29, జులై 2020, బుధవారం

నాద యోగం - సమాధి స్థితి - దశ విధ నాదాలు

భట్టాచార్య

సాధకుడు ఎడతెగని నిష్ఠతో సాధనలో ఉన్నపుడు....కుండలినీ శక్తి మేల్కొని, అనాహత చక్రం చైతన్య వంతమైతే "దశ విధ నాదాలు" అనుభవానికి వస్తాయి. కుండలినీ శక్తి ఆజ్ఞా చక్రంలో స్థిర పడితే, రక రకాల కాంతులు అనుభవానికి వస్తాయి. ఈ కాంతులనే "చిత్కళలు" అంటారు. కూటస్త చైతన్యమునే "బిందువు" అంటారు. అయితే ఇవన్నీ లయం కావలసిందే. అప్పుడు నిర్వికల్ప సమాధి సిద్ధించును.

నాద యోగాభ్యాసంలో భాగంగా,  ప్రణవ సాధన చేసేవారికి....మొదటి దశలో, లోపలి నాదం అనేక రకాలుగా వినిపిస్తుంది. నిరంతరం, దీక్షగా అభ్యాసం చేస్తూ ఉంటే, చివరికది సూక్ష్మ నాదంగా పరిణమిస్తుంది. ప్రారంభంలో, లోపల నుండి (1). సముద్ర ఘోష  (2). మేఘ ఘర్జన (3). భేరీ నాదం (4). నదీ ప్రవాహం చప్పుడు.......వినిపిస్తుంది. అయితే ఈ నాదాలు ప్రణవం యొక్క వివిధ పరిణామ రూపాలే. సాధన మధ్య దశలో 1. మద్దెల శబ్దం 2. ఘంటా నాదం 3. కాహళ నాదం వినిపిస్తాయి. ఇవన్నీ, కుండలినీ శక్తి జాగృతిలో, "నాదానుసంధాన" యోగ సాధనలో, ధ్యానావస్థల్లోని...పరిపూర్ణ దశలలో వినిపించే నాదాలివి. ఈ ప్రణవ అభ్యాసం చివరి దశలో, చిరుమువ్వల చప్పుడు, మధురమైన వేణు గానం, తుమ్మెద ఝంకారం....లాంటి వివిధ నాదాలు....అత్యంత సూక్ష్మంగా సాధకునికి వినిపిస్తాయి.

  సాధకుడు, తన సమాధి స్థితిలో నాదాన్ని వింటూన్నపుడు, మధ్యలో మహాభేరీ నాదాలు కూడా వినపడతాయి. ఆ సమయంలో, దాని వెనుకే....అత్యంత సూక్ష్మ నాదాలు వినపడతాయి. ఈ నాదాలను కూడా జాగ్రత్తగా వినాలి. సూక్ష్మ నాదాలు వింటూ...పెద్ద ధ్వనులను విడిచి పెట్టాలి. అలాగే పెద్ద ధ్వనులు వినేటపుడు, సూక్ష్మ నాదాలు విడిచి పెట్టాలి. ఇలా నిరంతరం నాదాభ్యాసం చేస్తున్నపుడు, మనస్సు ఒక నాటికి ఏదియో ఒక నాదంపై ఏకాగ్రతను పొంది, మనోలయం జరుగుతుంది. మనోలయమే కదా, కావలసింది.

కామెంట్‌లు లేవు: