17, జులై 2020, శుక్రవారం

శ్రీకృష్ణ కర్ణామృతం

ఒకనాడు కృష్ణుణ్ణి వాళ్ళమ్మ యశోద ఉయ్యాలలో పడుక్కోబెట్టి నిద్రపుచ్చుతోoది. ఎంతసేపటికి నిద్ర రావడం లేదు. సాధారణంగా పిల్లలకు నిద్రపట్టనప్పుడు తల్లులు పాటలు పాడడం గాని కథలు చెప్పడం గాని చేస్తూ ఉంటారు. అందువల్ల ఆమె ఒక కథ చెప్పడం ప్రారంభించింది. ఆ బిడ్డ పదునాలుగు భువనాలు తన బొజ్జలో దాచుకున్న వాడు . అందుకనే ఆ తల్లిది అదృష్టం అన్నారు అంతా .

" ఈ జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా యేమి నోము నోచె ఈ యశోద " అంటూ !
అవును ఆ అమ్మ యశోదమ్మే ! ఆ అల్లరి వాడు , గొల్ల వాడు , రేపల్లె బాలుడు మన క్రిష్ణయ్యే !రోజు రోజుకీ అల్లరి పెరిగిపోతుందనేమో అల్లరి క్రిష్ణయ్యకి రాముడి కధ చెప్తోంది . గోపాల బాలుడికి కోదండ పాణి కధ. గీతాకారుడికి సీతాపతి కధ .

ఆ కధ మనం చెప్పుకుందాము.

రామో నామ బభూవ ‘హూం ‘ తదబలా సీతేతి ‘హూం ’ తాం పితు
ర్వాచా పంచవటీ వనే విహరతస్తామాహరద్రావణ:
నిద్రార్ధం జననీ కధామితి హరే: హూంకార శృణ్వతః
సౌమిత్రే! క్వ ధనుర్ధనుర్ధనురితి ప్రోక్తా: గిర: పాంతు వ: -శ్రీ కృష్ణ కర్ణామృతం

అనగనగా పూర్వం రాముడనే రాజుండేవాడు అంది . కృష్ణుడు ఊ ! అని ఊ కొట్టేడు . ఆయనకొక భార్య ఉంది ఆమె పేరు సీత అంది . మళ్ళా ఊ ! అని ఊకొట్టేడు. వాళ్ళిద్దరూ తండ్రి దశరథుని ఆజ్ఞననుసరించి అయోధ్యను విడిచి అడవుల్లో సoచరిస్తూ ఉండగా అక్కడ పంచవటీవనప్రదేశంలో సీతను రావణుడు అపహరించాడు అంది.
ఈ విధంగా వాళ్ళమ్మ చెబుతున్న తన పుర్వకథనే తన్మయత్వంతో వింటూ ఉండడం వల్ల గతం అంతా జ్ఞాపకం వచ్చేసింది. ప్రస్తుతం తానెవరో మరిచిపోయాడు. తక్షణం రాముడైపోయాడు . అంతే వెంటనే ఒక్క ఉదుటున ఉయ్యాలలోంచి బయటకు దూకి ఆవేశపరవశుడై “ ఓలక్ష్మణా | నా ధనుస్సు (కోదండం) ఎక్కడ ? నా ధనుస్సు ఎక్కడ ? నా ధనుస్సు ఎక్కడ ? అని గట్టిగా అరుస్తున్నాడు. ఈ విధంగా పరవశత్వంతో రామునివలే పలికిన ఆ బాలకృష్ణుని పలుకులు మనలను రక్షించు గాక అని కృష్ణకర్ణామృతకర్త లీలాశుకుడు ఆ అందమైన శ్లోకం రచించాడు .

సీతమ్మ పేరు చెప్పగానే కృష్ణయ్య రాముడయ్యాడు . అనుజుడు లక్ష్మణుడినీ తలుచుకున్నాడు .

ఈ పద్యానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చక్కని వ్యాఖ్యానం చేశారు.

ఇంత చక్కటి పద్యం తెలుగు లో చదువుకుంటే బాగుంటుంది కదా ! ద్రాక్షారామం లో జరిగిన శతావధానం లో గరికపాటి వారికి చక్కటి సమస్య ఇచ్చారు .

ఈ పద్యం స్ఫూర్తి తోనే వారూ పూరించారు

సమస్య : ధనువుందీయుము లక్ష్మణా యని యశోదాసూనుడాత్రంబుగన్

పూరణ :

తనువన్ వాల్చిన బాల కృష్ణుని యశోదా దేవి గీతంబులం
దున జోల్వాడుచూ రామ గాధల మహత్తు( దెల్ప ఊ కొట్టుచున్
దనుజేంద్రుడా జనకాత్మజన్ గొనెనాన్ ఆత్రంబునన్ లేచి నా
ధనువుందీయుము లక్ష్మణా యని యశోదాసూనుడాత్రంబుగన్ !

ఇంతటి మహత్తర శ్లోకాలు, పద్యాలు చదువుకొనడానికి, మళ్ళీ మళ్ళీ ఆ వ్యాఖ్యానాలు మననం చేసుకోవడానికి సమయం లభించిన మనం కూడా అదృష్టవంతులమే.

కామెంట్‌లు లేవు: