25, సెప్టెంబర్ 2022, ఆదివారం

ధర్మాకృతి

 ధర్మాకృతి : పట్టాభిషేకము


శంకర పీఠాధిపతులు సన్యాసులే అయినప్పటికీ బహుకాలంగా అనేకమంది సంస్థానాధీశులకు గురువులుగా, ఆధ్యాత్మిక సార్వభౌములుగా పరిగణింపబడడం వల్ల అనూచానంగా వారికి చక్రవర్తి సహజమయిన మర్యాదలు ఏర్పాటు చేయబడి ఉన్నవి. వెండి అంబారీతో కూడిన భద్రగజం, పెద్ద వెండి సింహాసనం, దంతపు సింహాసనాలు, ఛత్ర చామరాది రాజ చిహ్నములు, స్వామివారి ముందు వెండి దండాలను పట్టుకొని నడిచే బ్రాహ్మణ పరివారం, ఆ ముందు కాగడాలు పట్టుకొని వెళ్ళే పరిచారక వర్గం, దాని ముందు వెండి బాకాల వారు, గౌరీ వాయిద్యం మ్రోగించేవారు ఈ రకంగా ఎన్నో రాజ లాంఛనాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. క్రొత్తస్వామి పట్టణానికి వచ్చినప్పుడు చక్రవర్తులకు జరిగే మాదిరి పట్టాభిషేకం జరుగుతుంది. 67వ పీఠాధిపతులకు ఈ పట్టాభిషేకం జరగనే లేదు.


ఆ ఆచారాన్ననుసరించి మహాస్వామివారు పట్టణానికి వచ్చినప్పుడు కూడా పట్టాభిషేకోత్సవం జరిపించాలని పీఠభక్తులయిన సంస్థానాధీశులు, మిరాసీదారులు, పండితులు ఉత్సాహపడ్డారు. 1907మే 9వ తేదీన స్వామివారిని మహాసింహాసనాధిష్ఠితులను చేసి వేదఘోష నడుమ నదీ జలాలతోనూ, మల్లెపూలతోనూ, అభిషేకం చేశారు. కంచికామకోటి పీఠంతో అత్యంత సన్నిహిత సంబంధమున్న కంచి కామాక్షీ తిరునావైక్కాల్ అఖిలాండేశ్వర దేవాలయముల ప్రధాన అర్చకులు తొలుదొలుత నదీజలాలతో స్వామివారిని అభిషేకించగా తంజావూరు మొదలైన సంస్థానాధీశులు ఒడయార్ పాళెం మొదలైన జమీందారులు స్వామిని మల్లెపూలతో అభిషేకించారు. వివిధ దేవాలయములనుంచి వచ్చిన ప్రసాదాలు, వివిధ సంస్థానాల భక్తుల వద్దనుండి వచ్చిన కానుకలు సమర్పించబడినాయి. సింహాసనాధీశులైన స్వామివారికి పీఠభక్తులందరూ తమ భక్తి ప్రపత్తులను తెలియజేశారు. స్వామి తమ తొలి అనుగ్రహ భాషణము చేశారు. పండితులకు యధోచితమైన సత్కారములు చేయబడినాయి. భూరి అన్నదానం జరిగింది. 


ఆరోజు రాత్రి తంజావూరు సంస్థానాధీశులు పంపిన బంగారు అంబారీ కూర్చిన భద్రగజంపై పట్టణ వీధులలో స్వామివారిని ఊరేగించారు. వీధులన్నీ రంగవల్లులతోనూ, ప్రత్యేక దీపాలతో అలంకరించబడి ఉన్నాయి. దారి పొడుగునా వేలాది భక్తజనులు స్వామివారికి తమ భక్తి ప్రపత్తులు తెలియజేశారు. ఈవిధంగా స్వామివారి 87ఏళ్ల ఆధ్యాత్మిక సార్వభౌమత్వము ఆరంభమయింది. 


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: