4, మే 2023, గురువారం

చార్ ధామ్ యాత్ర

 *🙏చార్ ధామ్ యాత్ర🙏*


*బదరీనాధ్, కేదార్నాధ్, యమునోత్రి, గంగోత్రి, అక్కడ వున్న ప్రముఖ ఆలయాలను చార్ధామ్ గా ప్రసిధ్ధిపొందాయి. చార్ధామ్ యాత్రలో మొదటిది బదరీనాధ్ దర్శనం ముఖ్యమైనది. బద్రీనాధుడు తపస్సు చేసే రూపంలో అనుగ్రహించే, 'బదరికాశ్రమం అనే బదరీనాధ్. ఇది 99వ దివ్య దేశం. అష్టాక్షర మంత్రాన్ని ప్రపంచానికి ఉపదేశించిన మహావిష్ణువు వెలసిన ప్రదేశం. ఈ దేవాలయం అలక్ నందా కుడి ప్రక్క నదీతీరాన నర నారాయణ శిఖరాలకి మధ్యన వున్నది. ఈ ఆలయానికి వెనుక భాగాన ఎత్తైన నీలకంఠ శిఖరం దర్శనీయం. చమోలీ నుండి ఇక్కడికి వెళ్ళడానికి నాలుగున్నర గంటల సమయం పడుతున్నది. మార్గంసక్రమంగా వుండదు. ఆ సన్నటి మార్గాన ఒక బస్సు మాత్రమే ప్రయాణించగలదు. డ్రైవర్ లు తమ వాహనాలను అతి జాగ్రత్తగా నడపవలసి వున్నది. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా, అతళ పాతాళమే. ఒక ప్రక్కన అతి లోతైన లోయలు, మరొక ప్రక్కన ఎత్తైన కొండ శిఖరాలు. ఆ మార్గంలో ప్రయాణం భయంగానే వుంటుంది. భగవంతుని మీద భారంవేసి భయంకరమైన మార్గం గుండా ప్రయాణిస్తారు. హిమంతో కప్పబడిన ఎత్తైనశిఖరాలు , దట్టమైన అడవులు వెండి అంచుల్లాగ ఎత్తైన శిఖరాల నుండి, జలజల పారే జలపాతాలు, చిన్న చిన్న సెలయేళ్ళు, కొన్ని ప్రదేశాలలో ప్రశాంతంగా ప్రవహించేనదులు, మరి కొన్ని ప్రదేశాలలో ఉధృతంగా ప్రవహించే నదుల మధ్య నుండి ఒంపులుగా సాగే సన్నటి బాట, కొండ చరియలు, పచ్చని రమణీయమైన కన్నులను, మనసులను రంజింపచేస్తాయి. నాలుగు వైపులా హిమాలయశిఖరాలైన నీలకంఠ పర్వతం, ఊర్వశి పర్వతం, నర  నారాయణ పర్వతాలతో ప్రకృతి అత్యంత సుందరంగా దర్శనమిస్తుంది. శ్రీమహావిష్ణువు నరనారాయణులుగా అవతరించి ఈలోక క్షేమంకోసం దీర్ఘతపమాచరించిన సమయంలో, ఆయన తపోభంగానికై దేవేంద్రుడు అప్సరసలను పంపాడు. తక్షణమే మహావిష్ణువు ఆ అప్సర్సల అహంకారం అణచడానికి, దేవేంద్రునికి పాఠం చెప్పడానికి, తన తొడ నుండి మహాసౌందర్యరాశియైన ఊర్వశిని ఆవిర్భవింప చేశాడు. ఊర్వశి అందాన్ని చూసి ఇంద్రుడి అప్సర్సలు సిగ్గుపడి తమ అహంకారాన్ని వదిలారు. దేవేంద్రుడు తప్పు తెలుసు కున్నాడు. ఇందువలన బదరీ నారాయణ ఆలయం 'ఊర్వశిపీఠం" అని పిలువబడుతున్నది. ఆలయానికి దక్షిణాన ఊర్వశికి కూడా ఒక ఆలయము వున్నది. పిదప నరనారాయణులు ఊర్వశిని దేవేంద్రుని నగరానికి పంపి వేశారు. ఊర్వశి దేవేంద్రుని సభలో నర్తకిగా వున్నది. నారదుడు ఈ స్ధలంలోనే, జ్ఞానాన్ని,యోగాన్ని, సంగీతకళలలో అద్భుతమైన ప్రజ్ఞ సంపాదించినందున, దీనికి నారదక్షేత్రం అనే పేరు కూడా వచ్చింది. జనమేజయుడు స్త్రీ వ్యామోహంతో,  సర్వ నాశనమవుతున్నప్పుడు వ్యాస భగవానుడు హితవు పలికి జ్ఞానబోధ చేసిన స్ధలమూ ఇదే. సంస్కృతంలో " బదరీ" అంటే రేగి పళ్ళు అని అర్ధం. ఈస్ధలం రేగి ఫలవనంగా వుంటుంది. ఇక్కడ మహా విష్ణువు తపమాచరిస్తున్నప్పుడు, ఆయనను సూర్యరశ్మి తీక్షణత నుండి కాపాడడానికి,మహాలక్ష్మీ అరవిందవల్లీతాయార్ అనే పేరుతో, తానే రేగువృక్షంగా అవతరించింది. ఇక్కడి శ్రీమహావిష్ణువు సాలగ్రామ విగ్రహం. తొమ్మిదవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు నారద గుండం నుండి, తీసుకుని వచ్చి ప్రతిష్టచేశారు. ఆదిశంకరాచార్యులవారు తప్తగుండానికి గరుడశిలకి మధ్యన ప్రతిష్టించారు. కుష్టు వ్యాధితో బాధ పడుతున్న గర్వాల్ మహారాజు, వరదరాజాచార్యులనే తన గురువు ఆదేశాను సారం ఇప్పుడు వున్న మూలస్ధానంలో విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. దాని ఫలితంగా ఆ మహారాజు వ్యాధి నుండి విముక్తుడైనాడు. వైకుంఠానికి ప్రవేశ ద్వారము బదరీనాధ్. ఆరు మాసాలు హిమపాతంతో కప్పబడి వుంటుంది. ఆసమయంలో దేవతలు వచ్చి పూజలు చేస్తారని ఐహీకం. ఈ స్ధలానికి 'బదరీ విశాల్' అనే పేరు వున్నది. బదరీనాధుని దర్శించని వారికి  ముక్తి లభించదని ఋగ్వేదంలోని కొన్ని వాక్కులు ఇక్కడ వ్రాసి వున్నవని భక్తుల విశ్వాసం. బదరీనాధుడు, బదరీశ్వరునిగా పిలువబడుతున్నాడు. ఈస్వామి వైష్ణవులకు వైకుంఠవాసునిగాను, శైవులకు పంచముఖ శివునిగాను, శక్తిని ఉపాసించే శాక్తేయులకు కాళిగాను, బౌద్ధులకు శాక్యమునిగాను, జైనులకు తీర్ధంకరునిగాను దర్శనమిస్తున్నట్లు నమ్మకం. ఆలయం తూర్పు ముఖంగా వుంటుంది. గర్భగుడిలో రెండడుగుల ఎత్తున బదరీనాధుడు, ధ్యాన ముద్రలో దర్శనమిస్తున్నాడు. గర్భగుడి సమీపమున 'ధర్మశిలా' అనే హుండి,హోమగుండం వున్నవి. కుడి ప్రక్కన నిలబడిన మూర్తులుగా నర నారాయణులు, ఎడమ ప్రక్కన కుబేరుడు, వినాయకుడు దర్శనమిస్తున్నారు. మహావిష్ణువు ముందర నారదుడు, మహావిష్ణువు విగ్రహానికి పైన సూర్యచంద్రులు వున్నారు. నల్లని సాలగ్రామ విగ్రహంగా వున్న బదరీనాధునికి పాలాభిషేకం, తేనె అభిషేకముజరుగుతాయి. సాయంకాలం శింగార దర్శన సమయానసహస్రనామములు.గీతగోవిందములతోస్తుతిస్తారు.ఆదిశంకరాచార్యులవారు నియమించిన నంబూద్రీ వంశం వారే ఈనాటికి యీఆలయ అర్చకులు. ఆలయంలో, మహాలక్ష్మీకి ఘంటాకర్ణునికి ప్రత్యేక సన్నిధులు వున్నవి. నారద,ఉధ్ధవనరనారాయణు సన్నిధులు వున్నవి. ఆలయం లోపల ఆదిశంకరాచార్యుల వారి చిత్రం, ఆయన తపస్సు చేసిన గుహ, కల్పవృక్షం వున్నాయి. ఆలయ ముఖ ద్వారము వద్ద మహావిష్ణువు యొక్క దశావతారాలు చిత్రీకరించబడిన పది స్ధంభాలు వున్నాయి. గరుత్మంతుని విగ్రహం అందంగా అమర్చబడి వుంటుంది. సమీపాన వినాయకుని విగ్రహం, హనుమంతుని విగ్రహం ప్రతిష్టింపబడి వుంటాయి. గర్భగుడి విమానము బంగారంతో నిర్మించబడినది. సభా మండపము నుండి భక్తులు బద్రీనాధుని దర్శించుకోవాలి. కట్నం చెల్లించిన దర్శనార్ధులకు మాత్రం గర్భగుడి ముందు మండపం నుండి దర్శించుకోవడానికి అనుమతి ఏర్పాట్లున్నాయి. ధర్మదర్శనం చేసుకునేవారు. వెలుపల మండపంలో వరుసలలో నిలబడి దర్శించుకోవాలి. విష్ణు సహస్రనామ పూజలో పాల్గొంటే, ఇరవై నిమిషాలు భగవంతుని మనసారా దర్శించే అవకాశం లభిస్తుంది. వరాహశిల, నారదశిల, న‌సింహశిల, గరుడశిల అనే పంచ శిలలు ఇక్కడే వున్నాయి. ఈ శిలలు తప్తగుండం పైన వున్నాయి. వాటి చుట్టూ ప్రహ్లాదధార, కూర్మధార, ఊర్వశిధార, భృగుధార, ఇంద్రధార అనే ఐదు జలధారలు ఎత్తు నుండి పడుతూంటాయి. పితృ తర్పణాలు వదలడానికి అలక్ నందా నదీ తీరాన బ్రహ్మ కపాలమనే స్ధలం వున్నది. పరమశివుడు బ్రహ్మ ఐదవ తలను ఖండించినప్పుడు ఆతల పరమశివుని చేతిని అంటుకుపోయింది, ఆతల ఇక్కడకు రాగానే క్రింద పడిపోయినది. అందువలన ఈ ప్రాంతానికి బ్రహ్మ కపాలమనే పేరు వచ్చింది. ఈ ప్రదేశంలో పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తే వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్తారు. తప్తగుండంలో పొగలు గ్రక్కే వేడి నీరు వుంటుంది. భగీరధుని కోసం పరమశివుని కపాలము నుండి ఉధ్భవించిన గంగ అవడం వలన ఉష్ణ గుండమైనదని చెప్తారు. ఈ గుండంలోని జలం ఓషధీ గుణాలు వున్నందున ఈ గుండంలో స్నానం చేస్తే వ్యాధులు గుణమౌతాయని భక్తుల ధృఢ విశ్వాసము. నవంబర్ ఆలయం మూసిన పిదప ఆరుమాసముల పాటు ఉత్సవ విగ్రహాలను క్రిందనున్న జోషీ మఠానికి తీసుకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆలయం మూయడానికి ముందు స్వామిసన్నిధిలో వెలిగించిన దీపం ఆరు మాసముల తర్వాత మరల ఆలయం తలుపులు తెరిచే దాకా వెలుగుతూ వుండడం అద్భుతమైన, ఆశ్చర్యకరమైన విషయం🙏.*

కామెంట్‌లు లేవు: