25, అక్టోబర్ 2022, మంగళవారం

గ్రహణ కాల ప్రత్యేక విధులు

 *గ్రహణ కాల ప్రత్యేక విధులు నిర్వహించండి!*


 స్వామీ నమస్తే!

 గ్రహణం సమయం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి?

గాయత్రీ జపం చేయవచ్చా?

 తర్పణాలు విడువవచ్చా? 

అసలు ఆచమనం చేయవచ్చా?

 స్త్రీలు స్తోత్రాలు చదువుకోవచ్చా?

గ్రహణం సమయంలో ఇంట్లో దీపం వెలిగిఃచాలా?అక్కర్లేదా?

రాత్రి భోజనం కాక పళ్లు ఫలహారం పనికొస్తుందా?

 దానాలు  గ్రహణం సమయంలోనా లేక విడిచిన తరువాతా?

 గ్రహణం సమయంలో అయితే బ్రాహ్మణులు దొరకరు కదా? 

గ్రహణం సమయంలో ఎవరిని ఉద్దేశించి జపం చేయాలి?

ఇష్టదైవం ప్రీత్యర్థంఅనా లేక సూర్య/ చంద్ర ప్రీత్యర్థం అనా జపసంకల్పం చేయాలి?

ఇలా ఎన్నో ప్రశ్నలు.... నేను  ఈ ప్రశ్నలు గొప్ప ఫండితుల్ని అడిగినా తృప్తికరమొన శాస్త్రియ జవాబు లేదు.ఒక వ్యాస రూపంలో  తమరువ్రాస్తే ఎందరికో తెలుస్తుంది.

===============================

చాలా మంచి ప్రశ్నలు అడిగారు. నిజానికి వీటికి సమాధానాలు చాలా మందికి తెలియవు. ఎక్కువ మంది గ్రహణకాల విధులు మరిచిపోయారు. కేవలం కొద్దిమంది సనాతనపరులు మాత్రమే వీటిని పాటిస్తున్నారు. కనుక తమ ప్రశ్నలకు సమాధానాలు కూలంకషంగా ఇవ్వవలసి ఉంది.

అయితే సామాజిక మాధ్యమం విస్తృతమైన పరిధిని దృష్టిలో ఉంచుకొని అన్ని కులాల వారు, వయసుల వారు, ఆడమగ, మతాల వారికీ పనికి వచ్చే విధంగా సమాధానం ఇస్తాము. ఎందుకంటే గ్రహణకాల విధులు అందరికీ ఒకే విధంగా ఉండవు. మీరు అడిగిన ప్రశ్నలకు కొన్ని అనుబంధప్రశ్నలున్నాయి కనుక వాటి గురించి ముందుగా తెలుసుకుందాము



================================

గ్రహణం అంటే ఏమిటి? గ్రహణ సమయం అంటే ఏమిటి?


గ్రహణం అనేదానికి వేదాలకు ముఖ్యమైన ఆరు అంగాల్లో ఒకటైన జ్యోతిషం ప్రకారం సూర్య గ్రహాన్ని, చంద్రగ్రహాన్ని ఛాయాగ్రహాలైన రాహుకేతువులు పీడించడంగా చెప్పవచ్చు. ఆధునికులు చంద్రుడిని గ్రహంగా అంగీకరించరు. అది వేరేసంగతి. 

గ్రహణానికి ముఖ్యమైనవి సమయాలు. ఇవి స్పర్శకాలం, మధ్య కాలం, మోక్షకాలం అంటారు. వీటిని అన్నింటినీ కలిపి ఆద్యంత పుణ్యకాలం అంటారు. 

ఉదాహరణకు కేతువు ద్వారా రాబోతున్న ఆశ్వయుజ సూర్యగ్రహణం స్పర్శకాలం 25వ తేదీన సాయంత్రం గం 5.04నిమిషాలు. మధ్యకాలం సాయంకాలం 5.39. ఇక గ్రహణం విడిచేది అయిన మోక్షకాలం సాయంత్రం 6.28. అయితే ఈ గ్రహణంలో మోక్షం సూర్యాస్తమయం తరువాత కలిగింది. భారతభూభాగంపై సూర్యుడు అస్తమించిన తరువాత గ్రహణం విడిచిపెట్టింది. కనుక దీన్ని కేత్రగ్రస్తాస్తమయ గ్రహణంగా చెబుతారు. ఇది చాలా అరుదైన గ్రహణం. అక్టోబర్ 25వ తేదీని సూర్యాస్తమయం 5.36నకే జరుగుతుంది. కనుక దీన్ని గ్రహణం మిగిలి ఉన్న అస్తమయంగా చెబుతారు. దీని వలన మరునాడు సూర్య దర్శనం అయ్యేంత వరకూ గ్రహణదోషం వీడదు. ఈ కారణాల వలన గ్రహణకాల విధులు మారిపోతాయి.

ఇక్కడ మరో విచిత్రం చంద్రగ్రహణం నాడు జరుగుతోంది. 

ఈ ఏడాది చంద్రగ్రహణం నవంబర్ 8వ తేదీన కార్తీక పౌర్ణమి రోజున రానుంది. రాహుగ్రస్త చంద్రగ్రహణం స్పర్శకాలం మధ్యాహ్నం 2.39 కాగా మధ్యకాలం సాయంత్రం 4.29 మోక్షకాలం సాయంత్రం 6.18 అవుతోంది. అంటే చంద్రగ్రహణంతోటే చంద్రోదయం కాబోతోంది కనుక దీన్ని రాహుగ్రస్తోదయ చంద్రగ్రహణంగా చెబుతారు. దీని వలన కూడా గ్రహణ విధులు మారిపోతాయి.

ఈ ప్రత్యేక పరిస్థితుల్లో గ్రహణ సమయంలో ఎలా విధులు నిర్వర్తించాలో అంతా తెలుసుకోవాలి.

===================

ముందుగా ఈ గ్రహణ సమయంలో స్వాతీ నక్షత్రం వారు సూర్యగ్రహణం, భరణీ నక్షత్రం వారు చంద్రగ్రహణం చూడరాదు. తులారాశివారు సూర్యగ్రహణం నాడు శాంతి చేయించుకోవాలి. మేషరాశి వారు చంద్రగ్రహణం నాడు శాంతి చేయించుకోవాలి.

=================

 గ్రహణం సమయం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి?

ఇది మంచి ప్రశ్న. గ్రహణ కాలం చాలా ఉత్తమమైన సమయం. చాలా అరుదైన సమయం. చాలా యోగదాయకమైన సమయం. ఈ సమయంలో చేసే సాధనలు కోటిరెట్లు ఉత్తమ ఫలాలను ఇస్తాయి. జపాలు కోటి రెట్లు అవుతాయి. దానాలు లక్షల రెట్లు అవుతాయి. అంటే ప్రతీ రూపాయి లక్షరూపాయల దానంతో సమానం అవుతుంది. ధ్యానం, నిధిధ్యాసం, సమాధి, ప్రాణాయామాది సాధనలకు అనుకూలం.

కనుక అనవసరమైన సంభాషణలు చేయరాదు. వృథాపనుల్లో ఉండరాదు. ఇంద్రియలోలత్వం కూడదు. నోటికీ నాలుకకూ విశ్రాంతి ఇవ్వాలి. అంటే మౌనం, నిరాహారం పాటించాలి. ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి. వృథాగా బయట తిరగడం సూర్య చంద్ర కిరణాలు పొందడం చేయరాదు. సూర్యచంద్రాదులను చూడడానికి ప్రయత్నించరాదు. 

=====================

గాయత్రీ జపం చేయవచ్చా?

చేయవచ్చా కాదు. చేయాలి. చేసితీరాలి. గ్రహణవిముక్తి, మోక్షకాలం వరకూ చేస్తూనే ఉండాలి. కేవలం గాయత్రినే కాదు. ఎన్ని ఉపదేశాలు పొందితే ఆ మంత్రాలు అన్నీ జిపించాలి.

=================================

తర్పణాలు విడువవచ్చా? 

కేవలం తర్పణాలు మాత్రమే కాదు. పిండప్రదానాలు వంటివి కూడా చేయాలి. కనీసం గోసేవ చేసుకొని పెద్దలను పేరుపేరునా తలచుకున్నా చాలు. గ్రహణాలు షణ్ణవతుల్లో భాగం. అంటే పితృదేవతార్చనలు చేయవలసిన తప్పనిసరి రోజుల జాబితా లోనిది. ఈ రోజున పెద్దల పేరిట దానాలు చేసినా తర్పణాలు విడిచినా పెద్దలు అపారంగా సంతోషించి మనసులోని కోరికలు అన్నీ తీరుస్తారు. ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా సంతృప్తి చెందుతారు. నిజానికి పితృశాపాలు, దోషాల నుంచీ విడుదల పొందడానికి జాక్ పాట్ వంటివి. జన్మదోషాలు జాతక దోషాలు కూడా ఈ సమయంలో పితృదేవతార్చనల వలన పోతాయి. దానాలు, తర్పణాదులు చేయలేని వారు కనీసం గోసేవ చేసుకున్నా సమస్త దేవతలూ సంతోషిస్తారు. అన్ని కోరికలూ తీరుస్తారు.

=============================

ఆచమనం చేయవచ్చా?

ఇది మంచి ప్రశ్నే. గ్రహణ కాలంలో నీరు కూడా త్రాగకూడదు. అయితే ఇది అందరికీ చెప్పలేదు. కేవలం కఠినమైన సాధనలు చేసే వారికి మాత్రమే చెప్పారు. గ్రహణ స్పర్శకాలానికి ముందే సంధ్యావందనాదులు ప్రారంభించి గాయత్రీ ధ్యానాదులు, అంగన్యాస కరన్యాసాదులు చేసేసుకొని జపం మొదలు మొదలు పెట్టాలి. గ్రహణ స్పర్శకాలంలోకి జపం చేస్తూ ప్రవేశించాలి. గ్రహణ మోక్షకాలం వరకూ జపం చేస్తూనే ఉండాలి. గ్రహణ మోక్ష స్నానం చేసిన తరువాత కాఫీ టీలు సేవించాలి.

=============================

స్త్రీలు స్తోత్రాలు చదువుకోవచ్చా?

స్త్రీలు స్తోత్రాదులు మాత్రమే చదువుకోవాలి. వారికి జపతపాదులు చెప్పలేదు. అయితే నేడు అనేక మంది స్త్రీలకు కూడా మంత్రోపదేశాలు చేస్తున్నారు. కనుక మంత్రోపదేశం పొందిన వారు కూడా జపాలు చేసుకోవాలి. అయితే స్త్రీలు శివ సహస్రనామం, లలితా సహస్రనామం, లలితా సప్తశతి వంటివి గీతవంటివి చదువుకోవచ్చు. లేదా నామస్మరణను చేసుకోవచ్చు. అంటే బీజాక్షరాలు మంత్రాక్షరాలు లేకుండా కేవలం నామసాధన చేయవచ్చు. లేదా పురాణ గ్రంథాలు చదువుకోవచ్చు. 

గర్భిణీలు, రజస్వలలు ఏమీ చేయకుండా క్రీయాశూన్యంగా పడుకోవాలి.

===================

గ్రహణం సమయంలో ఇంట్లో దీపం వెలిగిఃచాలా?అక్కర్లేదా?

గ్రహణ సమయానికి ముందు, తరువాత జ్యోతి ప్రజ్వలనాలు చేయవచ్చు. కార్తీక మాసం వస్తోంది కనుక స్పర్శా కాలానికి పూర్వమే దీపప్రజ్వలన చేయాలి. మోక్షం తరువాత మరలా జ్యోతి ప్రజ్వలనం చేయవచ్చు.

==================

రాత్రి లేదా పగలు భోజనం కాక పళ్లు ఫలహారం పనికొస్తుందా?


నేడు సూర్యగ్రహణం గ్రస్తాస్తమయం అవుతుంది. అలాగే చంద్రగ్రహణం గ్రస్తోదయం అవుతుంది. అంటే గ్రహణం ఉండగానే సూర్యాస్తమయం అవుతుంది కనుక మరునాడు సూర్యుడిని చూసేంత వరకూ అశౌచం ఉంటుంది. అంటే మరునాడు సూర్యోదయం తరువాతనే మడినీళ్ళు పట్టుకొని వండుకొని తినాలి. అప్పటి వరకూ ఏమీ తిన కూడదూ త్రాగరాదు. అలాగే చంద్రగ్రహణం గ్రస్తోదయం అవుతుంది. అంటే చంద్రోదయానికి పూర్వమే గ్రహణం ప్రారభమవుతుంది. అంటే చంద్రోదయానికి చంద్రుడు గ్రహణంలో ఉంటాడు. కనుక ఆరోజు పగలు భోజనాదులు చేయరాదు. సాయంత్రం చంద్రగ్రహణ మోక్షం తరువాతనే మడినీళ్ళు పట్టుకొని అశౌచ శుద్ధి చేసుకొని వండుకొని తినాలి.

అయితే ఈ నియమాలు అందరికీ వర్తించవు. ముఖ్యంగా పిల్లలకు బాలబాలికలకూ, గర్భవతులకు, దీర్ఘకాలప్రాణాంతక వ్యాథులు ఉన్నవారికి, బిపిలు షుగర్లు వంటి ఉన్నవారికి, వృద్ధులకూ, బాలింతలకు మినహాయింపులు ఉన్నాయి. వీరు పాటించాల్సిన అవసరం లేదు. అయితే గర్భవతులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పాలుతాగే పిల్లలలకు మినహాయింపు ఉంది. తల్లిపాలకు దోషం లేదు. 

ఇక ఆకలికి ఆగలేని వారు దుంపలు, సగ్గుబియ్యంతో చేసినవి, అటుకులతో చేసిన పదార్థాలు పళ్ళు పాలు వంటివి తీసుకొని తీరాలి. గృహస్థులకు శుష్కోపవాసాలు చెప్పలేదు. కనుక ఫలహారాలు సేవించవచ్చు. సేవించాలి. 

=========================

దానాలు  గ్రహణం సమయంలోనా లేక విడిచిన తరువాతా?గ్రహణం సమయంలో అయితే బ్రాహ్మణులు దొరకరు కదా? 

ఈ ప్రశ్నకు సమాధానం శాస్త్రంలో ఉన్నదాని కన్నా ఆచరణలో ఉన్నదానికే ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రహణ సమయంలో ప్రతీ బ్రాహ్మణుడూ గాయత్రినో లేదో ఏదో ఒకసావిత్రినో ఆశ్రయించి జపం చేసుకుంటూ ఉంటారు. కనుక వారు దొరకరు. అయితే నదీనదాలు పుణ్యక్షేత్రాదుల్లో కొందరు బ్రాహ్మణులు గ్రహణకాల సేవల్లో ఉంటారు. కనుక వారి సలహాప్రకారం చేసుకోవాలి.

=====================

ఇష్టదైవం ప్రీత్యర్థంఅనా లేక సూర్య/ చంద్ర ప్రీత్యర్థం అనా జపసంకల్పం చేయాలి?


కేతగ్రస్త సూర్యగ్రహణదినే గ్రస్తాస్తమయ గ్రహణకాలే

రాహుగ్రస్త చంద్రగ్రహణ దినే గ్రస్తోదయ గ్రహణ కాలే అని సంకల్పాలు చెప్పుకొనాలి.

కొంత మంది సూర్యోపారగ, సోమోపారగ అని కూడా చెబుతారు. హిరణ్యశ్రాద్ధాదులు నిర్వహిస్తారు.

https://chat.whatsapp.com/GDbe0UUwmB38nz6GKvSMkS

==================

కామెంట్‌లు లేవు: