగా స్వచ్ఛంగా తెల్లకాగితంలా ఉంటుంది. వీటిపై పెద్దలు ఏది రాస్తే అదే వారి మనసులో ముద్రితమవుతుంది. అవే యుక్తవయసులో సంస్కారాలుగా మనస్సాక్షికి ముడిపదార్థంలా రూపొందుతాయి.*


*సాయంసంధ్యా సమయాలలో పిల్లలను దగ్గరకు చేర్చుకుని గతంలో బామ్మలు నీతి కథలు చెప్పేవారు. అవి పసిహృదయాలలో నాటుకుని శీలనిర్మాణానికి దోహదపడేవి.*


*భారత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన స్వామి వివేకానందుడిలో ఆధ్యాత్మిక భావాల్ని బాల్యంలోనే తల్లి భువనేశ్వరీదేవి నూరిపోసి, జాతి గర్వించే తత్వవేత్తగా తీర్చిదిద్దింది.*


*వీరోచిత భావాలను ఆర్షవైభవాన్ని బాల్యంలోనే తల్లి జిజియాబాయి బువ్వగా తినిపించి శివాజీని ఛత్రపతిని చేసింది.*


*అందుకే మన పూర్వీకులు అమ్మకు గురువులలో ప్రథమస్థానం, దేవతలలో ఉన్నత స్థానం కల్పించారు. *


*సర్వసంగ పరిత్యాగులైనా తల్లికి పాదాభివందనం చేస్తారు.*


*బాల్యంలో ఉత్తమ సంస్కార బీజాలు పడినా, అవి అభ్యాసదశలో(కౌమారం) నిర్జీవం కాకూడదంటే విద్యతోపాటు శీలనిర్మాణానికి అధ్యాపకులు, తల్లిదండ్రులు ప్రాధాన్యమివ్వాలి.*


*వారి ఉరకలేసే ఉత్సాహాన్ని సన్మార్గంలోకి మళ్ళేలా చూడాల్సిన బాధ్యత పెద్దలదే.*


*గురువుల సన్నిధే పరిపూర్ణ వ్యక్తి వికాసానికి చివరి మెట్టు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



కామెంట్‌లు లేవు: