14, డిసెంబర్ 2021, మంగళవారం

మార్గశీర్ష శుద్ధ ఏకాదశి

 మార్గశీర్ష శుద్ధ ఏకాదశి #గీతాజయంతి గా ఆచరిస్తున్నాము. లౌకిక భాషలో చెప్పాలంటే ఆరోజు భగవద్గీత పుట్టినరోజు అని అర్థము. కాని వాస్తవంగా ఆ రోజున భగవద్గీత పుట్టలేదు, ఆవిర్భవించినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేసినాడని ఈనాడు అనగా మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పినాడు. కౌరవపాండవ యుద్ధం ప్రారంభమైన తరువాత పదియవనాడు ధృతరాష్ట్రుడు సంజయునితో 


”ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ: మామాకా: పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ” ప్రశ్నించాడు.


యుద్ధమునకు తలపడిన నావాళ్ళు అయిన కౌరవులు పాండవులు యేమి చేసిరి అని ప్రశ్న. ఆ సందర్భమున వ్యాసభగవానుడు సంజయునకిచ్చిన, ‘యుద్ధరంగమును ప్రత్యక్షముగా చూచుట’ అను వరము వలన జరిగినదంతా చూచి ధృతరాష్ట్రునకు వివరించినాడు. ఆ సంరద్భముననే భగవానుడు చేసిన గీతోపదేశమును కూడా సంజయుడు వివరించినాడు. ఇట్లు ఆరోజు గీతలోకమునకు వెలువడినది. అందువలన గీతాజయన్తిగా మనం ఆనాడు జరుపుకుంటున్నాము.భగవద్గీత భగవానుడు స్వయముగా చెప్పినది. 


‘గీతా సుగీతాకర్తవ్యా కిమన్యై: శాస్త్రసంగ్రహై: 

యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిర్గతా’ 


అనునది గీతా ప్రశస్తి.


 ఒక భగవద్గీత అధ్యయనం చేస్తే చాలు, ఇతర శాస్త్రాభ్యాసాలెందుకు, ఆ గీత పద్మనాభుని ముఖ పద్మము నుండి వెలువడినది అని భావము. అసలు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశమును ఎందుకు చేశాడు అంటే ఇలా చె ప్తున్నారు.


ఆస్థాన స్నేహకారుణ్య ధర్మాధర్మధియాకులం పార్ధం

ప్రపన్న ముద్ధిశ్య గీతా శాస్త్రం ప్రవర్తితమ్‌ 


అని అనగా ఉండకూడని చోట చూపకూడని చోట స్నేహమును కరుణ చూపుచున్నాడు అర్జునుడు. ధర్మాన్ని అధర్మముగా, అధర్మాన్ని ధర్మముగా భావించి అన్యదా జ్ఞానముతో విపరీత జ్ఞానముతో అనగా ఒక దాన్ని ఇంకోదానిగా భావించి కలత చెందిన బుద్ధితో నున్న అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ”శిష్యస్తేహం శాధిమాల త్వాం ప్రపన్నం” అని శరణు వేడ గా గీతాశాస్త్రమును ప్రవర్తింపచేసినాడు.గీతా శాస్త్రమును ప్రధానముగా బోధించు తత్త్వము శరీరాత్మ విజ్ఞానము అనగా శరీరము చేసే పనితో ఆత్మకు సంబంధము లేదు. శరీరము చేసేదాన్ని ఆత్మ చేసినది అనుకోవటమే అహంకారము. శరీరమునకు కావలసిన వారిని ఆత్మకు కావలసి నవారిగా భావించుట మమకారము. సంసారమనే సర్పాన్నికి అహంకారమమకారములు రెండు కోరలు. రెండు కోరలు తీసేస్తే పాము కాటు వేయజాలదు. అహంకారమమకారములను వదిలివేస్తే సంసారమును చేయజాలము. చేయుచున్నది నేను కాదు, భగవానుడు చేయించుచున్నాడు.


ఈశ్వర స్సర్వ భూతానాం హృద్దాణే అర్జున తిష్ఠతి భ్రామయన్సర్వ భూతాని యంత్రారూఢాని మాయయా


 అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. 


ప్రతిప్రాణి హృదయమున పరమాత్మ ఉన్నాడు. తన సంకల్పముతో సకల భూతములను యంత్రములపై ఉన్నవానిని త్రిప్పుచున్నాడు. ఇట్లు అందరి చేత అన్ని పనులను చేయించువాడతడే అన్ని ఫలితములను పొందువాడు అతడే. అందుకే స్వామి నాకు కర్మ చేయుటలోనే అధికారము, ఫలముల యందు కాదు అన్నాడు. అన్ని పనులు చేయుచున్నది శరీరము కదా. శరీరమునకే ఫలము ఉండదు తృప్తి, సంతోషము, అనుభూతి, మనస్సునకు బుద్ధికి ఇంకా చెప్పాలంటే భావనతో ఆత్మకు అవేమీ పని చేయుట లేదే. పని చేస్తున్నదానికి ఫలితం రావటం లేదు. ఫలితం పొందుచున్నవి పని చేయుట లేదు, ఇది యదార్ధజ్ఞానము. ఇది కలిగిన నాడు శోకము, దు:ఖము, సంతోషము కలుగవు. అన్ని ఫలితాలు పరమాత్మవే అన్ని కర్మలు చేయించేవాడే పరమాత్మ. అతను చేయిస్తున్నాడు, దీనికి మన శరీరము సాధనము. స్పూన్‌ గరిటెలాగా. గరిట పాయసంలో తిప్పినా పప్పులో తిప్పినా కూరగాయితో తిప్పినా తిరగటమే దాని పని కాని ఇది తియ్యగా ఉంది ఇది కారంగా ఉన్నది అనదే. పాయసంలో గరిటలా సంసారంలో జీవుడు తిరుగుచున్నాడు, అతనికి కష్టము లేదు సుఖము లేదని తెలియాలి. నిత్యము కార్యశీలివి కావాలి ఫలశీలికాదు. పని నీవు చేయాలి ఫలమును నాకర్పించాలి. ఫలము నాకర్పించిన నాడు పుణ్యము పాపము నీది కాదు. స్వర్గము, నరకము నీకు రాదు. నాలోకమే పరమపదమే లభిస్తుంది. స్వార్థాన్ని వదిలిపట్టి పరార్థాన్ని, పరమార్థాన్ని భావించిన నాడు సుఖదు:ఖాలు, రాగద్వేషాలు, ఆశాపాశాలు, లాభనష్టాలు యేమీ ఉండవు. ఇవేమీకానపుడు సంతోషం యెందుకు ? విచారం యెందుకు? స్థిర చిత్తముతో, స్థిర ప్రజ్ఞుడవై వ్యవహరించుము నన్ను శరణువేడుము. ఫలాన్ని ఇచ్చేవాణ్ణి, పనిచేయించేవాణ్ణి నేనే నీ యోగక్షేమములను నేను వహిస్తాను. ఇది గీతాసారము.


గీతము సరియైన గురువుల వద్ద అధ్యయనం చేస్తే ఇది చక్క‌ని వ్యక్తిత్వ వికాసమును కలిగిస్తుంది అందరిలోను పరమాత్మ ఉన్నాడు అని తెలిసిననాడు ఎవరినీ ద్వేషించజాలవు. అందరినీ ప్రేమిస్తావు. ఇదియే విశ్వప్రేమ, లోకకళ్యాణము. గీతను అర్థముతో చదువువారు. వీలుకాకుంటే ఒక మూలమే చదవండి. గాంధీజీ విజయానికి అహింసా మార్గానికి ఆధారం గీతే. వివేకానందుని విశ్వ విజయానికి మూలము గీతయే. వల్లభాయ్‌ పటేల్‌ను ఉక్కు మనిషిని చేసింది, లాల్‌ బహుదూర్‌ శాస్త్రిని జైజవాన్‌ జైకిసాన్‌ అనిపించినది గీతయే. అహింసామార్గం శాంతి మార్గానికి నిర్వచనం చెపునది గీతయే. రాజేంద్రప్రసాద్‌ భారత ప్రథమ రాష్ట్రపతి జేబులో గీతయే ఉండేది. జేబులో ఉండాలి మనలో ఉండాలి బుద్ధిలో ఉండాలి రోజూ ఒక శ్లోకమైనా చదువుతాము. గీత చెప్పిన వాటిలో ఒక్కటైనా ఆచరిస్తాము అని ప్రతిజ్ఞ చేసి ఈనాటి నుండి ఆచరించాలి. ఇదే భారతీయ గీతకు చేయు నిజమైన నిస్వార్థమైన ఆరాధన. అలా చేద్దాం చేయిద్దాం.


భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజును #గీతాజయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజుగా జరుపుకొంటారు. గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.


గీకారం త్యాగరూపం స్యాత్

తకారమ్ తత్వబోధకమ్

గీతా వాక్య మిదమ్ తత్వం

జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:


గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. "గీ" అనే అక్షరం త్యాగాన్నిను బోధించుచున్నది. "త" అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు. త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది. అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ, బంధమునుండి విముక్తి కలగటం అనే అర్థం వుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశించుచున్నది. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం మొదలెడదాం.


సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః

పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్


ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా,అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా, ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి, ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే, మరొపక్క లొకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందిచాడట. అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వతకాలమూ అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి, ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో, అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు, 


మన వర్త్మానువర్టంతే మనుష్యాః పార్థ సర్వశః. 


అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను.


వాసాంసి జీర్ణాని యథా విహాయ

నవాని గృర్ణోతి నరో పరాణి

తథా శరీరాణి విహాయ జీర్ణా

న్యన్యాని సంయాతి నవాని దేహీ


చిరిగిపోయిన పాతబట్టలను విడిచి మనుషులు ఇతర కొత్తబత్తలను ఎలా ధరిస్తున్నాడో అలాగే దేహియనే ఆత్మా కూడా శిథిలమైన పాత శరీరాలను వదిలి ఇతరములైన కొత్త శరీరాలను ధరించుచున్నాడు.


నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః

న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః


ఈ ఆత్మను ఆయుధములేవీ కూడా ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి ఎండింపజాలదు.


కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన

మా కర్మఫలహేతుర్భూర్మాతే సజ్గో స్త్వకర్మణి


అర్జునా! నీకు కర్మను చేయటంలోనే అధికారము వుంది. కర్మఫలాలను ఆశించుటలో ఏనాడూ కూడా నీకు అధికారము లేదు. కర్మఫలాలకు నీవు కారణభూతుడవు అవ్వకు. మరియు కర్మలు మానుటలో కూడా నీకు ఆసక్తి కలుగాకుండుగాక.

 

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యాహమ్


ఓ అర్జునా! ఎప్పుడెప్పుడు ధర్మమూ క్షీణించి, అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో, అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ వుంటాను.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

సాదు, సజ్జనులను సంరక్షించటం కోసం, దుర్మార్గులను వినాశం చేయడానికి, ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను.


కృష్ణుడంటాడు..


"ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్ధ దర్పణం..." అని, 


అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థాలకు అద్దం వంటిది. దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణపదం పొందుతారు. భగవద్గీత సారం అర్దమైతే మనం ఎవరిని ద్వేషించము. అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని, ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్టేనని అంటాడు కృష్ణుడు. ఈలోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలుపెడితే అభిమానించడానికి మంచివారు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలుంటాయి. మనం వ్యక్తిని ద్వేషించడం కాదు, చెడు లక్షణాలను, చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవరచుకోకుండా ఉంటాము.


నిజమైన దేవుడు ఆయనను నమ్మినా, నమ్మకున్నా ఎవరినీ ద్వేషించడు, ద్వేషించమని చెప్పడు. అందరిని మంచిగా బ్రతకమనే చెప్తాడు. గీతలో పరమాత్మ కూడా అందరు సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు. అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి ఒక కాంతికిరణం, ఒక ఆశాపుంజం. భగవద్గీతను చదవడం కాదు, అర్ధం చేసుకుంటే మన జీవితం సార్ధకమవుతుంది. అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాని అర్ధం చేసుకుని జీవితంలో అనుసరించినా, కొద్దిగా గంగాజలం త్రాగినా, కృష్ణపరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు. వారికి మోక్షం లభిస్తుంది.


గీతాజయంతి రోజున భగవద్గీత పుస్తక పఠనం, దానం విశేష ఫలాన్ని ఇస్తుంది.. 


        🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏

కామెంట్‌లు లేవు: