25, మే 2024, శనివారం

శ్రీ హిడింబేశ్వరఆలయం

 🕉 మన గుడి : నెం 328


⚜ కర్నాటక  :- చిత్రదుర్గ 


⚜ శ్రీ హిడింబేశ్వరఆలయం


నాటి ఘటోత్కచుని ఆశ్రమం నేటి చిత్రదుర్గ



💠 అందంగా పరిచినట్టుండే రాళ్ళు, కొండలతో ప్రకృతి సోయగాలు నింపుకున్న చిత్రదుర్గ చూసి తీరవలసిన ప్రదేశం. 

చారిత్రక కాలంలో ఈ నగరం విజయనగర సామ్రాజ్యంలో వెలుగొందిన ప్రాంతం. విజయనగర చరిత్రలో ఈ చిత్రదుర్గకి సామంతులు , అమిత పరాక్రమ వంతులు అయిన నాయకరాజుల ఏలుబడిలో ఈ నగరం అత్యంత సుందరంగా ఏడు చుట్ల ప్రాకారంలో, శిల్ప కళానైపుణ్యంతో నిర్మించబడింది.


🔆 కోటలో దేవాలయాలు


💠 ఎగువ కోటలో 18 దేవాలయాలు నిర్మించబడ్డాయి. 

 ప్రసిద్ధ దేవాలయాలలో కొన్ని హిడింబేశ్వర , సంపిగే సిద్దేశ్వర, ఏకనాథమ్మ, ఫాల్గుణేశ్వర, గోపాల కృష్ణ, హనుమాన్ , సుబ్బరాయ మరియు నంది ఆలయాలు.  


💠 ఈ దేవాలయాలలో, పురాతనమైనది మరియు అత్యంత ఆసక్తికరమైనది హిడింబేశ్వర దేవాలయం. 


💠 ఈ ఎత్తైన కోటలో సిద్దేశ్వర, హిడింబేశ్వర, ఏకనాథేశ్వరి, ఫాల్గుణేశ్వర, గోపాలకృష్ణ మూర్తుల విగ్రహాలు నిర్మించారు. 

ఇక దీని పౌరాణిక కథనం ప్రకారం మహాభారత కాలంలో హిడింబాసురుడు, అతని చెల్లెలు హిడింబ ఈ కొండ మీద ఉన్న గుహల్లోనే ఉండేవారు. 

హిడింబాసురుడు తన రాక్షస ప్రవృతిలో అందర్నీ హడలెత్తించేవాడు. కానీ రాక్షస కులంలో ఈతనికి చెల్లెలుగా పుట్టినా హిడింబ మాత్రం శాంత స్వభావురాలు. 


💠 లక్క గృహ దహనం అయిన తరువాత పాండవులు తల్లి కుంతితో సహా ఈప్రాంతానికి చేరుకున్నారు.

ఇక్కడ హిడింబాసురుడికీ, భీమసేనుడికి జరిగిన ఘోర యుద్ధంలో హిడింబాసురుడు అసువులు బాసాడు. 

భీముని పరాక్రమానికి ముగ్ధురాలైన హిడింబి భీమసేనుణ్ని వివాహం చేసుకుంది. 

ఆ క్రమంలో కొంతకాలం పాండవులు ఇక్కడే ఉండి హిడింబి పరిచర్యల్లో సంతోషంగా కాలం గడిపారు. 

తరువాత భీముడికీ, హిడింబికీ ఒక మగ శిశువు జన్మించాడు. 

అతడే ఘటోత్కచుడు. 

ఈ సన్నివేశాలన్నీ జరిగిన రమణీయ ప్రదేశం ఈ చిత్రదుర్గ.


💠 ఒకనాటి విజయనగర సామ్రాజ్యాధినేత దగ్గర పనిచేసిన తిమ్మన నాయకుడు, తన దక్షతతో, సామ్రాట్టుని గుర్తింపు పొంది ఈ నగరానికి మండలాధీశుడుగా పదోన్నతిని పొందాడు. అతని నిజాయితీ, కార్యదక్షతకీ మెచ్చిన విజయనగర ప్రభువు నాయకుని రాజుగా ప్రకటించాడు. నాటి నుండీ ఈ నగరం నాయకుల ఏలుబడిలోకి వచ్చింది.

 ఆ తరువాత 1588 ప్రాంతంలో ఈతని

కుమారుడు ఒబనా నాయకుడు రాజయ్యాడు. ఈతని తరువాత ఈతని కుమారుడు కస్తూరి రంగప్ప 1602 ప్రాంతంలో రాజై ప్రజల్ని శాంతి సుఖాలతో ఉండేలా చక్కని పరిపాలన అందించాడు. 

అప్పటికే ఈ నగరం చాలా అభివృద్ధి చెందింది. కస్తూరి రంగప్పకి సంతానం లేకపోవడంతో దత్తత తీసుకున్న కుర్రవాణ్ని పట్టాభిషిక్తుణ్ని కావించాడు.


💠 కానీ, దాయాదులు అతనిని రాజ్యభ్రష్టుని చేసి హత్యచేసారు. ఆ తరువాత 1676లో చిక్కన్న నాయకుని తమ్ముడు 2వ మదకరి నాయకుడు ఈ సింహాసనాన్ని అధిష్టించాడు. అతని తరువాత అతని తమ్ముడు 3వ మదకరినాయకుడు 1686లో రాజ్యాధిపత్యం వహించాడు. ఇలా అనంతంగా పౌరాణిక, చారిత్రక విజయపరంపరలతో కూడిన ఈ చిత్రదుర్గ నగరంలో చూడదగ్గ ప్రదేశాలున్నాయి. 


💠 కోటని మదకరినాయకుడు నిర్మించాడు. దీనినే కల్లిన కోట అనీ, కిన్న కోట అనీ, ఏలు సుట్టిన కోట అని కూడా పిలుస్తారు. 

దీని చుట్టూ ఏడు ప్రాకారాలు ఉండి, కోటలోపలి భాగంలో 18 దేవాలయాలు నిర్మించబడి ఉండి. 19 ద్వారాలు, 38 ప్రవేశమార్గాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాక ఇందులో రాజభవనం, మసీదు, రహస్యమార్గాలు, నూనె బంకులు కూడా మనం చూడవచ్చు.


💠 ఈ గుహల వెనుక భాగంలో అంకాళీ మఠం ఉంటుంది. ఇది ఇక పెద్ద రాతి కింద గుహమాదిరిగా ఉండి, అందులో పెద్ద పెద్ద శివలింగాలు ఉంటాయి. 


💠 సుమారు 3 మీటర్లు (9.8 అడుగులు) చుట్టుకొలత మరియు 2 మీటర్లు (6.6 అడుగులు) ఎత్తులో భేరి లేదా డ్రమ్ ఆఫ్ భీమా అని పిలువబడే ఇనుప పలకలతో తయారు చేయబడిన పెద్ద సిలిండర్ కూడా ఇక్కడ ఉంది.  ఈ ఆలయ ద్వారం వద్ద ఏకశిలా స్తంభం మరియు రెండు ఊయల ఫ్రేమ్‌లు కూడా కనిపిస్తాయి.  

సంపిగే సిద్ధేశ్వర దేవాలయం కొండ దిగువన ఉంది.  గోపాలకృష్ణ దేవాలయంలో, శాసనాలు 14వ శతాబ్దపు పూర్వపు విగ్రహం నాటివి.


💠 ఇది బెంగుళూర్ కు 202 కి॥మీల దూరంలో ఉన్న అతి సుందర పర్వత ప్రాంతం.

 ఆ రాష్ట్రంలో ఇది జిల్లా కేంద్రం కూడా, బెంగళూరు నుండి పూనా వెళ్ళే మార్గంలో ఉంటుంది ఈ నగరం.

కామెంట్‌లు లేవు: