25, జనవరి 2024, గురువారం

శ్రీమద్భగవద్గీత

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*శ్రీమద్భగవద్గీత - 2వ అధ్యాయము* 

. *సాంఖ్య యోగము*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹 

ఈ అధ్యాయములో అర్జునుడు, పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి అశక్తతని పునరుద్ఘాటించి, ఆసన్నమైన యుద్దంలో తన విధిని నిర్వర్తించడానికి నిరాకరించాడు. ఆ తరువాత శ్రీ కృష్ణుడిని తన ఆధ్యాత్మిక గురువు గా ఉండమని పద్ధతి ప్రకారముగా, మర్యాదపూర్వకంగా ప్రాధేయపడి, తను ఉన్న ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో తనకు దిశానిర్దేశము చేయమని శ్రీ కృష్ణుడిని బ్రతిమాలతాడు. శరీరము నశించినా, నశించిపోని, మరణము లేని ఆత్మ గురించి చెప్పటం ద్వారా దివ్య జ్ఞానాన్ని విశదీకరించటం ప్రారంభిస్తాడు, ఆ పరమాత్మ. ఒక మనిషి పాత బట్టలు తీసివేసి కొత్త బట్టలు ఎలాగైతే వేసుకుంటాడో ఆత్మ అనేది కేవలం ఒక జీవిత కాలం నుండి ఇంకో జీవిత కాలానికి శరీరాలను మార్చుకుంటుంది. ఆ తరువాత శ్రీ కృష్ణుడు సామాజిక భాధ్యతల గురించి ప్రస్తావిస్తాడు. ధర్మాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ భాద్యతలను అర్జునుడికి గుర్తుచేస్తాడు. సామాజిక భాధ్యతని నిర్వర్తించటం ఒక పవిత్రమైన ధర్మమని, అది ఉత్తమ గతుల వైపు దారి చూపుతుందని, అదేసమయంలో, కర్తవ్య ఉల్లంఘన వలన అవమానము, తలవంపు, అపకీర్తి కలుగుతాయని చెప్తాడు.

అర్జునుడిని లౌకిక స్థాయి నుండి పైకి తీసిన శ్రీ కృష్ణుడు, తదుపరి, కర్మ శాస్త్రాన్ని లోతుగా విశదీకరిస్తాడు. కర్మ ఫలాలపై అనురక్తి పెంచుకోకుండా కర్మలను ఆచరించమని అర్జునుడికి సూచిస్తాడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలని ఆచరించడాన్ని 'బుద్ధి యోగము' అన్నాడు. బుద్దిని ఉపయోగించి మనము కర్మ ప్రతిఫల కాంక్షని నిగ్రహించాలి. ఇలాంటి దృక్పథంతో పని చేస్తే, బంధాన్ని కలిగించే కర్మలే, బంధ-నాశక కర్మలుగా మారిపోయి, అర్జునుడు దుఃఖ రహిత స్థితిని చేరుకుంటాడు.

దివ్య జ్ఞానం లో ఉన్న వారి లక్షణాల గురించి అర్జునుడు అడుగుతాడు. దానికి జవాబుగా, శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక జ్ఞానం లో ఉన్న వారు మోహము, భయం, కోపములకు అతీతంగా ఎలా ఉంటారో విశదీకరించాడు. వారు సుఖః-దుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు; వారి ఇంద్రియములు నిగ్రహించబడి ఉంటాయి; వారి మనస్సు ఎప్పుడూ భగవంతునిలో లీనమై ఉంటుంది; మానసిక క్లేశములైన - కామము, క్రోధము, లోభములు - ఎలా ఎదుగుతాయో, వాటిని ఎలా నిర్మూలించవచ్చో, దశల వారీగా శ్రీ కృష్ణుడు విశదీకరిస్తాడు.

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 01*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*సంజయ ఉవాచ ।*

*తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ ।*

*విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః ।।*


*భావము:* 

సంజయుడు పలికెను : జాలి నిండినవాడై, శోకతప్త హృదయంతో, కంటి నిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన, శ్రీ కృష్ణుడు ఈ విధంగా పలికెను.

 

*వివరణ:*

అర్జునుడి మనో భావాలని వర్ణించడానికి సంజయుడు, 'కృపయా', అంటే జాలి లేదా కరుణ, అన్న పదం వాడాడు. ఈ కరుణ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి- ఈశ్వర విముఖత వల్ల భౌతిక జగత్తులో వేదనని అనుభవిస్తున్న జీవాత్మలపై భగవంతుడికి, సత్పురుషులకు కలిగే దివ్యమైన కరుణ. మరియొకటి - ఎదుటివారిలో శారీరిక కష్టాలని చూసినప్పుడు మనకు కలిగే భౌతికమైన కరుణ. భౌతికమైన కరుణ ఒక మహనీయమైన భావమే కానీ అది సంపూర్ణంగా సరియైనదే అని చెప్పలేము. అది, కారులో డ్రైవర్ ఆహారం లేక ఆకలితో అలమటించి పోతుంటే, కారు పరిస్థితి గురించి ఆలోచించినట్టుగా ఉంటుంది. అర్జునుడు ఈ రెండవ శ్రేణి మనోభావం అనుభవిస్తున్నాడు. యుద్ధం కోసం చేరివున్న శత్రువులపై అతనికి భౌతికమైన కారుణ్యం పెల్లుబికింది. అర్జునుడి నిరాశ, శోకం తో తల్లడిల్లిపోతున్న పరిస్తితి చూస్తే, అతనికే కనికరము అవసరం వుంది అని తెలుస్తోంది. కాబట్టి తను వేరే వారి మీద దయతో ఉండటం అనేది అర్థరహితమైనది.

ఈ శ్లోకం లో శ్రీ కృష్ణుడు “మధుసూదనా” అని పిలవబడ్డాడు. మధు అనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. ఇక్కడ అర్జునుడి మనస్సులో జనించిన, స్వధర్మాన్ని నిర్వర్తించటానికి అడ్డుగావున్న, అనుమాన రాక్షసిని మట్టుబెట్టబోతున్నాడు.



👆 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: