25, జనవరి 2025, శనివారం

తిరుమల సర్వస్వం -128*

 *తిరుమల సర్వస్వం -128*

 

 *తిరుమలకు చేరుకుందాం! 1*


 *సప్తగిరుల సమారోహమైన తిరుమలక్షేత్రం లోని ఏడవ శిఖరం “వేంకటాద్రి” పై నెలకొన్న ఆనందనిలయంలో శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు.* 



 *తిరుమలకు నడక మార్గాలు*


 తిరుమల క్షేత్రం చేరుకోడానికి అనాదిగా నాలుగు ముఖ్యమైన మార్గాలున్నాయి:


 చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక స్థలమైన తలకోన నుండి అరణ్యమార్గంలో దాదాపు నలభై కిలోమీటర్లు ప్రయాణించి తిరుమలకు చేరుకోవచ్చు. కాలాంతరాన ఈ మార్గం పూర్తిగా కనుమరుగై పోయింది.


 రెండవమార్గం కడప జిల్లా నుండి వచ్చేవారికి అనుకూలంగా ఉండేది. ఈ మార్గం కడప పట్టణంలో ప్రస్తుతం *"దేవునిగడప"* గా ప్రాచుర్యం పొందిన వేంకటేశ్వరుని ఆలయం నుండి ప్రారంభమయ్యేదని చెబుతారు. అచ్చటి నుండి కుక్కలదొడ్డి, మామండూరు గ్రామాల మీదుగా కనుమలతో కూడుకున్న అడవుల్లో సాగిపోయే ఈ మార్గం ప్రస్తుతం చాలావరకు శిథిలమైపోయింది. అయితే, ఈ దారిలో పురాతన సోపానమార్గపు ఆనవాళ్లు, కొన్ని విశ్రాంతి మంటపాలు ఇప్పటికీ కనిపిస్తాయి. తిరుమలక్షేత్ర మందు పాపనాశనం వెళ్లే దారిలోని *"గోగర్భం"* ఆనకట్ట ప్రక్కన ఉన్న *"ఈతకాయల మంటపం"* వాటిలో ఒకటి. ఇప్పటికీ అప్పుడప్పుడు కొందరు ఔత్సాహికులు అటవీశాఖ వారి ప్రత్యేక అనుమతితో, విశేష సందర్భాలలో ఈ మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అపాయాలతో కూడుకున్న, జనసంచారం లేని ఈ మార్గంలో ఒంటరిగా ప్రయాణించడం ఒకరకంగా సాహసయాత్రే!


 మూడవది మనలో చాలామందికి సుపరిచితమైన తిరుపతి పట్టణం లోని *"అలిపిరి"* నుండి మొదలయ్యేది. 


 నాలుగవ మార్గం చంద్రగిరి పరిసర ప్రాంతం నుండి బయలుదేరి తిరుమలకు చేరుకుంటుంది. దీనినే *"శ్రీవారిమెట్లు'* గా పిలుస్తారు. -


 ఇవే కాకుండా, తిరుమల క్షేత్రానికి నలుదిక్కుల నుంచి ఇంకా అనేక మార్గాలు ఉన్నట్లుగా చెబుతారు. పురాణాల ననుసరించి కపిలతీర్థం ఆలయం నుండి ఒక రహస్యమైన సొరంగమార్గం కూడా ఉండేది. తొండమాన్ చక్రవర్తి ఆ మార్గం గుండా వెళ్లి స్వామిని సేవించుకునే వాడు.


 ప్రస్తుతం *"అలిపిరి"* మరియు *"శ్రీవారిమెట్లు"* నడకమార్గాలు లేదా మెట్ల మార్గాలు మాత్రమే (వాహనాలు వెళ్ళి వచ్చే రెండు ఘాట్ రోడ్ లు కాకుండా) వాడుకలో ఉన్నాయి.



‌ *నడక మార్గంలో మెట్లు*


 1850వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం యాత్రికుల సౌలభ్యం కోసం కొండమీదకు ఉన్న నడకదారిలో మెట్లను నిర్మించింది. 1953వ సంవత్సరంలో ఆలయం తి.తి.దే. ఆధ్వర్యం లోకి వచ్చిన తర్వాత, 26 వేల రూపాయల ఖర్చుతో ఆ మెట్ల మార్గం అభివృద్ధి చేయబడింది. ఈ మెట్లు నిర్మించక ముందు, అంటే దాదాపుగా 150 సంవత్సరాల క్రితం, తిరుమల యాత్ర దుర్గమంగా ఉండేది. మార్గమధ్యంలో తరచుగా తారసపడే చిరుతలు, ఎలుగుబంట్ల వంటి క్రూర జంతువులను పారద్రోలటానికి డప్పులు వాయించేవారు; రాత్రులందు మంటలు కూడా వేసేవారు. దొంగల భయం అధికంగా ఉండడం చేత యాత్రికులు సమూహాలుగా మాత్రమే వెళ్లేవారు. భక్తులు లోయలు, రాళ్ళు, రప్పలు, ముళ్ళపొదలు, క్రిమికీటకాలతో నిండిన అరణ్యమార్గంలో అత్యంత ప్రయాసతో సపరివార సమేతంగా ప్రయాణిస్తూ ; మధ్యలో వంటా-వార్పు చేసుకునే వారు. మధ్య మధ్యలో మంచినీటి కోసం దిగుడు బావులు, విశ్రాంతి తీసుకోవడానికి *'ఠాణాలు"* గా పిలువబడే మండపాలు ఉండేవి. ఎందరో మహారాజులు, జమీందార్లు వారి పేరు మీదా లేదా వారి కుటుంబ సభ్యుల పేరు మీదా ఈ మంటపాలను నిర్మించి, *"మానవసేవే మాధవసేవ"* యని ఆనాడే చాటిచెప్పారు. అంగవైకల్యం కలవారిని, వయోవృద్ధులను పల్లకీలా ఉండే డోలీల ద్వారా కొండకు చేర్చడానికి ప్రత్యేకంగా కూలీలు ఉండేవారు. అందుకుగాను మనిషికి పది అణాలు, అంటే కేవలం 60 పైసలు, కూలి వసూలు చేసేవారు. ఈ డోలీలు నిలుపుకోవడానికి, ఆలయ సమీపంలో ఒక *"డోలీ మంటపం"* కూడా ఉండేది. ఈ ప్రదేశాన్ని ఇప్పుడు *"డోలీ మంటపం బ్లాకు"* లేదా *"డి ఎం బి"* గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి నుండి సన్నిధివీధి మీదుగా వెళ్లి ఇప్పుడున్న క్యూ కాంప్లెక్సుతో ఏమాత్రం సంబంధం లేకుండా నేరుగా మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి దర్జాగా శ్రీవారిని దర్శించుకునే వారు.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: