18, ఫిబ్రవరి 2023, శనివారం

మహాశివరాత్రి_

 #మహాశివరాత్రి_


 18-2-2023 నాడు శివరాత్రి. ఈరోజు ఏమి చేయాలని శాస్త్రం నిర్దేశిస్తోందో ఒకసారి పరిశీలిద్దాం. 


"వ్రతంచేద ముపవాసపూజాజాగరాత్మక కర్మత్రయ సంకల్పరూపమ్ " - అని స్మృతికౌస్తుభం చెబుతోంది. అంటే ఈ శివరాత్రి వ్రతం అనేది 3 కర్మలు కలిసిన సంకల్పం చెప్పి చేయవలసిన వ్రతము. అవి 1.పూజ 2.జాగరణ 3.ఉపవాసం.  


#విద్యారణ్యులు కూడా తమ #కాలమాధవం లో -"ఇదం వ్రత స్వరూపం త్రివిధమ్, ఉపవాసో జాగరణం పూజా చ " అని పై విషయాన్నే వివరించారు. అయితే ఈ మూడూ సముచ్చయమా? లేక వికల్పమా? అనే విచారణను విద్యారణ్యులు చేస్తూ వికల్పమనే తేల్చారు. అంటే పై మూడూ (ఉపవాస, జాగరణ, పూజలు) చేయలేని వారు ఏ రెండో లేక ఏ ఒకటో సంకల్పం లో ఉదయమే చెప్పుకుని ఆ ప్రకారం నియమాలు పాటించాలి. అంటే ఓపిక ఉన్నవారు మూడూ చేయడం లేక ఏ రెండో సంకల్పించడం చేయాలి. దానికి కూడా ఓపిక లేనివారు పూజ గానీ, ఉపవాసం గానీ, జాగరణ గానీ ఏదో ఒకటే సంకల్పం లో చెప్పుకుని ఆచరించ వచ్చును. 


👉 #ఉపవాసముండే వారు #పారణ ఎప్పుడు చేయాలి? 


       చతుర్దశి తిథి మధ్యాహ్నం ఘ20-23వి వరకు ఉన్నది. దిన ప్రమాణం 29 ఘడియలు ఉన్నది. మూడవ యామము ఘ21-45వి కు అంతమగుచున్నది. 


 "యదా యామత్రయాదర్వాగేవ చతుర్దశీ పరిసమాప్యతే , తదా తిథ్యంతే పారణమ్" - అనే ధర్మశాస్త్ర నియమానుసారం మధ్యాహ్నం 2:35 కు పారణ చేయాలి. 


👉 పూజ ఒకటే సంకల్పించే వారు 8 ఝాముల పూజ చేస్తే మంచిది. అంటే ఒక్కొక్క ఝామున ఒక్కొక్క సారి పూజ లేక అభిషేకం చేయాలి. 


పగలు

     1వ ఝాము : ఉదయం 6:01 నుండి 9:21 వరకు

      2వ ఝాము : ఉ.గం 9:21 నుండి 12:14 వరకు

      3 వ ఝాము : మ.గం. 12:14 నుండి 3:08 వరకు

      4 వ ఝాము : మ.గం. 3:08 నుండి సాగం 6:01 కు

రాత్రి 

     1వ ఝాము : సాగం 6:01 నుండి రాగం. 9:08 కు

      2వ ఝాము : రాగం 9:08 నుండి 12:15 కు

      3వ ఝాము : రాగం 12:15 నుండి 03:23 కు

      4 వ ఝాము : రాగం 3:23 నుండి తె.గం. 6:26 వరకు


👉 జాగరణ ఉండేవారు 18 వ తేదీ శనివారం నాటి సూర్యోదయం నుండి 19 వ తేదీ ఆదివారం సూర్యోదయం  వరకు నిదుర పోకూడదు. 


ఈ విధంగా మన శక్త్యనుసారం చేసి శివుని కృపాకటాక్షాలకు పాత్రులవుదాం.


*💐💐శ్రీమాత్రే నమః💐💐* 

*మహాన్యాసంలోని శివదర్శనం చేద్దామా !*

*💐💐💐💐💐💐💐💐*


*మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అంటారు కదా ! అంటే, మహాన్యాసంతో కూడినటువంటి రుద్రాభిషేకం అని అర్థం. ఈ మహాన్యాసంలో శివుని ఐదు ముఖాల వర్ణన ఉంటుంది . ఇవి పంచగుణాత్మ ప్రతీకలుగా కనిపిస్తాయి . తదనుగుణంగానే ఆయన స్వరూపాన్ని వర్ణించడం జరిగింది . ఆవిధంగా శివుని దర్శించిన తర్వాత, ఆయనకు నమక చమకాలతో కూడిన అభిషేకాన్ని నిర్వహిస్తారన్నమాట . మహాన్యాసంలోని అద్భుతమైన ఆ పరమేశ్వరుని పంచముఖాలనూ ఇక్కడ దర్శిద్దాం.*


*మహాన్యాసం రుద్రానికి ముందుగా చేయడం (పూర్వాంగంగా) జరుగుతుంది. మహాన్యాసము అంటే, భక్తుడు రుద్ర జప హోమ అర్చన అభిషేకాదులు చేసేందుకు అర్హత పొందాలి .*


*‘నారుద్రో రుద్ర మర్చయేత్ ‘ - అంటే, రుద్రుడు కానివాడు రుద్రాభిషేకమునకు అనర్హుడు అని అర్థం . ఇది ప్రమాణవచనం . అందువల్లే రుద్రుని తన ఆత్మలో నిలుపుకోవడానికి, రుద్రతత్త్వాన్ని తెలుసుకొని అర్హతపొందే ప్రక్రియ మహాన్యాసం . దీంట్లో భక్తుడు పంచాంగన్యాసం చేయాల్సి ఉంటుంది . ఇలా వివిధ శరీరభాగాలని స్పృశిస్తూ , ఆ రుద్రుని తన దేహాత్మలో మంత్రయుక్తంగా ఆవాహన చేయడం ద్వారా తానే రుద్రుడై , రుద్రార్చనకి అర్హుడవుతాడని వేదవచనం.*

 

*రుద్రమహాన్యాసము ఐదు అంగాలు కలిగిఉంటుంది . అంటే ఐదు స్వరూపాలు అన్నమాట. లేదా ఐదు తత్త్వాలు అనికూడా చెప్పుకోవచ్చు . ఈ పంచతత్త్వాలూ కలిగినవారు పంచాంగ రుద్రులు.*


*రుద్రాభిషేకంలోని  పంచముఖ ధ్యానం లోని శ్లోకాలు వాటి అర్థ సహితంగా :*


*రుద్రాభిషేకంలోని  పంచముఖధ్యానం లోని శ్లోకాలు మహాన్యాసంలో ప్రస్తావించడం జరిగింది . తత్పురుష , అఘోర , సద్యోజాత , వామదేవ, ఈశాన అనే ఐదు ముఖాలను కలిగిన రూపాలే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాలని మనకి ఋషులు అందించారు .  దీనినే శివ పంచానన స్తోత్రం అనికూడా అంటారు . ఈ ఐదు ముఖాలలో ఒక్కొక్క రూపానికి ఒక ప్రత్యేకత ఉంది . ఈ మహాన్యాస వివరణని ‘రావణ ప్రోక్త న్యాస ప్రక్రియ’లో తెలియజేశారు.*

 

*తత్పురుషముఖం - ధ్యానం :*

*సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక – ప్రస్పర్థితేజోరుణం*

*గంభీర ధ్వని సామవేద జనకం -తామ్రాధరం సుందరం*

*అర్ధేందుద్యుతిలోల పింగళజటా  - భారప్రబద్ధోరగం* 

*వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః*


*ప్రళయకాలములో జ్వలించేటటువంటి అగ్నికాంతోనూ , తటిల్లతలా మెరిసే  మెరుపుల తేజముతోనూ , బాగా కరిగిన బంగారు కాంతితోనూ పోటీపడే తేజములే తనరూపముగా కలిగినది , గంభీర ధ్వనితోపాటు భయంకరమైన అగ్నిలాగా ప్రకాశించే యెర్రని పెదవులు కలిగినది , చంద్రఖండ కాంతితో మెరిసే పింగళ వర్ణపు జడలు కలిగి , దాని చుట్టూ గట్టిగా చుట్టుకున్న సర్పములు కలది, సిద్ధులు , సురలు , అసురులు నమస్కరించేది అయిన శూలి తూర్పు ముఖానికి నమస్కరిస్తున్నాను అని అర్థం.*


*రజోగుణ ప్రధానమైన సృష్టి తత్త్వము ఈ శ్లోకములో ప్రస్తుతింపబడింది.* 


*అఘోరముఖ ధ్యానం :*


*కాలాభ్ర భ్రమరాంజన ద్యుతినిభం -వ్యావృత్త పింగేక్షణం*

*కార్నోద్భాసిత భోగిమస్తకమణి - ప్రోద్భిన్న దంష్ట్రాంకురం*

*సర్పప్రోత కాపాలశుక్తి శకల - వ్యాకీర్ణతా శేఖరం*

*వందే దక్షిణమీశ్వరస్య వందనం – చాతర్వనాదోదయం*


*కారుమేఘములు ,  నల్లని తుమ్మెదల వంటి మెరుపుని  పోలిన కాంతితో ప్రకాశించేటటువంటిది , బాగా మిట్టగా తిరిగేటటువంటి పింగావర్ణపు కన్నులు కలిగి, కోరలు, శిరోరత్నాలు కలిగిన నాగులు కర్ణాభరణాలుగా కలిగినది , సర్పాలతోపాటు కపాలమాలని ధరించినటువంటిది , ముత్యపు చిప్పలపోలిన కనురెప్పలపైన, ఎగుడుదిగుడు నడకతో భయంకరమైన అరణ్యాన్ని పోలిన కనుబొమ్మలు కలిగిన ఆ ఈశ్వరుని దక్షిణ ముఖమునకు నమస్కరిస్తున్నాను .  తమోగుణప్రధానమైన లయకర్త తత్త్వాన్ని ఇక్కడ స్తుతించడం జరిగింది.*


*సద్యోజాత ముఖ ధ్యానం :*

*ప్రాలేయాచల మిందుకుంద ధవళం - గోక్షీరఫేన ప్రభం*

*భస్మాభ్యంగ మనంగ దేహదహన - జ్వాలావళీ లోచనం*

*విష్ణు బ్రహ్మ మరుద్గణార్చిత పదం – ఋగ్వేదనాదోదయం*

*వందేహం సకలం కళంక రహితం - స్థాణోర్ముఖం పశ్చిమం*


*హిమవత్పర్వతం , చంద్రుడు , మల్లెపూల వంటి తెల్లని ఛాయ కలిగినది , ఆవుపాలమీది నురుగువంటి స్వచ్ఛమైన కాంతిని కలిగినది , విభూతిని ధరించి ఉన్నది , మన్మధుని శరీరాన్ని దహించే జ్వాలల పంక్తితో నిండిన త్రినేత్రాన్ని కలిగినది , బ్రహ్మాది దేవతల చేత స్తుతింపబడుతున్నది , యోగులచేత శ్రద్ధగా అర్చింపబడుతున్నది, నిర్మలమైన నిండు వదనంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ శివుని పశ్చిమ ముఖానికి నమస్కరిస్తున్నాను . సత్త్వగుణ ప్రధానమైన ఆ ఈశ్వరుని తత్త్వాన్ని ఈ శ్లోకములో స్తుతించడం జరిగింది.*


*వామదేవ ముఖం - ధ్యానం :*

*గౌరం కుంకుమ పంకితం సుతిలకం - వ్యాపాండు మండ స్థలం*

*భృవిక్షేప కటాక్ష వీక్షణలసత్ - సంసక్త కర్ణోత్పలం*

*స్నిగ్ధం బింబ ఫలాధరం ప్రహసితం - నీలాల కాలం కృతం*

*వందే యూజుష వేదం ఘోష జనకం - వక్త్రం హరస్యోత్తరం*


*గౌరవర్ణము (ఎరుపుతోకూడిన తెలుపు ) కలది , కుంకుమ పూతతో నిండినది , అందముగా దిద్దిన తిలకాన్ని ధరించినది, ధవళకాంతితో మెరిసేటటువంటి చెక్కిళ్ళు , కనుబొమ్మల కదలికతో కూడిన చక్కని కడగంటి చూపుతో ప్రకాశిస్తూ, తెల్లని కలువలను చెవులకి అలంకారంగా ధరించినది, చక్కని చిరునవ్వుతో మెరిసే దొండపండు వంటి క్రింది పెదవితో , దోబూచులాడే నల్లని ముంగురులతో , నిండుపున్నమి జాబిలిలా ప్రకాశించే ఆ శివుని ఉత్తరముఖమునకి నమస్కరిస్తున్నాను .  మూడుగుణాల మిశ్రమరూపమైన ఆ ఈశ్వర తత్త్వాన్ని ఇక్కడ ప్రస్తుతించారు.*


*ఈశానముఖ ధ్యానం :*


*వ్యక్తావ్యక్త నిరిపితించ పరమం – శస్త్రింశతత్వాధికం*

*తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః*

*ఓంకారాది సమస్త మంత్రం జనకం - సూక్ష్మాది సూక్ష్మం పరం*

*వందే పంచమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం*


*వ్యక్తము , అవ్యక్తము (స్పష్టరూపం కలిగినది , రూపం స్పష్టంగా లేనిది ) అనే రెండు లక్షణాల కంటే కూడా భిన్నమైన లక్షణం కలిగినది , ముప్ఫయ్ఆరు తత్వముల రూపములో పరిణమించింది , సకల తత్త్వములకంటె ఉన్నతమైనదైన అనుత్తరము అనే అక్షర (అకార) తత్వాన్ని కలిగినది , ఎల్లప్పుడూ యోగులచేత ధ్యానింపబడేది అయిన తమోగుణ రహితమైన, త్రినేత్రములు కలిగిన సూక్ష్మాతి సూక్షము కన్న ఉన్నతమైన శాశ్వతాన్ని, ఆకాశమంతా వ్యాపించి ఉన్న తేజమే తన రూపమైన ఆ సర్వేశ్వరుని ముఖమునకు నేను నమస్కరిస్తున్నాను . గుణాతీతమైన బ్రహ్మతత్త్వమును ఇక్కడ స్తుతి చేస్తున్నారు.* 


💐💐💐💐💐💐💐💐

కామెంట్‌లు లేవు: