28, మే 2024, మంగళవారం

ఇంద్రియ నిగ్రహం

 *ఇంద్రియ నిగ్రహం*


ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అని అర్ధం. వాటిలో మనస్సు కూడా ఒక ప్రధానమైన ఇంద్రియం. అదే కర్మలకు కారణమైన ప్రధాన ఇంద్రియం. తనకు ఇష్టమైనదానికోసం దానిని వెతుకుకుంటూపోవటం మనస్సు యొక్క సహజ లక్షణం. అది దానికి ఇష్టంలేని దానిమీదికి పోదు. ఎందుచేతనంటే దానివలన మనస్సుకు ప్రయోజనం లేదుకనుక. అలాంటప్పుడు మనసు ఇష్టం లేని దానికోసం  ఎందుకు శ్రమపడాలి ? కాబట్టి మనస్సుకు ( ఇంద్రియానికి ) ఏది ఆకర్షణగా ఉంటుందో, దేనివలన తాను కోరుకున్న అనందం కలుగుతుందో దానిమీదనే దాని ఆసక్తి ప్రసరిస్తుంది. అది లౌకికమైన తాత్కాలిక ఆనందం, కష్టసాధ్యమైన పారమార్ధిక విషయాల వైపు మనస్సు పోదు. అటువంటి మనస్సును నిగ్రహించి దానిని పారమార్ధికమైన విషయాలవైపు మళ్ళించటం కష్టసాధ్యమైన కార్యం. ఆ విధంగా మనస్సును మళ్లించగల శక్తిని సమకూర్చుకోవటాన్నే ఇంద్రియ నిగ్రహం అంటారు. 

కాబట్టి లౌకిక సుఖాన్ని కాదనుకుని నిత్యమైన పారమార్ధిక సుఖానికై మానవుడు ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం నిరంతరం సాగుతూనే ఉండాలి. కార్యసాధనకు ప్రయత్నం ముఖ్యం. లేకపోతే మనస్సును నిగ్రహించి కార్యోన్ముఖంగా చేయటం ఎట్లా సంభవిస్తుంది? కాబట్టి కార్యసాధనకు తీవ్రమైన ప్రయత్నం చేయాలి, ఆలోచన చేయాలి. ఆలోచన అంతర్ముఖంగా చేసుకొని మనస్సు ఏ విషయాలకు లోనవుతుందో వాటిని నిరోధించుకునే ప్రయత్నం చేయాలి. 

మనకు ఇష్టంలేని ప్రస్తావన తీవ్రమైనప్పుడు మనకు కోపం వస్తుంది. క్రోధం అంతః శత్రువు. హద్దు మీరుతుంది. చేయకూడని పని చేయిస్తుంది. మాట్లాడకూడని మాటలు మాట్లాడిస్తుంది. దీనివలన అనర్ధం జరుగుతుంది. అది తనకూ మంచిది కాదు. ఎదుటివారికీ ప్రయోజనం కలిగించదు. అటువంటి క్రోధాన్ని ప్రయత్నపూర్వకంగా నిరోధించాలి. 

సహనం, వివేకం జీవితంలో అలవరుచుకోవాలి. మనకు అనుకోని విధంగా ఒక ఆపద ఏర్పడింది అనుకుందాము. త్రోవను పోయే ఒకనిని హఠాత్తుగా పాము కాటువేసింది అనుకుందాము. అది ఆకస్మికమైన విపత్తు. దానికి ఏడ్చి పొడబొబ్బలు పెట్టి, ఇతరులను నిందించి, పాముపై క్రోధం పెరిగి, దానిని చంపటానికి ప్రయత్నించి, అది కనపడకుండా పోయి, భయము పెంచుకుంటూపోతే చేయవలసిన కార్యం మరచి సమయం వ్యర్ధమవుతుంది తప్ప ఉపయోగం ఉండదు. అటువంటి ఆపద సమయములలోనే మనము సహనము, వివేకముతో కూడిన కార్యము తలపెట్టాలి.

ఏ కార్యం జరగటానికైనా ఒక కారణం ఉంటుంది. ఆ పాము కాటు వేయటానికి ఒక ప్రేరణ ఉండి ఉంటుంది. అదియే దైవ ప్రేరణ. దీనినే మనం లౌకికంగా ఒక సామెత కూడా వాడుతూవుంటాము -  *"శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని"*. ప్రారబ్ధ కర్మ పాలనంలోనే అట్లా జరిగి ఉంటుంది అని భావించాలి. అట్లా విచారణచేయటమే వివేకం. ఈ విచారణను వివేకముచే స్థిరపరచుకుని నిర్ణయం చేసుకోగలుగుతున్నాము. 

ఈ విధమైన విచక్షణచేయగలగటానికి ఎన్నో కఠినమైన పరిస్థితులను, అవరోధాలను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. నీటిని సహనంతో అధిగమించాలి. దీనినే తితిక్ష అని కూడా అంటారు. తితిక్ష కలవాడే వేదాంత శిక్షణకు అర్హుడు, యోగ్యుడు. అటువంటివానికే శాస్త్రము యెడల శ్రద్ధ కలుగుతుంది. శాస్త్రంలో శ్రద్ధ అంటే విశ్వాసం. శాస్త్రం అనేది ఏది నిర్దేశిస్తుందో అది చేయాలి. ఆ విధంగా శాస్త్రం ఎందుకు చెప్పింది అన్న దానిపై పరిశోధన చేయకూడదు. శాస్త్రంపై పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉంటే చాలదు, శాస్త్రం చెప్పిన విధంగా ఆచరించి తీరాలి.  


--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు*

కామెంట్‌లు లేవు: