22, జూన్ 2023, గురువారం

ఇంకొక డాక్టరుని చూస్తా

 ఇంకొక డాక్టరుని చూస్తా 

ఒక పెద్దాయనకు రీనల్ ఫెయిల్యూర్,డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి, కార్డియాటిక్ మిసఫంక్షన్, లివర్ సోరోసిస్, మొదలైన వ్యాధులతో ఒక పెద్ద హాస్పిటల్లో చేరాడు,  ఆయన చుట్టూ, కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవారాళ్ళు అందరు ఆయనకు సేవలు చేయటానికి  వచ్చారు. ఒక్కొక్క డాక్టరు వచ్చి ఒక్కొక్క రోగానికి చికిత్స చేస్తూ వున్నారు. ఎవరు ఏ మందులు ఇస్తున్నారో పాపం అక్కడ వున్న కొడుకులకు తెలియటంలేదు.  ఏ డాక్టర్ ఏ మందులు, ఇంజక్షన్లు తెమ్మంటే అవి తెచ్చి ఇస్తున్నారు.  అప్పటికే హాస్పిటల్ బిల్లు డాక్టర్ల బిల్లులు లక్షలు దాటాయి.  ఎప్పుడు ఏ క్షణాన ఏ వార్త వినవలసి వస్తుందో నని భయం భయంగా అందరు ఎదురు చూస్తూవున్నారు. 

ఆయనను చూసే అందరు డాక్టర్లు మీటింగు పెట్టుకొని చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు అదేమిటంటే ఆ పెద్దాయన ఇంకొక గంట లేక గంటన్నర మాత్రం బతకగలడు అనే ఉమ్మడి నిర్ణయానికి వచ్చి ఆ రోగితో వచ్చిన కొడుకులకు విషయం చెప్పారు. మీరు కావాలంటే అయన ఎవరినయిన చూస్తానంటే పిలిపించండి అని చెప్పారు.  చిన్నగా ఆ వార్త ఆ పెద్దాయన కొడుకు  నాన్న నీవు ఇంకొక గంట మాత్రం బ్రతుకుతావు నీవు ఎవరినయినా చూడదలుచుకుంటే చెప్పు పిలిపిస్తాం అని అన్నారు.  ఆ మాట విన్న ఆ పెద్దాయన ఏ మాత్రం బెదరకుండా చిరునవ్వుతో నాయనా "నాకు ఇంకొక డాక్టరుని చూడాలని ఉందిరా" అని అన్నాడు. ఇది చదవటానికి నవ్వు వచ్చేదిగా  ఉంటుంది. కానీ ప్రతి మనిషి అలవరచుకోవలసిం లక్షణం అదే అదేమిటో చూద్దాం. 

ప్రతి మనిషి రెండిటితో ఎప్పుడు ముడివేసుకుని ఉంటాడు అదేమిటంటే సుఖము, దుఖ్ఖము. మనిషి ఆలోచనలు వాటి ఫలితాలు ఎప్పుడు ఈ రెండిటిలో ఏదో ఒకదానికి తావు ఇస్తాయి. అది యెట్లా అంటే నిన్ను ఎవరైనా మెచ్చుకొని, పొగిడారనుకో అప్పుడు నీకు ఎంతో సంతోషం కలుగుతుంది అంటే అది సుఖం అన్న మాట.  అదే నిన్ను ఎవరైనా దూషించినా, కించపరచినా అవమానపరచిన వెంటనే నీకు కోపం వస్తుంది దాని పర్యవసానమే దుఃఖం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి మనిషి సదా ఈ రెండు మానసిక స్థితుల మధ్యనే ఉగిసలాడుతూ ఉంటాడు. దానివలన అనవసరపు ఆలోచనలు చివరకు అనేకవిధాల అనారోగ్య సమస్యలు వస్తూవుంటాయి. ఈ రెండిటిని సమతుల్యం చేయగల వానిని స్థితప్రగ్న్యుడు అంటారు.  ప్రతి సాధకుడు స్థితప్రజ్ఞత సాదించాలి. 

ఒకమనిషి ఒక గంటలో చనిపోతాడు అని తెలిస్తే వెంటనే ఎంతో ఆందోళన భయం చెప్పలేని బాధ కలుగుతాయి.  కానీ స్థితప్రజ్ఞత కలిగినవాడు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోగలరు అదే పైన పెద్దాయన నిర్ణయం.  ఇంతమంది డాక్టర్లు వైద్యం చేస్తున్న ఆయనకు స్వస్థతను చేకూర్చలేక పోయారు ఇంకొక డాక్టరు అయన ఆయనను బ్రతికిస్తాడనేది ఆశా వాదం. ప్రతి మనిషి ఆశావాదిగా మాత్రమే తన జీవితాన్ని గడపాలి.  అప్పుడే జీవితాన్ని సాపీగా ఎలాంటి ఒడిదుడుకులనేనా ఎదుర్కొని ముందుకు సాగగలడు. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే చాలామంది సాధకులు ప్రారంభంలో నాకు ధ్యానం మీద మనస్సు లగ్నత కలగటం  లేదు నేను సాధనను కొనసాగించలేను అని చిన్న చిన్న అవరోధాలకు భయపడి సాధనను ప్రారంభంలోనే మానుకునే సాధకులు ఎందరో.  కానీ ఏ సాధకుడు అయితే ఎలాంటి అవరోధాన్ని అయినా ఎదుర్కొని ముందుకు సాగుతాడో అతనే మోక్షాన్ని పొందగలడు. 

మన మహర్షులు మనకు త్రివిధమైన అవరోధాలను తెలిపారు అవి 1) ఆద్యాత్మికం 2) అది భౌతికము 3) అధి దైవికము ఈ మూడు అవరోధాలను ఏ సాధకుడు అయితే ఎదుర్కొని తన సాధనను కొనసాగిస్తాడో ఆ సాధకుడు మాత్రమే మోక్షాన్ని చేరుకోగలడు. 

ఇప్పుడే దృఢ సంకల్పం తీసుకో ఎలాంటి అవరోధాలు ఎదురైనా నేను నా సాధనను నిలిపి వేయను. ప్రతి నిత్యం నేను నా మనస్సును పరమేశ్వరుని మీదనే నిలుపుతాను.  ఎట్టి పరిస్థితిలోకూడా నేను నా దృష్టిని ఈశ్వరునిమీద నుంచి మరల్చను.  నేను అరిషడ్వార్గాన్ని పూర్తిగా నా స్వాధీనంలో ఉంచుకుంటాను.  ఐహికమైన ఎటువంటి ప్రలోభాలకు నేను  లొంగను. అనే దృఢచిత్తంతో వున్న సాధకునికి మోక్షము కారతలామలకాలము అవుతుంది ఇది సత్యం. 

సాధకుడు ముందుగా దేహ వ్యామోహాన్ని వదలాలి అప్పుడే సాధనలో ముందుకు వెళ్లగలడు.  

 ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

మీ భార్గవశర్మ

కామెంట్‌లు లేవు: