17, జులై 2020, శుక్రవారం

కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్"..

ఈ పద్యం విన్నారా.. ఎప్పుడైనా?

ఒకసారి తెనాలి రామకృష్ణ కవికి రాయలవారు ఇచ్చిన సమస్య ఇది. 

"కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్". (అంటే ఏనుగుల గుంపు వెళ్లి దోమ గొంతులో ఇరుక్కొన్నదని అర్థం).

ఈ పద్యపాదాన్ని పూర్తిచేయమన్నారు.
అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.. రామకృష్ణుడు దానిని ఎలా పరిష్కరిస్తాడోనని...
ఆయన చతురత తెలిసిందే కదా!

"రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు గొల్వ పాల్పడి రకటా
సంజయా! యేమని చెప్పుదు ?
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్"

★ ఈ పద్య భావం :       

మహాభారతంలో  బలవంతులైన పాండవులు (పాండవులని ఏనుగులతో పొల్చుతూ).. , కౌరవులతో జూదంలో ఓడిపోయి, ఒక చిన్న సామంత రాజైన విరాట రాజు (విరాట రాజుని దోమతో పోల్చారు) కొలువులో చేరి అజ్ఞాతవాసంతో పనిచెయ్యవలసి వచ్చింది. ఓ రాజా ఇది ఏనుగుల గుంపు వెళ్లి దోమ గొంతులో కూర్చోవటం కాక మరేమిటి? అని ఆ సమస్యను పూరించారట.
సభలో ఎవ్వరికీ నోటమాట రాలేదు. రాయలవారు స్వయంగా రామకృష్ణ కవిగారిని ఆలింగనం చేసుకొని ప్రశంసించారట!

ఈ పద్యభావానికి అనుగుణంగా నేటి పరిస్థితి

ఈ భూమండలం మీద తానే మహా బలవంతుడనని, క్రూర మృగాలను జయించి ప్రక‌ృతిని గెలిచానని.. మహా సాగరాలను ఈది, మహా పర్వతాలను అధిరోహించిన మహా మేధావినని విర్రవీగిన మనిషి.. చివరకు కంటికి కనిపించని మహా సూక్ష్మ జీవికి లొంగిపోయి దానికి దొరక్కుండా గూట్లోకి దూరి దాక్కున్న వైచిత్రికి ఈ పద్యం అద్దం పడుతోంది కదా..

అందుకే.. మహాబలాఢ్యుడిని అనుకున్న మనిషిని ఇప్పుడు ప్రకృతి పరికించి చూస్తోంది.. పరిహాసం చేస్తోంది. 

ఆధిపత్యం ప్రదర్శించిన మనిషి తిరిగి తన మూలాల్లోకి.. గుహల్లోకి.. గ‌ృహాల్లోకి వెళ్లిపోవడంతో వన్య ప్రాణులు తిరిగి ప్రకృతి ఒడిలోకి చేరుకుంటున్నాయి.

★ థాయ్‌లాండ్ వీధుల్లోకి అడవి కోతులు ప్రవేశించి యథేచ్ఛగా తిరుగుతున్నాయి..

★ జపాన్ రోడ్ల మీద సికా జింకలు షికారు చేస్తున్నాయి..!

★ కాలిఫోర్నియా వీధుల్లో టర్కీ కోళ్లు సామూహికంగా విహరిస్తున్నాయి..

★ మన కోయంబత్తూరు రోడ్ల మీదకు అడవి జింకలు వచ్చి దర్జాగా తమ పూర్వ ప్రదేశాన్ని ఆక్రమించుకున్నాయి..

★ కొజికోడ్ వీధుల్లో పట్టపగలే అడవిపిల్లులు రాజ్యమేలుతున్నాయి.

★ నోయిడా రాచవీధిలో నీల్గాయ్‌లు తిరుగుతున్నాయి..

★ బెంగళూరు బస్ స్టాండు ఇప్పుడు పావురాల ప్రపంచమైపోయింది..

★ తిరుమల ఘాట్‌రోడ్లు.. మాడవీధులు జింకలకు ఆవాసమయ్యాయి.

ఇక్కడా అక్కడా అనిలేదు..

★ లండన్ నుంచి లాస్ ఎంజెల్స్ వరకు.. న్యూయార్క్ నుంచి న్యూ సౌత్ వేల్స్ వరకు.. టోక్యో నుంచి టోరోంటో వరకు..

ఎటు చూసినా.. మనిషి అహంభావానికి, స్వార్థానికి ప్రతీకలుగా నిలిచిన కాంక్రీట్ జంగిల్స్‌లో తిరిగి తమ మూలాలను వెతుక్కుంటూ.. తాము కోల్పోయిన వనాలను గుర్తుచేసుకుంటూ వన్య ప్రాణులు వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నాయి.

అర్ధనగ్న, పూర్తి నగ్న దృశ్యాలతో చెలరేగి.. బీరు సీసాలు, వైన్ గ్లాసుల చప్పుళ్లతో, అర్థంలేని వీరంగాల రణగొణ ధ్వనులతో నిన్నటిదాకా మారుమోగిన సాగర తీరాలు, ప్రేమికుల దినోత్సవాలతో, ఫ్లైయింగ్ కిస్సులతో, హాట్ హగ్గులతో బిత్తరపోయిన ఐఫిల్ టవర్లు, ఉద్యమాలతో దద్దరిల్లిన తియనాన్మెన్ స్వ్కేర్‌లు, కార్నివాల్స్‌తో చిత్తయిపోయిన సాల్వడార్లు ఇప్పుడు నిర్మానుష్యమైపోయాయి.

ఇప్పుడక్కడ అడవితల్లి ముద్దుబిడ్డలు.. కపట మెరుగని మూగజీవాలు ఆటలాడుకుంటున్నాయి!

ఓ మనిషీ.. భూమి, ఆకాశం, గాలి, నీరు.. అన్నీ.. ఈ జగత్తు మొత్తం నీ ఒక్కడి సొత్తే అన్నట్టు ఆక్రమించావు.

అడవుల్లోని జంతువుల నుంచి.. ఆకాశమార్గాన సాగిపోయే స్వేచ్ఛా విహంగాల నుంచి మహా సాగరాల్లోని తిమింగలాల వరకు అన్నింటినీ జయించావు.. ఇష్టారాజ్యంగా వధించావు.. ప్రకృతిని  దోచావు .

ఇప్పుడు కంటికి కనిపించని అతి సూక్ష్మజీవికి భయపడి దుప్పటి తన్నేశావు.. ముక్కుకు ముసుగేశావు.. నిజంగానే "కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్"అన్నట్లు నీ మూలాల్లోకి వెళ్లిపోయి గుహల్లో దాక్కున్నావు. నీ అసలు ముసుగు తొలగిందిలే..

ప్రక‌ృతి ముందు నువ్వు ఎప్పటికీ అంగుష్ఠమాత్రమేనని అర్థమైందిలే!!

ఇప్పటికైనా మేలుకో... కనీసం అయిదూళ్లయినా మాకివ్వు అంటున్నాయి ఆ అడవి జీవాలు.

ఈ సమస్త భూమండలం మీదా నీతోపాటే తమకూ సమాన హక్కులున్నాయని గుర్తుచేస్తున్నాయి ఈ వన్య ప్రాణులు.  తాము కేవలం ఆకలి తీరడానికి.. కడుపు నింపుకోడానికి మాత్రమే వేటాడతామని.. అదీ కేవలం ఆగర్భ శత్రువుతోనే తలపడతామని.. నీలా సర్వభక్షకులం కాదని కాకూడదని హెచ్చరిస్తున్నాయి ఈ మూగ జీవాలు.

ఇప్పటికైనా మేలుకొని సంధికొస్తే సరి.. కాదూ, కూడదూ.. సూది మొన మోపినంత భూమి కూడా లేదు అనే అనేశావంటే.. ప్రక‌ృతి చేసే కురుక్షేత్రంలో బలైపోతావు సుమా!!

కామెంట్‌లు లేవు: