14, డిసెంబర్ 2021, మంగళవారం

*గీతా జయంతి

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

నేడు…


              *గీతా జయంతి*

                 ➖➖➖✍️


*గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు.* ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం *మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు* జరుపుకొంటారు. గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.


*గీకారం త్యాగరూపం స్యాత్*

*తకారమ్ తత్వబోధకమ్*

*గీతా వాక్య మిదమ్* *తత్వం*

*జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:*



*గీత* అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. *"గీ"* అనే అక్షరం త్యాగాన్ని ను బోధించుచున్నది. *"త"* అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు. త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది . అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ , బంధమునుండి విముక్తి కలగటం అనే అర్థం వుంది. ఈ పరమ *రహస్యాన్నే గీతాశాస్త్రము* ఉపదేశించుచున్నది. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము *మార్గశిర శుద్ధ ఏకాదశి.* ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం ప్రారంభించండి.


*సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|*

*పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్||*

ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన *బ్రహ్మవిద్య భగవద్గీత.* అందుకే అంటారు , *సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా , అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా , ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి , ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే , మరోపక్క లోకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందిచాడట.* అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వతకాలమూ అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి , ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో , అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు , మన *వర్త్మానువర్టంతే మనుష్యాః పార్థ సర్వశః.* అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను.

 

*వాసాంసి జీర్ణాని యథా విహాయ*

*నవాని గృర్ణోతి నరో పరాణి*

*తథా శరీరాణి విహాయ జీర్ణా*

*న్యన్యాని సంయాతి నవాని దేహీ*

చిరిగిపోయిన పాతబట్టలను విడిచి మనుషులు ఇతర కొత్తబట్టలను ఎలా ధరిస్తున్నాడో అలాగే దేహియనే ఆత్మా కూడా శిథిలమైన పాత శరీరాలను వదిలి ఇతరములైన కొత్త శరీరాలను ధరించుచున్నాడు.


*నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః*

*న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః*


ఈ ఆత్మను ఆయుధములేవీ కూడా ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు , నీరు తడుపజాలదు , గాలి ఎండింపజాలదు.


*కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన*

*మా కర్మఫలహేతుర్భూర్మాతే సజ్గో స్త్వకర్మణి*


అర్జునా ! నీకు కర్మను చేయటంలోనే అధికారము వుంది. కర్మఫలాలను ఆశించుటలో ఏనాడూ కూడా నీకు అధికారము లేదు. కర్మఫలాలకు నీవు కారణభూతుడవు అవ్వకు. మరియు కర్మలు మానుటలో కూడా నీకు ఆసక్తి కలుగకుండుగాక.


*యదా యదా హాయ్ ధర్మస్య గ్లానిర్భవతి భారత*

*అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యాహమ్*


ఓ అర్జునా ! ఎప్పుడెప్పుడు ధర్మమూ క్షీణించి , అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో , అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ వుంటాను.


*పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్*

*ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే*


సాదు , సజ్జనులను సంరక్షించటం కోసం , దుర్మార్గులను వినాశం చేయడానికి , ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను.

 

*కృష్ణుడంటాడు "ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్ధ దర్పణం..."* అని , అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థాలకు అద్దం వంటిది. దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణపదం పొందుతారు. భగవద్గీత సారం అర్దమైతే మనం ఎవరిని ద్వేషించము. అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని , ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్టేనని అంటాడు కృష్ణుడు. ఈలోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలుపెడితే అభిమానించడానికి మంచివారు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలుంటాయి. మనం వ్యక్తిని ద్వేషించడం కాదు , చెడు లక్షణాలను , చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవరచుకోకుండా ఉంటాము.

 

నిజమైన దేవుడు ఆయనను నమ్మినా , నమ్మకున్నా ఎవరినీ ద్వేషించడు , ద్వేషించమని చెప్పడు. అందరిని మంచిగా బ్రతకమనే చెప్తాడు. గీతలో పరమాత్మ కూడా అందరు సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు. అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి ఒక కాంతికిరణం , ఒక ఆశాపుంజం. భగవద్గీతను చదవడం కాదు , అర్ధం చేసుకుంటే మన జీవితం సార్ధకమవుతుంది. అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాని అర్ధం చేసుకుని జీవితంలో అనుసరించినా , కొద్దిగా గంగాజలం త్రాగినా , కృష్ణపరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు. వారికి మోక్షం లభిస్తుంది.✍️


. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కామెంట్‌లు లేవు: