3, డిసెంబర్ 2022, శనివారం

 Srimadhandhra Bhagavatham -- 81 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


శ్రీకృష్ణుని రాసలీల:

రాసలీల ఘట్టము విన్నంత మాత్రం చేత మన పాపములన్నిటిని దహించగల శక్తి కలిగినది. రాసలీలను సామాన్యమయిన స్థాయిలో విని, మనస్సును పరిశుద్ధంగా ఉంచుకొని అది ఈశ్వరుని లీల అని విన్నంత మాత్రం చేత గొప్ప ఫలితమును ఇస్తుంది. దాని లోపల ఉండే అసలయిన రహస్యమును తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తే అది ఒక దివ్యాతిదివ్యమయిన లీల. అంతకన్న గొప్పలీల సృష్టిలో ఉండదు. రాసలీల అనేసరికి కృష్ణుడు చాలామంది కాంతలతో భోగము అనుభవించుట అని అనుకుంటారు. దాని ఉద్దేశము అది కాదు.

శరత్కాలములో పౌర్ణమి వచ్చింది. మంచి వెన్నెలతో కూడిన రాత్రి. ఆ రాత్రి కృష్ణ భగవానుడు యమునానదీ సైకతమునందు ఒడ్డున నిలబడి వేణువు మీద ఒక గొప్ప మోహనగీతము నొకదానిని ఆలాపన చేశారు. అక్కడ అనేకమంది గోపాలురు ఉన్నారు గోపకాంతలు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది పాలు తీయడానికి దూడలను విడిచి పెడుతున్నారు. మరికొంతమంది పాలు పితుకుతున్నారు. మరికొంతమంది పితికిన పాలను అగ్నిహోత్రం మీద పెడుతున్నారు. వేరొక ఇంట్లో చల్ల చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పని జరుగుతోంది. ఈలోగా కృష్ణ భగవానుడు ఊదిన వంశీరవము వినపడగానే ఇక్కడే మనస్సులో కృష్ణ భగవానుని దర్శనం చేసి, ఇంత గొప్ప వంశీరవమును చేస్తున్న ఆ మోహనరాగము పలుకుతున్న రూపమును చిత్రించుకుని గాఢాలింగనము చేసుకుని ఆ మైమరపుచే పరవశులై ఇక్కడే కొందరు గోపకాంతలు శరీరమును వదిలిపెట్టేశారు. మరికొంతమంది భర్తలు అడ్డుపడుతున్నా, మామలు అడ్డుపడుతున్నా కృష్ణుడితో రాసలీల చేయాలని ఆయనతో ఆనందం అనుభవించాలని వీళ్ళనందరినీ తోసేసి కృష్ణుడు ఎక్కడ రాగాలాపన చేస్తున్నాడో అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కృష్ణుడు వీరందరినీ చూసి వేళకాని వేళలో పర పురుషుడి దగ్గరకు స్త్రీలు పరుగెట్టుకు వస్తే మానం మర్యాదలు మంట కలిసిపోవా? ఈ రాత్రివేళ మీరు ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు. వారు కన్నులవెంట నీరు కారుస్తూ ‘కృష్ణా! మేము రావడానికి కారణం నీకు తెలుసు. ఇక్కడవరకు వచ్చిన తరువాత నీవలన సుఖమును పొందాలని మేము వస్తే ఎందుకు వచ్చారు అని అడుగుతావా?’ అని అడిగారు.

ఈవిషయం వినేసరికి పరీక్షిత్తుకు ఆశ్చర్యం వేసింది. కొన్ని సందేహములు కలిగాయి. కృష్ణుని అడగటమేమిటి? భగవానుడు ఈ పనులు చేయవచ్చునా? ధర్మమును ఆవిష్కరించవలసిన వాడు, ధర్మమును స్థాపించవలసిన వాడు పరకాంతలయందు ఇటువంటి మోహబుద్ధిని జనింపచేయవచ్చునా?’ అని శుకమహర్షిని అడిగాడు. శుకబ్రహ్మ ‘పరీక్షిత్తూ! నీవు తొందర పడకు. రాసలీలను జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యి. దానిని నీవు తెలుసుకుంటావు’ అన్నారు.

రాసలీల ఈశ్వరుని లీల. ఈశ్వరుడు చేసే పనియందు యుక్తాయుక్తములను విచారించే అధికారం మనకు ఉండదు. ఆయన జగత్ప్రభువు. ఆయన జగత్తునందు ఏది చేసినా అడిగే అధికారం, దానిని గురించి విమర్శ చేసే అధికారం మనకి లేదు. శుకుడు కూడా ఇదే మాట చెప్పాడు. యమునానది ఒడ్డునే వేణువును ఎందుకు ఊదాలి? సూర్యునికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు యముడు, కూతురు యమున. యమున ప్రవహించి వెళ్ళిపోయే కాలము స్వరూపము. కాలము ప్రవహించి వెళ్ళిపోతున్నప్పుడు ఉన్నామని ఈ శరీరమును చూపించిన జీవులు పడిపోతూ ఉంటారు. ఎంతమంది పడిపోతుంటారో ఎవ్వరికీ తెలియదు. ఆ లెక్కపెట్ట గలిగిన వాడు ప్రపంచమునందు ఎవ్వడూ ఉండడు. ఒక్క ఈశ్వరుడికే తెలుస్తుంది. ఎందుకనగా ఆయనే కాలస్వరూపమయి ఉన్నాడు. యమున కాలప్రవాహమునకు గుర్తు. ఎప్పుడు ఆయన తన నిర్హేతుకమయిన కృపతో కొంతమందిని ఉద్ధరించాలని అనుకున్నారు. భావనయందు ఎలా పెట్టుకున్నా సరే వస్తువు అటువంటిది. ఆయనయందు భక్తితో గుండెల్లో గూడు కట్టుకున్న వాళ్ళని ఆయన ఉద్ధరించాలని అనుకున్నారు. దీనినే ఈశ్వర సంకల్పము అంటారు. ఇలా ఎందుకు ఈశ్వరుడు సంకల్పించాలి? అలా సంకల్పించడమును ‘నిర్హేతుక కృప’ అని శాస్త్రము పేర్కొంది. శరత్కాలములో ఎందుకు ఊదాలి అంటే శరత్కాలములో ఆకాశములో మబ్బులు ఉండవు. ఆకాశమంతా నిర్మలంగా తెల్లటి వెన్నెలతో కూడి ఉంటుంది. అలాగే జీవి అంతరమునందు రజోగుణము, తమోగుణము బాగా తగ్గిపోయి సత్త్వగుణ ప్రకాశముతో ఉంటాయి. సత్త్వ గుణ ప్రకాశముతో ఉన్న మనస్సులు ఏవి వున్నాయో, ఏవి నిరంతరము కృష్ణ భావన చేస్తున్నాయో అవి ఈ వేణునాదమును విని పరుగెట్టగలవు.శబ్దము అందరికీ వినపడుతుంది. ఆ శబ్దము ఉత్తేజితము చేయవలసి వస్తే అది స్త్రీ పురుషులనందరినీ చేస్తుంది తప్ప కేవలము స్త్రీలను మాత్రమే ఉత్తేజితులను చేయడమో, కేవలము పురుషులను ఉత్తేజితులను చేయడమో ఉండదు. కృష్ణుని వేణుగానము కేవలము గోపకాంతలను మాత్రమే ఎందుకు ఉత్తేజితులను చేసింది? వాళ్లకు కేవలము ఉన్నది కామోద్రేకమే అయితే వేణునాదము విన్న తరువాత మాత్రమే కామోద్రేకముతో ఎందుకు పరుగెత్తాలి? వేరొక సందర్భములో పరుగెత్తవచ్చు కదా! కామాతురత కలిగిన వాడు అందునా పర పురుష సంగమము కోరుతున్న స్త్రీ గుప్తంగా వ్యవహరిస్తుంది తప్ప తన భర్త ఎదురువస్తే త్రోసి అవతలపారేసి పరుగెడుతుందా? అది సాధ్యమయే విషయం కాదు. కానీ ఇక్కడ కొన్ని వేలమంది గోపకాంతలు పరుగెడుతున్నారు. మరి గోపాలురు పరుగెత్తరా? వారిని అడ్డుకోరా? అలా రాసలీలలో ఎందుకు జరుగుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే మనం వేణునాదమును వింటే గోపకాంతలకు ఏమయినదో తెలుసుకోవాలి. వేణు నాదమును వింటే గోపకాంతలకు ‘అనంగవర్ధనము” అయినదని చెప్పారు. అనంగవర్ధనమనే మాటను వాడి వ్యాసుల వారు మనందరి మీద సమ్మోహనాస్త్రమును వేసారు. కృష్ణుడు వేయలేదు ఆయన వేశారు. అనంగుడు అనగా శరీరము లేనివాడు - మన్మథుడు. మన్మథవర్ధనం జరిగినది అంటే లోపల కామోద్రేకము కలిగినదన్నది బాహ్యార్థము. రాసలీలనే శీర్షికను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటే ‘అనంగ’ అనగా శరీరము కానిది అనగా ఆత్మ. అనగా అనంగవర్ధనము అనగా ఆత్మవర్ధనము. జీవి ఆత్మాభిముఖుడయినాడు. ఈశ్వరుని పిలుపునకు ఎవడు యోగ్యుడో వాడికి అందినది.

ఆత్మోన్ముఖులు అయ్యారని గోపకాంతలకు మాత్రమే చెపుతారు. పురుషులకు ఎందుకు చెప్పరు? ప్రపంచమునందు మనం అందరం కూడా బాహ్యంలో భార్యభర్త అంటాం. శాస్త్రమునందు మాత్రము భార్య భర్త ఉండరు. పురుషుడు ఒక్కడే ఉంటాడు ఆయనే పరమాత్మ. ప్రపంచంలో పరమాత్మ ఒక్కడు మాత్రమే పురుషుడు. మిగిలిన వారు అందరూ స్త్రీలే. అందరికీ ఒకడే భర్త జగద్భర్త. ఆయనే పరమాత్మ. అందరూ ఆయననే పొందాలి.

పతిం విశ్వశ్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం’

వాడు విశ్వేశ్వరుడు లేదా నారాయణుడు. ఏ పేరు పెట్టి పిలిచినా అభ్యంతరం లేదు. అటువంటి వాడిని పొందాలి. ఇపుడు స్త్రీయా పురుషుడా? పురుషుడిని పొందాలి కాబట్టి స్త్రీగా చెప్తారు. పరమాత్మ పురుషునిగా ఉన్నాడు. మారని వాడు మారుతున్నది శరీరము. మారుతున్న శరీరమునందు మీరు ఉండి మారని తత్త్వమయిన భగవంతుడిని అందుకోవాలి. ఇది ఎవరికో లోపల ప్రచోదనం అవుతుంది. అలా ఎవరికీ ప్రచోదనం అయిందో వారికి కృష్ణ పరమాత్మ వేణునాదము వినపడింది. వారికి అనంగవర్ధనం అయినది. పైకి కథ కామోద్రేకము కలిగినట్లు ఉంటుంది. వాళ్ళు అడుగుతున్నది కామమా లేక మోక్షమా? వారు మోక్షమును అడుగుతున్నారు. వీరందరూ ఆత్మసుఖమును అభిలషిస్తున్నారు. ఆత్మానందమును వాక్కు చేత చెప్పడం కుదరదు. దీనిని మధురభక్తితో చెప్పాలి. మధురభక్తిని నాయిక నాయకుల వలన చెపుతారు. జీవ బ్రహ్మైక్య సిద్ధిని ప్రేయసీ ప్రియుల సమాగమముగా చెప్తారు. అందుకే జీవ బ్రహ్మైక్య సిద్ధియే కళ్యాణం. మధురభక్తిని ఆధారంగా తీసుకొని రాసలీలను వర్ణిస్తున్నారు. వ్యాసుల వారు మహాపురుషుల స్థితిని చూపిస్తున్నారు. పైకి కథ గోపికలు ఒళ్ళు తెలియని కామంతో ప్రవర్తిస్తున్న జారిణుల కథలా ఉంటుంది రాసలీల. అంతే అర్థం అయినట్లుగా మాట్లాడితే భగవంతుడి పట్ల భాగవతుల పట్ల, ముక్త పురుషుల పట్ల భయంకర అపరాధము చేశారన్నమాట. రాసలీల గురించి తెలిస్తే మాట్లాడాలి. తెలియకపోతే ఊరుకోవాలి. అంతేకాని అందులోని పరమార్థం గ్రహించలేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు.

గోపికలు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని అన్నారు. ‘ఎవరు నీ పాదములు పట్టుకుంటున్నారో వాళ్లకి సంసారం భయం పోతోంది’ అన్నారు. కృష్ణ పరమాత్మ – ‘అలా మీరు రానూ కూడదు. నన్ను అడుగనూ కూడదు. ఇంతరాత్రి వేళ నేను వంశీరవము చేస్తే మీరు మీరు పరుగెట్టుకు వచ్చి నాతో సుఖము అభిలషించి నాతో ఉంటానంటున్నారు అది చాలా తప్పు. మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోవాలి’ అన్నారు. వాళ్ళు ‘ఎన్నో జన్మల తరువాత మేము చేసిన తపస్సు పండితే ఈశ్వరా! నీ పాదముల దగ్గరకు చేరుకున్నాము. మమ్మలి తిరిగి వెళ్ళిపొమ్మంటావా? వాళ్ళు లౌకికమయిన పతులు. అది సంసారమునకు హేతువు మాకు అది వద్దు. మేము జగత్పతివయిన నిన్ను చేరాలని వచ్చాము. అందుకని మాకు సంసారము వద్దు. మేము తిరిగి వెళ్ళడానికి నీ దగ్గరకు రాలేదు. మాకు తిరిగి రావలసిన అవసరం లేని మోక్ష పదవినీయవలసినది’ అని అన్నారు.

వాళ్ళ మాటలకు పరమాత్మ ప్రీతి చెందాడు వెళ్ళడం ఒక ఎత్తు. వెళ్ళి నిలబడడం ఒక ఎత్తు. దీనికి చాలా తేడా ఉంటుంది. రాసలీల పైకి అనేకమంది గోపకాంతలు కృష్ణుడు కలిసి ఆడుతున్నట్లు కనపడుతుంది. అది నిజం కాదు సంకేతిస్తున్నారు. అలా ఆడడంలో బ్రహ్మానందమును వారు అనుభవిస్తున్నారు. మేఘము మీద మెరుపులు ఎలా ఉంటాయో అలా వాళ్ళందరూ కలిసి కృష్ణుడితో ఆడుతున్నారు.

అంగనామంగనామంతరే మాధవో మాధవమ్

మాధవం మాధవం చాంతరే నాంగనా

ఇత్థ మాకల్పితే మండలేమధగః

సంజగౌ వేణునా దేవకీ నందనః

గోపిక గోపిక మధ్యలో కృష్ణుడు. కృష్ణుడు కృష్ణుడు మధ్యలో గోపిక. ఎంతమందయినా ఏకకాలమునందు మోక్షమును పొందుతారు. ఇంతమందితో కలిసి కృష్ణుడు రాసక్రీడ ఆడుతున్నాడు. మోక్షమును పొందుతున్న వారిని చూసి ఇన్ని జన్మల తరువాత ఈశ్వరునితో ఐక్యమవుతున్నారని దేవతలంతా పొంగిపోతున్నారు. దేవతలు ఈ శరీరంలోనే ఉంటారు. ఒక్కొక్క అవయవం దగ్గర ఒక్కొక్క దేవత ఉంటాడు. లోపలున్న భావ పరంపరలన్నీ అణిగి పోయి, వాసనలన్నీ అణిగిపోయి, కేవలము తాను ఆత్మస్వరూపిగా నిలబడిపోయి, ఇంద్రియములన్నీ పనిచేయడం మానివేసి, సమాదియందు లోపల ఉన్న జ్యోతి స్వరూపమేదో అదే తానుగా ఉండిపోతాడు. అలా ఉండిపోయినపుడు జీవి అపరిమితమయిన ఆనందమును పొందేస్తాడు. ఆ ఆనందము చేత ఈ శరీరము పోషింపబడుతుంది. తినడం కాని, త్రాగడం కానీ ఉండవు. ఆ ఆనందము ఈ శరీరమును కాపాడుతూ ఉండడం వలన బ్రతికి ఉంటాడు. అలా ఆనందమగ్నుడయిపోయి ఉండిపోతాడు. అలా ఉండిపోయిన సమాధిస్థితిని వర్ణన చేస్తున్నారు. ఇది గోపకాంతలు కృష్ణుడితో కలిసి అనుభవించిన రాసలీల.

యమున ఒడ్డున రాసలీల జరిగింది. వాళ్లకి పట్టిన చమటను పోగొట్టడానికి వాళ్ళు పొందుతున్న ఆనందములో శరీరమునకు పట్టిన బడలికను తీర్చడానికి యమునానది నుండి చల్లటి గాలులు వీచాయి. ఆ చల్లటి గాలులచేత వారు బహిర్ముఖులయ్యారు. ‘నేను ఆత్మ దర్శనమును పొందాను’ అని ప్రతి గోపికా అనుకుంది. ఆత్మ దర్శనమును పొందిన తరువాత మళ్ళీ ఈ ‘నేను ఎక్కడి నుండి వచ్చింది’ ఆత్మగా ఉన్నాను అనాలి. నేను అనుకుంటే మరల జారుడు మెట్లు ఎక్కినట్లే లెక్క. వారందూ మేము అందరమూ కృష్ణునితో ఆనందమును అనుభవిస్తున్నాము అన్నారు. వారు అలా అనీ అనడంతోనే కృష్ణుడు అదృశ్యం అయిపోయాడు. అనగా వారు తపస్సులో కూర్చున్నప్పుడు సమాధిస్థితి యందు కుదురుకోవడం కుదరడం లేదు. ఇపుడు వీళ్ళకి కృష్ణుడు కావాలి. ఎక్కడ ఉన్నాడని మనుష్యులను అడగడం లేదు వీళ్ళు. రకరకాల చెట్ల దగ్గరకు వెళ్ళి నీవు చూశావా? అని అడుగుతున్నారు.

నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబు పై

జల్లెడు వాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వు రా

జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దెచ్చె నో

మల్లియలార! మీ పొదలమాటున లేడు గదమ్మ చెప్పరే ?

వీళ్ళందరూ మల్లెపొదలను అడుగుతున్నారు. నల్లగా ఉంటాడు, చక్కటి నవ్వు నవ్వుతుంటాడు. పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు, నెమలి పింఛము ధరించిన వాడు, ఆయన అస్ఖలిత బ్రహ్మచర్యమును నిరూపించడానికే నెమలి ఈకను పెట్టుకుంటాడు. సృష్టి మొత్తం మీద స్త్రీపురుషుల సంభోగం లేకుండా పిల్లలను కనే ఏకైక ప్రాణి నెమలి. దానికి భౌతికమైన సంపర్కం లేదు. ఇదే రాసలీల. అందుకే కృష్ణుడు నెమలి ఈకను ధరిస్తాడు. కృష్ణుడు ఆడవారందరితో కలిసి జులాయిగా తిరిగిన వాడు కాదు. ఆయన పరబ్రహ్మయై జీవ బ్రహ్మైక్య సిద్ధిని ఇస్తున్నాడు. వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ అనుగ్రహమును పొందారు. జలక్రీడలు ఆడారు. దానిని రాసలీలని పిలుస్తారు.

రాసలీల అనేది ధ్యానము చేత తెలుసుకోవలసిన రహస్యము. నీవు ఎంత చెప్పినా నాకు అర్థం కావడం లేదు. ఇలా పరకాంతలతో కలిసి కృష్ణుడు ఎలా ఆడినాడని పరీక్షిత్తు పలుమార్లు శుకమహర్షిని ప్రశ్నిస్తాడు. శుకుడు ‘ఈశ్వరుడి లీల లోపల ఉండే జ్ఞానమును నీవు అందుకోలేని స్థితి ఆయినే ఒక విషయమును నీవు జ్ఞాపకం పెట్టుకో. అగ్నిహోత్రమును తీసుకువెళ్ళి శవం మీద పెట్టినట్లయితే అది శవమును కాల్చేస్తుంది. శవమును కాల్చిన అగ్నిహోత్రం మళ్ళీ వెళ్ళి ఎక్కడయినా తలస్నానం చేస్తుందా? చెయ్యదు. శవమును కాల్చిన అగ్నిహోత్రమునకు అపవిత్రత లేదు. అగ్నిహోత్రం నీకు వంట చేసి పెట్టింది. అగ్నిహోత్రమునకు పుణ్యం రాలేదు. యజ్ఞంలో అగ్నిహోత్రం ఉన్నది. మీరు స్వాహా అంటూ హవిస్సును దేవతలకు ఇచ్చారు. అందువలన అగ్నిహోత్రమునకు గొప్పతనం ఏమీ రాలేదు. శవమును కాల్చినా అగ్నిహోత్రమునకు అపవిత్రత లేదు. ఏ పనులు చేసినా అగ్ని మాత్రం అగ్నిగానే నిలబడుతుంది. వస్తుసంపర్కం అగ్నికి లేదు. కృష్ణుని కూడా అలా భావించగలిగితే రాసలీల నీకు ఏమి ఇబ్బంది?’ అని అడిగాడు. ఆ స్థాయిలో నువ్వు ఆలోచించు. కృష్ణుడు అనగా అగ్నిహోత్రము. ఎవరిని ఉద్ధరించాలని అనుకున్నాడో వారిని అలా ఉద్ధరించాడు. ఈశ్వరునికి ఏ సంపర్కము లేదు. అందుకే నెమలి ఈక పెట్టుకున్నాడు. అగ్నిహోత్రమై ఉన్నాడు. నీ కంటికి అగ్నిహోత్రం పవిత్రత పాడవకుండా కనపడుతోంది. కృష్ణుడి విషయంలో నీకు అలా ఎందుకు కనపడదు? కనపడకపోతే అది నీ దృష్టిదోషం తప్ప కృష్ణ దోషం కాదు. నీవు అలా విను. రాసలీల నిన్ను ఉద్ధరిస్తుంది’ అని చెప్పాడు. ఆ రాసలీల అంత పరమ పావనమయిన ఘట్టం. రాసలీల పూర్తయిపోయిన పిమ్మట కృష్ణ పరమాత్మ మరల బృందావనం చేరుకుంటాడు.


 Srimadhandhra Bhagavatham -- 82 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


అకౄరుడు బృందావనముకు ఏతెంచుట


అక్కడ కంసుడు కృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడోనని చాలా ఆందోళనలో ఉన్నాడు. ఈలోగా కంసుడు మరణించవలసిన సమయం ఆసన్నమైనదని తెలుసుకున్న నారదుడు వచ్చి ‘కంసా! ఇన్నాళ్ళ నుండి నిన్ను చంపేవాడు ఎక్కడ ఉన్నాడని కదా నువ్వు చూస్తున్నావు? నిన్ను చంపేవాడు వసుదేవుని కడుపునే పుట్టాడు. ఈ వసుదేవుడే కారాగారము తలుపులు తెరుచుకుంటే కృష్ణుని యమునానదిని దాటించి నందవ్రజంలో నందుని దగ్గర పడుకోబెట్టాడు. ఇతని కొడుకే నిన్ను చంపేవాడు అష్టమ గర్భంలో పుట్టాడు’ అని చెప్పాడు. అనగానే ‘ముందు ఆ వసుదేవుని చంపేస్తాను అని కత్తి తీశాడు కంసుడు. నారదుడు ‘ఇప్పుడు నువ్వు వసుదేవుణ్ణి చంపేస్తే నీ మృత్యువు పోదు. ఎందుకు దేవకీ వసుదేవులను చంపడం’ అన్నాడు. కంసుడు దేవకీ వసుదేవులను తెచ్చి చెరసాలలో బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. వారిద్దరినీ తీసుకువచ్చి చెరసాలలో బంధించారు. నారదుడు ఒకమాట చెప్పాడు ‘నీవు బంధువులందరి చేత ఎందుకు ద్వేషింపబడుతున్నావో అందుకు సంబంధించిన నీ జన్మరహస్యం చెప్తాను విను’ అన్నాడు.

ఈవిషయమును మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది ‘మావంశంలో ఒక మహా పురుషుడు పుట్టాలండీ’ అంటూ ఉంటారు. అలా అనుకున్నవారు కావలసిన రీతిలో నడవడిని కలిగి ఉండాలి. నారదుడు ఈ రహస్యమును కంసుడితో చెప్తున్నాడు. నీవారు నీకు శత్రువులు. ఎందుకో చెప్తాను విను. నీ తల్లి మహాపతివ్రత. ఆమె ఒకనాటి సాయంకాలం పుష్పవాటికయందు విహరిస్తోంది. ఆవిడకి భర్తృ సమాగమ కాంక్ష కలిగింది. ద్రవిళుడు అనబడే గంధర్వుడు ఇతరుల మనస్సులను కనిపెట్ట గలిగిన వాడు ఆ సమయంలో అదృశ్య రూపంలో తిరుగుతున్నాడు. వానికి ఇతరుల మనస్సు తెలుసు. నీతల్లి మనస్సును గ్రహించాడు. ఉగ్రసేనుడి రూపంలో వచ్చాడు. ఆ వచ్చిన వాడు తన భర్త కాడేమోనని ఆవిడకి అనుమానం వచ్చింది. ఉత్తరక్షణం వాడు తన నిజస్వరూపంతో నిలబడ్డాడు. ఆవిడ ఆగ్రహించింది. వాడు ‘ఇది అలోమ సంపర్కము. ఈ అలోమ విధానంలో నేను గంధర్వుడను, నీవు మనుష్యకాంతవు. గంధర్వులు మనుష్య కాంతలతో సుఖము అనుభవించవచ్చు. దానివలన చాలా తేజస్సు కలిగిన కుమారుడు జన్మిస్తాడు. నేను నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను. నీకు గొప్ప పరాక్రమము కలిగిన వాడు బుద్ధి కలిగిన వాడయిన కుమారుడు జన్మిస్తాడు’ అని ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. ఆవిడ ‘పరమ దుర్మార్గుడా నా మనస్సులో భర్తృ సమాగమ కాంక్ష తెలుసుకుని నా భర్తరూపంలో వచ్చి నా పాతివ్రత్యం చెడకుండా నాకు కొడుకును ఇస్తావా? నువ్వు ఎన్ని మాటలు చెప్పినా వెయ్యి మంది సుపుత్రులు కలిగే కన్నా స్త్రీకి శీలమే గొప్ప. నీవు ఇటువంటి దుర్మార్గమయిన పని చేశావు కనుక’ అని అంటూ ద్రవిళుడిని శపించబోయింది. తనని శపిస్తుందేమోనని వాడు గజగజలాడుతూ నిలబడ్డాడు. ఆమె ‘నీ వలన నాకు పుట్టబోవు కొడుకు దుర్మార్గుడు అగుగాక! ఋషులను ద్వేషించుగాక! పరమ కిరాతకుడు అగుగాక! వానిని పదికాలముల పాటు రాక్షసునిగా చెప్పుకొనెదరు గాక’ అన్నది. ద్రవిళుడు తానుకూడా శాపిస్తేనే ఆవిడ సంతోష పడుతుందని ‘అతడు తనవారి చేత తాను ద్వేషింపబడుగాక’ అని అన్నాడు. నీవారి చేత నీవు ద్వేషింపబడతావు. నీతల్లి నీవు పుట్టగానే వరం ఇస్తూనే శపించింది. ద్రవిళుడు కూడా శపించాడు. అందుకే నీ బ్రతుకు ఇలా అయిపోయింది. అందుకే నీవారు అన్నవారు నిన్ను ద్వేషిస్తారు’ అన్నాడు.

నారదుడు అలా అనగానే కంసుడు తన బంధువులనందరినీ తెచ్చి కారాగారంలో పడేశాడు. ‘వీళ్ళందరూ నన్ను చంపేవాళ్ళే, వీళ్ళని నేను చంపేస్తాను’ అని అకౄరుని పిలిచి ‘అకౄరా! నీకు తెలుసు నేను బ్రతకాలి అనుకుంటున్నాను. కృష్ణుడు నన్ను చంపాలని అనుకుంటున్నాడు. నీవు వెంటనే బృందావనం వెళ్ళి నీ మేనమామ కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు. చూడడానికి నీవు బయల్దేరి రావలసింది అని ఆహ్వానించి కృష్ణుని తీసుకునిరా. ధనుర్యాగం మిష పెట్టి ఆ పిల్లవాడు మధురా నగరంలోకి రాగానే ఏదోరకంగా చంపేస్తాను. మన దగ్గర కువలయాపీడము అనే ఏనుగు ఉన్నది. ఆ ఏనుగుతో తొక్కించేస్తాను. చాణూర ముష్టికులనే ఇద్దరు మల్లులు ఉన్నారు. వాళ్ళతో మల్లయుద్ధం పెట్టి చంపించేస్తాను. ఒకవేళ తప్పుకుంటే నేను చంపేస్తాను. ఎలాగయినా సరే మామయ్య పిలుస్తున్నాడని తీసుకురా’ అన్నాడు. అక్రూరుడు కృష్ణుడి దగ్గరకు బయలుదేరుతున్నాడు.

మదురానగరంలో కంసుని రాజ్యంలో ఉంటున్న అకౄరుడికి కృష్ణుడి మీద ఇంత భక్తి ఎలా ఏర్పడింది? అక్రూరుని తల్లిదండ్రులు గాందిని, శ్వఫల్కుడు. గాందిని తండ్రిగారికి ఒక కోరిక ఉండేది. తన పిల్లల కడుపున ఒక మహాపురుషుడు జన్మించాలని ఆయన కోరుకునే వాడు. ఆయన ఒక వ్రతం చేశాడు. ఆ వ్రతంలో మూడువందల అరవై అయిదురోజులు ‘ప్రతిరోజూ నేను ఒక ఆవును దానం చేస్తాను’ అని మూడువందల అరవై అయిదు రోజులు దానం చేశాడు. ఆడపిల్ల తండ్రి ప్రతిరోజూ ఒక ఆవు చోపున సంవత్సరం పాటు దానం చేశాడు. ఆ దానం చేసిన ఫలితం చేత ఆయన కుమార్తె అయిన గాందినికి అకౄరుడు జన్మించాడు. ఈ అకౄరుడు జన్మతః విశేషముగా కృష్ణ భక్తి కలిగినవాడు. ముందుతరం కాక ఆ ముందుతరం వాళ్ళు చేసిన గోదాన ఫలితం నుండి ఇటువంటి మహాపురుషుడు పుట్టాడు. అకౄరుని వంటి మహాపురుషుని వలన ఆ వంశం తరిస్తోంది. పుట్టుకచేత ఇంతభక్తి గతంలో చేసిన పుణ్యము వలన వచ్చింది. ప్రయత్నపూర్వకంగా మనిషి పుణ్యమును చేసి తీరాలి. అలా చేస్తే ఉద్ధరించగలిగిన మహాపురుషుడు ఆ వంశంలో జన్మిస్తాడని అక్రూరుని జీవితం తెలియజేస్తుంది.

అకౄరుడు ఏమి నా అదృష్టం అని పొంగిపోతూ బలరామకృష్ణులను తీసుకురావడానికి వెళ్ళాడు. అందుకే నమస్కారమునకు అకౄరుని చెపుతారు. అలా వెళ్తూ ఒకసారి భూమిమీదకి చూశాడు. అక్కడ దివ్యరేఖలతో కూడిన చిన్నిచిన్ని పాదముద్రలు కనిపించాయి. అనగా ఆలమందతో కృష్ణుడు అటుగా వెళ్ళి ఉంటాడని భావించాడు. ఆయన కృష్ణుడు నడిచిన భూమి మీద తాను రథం మీద వెళ్ళడమా! అనుకుని ఒక్కసారి రథమును ఆపాడు. ఒళ్ళంతా ఆనందముతో పొంగిపోయింది. కన్నులవెంట భాష్పధారలు కారుతుండగా స్వర్ణదండము రథము నుండి కిందపడిపోతే ఎలా పడిపోతుందో అలా రథమునుండి క్రిందపడిపోయాడు. తన స్వామి నడిచిన చోట తాను క్రింద పడ్డాను అనుకుని దొర్లేశాడు. ఆ ధూళి అంతా ఒంటిమీద పోసేసుకుని నందుడు ఉండే ఇంటి దగ్గరకు వెళ్ళాడు.

ఆవులమందలో ఒక ఆవు పొదుగు దగ్గర కూర్చుని అంతటా వ్యాప్తి చెందినా నారాయణ తత్త్వము నందుని ఇంట్లో పాలు పితుకుతోంది. ‘రాశీభూతమైన పరబ్రహ్మమును నా మాంసనేత్రములతో చూస్తున్నాను. నా జన్మ ధన్యమయిపోయింది’ అనుకుని వెళ్ళి కృష్ణుడికి బలరాముడికి నమస్కరించి మానవ జన్మ ఎత్తినందుకు మీ యిద్దరిని చూసి ధన్యత చెందాను’ అన్నాడు. బలరాముడు అకౄరుడిని గబగబా తీసుకువెళ్ళి ఉచితాసనం మీద కూర్చోపెట్టారు. కాళ్ళు కడిగి ఆ నీళ్ళని తనపై చల్లుకున్నాడు. అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, మంచి భోజనం పెట్టాడు, మధుపర్కం ఇచ్చాడు, ఒక గోవును దానం చేశాడు, తాంబూలం ఇచ్చాడు. బలరామకృష్ణులు వచ్చి అకౄరుని ప్రక్కన కూర్చున్నారు. భక్తికి ఈశ్వరుడు ఎంతో వశుడు అవుతాడు. అకౄరా! మధురలో అందరు కుశలమా అని అడగబుద్ధి వేయలేదు. ప్రభువు ధూర్తుడయిన చోట క్షేమం ఎక్కడ ఉంటుంది? కంసుడు పరిపాలిస్తుండగా మధురలో ప్రజలు క్షేమంగా ఎలా ఉంటారు? ఏ పనిమీద మీరు ఇంత దూరము వచ్చారో చెప్పవలసినది’ అన్నారు.

అకౄరుడు ‘మహానుభావా! మీకు తెలియని విషయం కాదు. కంసుడు ధనుర్యాగమనే మిషతో మల్లయుద్ధములను ఏర్పాటు చేశాడు. మేనల్లుళ్ళు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. అంతరమునందు కోర్కె వేరు. మీ యిద్దరిని చంపడం కోసం మధుర పిలుస్తున్నాడు. దానికి నన్ను నియోగించాడు. మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. మీరు దీపముల వంటి వారు. మీమీద పడిన మిడతలు కాలిపోతాయి. ఈ రీతిగా నయినా మిమ్మల్ని సేవించుకుందామని నేను వచ్చాను’ అన్నాడు. వెంటనే కృష్ణపరమాత్మ అక్కడ ఉన్న పెద్దలను పిలిచి ‘మీ అందరూ కూడా పాలు, వెన్న మొదలయిన భాండములను సిద్ధం చేయండి. రేపటి రోజు ఉదయం నేను బలరాముడితో కలిసి అకౄరుడితో మధురా నగరమునకు వెడతాము. కంసమామ మమ్మల్ని యాగమునకు పిలిచాడు’ అన్నారు. ఈవార్త బృందావనంలో గుప్పుమంది. కృష్ణునితో గోపకాంతలు విపరీతమయిన అనుబంధం పెంచుకున్నారు. వారందరి కోపం అకౄరుడి మీదకు మళ్ళింది. ఇతని పేరు అకౄరుడా! ఇతని పేరు కౄరుడని కృష్ణుని రథమునకు ఆడ్డుపడ్డారు. దామోదరా! గోవిందా! కేశవా! నువ్వు వెళ్ళడానికి వీలులేదు. నిన్ను మేము విడిచిపెట్టి ఉండలేము. నీవు వెళ్ళిపోతే ప్రాణములు లేని శరీరముల వలె పడిపోతాము’ అన్నారు.

పరమాత్మ వాళ్ళతో మాట్లాడలేదు. ‘వాళ్ళని ప్రక్కకి తొలగమనండి ఇది నా ఆజ్ఞ. నేను మధురకు బయల్దేరుతున్నాను’ అన్నాడు. పక్కకి తొలిగారు. రథము వెళ్ళిపోతోంది. పాపం యశోదాదేవి దుఃఖమునకు అంతేలేదు. ప్రతిక్షణం ఆ కృష్ణుడిని తలుచుకోవడం తప్ప అసలు ఆవిడకి జీవితమే లేదు. అంత ప్రేమించిన తల్లి. కంసుని వలన ఏ ప్రమాదము వస్తుందోనని ఆమె బెంగపెట్టుకున్నది. దూరంగా రథం వెళ్ళిపోయి ఆ ధూళి రేగుతుండగా పతాకం కనిపించినంతసేపు ఉండి తిరిగి ఇళ్ళకు వచ్చేశారు. వెళుతుండగా అక్రూరుడు ఒక చిత్రమయిన పని చేశాడు. రథమును యమునానది ఒడ్డున ఆపి ‘ఒక్కసారి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తాను కృష్ణా!’ అన్నాడు. చేసుకురమ్మన్నారు. ఆయన నీటి దగ్గరకు వెళ్ళి ప్రణవమును జపించి ఒకసారి ఆ యమునానది వంక కళ్ళు విప్పి చూశాడు. యమునానది నీటిమీద బలరామ కృష్ణులు కనపడ్డారు. ఆశ్చర్యపడ్డాడు ఇదేమిటి? రథం మీద నుండి దిగి నీటిమీద నిలబడ్డారని మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. రథంలోనే కనపడ్డారు. అలా కనపడడం ఈశ్వరుని దివ్యశక్తి అనుకుని యమునానదీ స్నానం చేద్దామని మునకవేశాడు. ఎవ్వరికీ ఇవ్వని దర్శనము పరమాత్మ అకౄరునికి యిచ్చాడు. అంతేకాకుండా అకౄరుడు యమునలో మునిగేటప్పటికి సనక సనందనాది మహర్షులు మొదలగువారు అందరూ స్తోత్రం చేస్తుండగా క్షీరసాగరము నందు ఆదిశేషుని మీద అలవోకగా పవళించిన ఆదితత్త్వమయిన ఆదినారాయణుని దర్శనమును పొందాడు. అకౄరుడు పరమాత్మను అద్భుతమయిన స్తోత్రం చేశాడు.

మనం అటువంటిమూర్తినే తిరుపతిలోని గోవింద రాజస్వామి వారి ఆలయంలో దర్శనం చేస్తాము. గోవిందరాజస్వామి పెద్ద పాముచుట్ట మీద తలవెనుక పెద్ద సొల పెట్టుకొని పడుకుని ఉంటాడు. నాభికమలము నందు చతుర్ముఖ బ్రహ్మగారు, కాళ్ళ దగ్గర శ్రీదేవి, భూదేవి, మధుకైటభులనే రాక్షసులతో సహా మనకి దర్శనం ఇస్తారు. ఆయన పొట్టమీద అడ్డంగా తులసిమాలలు వ్రేలాడదీయబడి ఉండగా కన్నులు మూసుకుని నిద్రిస్తూ ఉన్నట్లుగా మనకు దర్శనం ఇస్తాడు. మనము అకౄరుని మనసులో తలుచుకుని అకౄరుడు దర్శించిన శ్రీమన్నారాయణ తత్త్వము ఇక్కడ కనపడుతోందని గోవిందరాజస్వామిని దర్శించవచ్చు. అటువంటి దర్శనమును పొంది అకౄరుడు సాయంకాలం చీకటి పడుతుండగా బలరామకృష్ణులతో కలిసి మధురా నగరమును చేరుకున్నాడు. కృష్ణుడిని తన ఇంటికి వచ్చి ఆనాటి రాత్రి విడిది చేయవలసినదని కోరాడు. కృష్ణుడు నేను ఇప్పుడు రాను రాక్షస సంహారము పూర్తయిపోయి కంసుని సంహరించిన తరువాత యోగ్యమయిన కాలమునందు వచ్చి నీయింట నేను తప్పకుండా ఆతిథ్యమును స్వీకరిస్తాను’ అని మాట ఇచ్చి బలరామకృష్ణులు ఊరిబయట పడుకున్నారు. మరునాటి ఉదయం మధురా నగర ప్రవేశం చేసారు.


 Srimadhandhra Bhagavatham -- 83 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


బలరామకృష్ణులు చేసిన గొప్ప చేష్టితములను తెలిసికొన్న వారైన మధురా నగర వాసులు మేడలమీద నిలబడి వారిని చూస్తున్నారు. ఎంతో ఆనందముగా బలరామ కృష్ణులు మధురా నగరం రాజవీధిలో వెడుతున్నారు. కంసుడికి బట్టలు ఉతికే చాకలి వాడు పట్టుబట్టలన్నీ ఉతికి మూటను కట్టుకొని తలమీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడు అతనిని పిలిచి ‘మేము నంద మహారాజుగారి బిడ్డలము. మాకు కూడా ఒక పట్టుపంచె ఇవ్వు. కట్టుకుంటాము’ అన్నాడు. చాకలి కృష్ణుడుతో చాలా పొగరుతనంతో మాట్లాడాడు. ‘ఈవిషయం మా కంసమహారాజు గారికే తెలిస్తే ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా? ప్రాణములు ఉగ్గడించేస్తాడు. మీకు పెరుగులు, నేతులు త్రాగి బాగా కొవ్వు పట్టింది. ఇవి సాక్షాత్తు కంసమహారాజు గారు కట్టుకొనే పంచెలు. ఇవి మీకు కావలసి వచ్చాయా! వెర్రి మాటలు మాట్లాడకండి’ అన్నాడు. వాని మాటలు విని కృష్ణుడు బలరాముని వంక చూసి ‘అన్నయ్యా ఇంక ఈ పుర్రె మారదు’ అని పిడికిలి బిగించి ఆ చాకలి వాని నెత్తిమీద ఒక గుద్దు గుద్దాడు. వాడు తలబద్దలై చచ్చిపోయాడు.

కృష్ణుడు రజకుడిని ఎందుకు చంపాడో మనం తెలుసుకోవాలి. చాకలి వాని పుర్రె ఇప్పటిది కాదు. అది త్రేతాయుగం నాటి పుర్రె. సీతాదేవి మీద నిందవేశాడు. ఆ పుర్రె సీతా పరిత్యాగమునకు కారణమయిన పుర్రె. ఎప్పటికయినా మారుతుందేమోనని ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మలోనయినా ఒక్క మంచి మాట మాట్లాడతాడేమో అనుగ్రహిద్దామని చూసాడు. ఒక్కొక్కడు అవకాశం వచ్చినా అహంకారముతో నాశనం అయిపోతాడు. ఎక్కడ అలా మాట్లాడాలో తెలియక నోటిమాట వలన చెడిపోతాడు. పొగరుగా మాట్లాడాడు. చచ్చి ఊరుకున్నాడు. ఈశ్వరుని క్షమా గుణమును, మనిషి తెంపరితనమును ఈ రజకుని మరణము ఆవిష్కరిస్తుంది. బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనస్సును ఉతుక్కోలేకపోయాడు.

మరోచోట వృద్ధుడయిన సాలెవాడు ఒకడు పంచెలు నేస్తున్నాడు. ఆయన బలరామకృష్ణులకు ఎదురువచ్చి తీసుకు వెళ్ళి ‘ఇవి నేను కంసుని కోసం నేస్తున్న మెత్తటి పంచెలు. మహానుభావా! మీరీపంచె కట్టుకుని కనపడితే ఎంతో బావుంటారు. ఈ పంచె కట్టుకోవలసింది’ అన్నాడు. కృష్ణ పరమాత్మ ఆ పంచె కట్టుకొని సాలెవానికి ఇహమునందు సమస్త ఐశ్వర్యమును ఇచ్చి అంత్యమునందు అతనికి సారూప్యము ఇచ్చి తన దగ్గర కూర్చోపెట్టుకొనగలిన ఐశ్వర్యమును కటాక్షించాడు.

సుధాముడు అనబడే మాలాకారుడు ఉన్నాడు. ఆ మాలాకారుడి దగ్గరకు వెళ్ళారు. ఆయన కంసునికి పుష్పమాలలు కడుతూ ఉంటాడు. ఆ మాలాకారుడు వీరికి ఎదురువచ్చి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టి అర్ఘ్య పాద్యాదులను ఇచ్చాడు ‘కృష్ణా! నా జన్మ ధన్యమయింది. ఏమి అదృష్టం! మీరిద్దరూ ఇవాళ నా దగ్గరకు వచ్చారు. దయచేసి నేను ఇస్తున్న ఈ పుష్పమాలను తీసుకుని అలంకారం చేసుకొనవలసింది’ అని పుష్పమాలలు ఇచ్చాడు. పరమాత్మ పొంగిపోయి నీకు ఏమి కావాలో అడుగు ఇచ్చేస్తాను’ అన్నాడు. ఆనాడు మాలాకారుడు మనం అందరం పూజలో చెప్పవలసిన దానిని అడిగాడు.

నీ పాదకమల సేవయు, నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాం

తాపారభూత దయయును, తాపస మందార! నాకు దయసేయ గదే!

కేవలం బ్రతికేయడం కాదు తండ్రీ! ప్రతిక్షణం నీ పాదకమలముల సేవ నేను చేసుకోగలగాలి. ఎవరెవరు నీ పాదములు పట్టి పూజచేసే మహాభక్తులు ఉన్నారో వాళ్ళతో నాకు స్నేహము కావాలి. ఏ పదార్థము చూసినా అది ఈశ్వరుడే అని నేను భావించి ప్రేమించగలగాలి దానికి ఎల్లలేదు. పూర్ణమై ఉండాలి. ఈశ్వరా! నాకు అటువంటి భక్తిని ప్రసాదించవలసినది’ అని అడిగాడు. కృష్ణుడు పొంగిపోయి ఆ మాలాకారుడికి ఆలింగన సౌఖ్యమునిచ్చాడు.

తదనంతరము ఆ ప్రదేశమును దాటి ముందుకు వెడుతుంటే ఒక కుబ్జ ఎదురువచ్చింది. ఇవి అన్నీ దశమస్కంధములో గొప్ప రహస్యములు. ఇవి మనం తెలుసుకోవలసిన ఘట్టములు. ఎదురువచ్చిన కుబ్జ త్రివక్ర. గూని వలన ఆమెకు శరీరంలో మూడు వంకరలు ఉన్నాయి. ఆవిడ ఎదురుచూస్తోంది. కృష్ణ పరమాత్మ ఆవిడ వంకచూశారు. కుబ్జ అందంగా ఉండదు కదా! ఆవిడ కృష్ణుని వంక చూసి

అయ్యా! నన్ను కుబ్జ అంటారు. ఊళ్ళో వాళ్ళందరూ త్రివక్రని పిలుస్తారు. నీవు చూస్తే చాలా అందంగా ఉన్నావు. నీకు దృష్టి తీతలా నీ ఎదురుగుండా నేను నిలబడ్డాను. నేను గంధపుచెక్కల మీద గంధం తీస్తూ ఉంటాను. పరిమళ ద్రవ్యములు సిద్ధం చేస్తాను. వాటిని కంస మహారాజుకి పట్టుకు వెడతాను. ఆయన వాటిని తన ఒంటికి రాసుకుంటాడు. అసలు అందం అంటే ఏమిటో ఇవాళ నీలో చూశాను. నీవు ఈ గంధమును రాసుకుంటే ఈ గంధమునకు అందం వస్తుంది. ఈశ్వరా! కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా!’ అన్నది. కుబ్జ కొద్దిపాటి గంధము ఇచ్చినందుకు ఈశ్వరుడు ఆమెకు ఎవ్వరికీ దొరకనని విచిత్రమయిన సౌఖ్యమును ఇచ్చాడు. కుబ్జ పాదమును తన కుడిపాదముతో తొక్కాడు. తన చేతి రెండువేళ్ళను కుబ్జ గడ్డం క్రింద పెట్టి పైకి ఎత్తేసరికి కుబ్జ మూడు వంకరలు పోయాయి. ఆమె అందమయిన సౌందర్యరాశి అయింది.

ఇళ్ళు లేని వాళ్ళని పూర్వం పాంథులు అనేవారు. అలాంటి వారందరూ పూర్వం సైరంధ్రి యింట్లో ఉండేవారు. సైరంధ్రి పురుషులు అడగడమే తడవు వారికి కావలసిన సౌఖ్యమును కూడా కటాక్షిస్తుంది. కుబ్జ సౌందర్య రాశి అయిపోగానే ‘నేను సైరంధ్రిని, నాకు ఇంత సౌందర్యమును ఇచ్చావు. నీవు ఒకసారి మా ఇంటికి వచ్చి నేను ఇచ్చే ఆనందమును అనుభవించమని ఆయన మీద ఉన్న ఉత్తరీయమును పట్టుకొని లాగింది. కృష్ణ పరమాత్మ తప్పకుండా నేను మీ ఇంటికి వస్తాను. కాని ఇప్పుడు కాదు. కంస సంహారమయిన తరువాత వస్తాను’ అన్నాడు. ఇది మనకు చిత్రంగా తోస్తుంది. త్రివక్రకు కృష్ణ దర్శనం అయిన తరువాత ఆయన పాదంతో తొక్కాక కూడా ఆమెలో ఇటువంటి వాంఛ ఉన్నదా అనిపిస్తుంది. భాగవతమును చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. త్రివక్రం అంటే మనసులో ఒకమాట, శరీరంతో ఒకటి చేయడం, నోటితో ఒకటి చెప్పడం. మూడింటియందు మూడువంకర్లు. ఈ మూడువంకర్లు తీసివేయడమే కుబ్జతనమును తీసివేయడం. అవి పోయి ఏకత్వం వచ్చేసిందంటే ఈశ్వరస్పర్శ కలిగిన వాడు ఎప్పుడూ ఈశ్వర సేవే కావాలని అడుగుతాడు. ఆ సేవకి వేళాపాళా ఉండదు. త్రివక్రకు తన వంకర్లు పోగానే ఆవిడ ఈశ్వరుని కైంర్యము అడుగుతున్నది. అందుకు తన యింటికి రమ్మంటోంది. పరమాత్మ కంసవధ అయిన తరువాత వస్తానంటున్నాడు. అనగా అజ్ఞాన సంహారం పూర్తయిపోవాలి. అప్పుడు వస్తానని మాట ఇచ్చాడు. తప్ప ఆమెయందు మీరు దోషమును పట్టకూడదు. ఆయన ఒక చిత్రమయిన మాట అన్నాడు ‘నేను పాంథుడను’ అన్నాడు. పాంథుడు అనగా ఇల్లు లేనివాడు. ఆత్మకి ఇల్లేమిటి? అది అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. అది అప్పుడప్పుడు ఇంట్లోకి వచ్చి ఉంటూ ఉంటుంది. అందుకని అది శరీరంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది.

ఈ మాటలు చెప్పి ఇంకా కొద్ది ముందుకు వెళ్ళాడు. ధనుర్యాగం జరిగే చోటును అడిగి తెలుసుకున్నాడు. ఆయాగం జరిగేచోట ఒక పెద్ద ధనుస్సు నిలబెట్టబడి ఉన్నది. కృష్ణపరమాత్మ ఆ ధనుస్సును తీసుకొని సంధించారు. అది రెండుగా విరిగిపోయింది. ఆ ధనుస్సు రెండుముక్కలను బలరామ కృష్ణులు చేత్తో పట్టుకుని అక్కడ ఉన్న కంసుని సైన్యమునంతటినీ సంహారంచేసి ముందుకు వెడుతుంటే కంసుని గుండెలు అదిరిపోయాయి. కృష్ణుడు తనను చంపివేస్తాడని భావించాడు. కువలయా పీడమనే పెద్ద ఏనుగు ఒకటి కంసుని వద్ద ఉన్నది. ఆ ఏనుగును కృష్ణుని మీదకి తోలించాడు. కృష్ణుడు మరణించేలా దాన్ని కృష్ణుని మీదకి తోలవలసిందని మావటివానికి చెప్పాడు. అక్కడ ఉన్న ద్వారపాలకుడు మావటి కలిసి కృష్ణుని మీదికి ఆ ఏనుగును నడిపించారు. ఆ ఏనుగు వచ్చి ఆయనను గట్టిగా చుట్టుచుట్టింది. కృష్ణుడు దాని తొండములో నుండి జారిపోయి నాలుగు కాళ్ళ మధ్యలో దూరాడు. అది తన రెండు కాళ్ళ మధ్యలో తొండం పెట్టి కృష్ణ పరమాత్మ కోసం వెతుకుతోంది. ఆయన దొరకకుండా వెనక కాళ్ళ మధ్యనుండి బయటకు వచ్చి దాని తోక పట్టుకొని దానిని నూరు ధనుస్సుల దూరం వెనక్కి ఈడ్చేశారు. సమస్త బ్రహ్మాండములను తన బొజ్జయందు ఉంచుకున్న వాడికి దిక్కుమాలిన ఏనుగును లాగడం పెద్ద కష్టమా! గిరగిర త్రిప్పి విసిరేశాడు. మావటి వాడు పరుగెత్తుకు వెళ్ళి ఆ ఏనుగును మరింత ప్రచోదనం చేశాడు.

యుద్ధంలో అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమయినది ఏనుగు. గుఱ్ఱము తనమీద కూర్చున్న వీరుడిని తీసుకుని పరుగెడుతుంది. యుద్ధమునకు తీసుకు వెళ్లేముందు ఏనుగుకు నల్లమందు పెడతారు. దానికింకా అస్సలు ఒళ్ళు తెలియదు. ఒళ్ళు తెలియని స్థితిలో ఏనుగు నడుస్తూ శత్రుసంహారం చేస్తుంది. ఏనుగు వెళ్ళిపోతూ దానికి అడ్డు వచ్చిన వాళ్ళని తొండముతో లాగి కింద పడేసి కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. అది తొక్కుతుంటే, తొండము పెట్టి కొడితే, దంతము పెట్టి పొడిస్తే, ఎవడి మీదయినా పడితే చచ్చిపోతారు. ఏనుగు అలా యుద్ధం చేయగలదు. అటువంటి ఏనుగును కృష్ణుని మీదికి పురిగొల్పాడు. అది చిన్నికృష్ణుని మీదికి పరుగెత్తుకు వస్తున్నది. కృష్ణుడు ఒక్కసారి తనకాలితో దాని కాలు తొక్కేటప్పటికీ ఆ ఏనుగు మొర్రో అని ఘీంకరిస్తూ వంగింది. అలా వంగేసరికి కృష్ణుడు దాని రెండు దంతములు ఊడబెరికేశాడు. అరచేత్తో దాని కుంభస్థలం మీద ఒక దెబ్బ కొట్టారు. దాని కళ్ళల్లోంచి నోట్లోంచి నెత్తురు కక్కుతూ కింద పడిపోయింది. అది కింద పడిపోయిన తరువాత దాని దంతములను పెట్టి అక్కడ ఉన్న ఇతర వీరులను మావాటిని సంహరించాడు. కృష్ణుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఏనుగు దంతములు రెండింటిని భుజముల మీద వేసుకున్నాడు.

మార్గశీర్ష మాసంలో మనవాళ్ళు తిరుప్పావైని చదువుతుంటారు. అందులో నీలాదేవికి మంచం చేయించవలసి వస్తే కువలయా పీడము నుంచి లాగేసిన దంతముల తోటే ఆయన ఆవిడకు మంచమును చేయించాడు. ఏనుగుకు కువలయా పీడము అనే పేరు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ‘కు’ అంటే భూమి. ‘వలయము’ అంటే భూమండలము. కువలయా పీడము అనగా భూమండలమును పీడించునదని అర్థము. పృథివీ వికారమయిన మనము పూజ చేద్దామని భూమి మీద ఉండి కూర్చుందామని అనుకుంటే ముందు మనలని దేహాత్మాభిమానము అడ్డుతుంది. ఈ శరీర అహంకారమే మనలను పాడుచేేస్తుంది. ‘అమ్మో! ఈవేళ అంతసేపు కూర్చోవాలా’ అంటుంది. కువలయా పీడమనేది దేహమునకు సంబంధించిన అహంకారము. శాస్త్రములో దీనిని ‘అన్న వికారము’ అని పిలుస్తారు. అన్న వికారము అంటే ఈ పృథివిలో పండినవి ఎన్నో తినేశావు. వాటినన్నిటిని తినడం వలన ఇంత శరీరం తయారయింది. ఈ అన్న వికారమయిన శరీరం ఏమవుతుంది? ఇందులో ఉన్న రక్తము భూమిలోకి ఇంకిపోతుంది. ఇందులో వున్న మాంసము కాలిపోతుంది. లేదా పురుగులు తినేస్తాయి. శరీరం పృథివిలో కలిసిపోతుంది. వెంట్రుకలు మాత్రం వెళ్ళి చెట్ల మొదళ్ళను పట్టుకుంటాయి. ఈపాటి శరీరమును చూసుకుని ఎంతో పొగరుతో రెచ్చిపోతూ అహంకారంతో ప్రవర్తించి లేనిపోని పాపములను మూట కట్టుకుంటూ ఉంటారు. ఎందుకు వచ్చిన భ్రాంతి! దీనిని భాగవతంలో కువలయా పీడము అంటారు. జ్ఞానము లేనివాడికి ఇది వాడిని వాడు పీడించుకోవడానికి పనికొస్తుంది. పాపం బాగా మూట కట్టుకోవడానికి పనికొస్తుంది. ఒక మహా పురుషునికి ఇది పుణ్యం చేయించడానికి, వినయముతో నమస్కారం చేయడానికి ఈశ్వరుని ఆరాధించడానికి తాను ఇక్కడ ఉన్నన్నాళ్ళు హాయిగా సంతోషంగా ఉండి గట్టెక్కడానికి పనికివస్తుంది. కంసునియందు ఉన్న కువలయాపీడము పాడుచేయడానికి పనికివస్తుంది. దానికి లోపల ఆ జ్ఞానము ఉంది. ఈ కువలయాపీడమును కృష్ణుడు సంహరించాలి. కువలయాపీడమును ఆయన సంహరించాడు.


వారు మరికొంత లోపలికి వెళ్ళగా చాణూర ముష్టికులు ఉన్నారు. మనలో ఉన్న కామక్రోధములే చాణూరముష్టికులు. వాళ్ళు మల్లయుద్ధం చేస్తారు. వాళ్ళు పట్టుకు పట్టుకు మనలను పడగొడతారు. కంసుడు చాణూర ముష్టికులను ప్రయోగించాడు. అజ్ఞానము ఎలా ఉంటుందో చూడండి. ముష్టికుడితో బలరాముడిని, కృష్ణుడితో చాణూరుని వేదికమీద మల్లయుద్ధం చేయమన్నాడు. వారిద్దరూ భయంకరమయిన మల్లులు. బలరామకృష్ణులు చిన్నపిల్లలు. వాళ్ళతో ఈ చిన్నపిల్లలకు యుద్ధం ఏమిటని అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోతున్నారు. వాళ్లకి వచ్చినవాడు పరాత్పరుడని తెలుస్తున్నది. వాళ్ళు – ‘ఇదేమీ వైకుంఠ పురం కాదు కంసుని సభ. ఇది సంసారమును వదిలి పెట్టేసిన వారి సభ కాదు. ఇది గర్వించి ఉన్న వాళ్ళ సభ. ఇది నారదుడు మీటే వీణ కాదు. ఇది కాలదండము లాంటి నా పిడిగుద్దు. లక్ష్మీదేవితో పరాచికములు ఆడడం కాదు. మాతోటి యుద్ధం చేస్తావా? నీవు ఎక్కడికి పారిపోతావు? పారిపోవడానికి భక్తుల గుండెలు లేవు – సాగి నీవు నడవడానికి వేదాంత వీధి కాదు. రా! నిన్ను మట్టు పెడతాము’ అన్నారు. చాణూరుడితో కృష్ణుడు, ముష్టికునితో బలరాముడు కలియబడ్డారు. బ్రహ్మాండమయిన మల్లయుద్ధం జరిగింది. గరుడుడు పాములను పట్టుకుని ఎగరేసుకు పోయినట్లుగా వాళ్ళిద్దరూ చాణూర ముష్టికులను ఇద్దరినీ సంహరించారు. వాళ్ళిద్దరూ మరణించగానే కంసుని గుండె అదిరిపోయింది. సింహాసనం మీద కూర్చుని ఉన్నవాడు వెంటనే కత్తితీసి భటులను పిలిచి ‘వసుదేవుని సంహరించండి – ఉగ్రసేనుని సంహరించండి – ఈ గోపాల బాలురను మట్టుబెట్టండి’ అని ఉన్మాదంతో కేకలు వేస్తున్నాడు.

కృష్ణుడు సింహాసనం మీదకి ఒక్క దూకు దూకి కంసుని జుట్టు పట్టుకున్నాడు. అంతే కంసుడు పంచత్వమును పొంది చచ్చిపోయాడు. కంసుని మీదకి కత్తి విసరలేదు. యుద్ధం చెయ్యలేదు. ఉగ్రసేనుడికి పట్టాభిషేకము చేసి దేవకీ వసుదేవులను విడుదల చేసి యజ్ఞోపవీతములు వేసుకుని ఉపనయన సంస్కారము పొందారు.

జరాసంధుడు – కాలయవనుడు – ముచుకుందుడు

తరువాత ఒక ముఖ్యమయిన ఘట్టం జరిగింది. జరాసంధుడు యుద్ధమునకు వచ్చాడు. కంసునికి యిద్దరు భార్యలు. వారు జరాసంధుని కుమార్తెలు. వీళ్ళు వెళ్ళి ‘కృష్ణుడు మా భర్తను సంహరించాడు మాకు వైధవ్యం వచ్చింది’ అని జరాసంధుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. జరాసంధుడికి కోపం వచ్చి ఇరువది మూడు అక్షౌహిణుల సైన్యమును తెసుకొని శ్రీకృష్ణుని మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇలా పదిహేడు మార్లు వచ్చాడు. పదేహేడుమార్లు అనేక అక్షౌహిణుల సైన్యమును కృష్ణుడు చంపాడు. పదునెనిమిదవ మాటు మరల జరాసంధుడు వస్తున్నాడు. కృష్ణుడు ఒక చిత్రమయిన పని చేశాడు. జరాసంధుడు మధురానగరమును ముట్టడిస్తే అమాయకులమయిన గోపాలబాలురు మరణిస్తారని తనకి కొంత చోటును ఇస్తే అందులో జలదుర్గము కట్టుకుంటానని సముద్రుడిని చోటు అడిగాడు. సముద్రుడు చోటు ఇచ్చాడు. ఆనాడు విశ్వకర్మను అడిగి సముద్రగర్భంలో ద్వారకానగర నిర్మాణం చేసాడు. ఆనాడు కట్టిన ద్వారక పరమసత్యమని ఈనాడు బయటపడిన అవశేషాలు మనకి తెలియజేస్తున్నాయి. ఆ ద్వారకా నగరునకు తన మాయాశక్తితో ఎవరికీ ప్రమాదం రాకుండా ఎవరికీ తెలియకుండా అందరినీ ద్వారకకు చేర్చేశాడు. తాను బలరాముడు మాత్రమే మధురలో ఉన్నారు.

కాలయవనుడని ఒకాయన ఉన్నాడు. ఆయన పెద్ద జడతో నల్లగా ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉన్నది. యాదవులు ఎవరూ కూడా ఆయనను చంపలేరు. ఆయన దగ్గరకు వెళ్ళి నారదుడు ఒకమాట చెప్పాడు ‘ నీవు అందరి మీదికి యుద్ధమునకు వెడుతుంటావు. అసలు నిన్ను చంపగలిగిన వాడు, నీతో యుద్ధం చేయగలిగిన వాడు, ఒకడు ఉన్నాడు. అతనిని కృష్ణుడని అంటారు. మధురలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి అతనితో యుద్ధం చెయ్యి’ అన్నాడు. కాలయవనుడు అతని యవన సైన్యమునంతటినీ తీసుకొని వచ్చాడు. కృష్ణుడితో యుద్ధమునకు శత్రు సైన్యమంతా కోటబయట విడిది చేసింది. మరునాడు ఉదయం కృష్ణుడి సైన్యం బయటకు వస్తుందని వారు ఎదురు చూస్తున్నారు. కానీ లోపల సైన్యం ఎవరయినా ఉంటే కదా! లోపల బలరామ కృష్ణులు మాత్రమే ఉన్నారు. కృష్ణుడు చాలా నిశ్శబ్దంగా రెండు చేతులు వెనక్కు పెట్టుకొని నెమ్మదిగా కాలయవనుడి దగ్గరకు వస్తున్నాడు. అలా వస్తున్న వానిని చూసి కాలయవనుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడిని గుర్తు పట్టి కృష్ణా, నీకోసమే వచ్చాను ఆగు’ అన్నాడు. కృష్ణుడు పరుగెత్తడం మొదలుపెట్టాడు. కృష్ణుడు పారిపోతున్నాడని భావించి కాలయవనుడు గుర్రం మీద కృష్ణుని వెంబడించాడు. కృష్ణుడు కాలయవనుడికి దొరకకుండా పరుగెత్తి పరుగెత్తి ఒక కొండగుహ లోనికి దూరిపోయాడు. గుర్రమును వదిలివేసి కాలయవనుడు కూడా ఆ కొండగుహలోనికి ప్రవేశించాడు. కొండగుహలో దుప్పటి ముసుగు పెట్టుకొని ఒకాయన పడుకుని వున్నాడు. కాలయవనుడు అక్కడ కృష్ణుడే దుప్పటి కప్పుకుని నిద్రిస్తున్నవాడిలా నటిస్తున్నాడని భావించి అతనిని కాలితో ఒక్క తన్ను తన్నాడు. ‘ఎవడురా నన్ను నిద్రలేపిన వాడు’ అని ఆ ముసుగులో పడుకున్న ఆయన లేచాడు. లేచి ఆయన తీవ్రంగా చూసేసరికి కాలయవనుడు కిందపడిపోయి బూడిదయిపోయాడు. పరీక్షిత్తు ఆ దుప్పటి కప్పుకుని పడుకున్నవాడు ఎవరు?” అని శుకమహర్షిని అడిగాడు. శుకుడు దానికి జవాబు చెప్పాడు.

త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో మాంధాత కుమారుడు ముచుకుందుడనేవాడు ఒకడు ఉండేవాడు. అతను మహా తేజోసంపన్నుడు గొప్ప భక్తుడు. రాక్షససంహారమునకు ఒకసారి దేవేంద్రుడు సహాయం అడిగితే వెళ్ళాడు. కుమారస్వామి సర్వసైన్యాధిపత్యం స్వీకరించే వరకు రాత్రింబగళ్ళు యుద్ధం చేసి అనేకమంది రాక్షసులను సంహరించాడు. కుమారస్వామికి దేవసేనాధిపత్యం ఇచ్చాక దేవతలు ఇతనిని ఏమి కావాలో కోరుకొనమని అడిగితే ఆయన ‘నాకు నిద్రపోవాలని ఉన్నది. నన్ను ఎవరూ నిద్రాభంగం చేయకుండా నేను కొంతకాలం ఎక్కడ నిద్రపోవాలో చెప్పండి’ అన్నాడు. వాళ్ళు ఈ గుహ చూపించి అందులో పడుకోమన్నారు. ‘నీకు ఎవరయినా నిద్రాభంగం చేస్తే నీవు వాడికేసి చూసిన తక్షణం వాడు బూడిద అయిపోతాడు’ అని చెప్పారు. కృష్ణుడికి ఈ రహస్యం తెలుసు. అందుకని కాలయవనుడిని అక్కడికి తీసుకెళ్ళాడు. కాలయవనుడు యాదవుల చేతిలో మరణించడు కదా! ఈవిధంగా ముచుకుందుడి వలన కాలయవనుడు మరణించాడు.

ఇపుడు పదునెనిమిదవ సారి జరాసంధుడు వచ్చాడు. బలరామ కృష్ణులిద్దరూ కోటలోనుండి బయటకు వచ్చి మరల పరుగు మొదలుపెట్టారు. జరాసంధుడు వారివెంట పడ్డాడు. ప్రవర్షణ పర్వతమనే పెద్ద పర్వతమును ఎక్కి బలరామకృష్ణులు అక్కడి పొదలలోకి దూరిపోయారు. అక్కడ ఇంద్రుడు వర్షములను ఎక్కువగా కురిపిస్తూ ఉంటాడు. చెట్లన్నీ చీకటితో ఉంటాయి. వాళ్లకి బలరామకృష్ణులు కనపడలేదు. జరాసంధుడు ఆ పర్వతము నంతటినీ తగల పెట్టెయ్యమని తన సైనికులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు మొత్తం పర్వతమంతా తగులపెట్టేశారు. అగ్నిహోత్రుని కాంతులు ఆకాశమునకు అంటుకున్నాయి. బలరామకృష్ణులిద్దరూ కూడా నిశ్శబ్దంగా పర్వతం మీదనుండి సముద్రంలోనికి దూకేసి ఈదుకుంటూ ద్వారకానగరమునకు వెళ్ళిపోయారు. కృష్ణుడు, బలరాముడు ఇద్దరూ మరణించి ఉంటారనుకుని జరాసంధుడు వెళ్ళిపోయాడు. కృష్ణబలరాములు మాత్రం క్షేమంగా ఉన్నారు.

ఇందులో తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఉన్నది. ‘సంధి’ అనగా సగము సంధికాలము వచ్చింది. యుగ సంధి వచ్చింది అంటారు. ఎవరినయినా ఆశీర్వచనం చేస్తే ‘శతమానం భవతి శతాయు పురుషశ్శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతీ’ అంటూ నూరు సంవత్సరములు జీవించు అంటాము. నూరు సంవత్సరములలో సగము ఏభై. మీరు ఈశ్వరారాధన ఈ ఏభై లోపల చెయ్యాలి. ఏభై తరువాత చేసే ఆరాధన మానసికమయినది. ఏభై తరువాత అంత కలివిడిగా శరీరముతో ఈశ్వర సేవ చేయడం కష్టం. మనం చేసే పెద్ద పెద్ద యాత్రలన్నీ ఏబది సంవత్సరముల వయసు లోపల పూర్తి అవాలి. జరాసంధుడు పట్టుకోవడం అంటే వృద్ధాప్యం రావడం. వృద్ధాప్యం వస్తే కాలయవనుడు తరుముతాడు. మృత్యువు వస్తుంది. ఇక్కడ కృష్ణుడు గుహలోకి దూరిపోయాడు. అనగా హృదయగుహలోకి వెళ్ళిపోయాడు. ముచుకుందుడు నిద్రలేచాడు. హృదయంలోకి వెళ్ళిపోయి ఆత్మస్థితి గతుడయిపోయిన వాడికి మరణం ఉండదు. కాలయవనుడు పోయాడు తప్ప ఈయనకి వచ్చిన నష్టం ఉండదు. జరాసంధుని తప్పుకోవడానికి ప్రవర్షణ పర్వతమును ఎక్కాడు. అలా చేయడం అనగా నిరంతరము భక్తితో ఉండడం. పరమభక్తితో ఉంటే మృత్యువు మిమ్ములను ఏమీ చేయలేదు. యమధర్మరాజు గారు, యమదూతలు దాపులకు రారు . పరమభక్తుడయిన వాడిని తీసుకు వెళ్ళడానికి నారాయణుని పార్షదులు వస్తారు. శివుని పార్షదులు వస్తారు. ప్రవర్షణ పర్వతం అంతా కాలిపోయింది. సముద్రాంతర్గతమయిన ద్వారకను అనగా ఈశ్వర స్థానమునకు చేరుకున్నాడు. ఈవిధంగా లోకమున కంతటికీ జీవయాత్రను ఈశ్వరుడు ఇలా బ్రతకడం నేర్చుకో అని నిరూపించి చూపించాడు.

రుక్మిణీ కళ్యాణం:

భాగవతంలో దశమస్కంధము ఆయువుపట్టు. ఈ దశమ స్కంధమును పూర్వోత్తర భాగాములని మరల రెండుగా విభజించారు. పూర్వభాగమును రుక్మిణీకళ్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత, రుక్మిణీ కళ్యాణం చేసినందు వలన, చూసినందు వలన, వినినందు వలన, చదివినందు వలన కలిగే ఫలితం చెప్పడానికి మాటలు చాలవు. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడయిన వరుడు కన్యకు వచ్చి తీరుతాడు. రుక్మిణీకళ్యాణ ఘట్టమును ప్రారంభం చేస్తూ పోతనగారు

వినుము విదర్భదేశమున వీరుడు కుండినభర్త భీష్మకుం

డను నొక దొడ్డరాజు గల; డాతని కేవురు పుత్రు లగ్రజుం

డనయుఁడు రుక్మినా బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలై

మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణి నా బ్రసిద్ధయై.

విదర్భ దేశమును భీష్మకుడు అనే దొడ్డ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు అయిదుగురు కుమారులు. వాళ్ళ పేర్లు రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. వీరికి చిట్టచివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్ల రుక్మిణీదేవి. అయిదుగురి చెల్లెలయిన రుక్మిణి పెరిగి పెద్దది అవుతోంది.

పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబు లందు;

గుజ్జెన గూళులు గొమరొప్ప వండించి చెలులకు బెట్టించు జెలువు మెఱసి;

రమణీయ మందిరారామదేశంబుల బువ్వు దీగెలకును బ్రాది వెట్టు

సదమల మణిమయ సౌధభాగంబుల లీలతో భర్మడోలికల నూఁగు

బాలికలతోడ జెలరేగి బంతు లాడ శారికా కీర పంక్తికి జదువు సెప్పు

బర్హి సంఘములకు మురిపములు గఱపు, మదమరాళంబులకు జూపు మందగతులు.

ఆ తల్లి చిన్నప్పటినుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేది. రుక్మిణీ దేవి అంతఃపురమునుండి డోలు, సన్నాయి వినబడుతూనే ఉండేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్నెపిల్ల సువాసిని అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపుకుంకుమలు నిలబడతాయి. ఆవిడ గుజ్జనగూళ్ళను ఒండించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేసి పెడుతూ ఉండేది. ఆడవాళ్ళు చేసే పనులు పరమ సౌకుమార్యంతో ఉంటాయి. ఆవిడ లతలకు, తీగలకు చక్కగా పందిరి వేసేది. ఊయలలు ఊగుతూ ఉండేది చిలుకలకు పలుకులు నేర్పుతుండేది. హంసలకు నడకలు నేర్పేది. ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నది.


 Srimadhandhra Bhagavatham -- 85 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


తండ్రి అయిన భీష్మకుని దగ్గరకు తరచుగా భాగవతులు వస్తూ ఉండేవారు. వచ్చిన భక్తులను ఆయన ఆదరణ చేస్తూ ఉండేవాడు. వారు ఎప్పుడూ భగవత్సంబంధమైన విషయములను మాట్లాడేవారు. కృష్ణుని కథలు వాళ్ళు చెప్పేవారు. భీష్మకుడు వాటిని వినేవాడు. ఆ సందర్భంలో రుక్మిణి కూడా వారు చెప్పే కథలను వినేది. అందువలన క్రమంగా ఆమె మనస్సు కృష్ణునియందు చేరింది. రుక్మిణీ కళ్యాణ ఘట్టమును కథగా వింటే మీకు కలిగే ప్రయోజనం తక్కువ. ఆ కథ ద్వారా మీ ఇల్లు ఎలా ఉండాలో మీరు చూసుకోవాలి. మీ యింటికి వచ్చేవారు పదిహేను నిమిషములు మాట్లాడితే కనీసంలో కనీసం అయిదు నిమిషములు భగవత్సంబంధమో, పిల్లలు విన్నా పనికివచ్చే మాటలో మాట్లాడేవాడు అయి వుండాలి. అంతే కానీ యింటికి వచ్చేవాడు లౌకికమయిన విషయములు, వాడి మీద గోల, వీడి మీద గోల, అసలు పనికొచ్చే విషయములు మాట్లాడడం అలవాటు లేకపోయినట్లయితే అదే సంస్కృతి పిల్లలకు వస్తుంది. ఒక యింట్లో ఇంటాయనకు పరమాచార్య అంటే ప్రాణం అనుకోండి. ఆయన పరమాచార్యను అస్తమాను తలుచుకుంటుంటే యింట్లో పిల్లలకు పెద్దలఎడ భక్తి భావన గౌరవము ఏర్పడతాయి. యింట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు పిల్లలకు గొప్ప సంస్కృతిని నేర్పుతాయి. తన యింటికి వచ్చిన భాగవతుల మాటల వలన రుక్మిణికి కృష్ణ పరమాత్మయందు హృదయము కుదురు కొనినది. ఆయననే వివాహం చేసుకోవాలని మనస్సు నందు నిశ్చయించుకుంది. ఆవిడ ధైర్యము కలిగినదై, పరబ్రహ్మతత్వము తెలిసి వున్నదై ఇంతకూ పూర్వం ఏ పురుషునికీ తన హృదయంలో స్థానము ఇవ్వనిదై కులవతియై ఆచారము సంప్రదాయము తెలిసి వున్నదై కేవలము కామముతో ఎవరో పురుషుని పొందేద్దాము అన్న ప్రయత్నము ఉన్నది కానిదై ఇతఃపూర్వము వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడని స్వరూపము కలిగినదై తన భర్తను తాను ఎన్నుకొన్న స్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉన్నది. ఆ స్థాయిని అమ్మవారు పొందారు.

బంధువు లెల్ల గృష్ణునకు బాలిక నిచ్చెద మంచు శేముషి

సింధువులై విచారములు సేయగా వారల నడ్డుపెట్టి దు

స్సంధుడు రుక్మి కృష్ణునెడ జాల విరోధము జేసి మత్తపు

ష్పందయవేణి నిత్తు శిశుపాలున కంచు దలంచె నంధుడై!!

నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి జుట్టు గలిగిన రుక్మిణీ దేవిని కళ్ళు లేనివాడై పెద్దన్న గారయిన రుక్మి శిశుపాలునకు యిస్తానంటున్నాడు. అమ్మవారు జుట్టు నలుపుకి రుక్మికి ఏమిటి సంబంధం? అంధత్వము చీకటిని చూపిస్తుంది. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుంది. అమ్మవారి జుట్టుకి ఒక లక్షణం ఉంది. నల్లని అమ్మవారి కబరీ బంధమును మీరు ధ్యానం చేసినట్లయితే అజ్ఞానము నశిస్తుంది. శిశుపాలుడు రుక్మిణీ దేవిని వివాహం చేసుకుందామని తరలి కన్యాదాతగారి యింటికి వచ్చేశాడు. ఇంకా అమ్మవారిని పెళ్లి కూతురుని చెయ్యాలి. శిశుపాలునితో జరాసంధుడు మొదలయిన వాళ్ళు వచ్చారు. ఇపుతూ రుక్మిణి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుని ఆశ్రయించింది. ఆయనను పిలిచి ఒక మాట అంది. ‘మహానుభావా నేను శ్రీకృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవాలని అనుకున్నాను. కానీ నా అన్నగారయిన రుక్మి నన్ను తీసుకొని వెళ్ళి శిశుపాలున కిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుచేత నేను రాసిన ఈ లేఖను పట్టుకొని వెళ్ళి ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మకు అందించి నన్ను కృతార్థురాలిని చేయవలసింది’ అని అడిగింది. వెంటనే అగ్నిద్యోతనుడు ఆ లేఖను పట్టుకొని ద్వారకా నగరమును చేరుకున్నాడు.

కృష్ణ పరమాత్మ అగ్నిద్యోతనుడు వచ్చాడని తెలుసుకున్నారు. కానీ అగ్నిద్యోతనుడు ఎక్కడి నుండి వచ్చాడో తెలిసివున్న వాడిలా ప్రవర్తించలేదు. బ్రాహ్మణుడు వచ్చాడని ఆయనను గౌరవించి, ఆయనకు అర్ఘ్య పాద్యాదులు ఇచ్చిన తరువాత ఆయనకు మధురాన్నములతో భోజనం పెట్టి, ఆయన కూర్చున్న తరువాత ఆయన పాద సంవాహనం చేతూ అయ్యా మీరు ఏ దేశమునకు చెందినవారు. మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా?’ అని అడిగాడు.అపుడు అగ్నిద్యోతనుడు ‘నేను భీష్మకుడను రాజు పరిపాలిస్తున్న కుండిన నగరం నుండి వచ్చాను. రుక్మిణీ దేవి మీకు యిచ్చిన లేఖను తీసుకువచ్చాను. ఈ లేఖను మీరు అవధరించవలసినది’ అని ఆలేఖను తీసి కృష్ణునికి ఇచ్చాడు.

ఆ లేఖను తీసుకొని పరమాత్మ దానిని చదువుతున్నారు. వ్యాసభగవానుడు సంస్కృతంలో రచించిన లేఖను పోతనగారు తెలుగులో చక్కని పద్యములలో ఆంధ్రీకరించారు. వ్యాస భగవానుని మూల శ్లోకములలోని శక్తి పోతనగారి పద్యములలో ఉంది. ఆ పద్యములు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తే గొప్ప ఫలితము కలుగుతుంది. కన్నె పిల్లలకు పెళ్లి అవుతుంది. రుక్మిణీదేవి ఎంత గొప్పగా అడిగిందో చూడండి ‘నీవు ధన్యుడవు, పదిమందిని ధన్యులను చేస్తావు. లోకమంతటికీ ఆనందమును చేకూరుస్తావు. నీవు భగవంతుడవు, ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తి వీర్యము, తేజస్సు కలవాడివి’ అని ఆవిడ భగవంతుని గుణములను ఆవిష్కరిస్తోంది. నేను కాని గత జన్మలలో ఎప్పుడయినా వ్రతం చేసిన దానను అయితే ఒక నోము నోచిన దానను అయితే ఒక మహానుభావుడయిన సద్గురువు పాదములు ఒత్తిన దానను అయితే మనస్ఫూర్తిగా వారి పాదములు ఒకరికి పెట్టిన దానను అయితే నాకు అటువంటి పుణ్యమే వుంటే అధముడయిన చేది ప్రభువు శిశుపాలుడు నీచేతిలో మరణించుగాక! నేను నీ దానను ఔదును గాక! అంది.

ఇందులో రహస్యం అంతా ఉంది. భీష్మకుని అయిదుగురు కొడుకులకు రుక్మముతోనే పేర్లు పెట్టబడ్డాయి. రుక్మము అనగా బంగారము. బంగారము లోభమును కలిగిస్తుంది. మనకి అయిదు ఇంద్రియములు. ఈ అయిదు ఎప్పుడూ చేది ప్రభువును కోరుకుంటాయి. చిత్త ప్రభవమే కామము. ఇంద్రియములను అణచడం అంత తేలిక కాదు. ముందు పుట్టిన ఈ అయిదుగురు యింద్రియములు. చేది ప్రభువయిన శిశుపాలుడు కామం. రుక్మిణి అంటే బుద్ధి, మనస్సు. ఈవిడ కృష్ణుడు కావాలని కోరుకుంటోంది. పొందకుండా అడ్డుపడుతున్నవి ఇంద్రియములు. యింద్రియములను గెలవలేకపోతే శరణాగతి చేయాలి. కృష్ణా నీవు చతురంగ బలంతో రావాలి. ఈశ్వర సంబంధమయిన గుణములు నాయందు ప్రవేశ పెట్ట్టాలి. నీవే నా దగ్గరికి రావాలి. నన్ను ధన్యురాలిని చెయ్యాలి. నాకు వున్న ఈ అరిషడ్వర్గములను అణచాలి. ఇంద్రియ లౌల్యమును తగ్గించాలి. తగ్గించి రాక్షస వివాహం ద్వారా నన్ను నీదానిని చేసుకోవాలి.

రుక్మిణీ నీవు చెప్పావు బాగానే ఉంది. నీవు ఎక్కడో అంతఃపురంలో ఉంటావు. నీదాకా వచ్చి నిన్ను నేను తీసుకు వెళ్ళాలంటే ఎందరినో చంపాలి. అడ్డువస్తే భీష్మకుడిని చంపవలసి ఉంటుంది. అపుడు నా కోరిక వల్ల ఇలా అయిపోయారా అని నీకు మొహబుద్ధి ఏర్పడితే అంటావేమో మా వాళ్ళు నన్ను పెళ్ళికి ముందు ఊరిచివర వున్నా పరమశివుని యిల్లాలయిన పార్వతీ దేవితో కలిసి కూర్చున్న మహాదేవుడయిన శంకరుని ఆలయమునకు పంపిస్తారు. నేను అక్కడికి వచ్చి సర్వమంగళాదేవిని అర్చన చేస్తాను. ఆ సమయంలో నీవు వచ్చి నన్ను నీ రథం ఎక్కించుకొని తీసుకు వెళ్ళిపో. అని ఉపాయం కూడా అమ్మవారు బోధ చేసింది.

అమ్మవారు అలా చెప్పడంలో రహస్యం అది సర్వస్య శరణాగతి.

ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని; కర్ణరంధ్రంబుల కలిమి యేల?

పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని; తనులతవలని సౌందర్య మేల?

భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని; చక్షురింద్రియముల సత్వ మేల?

దయిత! నీ యధరామృతం బానఁగా లేని; జిహ్వకు ఫలరససిద్ధి యేల?

ప్రాణేశా! నీ గురించి వినని ఈ చెవులు వున్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. శిశుపాలుడు నీ గురించి మాట్లాడడు. అతను నీకు శత్రువు. అందుచేత అతని భర్తృత్వం నాకు అక్కరలేదు. నిన్ను చూడడానికి పనికిరాని ఈ కళ్ళు వున్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. నాకు ఎప్పుడూ కూడా నీ అధరామృతం పానం చేయాలని ఉంటుంది. నీవు అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకూ కొరగానిది. నిరంతరమూ నిన్ను గాఢాలింగనం చేసుకొని నీ మేడలో వున్న వనమాల వాసన చూడాలని నాకు కోరిక. ఎన్ని జన్మలెత్తితే ఎందుకు? ఎంత పెద్దపెద్ద శరీరములు వస్తే ఎందుకు? నీ సేవ చేయని శరీరం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే.

ఏ నీ గుణములు గర్ణేంద్రియంబులు సోఁక దేహతాపంబులు దీఱిపోవు

నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల కఖిలార్థలాభంబు గలుగుచుండు

నే నీ చరణసేవ యే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు

నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ దడవిన బంధసంతతులు వాయు

నట్టి నీ యందు నా చిత్త మనవరతము నచ్చి యున్నది నీ యాన నాన లేదు,

కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి! శ్రీయుతాకార! మానినీచిత్తచోర!

ఈశ్వరా, నీ గుణములు వింటుంటే, ఈశ్వరుని కథలు వింటుంటే సంసారంలో తిరగడం వలన కలిగిన తాపము ఉపశాంతి పొంది మనస్సు చల్లబడి హాయిగా ఉంటుంది. సంసార పాశములు తెగిపోయి పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని ఇవ్వగలిగిన నీ నామమును పలకగాలిగిన నాడు ణా నోరు నోరు. ఇంద్రపదవి అక్కరలేదు. ఈశ్వరా, నిన్ను చేరుకోవాలని కోరుకుంటున్నాను.

నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాడెవరు నన్ను చేసుకోవడానికి? నీవు పురుష సింహానివి. సింహము తినవలసిన పదార్ధం నక్క తిందామనుకుంటే సింహము నక్కను ఎలా చీల్చేస్తుందో అలా నీవు వచ్చి నీ ప్రతాపం ఏమిటో చూపించి ఆ శిశుపాలుడిని పరిమార్చి నన్ను చేపట్టాలి. ఇది నా ప్రార్థన”.

నీ పాదములనుండి స్రవించే ఆకాశగంగ యందు మునక వేయాలని కోరుకునే మహాపురుషుల వాలే ఈశ్వరా, ఈ జన్మకే కాదు. నూరు జన్మలయినా సరే పొందితే నిన్నే పొందుతాను. పొందకపోతే నీకోసం వ్రతములు చేస్తాను. అంతేకానీ అన్యులను మాత్రం భర్తగా అంగీకరించను’ అని ఆ లేఖలో విషయములను పొందుపరచింది.



కామెంట్‌లు లేవు: