22, జూన్ 2023, గురువారం

⚜ శ్రీ వృషభాచలేశ్వర ఆలయం

 🕉 మన గుడి : 


⚜ కడప జిల్లా : పులివెందుల












⚜ శ్రీ వృషభాచలేశ్వర ఆలయం


💠 పురాణాలను పరిశీలిస్తే మానవులైనా ... దానవులైనా అడిగినదే తడవుగా వాళ్లకి వరాలను ప్రసాదించే దేవతలుగా బ్రహ్మ ... శివుడు కనిపిస్తారు. 

వారు ప్రసాదించిన వరాలతో దానవులు దుర్మార్గాలకు పాల్పడుతున్నప్పుడు శ్రీమన్నారాయణుడు రంగంలోకి దిగుతాడు. దానవులు పొందిన వరాలలో లోపాలను గుర్తించి ఆ దిశగానే వారి ఆటకట్టిస్తుంటాడు.

ఇదే విషయం మనకి మరోమారు స్పష్టం చేస్తుంది 'వృషభాచల క్షేత్రం'. 


💠 ఇది కడప జిల్లా పులివెందుల సమీపంలోని వేంపల్లె గ్రామంలో దర్శనమిస్తుంది. 

ఇక్కడి ఎత్తైన కొండను అంతా 'ఎద్దులకొండ' అని పిలుస్తుంటారు. 

ఈ కొండపైనే పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామి ఆవిర్భవించాడు.


💠 వెంపల్లె పాపాగ్ని నదీ తీరంలో కొండపై నెలకొన్న పురాతన ఆలయం. 

ఇటీవలే పునరుద్ధరణ జరిగి నూతనంగా నిర్మించడం జరిగింది, స్వామి వారు వృషబాసురుడు అనే రాక్షసుడిని సంహరించి ఇక్కడ వెలసినందున స్వామి వారికి "వృషభచలేశ్వర స్వామి" అని పేరు. 


⚜ స్థల పురాణం ⚜


💠 పూర్వం వృషభుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతమున ఉండేవాడు, గొప్ప విష్ణుభక్తుడు అయినా రాక్షసుడైనందున ఇక్కడి తపోధనులైన ఋషులను బాధించేవాడు.


💠 'వృషభాసురుడు' దేవతలవలన గానీ ... దానవులవలన గానీ ... మానవుల వలన గాని తనకి మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరాన్ని పొందాడు. అప్పటి నుంచి సాధుజనులను అనేక విధాలుగా బాధించడం మొదలుపెట్టాడు.

దాంతో దేవగణాలు ...ముని గణాలు శ్రీ మహావిష్ణువుకి పరిస్థితిని వివరించి ఆందోళనను వ్యక్తం చేశారు.

వృషభాసురుడి బాధలను తొలగించమని శ్రీహరిని ప్రార్థించగా ధర్మరక్షణ నిమిత్తము శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన వృషభాసురుని సంహరించుటకు సిద్ధమైనాడు

 

💠 వృషభాసురుడికి బ్రహ్మ ఇచ్చిన వరాన్ని ఒకసారి గుర్తుచేసుకున్న శ్రీమహావిష్ణువు, ఆ వరంలో జంతువుల ప్రస్తావన లేకపోవడంతో, ఎద్దు రూపంలో ఆ రాక్షసుడితో పోరాడి సంహరించాడు.

 

💠 వృషభుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకుని తనను కొండగా చేసి శిరస్సున స్వామి కొలువై శాశ్వతముగా తన పేరున పూజలందుకుని మోక్షాన్ని కలుగజేయమని వరం కోరాడు. శ్రీమహావిష్ణువు తన భక్తుని కోరిక మేరకు వృషభ రూపమును ధరించి తన భక్తుడైన వృషభాసురుని శిరస్సుపై తన ముందురి కాళ్ళ గిట్టలతో అదిమిపట్టి అచలునిగా(కొండగా) చేశాడు .

నాటి నుండి వేల సంవత్సరాలుగా స్వామివారు వృషభాచలేశ్వరునిగా (వృషభం,=ఎద్దు,అచలం= కొండ=ఎద్దులకొండ),  వెలసి ఎద్దుల కొండ్రాయునిగా  ఎంతో మంది భక్తులకు ఇలవేల్పుగా పూజలందుకొనుచున్నాడు


💠 అనంతరం అమ్మవారితో కలిసి ఈ క్షేత్రంలో ఆవిర్భవించాడు. 

ద్వాపరయుగంలో జరిగిన ఈ సంఘటనకు వేదికగా నిలిచిన ఈ కొండ 'ఎద్దులకొండ'గా ప్రసిద్ధి చెందగా, స్వామివారు 'వృషభాచలేశ్వరుడు' గా పూజలు అందుకుంటున్నాడు.


💠కొండపై నుండి వర్షాకాలంలో పాపాగ్ని నది సోయగాలు వీక్షించడం ఒక అనిర్వచనీయమైన అనుభవం.

ఇది భాస్కర క్షేత్రంగా ప్రసిద్ధి.

పాపాగ్ని నది ముఖ్యంగా 5 చోట్ల పవిత్రమైనది గా వ్యవహరిస్తారు... 

వాటిలో గండి, భాస్కర క్షేత్రం(ఎద్దులకొండ) ప్రముఖమైనదిగా చెప్పవచ్చు.

ఇక్కడ పాపాగ్ని నది ఉత్తరoగా ప్రవహించడం మరో విశేషం.


💠 ఇటీవలి కాలంలో దేవాదాయ ధర్మాదాయశాఖవారు మరియు రాజకీయ నాయకులు, భక్తుల కృషితో దినదినాభివృద్ధి చెందుచు, కొండపైకి తారు రోడ్డును వేసి బైక్లు,ఆటోలు, కార్లు, బస్సులద్వారా భక్తులు కొండపైకి చేరుకునే సౌకర్యమును కలుగచేసినారు.


💠 ఇక్కడి ఆలయంలో ధనుర్మాసంలో విశేష పూజలు ... ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. 


💠 కోరిన కోరికలను స్వామి వెంటనే తీరుస్తాడనే విశ్వాసం కారణంగా, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది.


💠 ఆలయాన్ని వెంపల్లె నుంచి ఆటోలో చేరుకోవచ్చు.

 ఈ ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రం గండికి దగ్గర లో ఉంది

కామెంట్‌లు లేవు: