6, ఆగస్టు 2022, శనివారం

ధర్మాకృతి : పూర్వీకులు

 ధర్మాకృతి : పూర్వీకులు 


తంజావూరు మహారాష్ట్ర ప్రభువుల పాలనలోనికి రాకముందు కర్ణాటక నాయక రాజుల పరిపాలనలో ఉండేది. నాయక రాజులలో ప్రసిద్ధులైన సేవప్ప నాయకుని కాలంలో శ్రీ గోవింద దీక్షితుల వారు నాయకరాజుల కుల గురువుగా ఉండేవారు. వారు బహుశాస్త్ర కోవిదులు. యజ్ఞదీక్షితులు, అనుష్ఠానపరులు. రాజుగారి కోరికపై ప్రధాని మంత్రిపదవిని స్వీకరించారు. అనతికాలంలో మంచి పరిపాలనాదక్షులుగా విఖ్యాతి సాధించారు. వీరి కాలంలో తంజావూరు సీమ అన్ని రంగాలలోనూ ముందంజ వేసింది. అనేక ప్రజోపకరములైన కార్యములు చేపట్టబడినవి. అయ్యన్ అనేది దీక్షితుల వారి గౌరవ నామము. వీరి కాలంలోనే వీరి పేరుతో తంజావూరి సీమకంతటికీ సేద్యపునీటినందించు అయ్యన్ కాలువ, అయ్యన్ కోనేరు త్రవ్వబడినాయి. వీరు కుంభకోణములో రాజా వేదపాఠశాలను ఆరంభించారు. ఈనాటికి కూడా ఆ పాఠశాలలో నూరుకు పైగా విద్యార్థులు వేదశాస్త్రములు అధ్యయనం చేస్తున్నారు. చతుర్దండి ప్రకాశిక అనే పుస్తకాన్ని రచించిన ప్రసిద్ధ స్వరమేళకర్త శ్రీ వేంకటమఖి వీరి పుత్రులు.


దీక్షితుల వారు హోయసల కర్ణాటక బ్రాహ్మణులు. వీరిని ఆశ్రయించుకొని అనేక కర్ణాటక బ్రాహ్మణ కుటుంబాలు తంజావూరి సీమకు తరలివచ్చాయి. నాయకరాజులు కూడా కన్నడిగులే కదా! ఇలా స్థిరపడిన కుటుంబాల వారందరూ వేదశాస్త్రములలో మహత్తరమైన కృషి చేశారు. తంజావూరి సీమకే గర్వకారణమయినారు. పేష్వాల చేత అపరిమితమైన గౌరవాన్ని పొందిన పొందిన మణికుట్టి ఈ వంశములోని వారే. మణికుట్టి చివరి పేష్వాకు అత్యంత అంతరంగీకులయ్యారు. చివరికి ఆ పేష్వాను తెల్లవారు బంధించి తీసుకొని వెళుతున్నప్పుడు కూడా దారిలో బిచ్చమెత్తుకుని జీవిస్తూ బహుకాలం వారికి శాస్త్ర విజ్ఞానపు విందు చేశారు. తరువాత మైసూరు మహారాజు చేత విశేష సత్కారాలను పొందారు.


కంచి కామకోటి పీఠపరంపరలో 59వ ఆచార్యుల వారయిన శ్రీ భగవన్నామ భోదేంద్ర సరస్వతీ స్వామివారు రామేశ్వర యాత్ర ముగించుకొని కంచి తిరిగి వస్తూ పవిత్ర కావేరీ తీరంలో ప్రకృతి రమణీయమైన గోవిందపురంలో బహుకాలం ఉండి అక్కడే సిద్ధి పొందారు. వారి శిష్యులయిన శ్రీ ఆధ్యాత్మిక ప్రకాశేంద్రులు కూడా చాలా కాలం గురువుగారి అధిష్ఠానం వద్దనే ఉండిపోయారు. వారు తమ వారసుని మహాపండితులయిన ఈ హోయసల కర్ణాటక బ్రాహ్మణ కుటుంబం నుంచే ఎన్నుకొన్నారు. అప్పటి నుంచి మన మహాస్వామి వారి వరకు వచ్చిన పీఠాధిపతులందరూ ఈ కుటుంబాల నుంచి వచ్చిన వారే. 


17వ శతాబ్దంలో కర్ణాటక యుద్ధం కారణంగా కాంచీపురంలో అశాంతి నెలకొన్నది. అప్పటి కామకోటపీఠ ఆచార్యులయిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు బంగారు కామాక్షీ విగ్రహాన్ని తీసుకొని ఒడయార్ పాళెం చేరారు. ఒడయార్ పాళెం జమీందారులు శ్రీచరణుల యెడ అపరిమితమైన భక్తిప్రపత్తులున్నవారు. అప్పటి తంజావూరు పాలకులైన శ్రీ ప్రతాప సింహ రాజా స్వామి వారిని తంజావూరు విచ్చేసి ఉండవలసినదిగానూ, బంగారు కామాక్షిని తంజావూరులో ప్రతిష్ఠించవలసినదిగానూ కూరారు. రాజాగారి వినతిని అనుసరించి స్వామివారు తంజావూరు విచ్చేసి, కామాక్షీ విగ్రహ ప్రతిష్ఠ చేయించి, శంకర మఠంలో కొంతకాలం బసచేశారు. స్వామివారు ముఖ్యపట్టణానికి కొంచెం దూరంగా నదీ తీరంలో ఉండడానికి సంకల్పించడంతో అప్పటి తంజావూరు ప్రధాని శ్రీదాబిర్ పంత్ శ్రీ మఠానికి కుంభకోణం కావేరీ తీరంలో ఆదికుంభేశ్వర మంగళాంబాదేవి సమక్షంలో మఠనిర్మాణం చేసి ఇచ్చారు. శ్రీమఠ ప్రధాన కార్యాలయం కుంభకోణానికి మార్చబడింది. కంచిలో నామమాత్రంగా శాఖా కార్యాలయం నిర్వహించబడుతూ వచ్చింది. 


శ్రీమఠం కుంభకోణానికి వచ్చినది ఆదిగా అపప్తికే ఉద్దండ పండితులుగా ప్రఖ్యాతి గాంచిన హోయసల కర్ణాటక బ్రాహ్మణులు పీఠమునకు యధోచితమైన సేవ చేస్తూ స్వామి వారలను ఆశ్రయించి ఉన్నారు. మన మహాస్వామి వారి మాతామహా స్థానము గోవింద దీక్షితుల వారి పరంపరలోని వారు. వారి ప్రపితామహులైన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తిరువిడైమరుదూరు మహాలింగస్వామి ఆలయ వీధిలో ఉన్న శంకరమఠంలో పూజ చేస్తూ శ్రీమఠ ముద్రాధికారిగా ఉన్నారు. వారికి ఇద్దరు కుమారులు శ్రీ శేషాద్రి శాస్త్రి, శ్రీ గణపతి శాస్త్రి. శేషాద్రి శాస్త్రి గారు ఋగ్వేదాధ్యయనం పూర్తిచేసి తండ్రిగారి ముద్రాధికారిత్వం చేపట్టి శంకరమఠంలో పూజ చేస్తూ తిరువిడై మరుదూరులో స్థిరపడ్డారు. శ్రీ గణపతి శాస్త్రి ఋగ్వేదము సాంగోపాంగంగా అధ్యయనం చేశారు. మంచి శాస్త్ర పండితులు. మాతృభాష కన్నడం, తెలుగు, తమిళం, మరాఠీ భాషలలో మంచి ప్రవేశం ఉన్నది.  50సంవత్సరములు శ్రీమఠంసర్వాధికారిగా తమ యావచ్ఛక్తి యుక్తులు ధారపోశారు. ఈ హోయసల కర్ణాటక బ్రాహ్మణ కుటుంబములలో తిరువిసైనల్లూరులో స్థిరబడిన కుట్టకవి మనుమడు మహా పండితుడు అయిన “మణికుట్టి” గురించి, శ్రీ గణపతి శాస్త్రిగారి గురించి మహాస్వామి వారు ఇష్టాగోష్ఠిలో చెప్పిన రసస్ఫోరకమైన విషయాలు శ్రీ రా. గణపతి గారిచే తమిళ భాషలో కల్కిలో ప్రచురించబడినవి. ఇందు చెప్పబడిన విషయములు శ్రీమఠ ఆచార్యుల చరిత్రతోనూ, శ్రీవారి పూర్వీకులతోనూ ముడిపడి ఉన్నందున, వీని స్వేచ్ఛానువాదములు ఇక్కడ పొందుపరచబడినవి. 


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: