22, ఏప్రిల్ 2021, గురువారం

తెలుగు బ్రాహ్మణులు

 తెలుగు బ్రాహ్మణులు


వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న బ్రాహ్మణులలో తెలుగు బ్రాహ్మణులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కల్హణుని 'రాజతరంగిణి'లో పేర్కొన్న 'పంచ ద్రావిడుల'లో తెలుగువారు ఒకరు. ఒక జాతి సంఖ్యాపరంగా విస్తృతం అవుతున్నప్పుడు, వారు భాషలవారీగా, ప్రాంతాలవారీగా, పాటించే విధానాలు, ఆచారవ్యవహారాల ఆధారంగా పలు తెగలుగా విడిపోవడం సహజం. సాంఘికంగా ఇలా వచ్చే అనేక మార్పులలో భాగంగానే, తెలుగు మాట్లాడే ప్రాంతాలలోని బ్రాహ్మణులు 'తెలుగు బ్రాహ్మణులు'గా పరిగణనలో ఉండటం సహజం. వీరుకూడా, కాలానుగతంగా వచ్చే మార్పుచేర్పులకు లోనవుతూ, అనేక విధాలైన పరిణామాలకు గురి అవుతుంటారన్నది గుర్తించాలి. 


1891లో ప్రచురితమైన ఒక గ్రంధం ప్రకారం, తెలుగు బ్రాహ్మణులలో స్మార్తులు అత్యధికులు. మధ్వులు ఉన్నప్పటికీ వారి సంఖ్య పరిమితం. మధ్వులలోనూ కన్నడ ప్రాంతాలనుంచి వచ్చి, తెలుగు ప్రాంతాలలో స్థిరపడినవారే అధికం. 


ఆ పుస్తకం ప్రకారం, తెలుగు స్మార్త బ్రాహ్మణులలో కానవస్తున్న తెగలు అనేకం ఉన్నప్పటికీ, వాటిలో ప్రధానమైన తెగలు ఇవి:


1. తెలగాణ్యులు :


నైజామ్‌ ప్రాంతంలో, నాటి నిజామ్‌ దురంతాలను భరించలేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు. వీరు ముఖ్యంగా నేటి కరీమ్‌నగర్‌ జిల్లాలోని ధర్మపురి, మంథని, కాళేశ్వరం, చెన్నూరు ప్రాంతాలకు చెందినవారు.


2. మురికినాడు :


ఇది చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం ప్రాంతమని 'కాకతీయ సంచిక'లోని 168వ సేజీ పక్కనగల చిత్రపటం ద్వారా తెలుస్తోంది. ఈ మురికినాడులోని కొంత ప్రాంతాన్నే 'తొండపినాడు', 'తొండపి మండలం' అనికూడా అనేవారు. ('ముల్క్‌' అంటే 'దేశం' అని అర్థం. నైజామ్‌ ప్రాంతానికి ఒకప్పుడు 'ముల్క్‌' అనే పేరుండేది. ఇది 'ముల్కి నాడు' శబ్దం అపభ్రంశం అయి, 'మురికినాడు' అయిందన్న భావన తప్పుగా తోస్తోంది.) 


3. వెలనాడు - వీరిలోనూ 3 తెగలు. అవి:


             1. శుద్ధ వెలనాడు, 2. కాకిమాని వెలనాడు, 3. పెరుంబటి వెలనాడు.


(వీరినే 'వెలినాటి బ్రాహ్మణులు' అంటారనీ తెలుస్తోంది. వీరిలోని 3 శాఖలనూ 1. శుద్ధ వెలినాడు, 2. పేరుంబేడి వెలినాడు, 3. వెలినాడు బ్రాహ్మణులుగా పేర్కొంటున్నారు. మొత్తంమీద వీరందర్నీ 'వెల్నాటి బ్రాహ్మణులు' అనడమూ ఉంది.)  


4. కాసలనాడు :


ఒకప్పటి 'కోసల దేశం' నేటి 'మధ్యప్రదేశ్‌' అనుకోవచ్చు. అప్పటి దక్షిణ కోసల దేశం అయిన జబల్‌పూర్‌, రేవా, బిలాస్‌పూర్‌, సాగర్‌, సాత్నా వంటి ప్రాంతాలనుంచి కొన్ని మతపరమైన కారణాల వల్ల మన ప్రాంతాలకు వలస వచ్చినవారు వీరు. వీరినే 'కోసలనాటి బ్రాహ్మణులు' అనేవారు. 


5. కరణ కమ్మలు -


         1. బాల కరణాటి బ్రాహ్మణులు, 2. కొలింగేటి బ్రాహ్మణులు, 3. ఓగేటి బ్రాహ్మణులు. 

(వీరిలోనూ 1. బగల్నాటి కరణ కమ్మలు, 2. కొవిజేటి కరణ కమ్మలు. 3. ఓగోటి కరణ కమ్మలు అని 3 శాఖలున్నట్లు కూడా ఉంది. ఇవి పౖౖెన పేర్కొన్న 3 శాఖల పేర్లే అనిపిస్తోంది.)


6. వేగినాడు


7. తొండ్రనాడు


(ఇది బహుశా నేటి తిరుపతి ప్రాంతం కావచ్చు. తిరుమాండ్యం శాసనం, కపిలేశ్వర శాసనాల ఆధారంగా నేటి తిరుపతి ప్రాంతానికి ఒకప్పుడు 'తుండీర మండలం', 'తుండక విషయం', 'తుండైనాడు', 'తొండమనాడు' అనే పేర్లుండేవని తెలుస్తోంది. ఈ పేర్లలోంచే 'తొండ్రనాడు' కూడా రూపొంది ఉండవచ్చు.) 


8. ఔదమనాడు


9. కోనసముద్ర ద్రావిడులు 


10. ఆరామ ద్రావిడులు

1891లో ప్రచురితమైన ఆ పుస్తకం ప్రకారం పైన పేర్కొన్న పది తెగలవారూ 'వైదికులు'. వీరిలో కోనసీమ ద్రావిడులు, ఆరామ ద్రావిడులూ మొదట తమిళనాడు ప్రాంతానికి చెందినవారైనా, తెలుగునాడుకు వచ్చి, ఇక్కడ స్థిరపడ్డారు. క్రమంగా వీరి భాష, కట్టూబొట్టూ అన్నీ పూర్తిగా తెలుగు సంప్రదాయానికి అనుగుణంగా మారిపోయాయి. ఈ రెండు తెగలవారికీ తెలుగు బ్రాహ్మణులలో విశిష్టస్థానాలు ఉన్నాయి. తమిళ ప్రాంతంనుంచి వచ్చి, తెలుగు ప్రాంతంలో స్థిరపడిన కారణంగా, వీరిని కొన్నిచోట్ల 'సంకీర్ణులు' అని వ్యవహరించటంకూడా ఉంది. 


ఆరామ ద్రావిడులు

 ఆరామ ద్రావిడుల గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం: 


ఆరామ ద్రావిడులనే కొందరు 'తూర్పు ద్రావిడులు', 'కోస్తా ద్రావిడులు', 'కోనసీమ ద్రావిడులు', 'పేరూరు ద్రావిడులు' అనడమూ ఉంది. ప్రాథమికంగా ఇవన్నీ వారు స్థిరపడిన ప్రాంతాలకు సంబంధించిన పేర్లేనన్నది స్పష్టం. తూర్పు ద్రావిడులు ప్రధానంగా మన కోస్తాకు ఆవల ఉన్న ఉత్కళ ప్రాంతం, తూర్పు ఆంధ్రదేశంలోని వారు. కోస్తా ద్రావిడులు కోస్తా జిల్లాలలో స్థిరపడినవారు. ఇక, కోనసీమ ద్రావిడులు మన కోనసీమలో స్థిరపడినవారు. ఈ ఆరామ ద్రావిడులలో పేరూరు ద్రావిడులనే వారూ ఉన్నారు.


ఆరామ ద్రావిడులు ఆంధ్రదేశానికి రావటం వెనుక కొన్ని కథలు ఉన్నాయి. జనజీవనచరిత్ర అంతా పలు సందర్భాలలో జరిగిన, జరుగుతున్నవలసల వివరమేనన్నది వాస్తవం. ఆరామ ద్రావిడుల కథా అంతే! ఒక కథనం ప్రకారం - చాళుక్యరాజైన రాజేంద్రచోళుడు, తన కుమార్తె అయిన అమ్మంగి దేవిని రాజమహేంద్రవర పాలకుడైన రాజరాజ నరేంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ సందర్భంలో, ఆయన తన కుమార్తెతోబాటుగా, 18 కుటుంబాల బ్రాహ్మణులను వేంగి రాజ్యానికి పంపాడు. ఈ 18 కుటుంబాలవారూ అసలు నాటి చాళుక్యదేశం (దాదాపు నేటి తమిళనాడు) లోని 'వేలంగమన్‌' అనే గ్రామానికి చెందినవారు. (ఇప్పుడు ఈ గ్రామం 'వలంగైమన్‌' పేరుతో తిరువరూర్‌ జిల్లాలో ఉంది.) రాజాజ్ఞ తలదాల్చి, వీరిలో కొందరు 'అగ్నిహోత్రం' ధరించి, కాలినడకన వేంగి రాజ్యానికి రాగి, మరికొందరు నావలమీద వచ్చారు. నావలమీద వచ్చినవారు సముద్రతీరంలోని 'కొనసీమ' లేదా 'కోనసీమ'కు చేరారు. వారే 'కోనసీమ ద్రావిడులు' అయ్యారు. ఇక, భూమార్గాన వచ్చినవారికి రాజరాజనరేంద్రుడు, ర్యాలి సమీపాన స్థలం ఇచ్చి నివాసం ఉండమన్నాడు. వారంతా అరవ ప్రాంతంనుంచి వచ్చిస్థిరపడిన కారణంగా, అక్కడ (ర్యాలిలో) ఉన్న గుట్టలను స్థానికులు 'అరవ దిబ్బలు'గా వ్యవహరించేవారని అంటారు. నేటికీ ర్యాలిలో అరవ దిబ్బలు ఉన్నాయి. 


అరవదేశంనుంచి ఇక్కడ స్థిరపడినవారిలో - నన్నయభట్టారకుడి శిష్యుడు నారాయణ భట్టు ముఖ్యుడు. 'శ్రీమదాంధ్ర మహాభారతం' ఆంధ్రీకరణంలో నన్నయభట్టుకు నారాయణ భట్టు చేసిన సహాయానికి మెచ్చిన రాజరాజ నరేంద్రుడు ఆయనకు నందంపూడి అగ్రహారాన్ని కానుకగా ఇచ్చారన్న కథా ఉంది. 


ఇక, చోళదేశంనుంచి వచ్చిన మరికొందరు, పలిమెలపాడు పాలకుడి అనుమతితో పేరూరులో స్థిరపడ్డారని అంటారు, వీరు అసలు తమిళనాడులోని 'పెరియ ఊర్‌' (పెద్ద ఊరు) నుంచి వచ్చారని, కనుక, తాము స్థిరపడిన ఊరికి అలాగే, 'పేరూరు' అని పేరు పెట్టుకున్నారని అంటారు. ఇక్కడి ద్రావిడులు 'పేరూరు ద్రావిడులు'గా సుప్రసిద్ధులయ్యారు.


వీరికి 'ఆరామ ద్రావిడులు' అన్న పేరు రావడానికి మరో కారణాన్ని శ్రీ చందూరి వేంకట సుబ్రహ్మణ్యం గారు తమ 'వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు' పుస్తకం (పేజీ 82)లో వివరించారు. మన రాష్ట్రంలో ఉన్న పంచారామాలు- ద్రాక్షారామం, భీమారామం, క్షీరారామం, అమరారామం, కుమారారామం- లలో ముందుగా స్థిరపడిన ద్రావిడులు గనుక వీరిని 'ఆరామ ద్రావిడులు' అంటారని ఆ పుస్తకంలో ఉంది.  


11. తుంబల వారు


12. ప్రథమ శాఖీయులు 


13. నియోగులు-  


        1. ఆరువేల నియోగులు 2. కమ్మెల బ్రాహ్మణులు 3. ప్రాజ్ఞాడు బ్రాహ్మణులు 4. నందవరీక బ్రాహ్మణులు

        5. పెసలవాయిల బ్రాహ్మణులు 6. తుమ్మనాడు లేదా కమ్మనాడు బ్రాహ్మణులు 7. లింగధారులు 8. ప్రథమశాఖ నియోగులు 


ఇక్క డ మనం కొన్ని ముఖ్య విశేషాలు గమనించాల్సి ఉంది. పైన పేర్కొన్న తెగలలో కొన్ని ప్రాంతాలపరంగా ఉండటం స్పష్టం. వీటిలో కొన్ని ఇప్పుడు కనపడటం లేదనిపిస్తోంది.


(బాల కర్నాటి, కొలింగేటి, ఓగేటి, తొండ్రనాడు, ఔదమనాడు వంటి కొన్ని నియోగ బ్రాహ్మణ శాఖలు ఎక్కడైనా ఉన్నాయోమో కానీ, ఈ సంకలనకర్త దృష్టికి రాలేదు.) 


నందవరీకులు

    నందవరీకుల గురించిన ఈ దిగువన వివరిస్తున్న చరిత్ర శ్రీ గోపానందనాథులు 1996లో రాసిన 'శ్రీ దేవీ మాహాత్మ్యము- శ్రీ చౌడేశ్వరీ చరిత్రము' అనే పుస్తకంలో ఉంది. 


    సోమ వంశంలో పాండురాజు సంతతికి చెందిన నందరాజు అప్పటి కర్నాటక దేశంలోని నందవరం రాజధానిగా పరిపాలన చేసేవాడు. ఈ నందరాజు జనమేజయునికి తొమ్మిదో తరానికి చెందిన ఉత్తుంగభుజుని కుమారుడు. ఈయన చాణక్య-మౌర్యుల చరిత్రలోని నవనందులలోనివాడు కాడు. నందరాజు గొప్పశివభక్తుడు. ఈయన శివభక్తికి మెచ్చి, ఒక సిద్ధుడు ఒక దివ్యపాదుకల జతను ప్రసాదిస్తాడు. తను ఇచ్చిన దివ్యపాదుకల విషయం ఎవ్వరికీ చెప్పవద్దనే ఆంక్ష కూడా విధిస్తాడు. ఈ దివ్యపాదుకల ప్రభావంతో నందరాజు ప్రతీ నిత్యమూ వేకువజామున లేచి, కాశీనగరం చేరుకుని గంగాస్నానానంతరం విశ్వేశ్వరుని, విశాలాక్షిని దర్శించుకుని, తిరిగి తెల్లవారే లోగా తన రాజధానికి చేరుకునేవాడు. ఇలా కొంతకాలం జరిగాక, తన భర్త తెల్లవరే సమయంలో అదృశ్యం కావడాన్ని గుర్తించిన రాణి, తన భర్తను ఆ విషయమై నిలదీస్తుంది. తప్పనిసరై, నందరాజు తనకు సిద్ధుడు ఇచ్చిన పాదుకలగురించి వివరిస్తాడు. అది ఒక గొప్పవింతగా భావిస్తూ, తననూ కాశీకి తీసుకువెళ్లమని కోరుతుంది. నందరాజు ఆమెను అక్కడికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత, రాణికి రజోదర్శనం అవుతుంది. ఆ అశుచి ఫలితంగా దివ్యపాదుకలను ఉపయోగించుకోలేక, రాజధానికి తిరిగి చేరలేని పరిస్థితి ఏర్పడి, వారిద్దరూ కాశీలో చ్కిడిపోతారు.


ఈ దశలో వారు అక్కడున్న కొందరు విప్రులను చూస్తారు. వారి తేజస్సును చూసి, వారికి నమస్కరించి, తమకు సంప్రాప్తించిన విపత్తును వివరించి, సహాయం చేయవలసిందిగా కోరతారు. తపస్సంపన్నులయిన ఆ బ్రాహ్మణులు తమ దివ్యదృష్టితో భవిష్యత్తును చూసినవారై, త్వరలోనే కాశీనగరం కరవుకాటకాల పాలవుతుందని గ్రహించి, ఆ సమయంలో తమను నందరాజు ఆదుకోగలడని ఆశిస్తూ, ఆయననుంచి తగిన వాగ్దానం పొందుతారు.


వారు చేస్తామన్న సహాయానికి ప్రతిగా, తన రాజ్యంలోని నందవర అగ్రహారాన్ని వారికి దానం ఇచ్చేందుకు అంగీకరిస్తూ, విళంబినామ సంవత్సర చైత్ర బహుళ అమావాస్య సూర్యోదయ సమయంలో కాశీలోని గంగాతీర మణికర్ణికా ఘట్టంలో, శ్రీవిశ్వేశ్వర మహాదేవునికి సమర్పణంగా, శ్రీ చాముండాదేవి సాక్షిగా


ఆ విప్రులకు దానం చేశాడు. (ఇది నేటి క్రీ.శ. 2013కు 4135 సంవత్సరాల క్రితం, అంటే యుధిష్టిర శకంలోని 980కి సమానం.) ఆ తర్వాత, ఆయనకు సహాయం చేయడానికి సిద్ధపడిన విప్రులు, వేదోక్తవిధిని రాణిని శుచిని చేసి, రాజును, రాణిని క్షేమంగా నందరాజ్యానికి చేర్చుతారు. 


    ఆ తర్వాత, ఆ విప్రులు గుర్తించినట్లే కాశీనగరం కరవుకాటకాల పాలవుతుంది. తాము అక్కడ ఉండలేక, మొత్తం 500 ఇళ్లవారు నందరాజు తమకు ఇచ్చిన దానాన్ని గుర్తు చేసుకుని, నందరాజ్యానికి వస్తారు. నందరాజ్యం చేరిన వారికి రాజదర్శనం వెంటనే లభించక, కొంత సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో తమ నిత్యకర్మానుష్టానాలను రాజభవనంముందే పూర్తి చేసి, తీర్థజలాన్ని అక్కడే ఉన్న ఒక ఎండు రావి చెట్టుమీద చల్లుతారు.


ఆ విధంగా మూడు రోజులు గడిచేసరికి, ఆ ఎండు చెట్టు చిగురిస్తుంది. ఇది కేవలం ఆ విప్రుల తపోబలప్రభావమేనని భావించిన రాజసైనికులు వెంటనే


ఆ విషయాన్ని రాజుగారికి తెలియజేస్తారు. ఆయన రాజభవనం ముందుకు వచ్చి, ఆ విప్రులను సభకు ఆహ్వానిస్తాడు. సభలో, విప్రులు రాజుకు ఆయన తమకు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుకు తెస్తారు. నందరాజుకు ఆ విషయం జ్ఞప్తికి వచ్చినా, తాను దివ్యపాదుకలను పొందిన సంగతినిగానీ, తాను ప్రతినిత్యం కాశీకి వెళ్లిన సంగతినిగానీ ప్రజలు విశ్వసించరేమోనన్న భీతితో, తాను అసలు కాశీకి వెళ్లనే లేదని బొంకుతాడు. అప్పుడు ఆ విప్రులు నందరాజు, కాశీలో విశాలాక్షి సాక్షిగా తమకు వాగ్దానం చేశాడని సభలో వివరిస్తారు. అయితే, సభలోని పురజనులు సైతం రాజుకే వత్తాసు పలుకుతూ, తమ రాజు అసలు కాశీకి వెళ్లనే లేదనీ, ఒకవేళ విప్రులు చెప్పేది నిజమే అయిన పక్షంలో విశాలాక్షిచేత తనముందు సాక్ష్యం చెప్పించాలని గేలి చేస్తూ విప్రులను నిండుసభలో అవమానపరుస్తారు. జగన్మాతముందు చేసిన వాగ్దానాన్ని కాదనటమేగాక ఆవిధంగా నిండుసభలో తమను అవమానపరచటంతో వారు ఎంతగానో నొచ్చుకుని, కాశీలోని విశాలాక్షి మాత చేతనే సాక్ష్యం చెప్పించటం భావ్యంగా ఉంటుందని భావించి, తమలో నలుగురు పెద్దలను ఎంచుకుని, వారిని విశాలాక్షి దగ్గరకు పంపుతారు. అలా కాశీకి వెళ్లిన నలుగురు పెద్దలు:


    1. బ్రహ్మశ్రీ అవధానం పెద్దిభట్టు (శ్రీవత్సస గోత్రం)

    2. బ్రహ్మశ్రీ తర్కశాస్త్రం మాధవభట్టు (వశిష్టస గోత్రం)

    3. బ్రహ్మశ్రీ పురాణం శ్రీధరభట్టు (భారద్వాజస గోత్రం) 

    4. బ్రహ్మశ్రీ వార్తికం కమలనాభ పండితుడు (హరితస గోత్రం)


పై నలుగురు ప్రముఖులు కాశీకి వెళ్లి, అక్కడ జపతపహోమాలను శాస్రోక్తంగా చేసి, జగన్మాతను పూజించి, ఆమెను ప్రసన్నం చేసుకుంటారు. వారి భక్తికి మెచ్చి, ఆమె వారిముందు ప్రత్యక్షం కాగానే, జరిగిన విషయం ఆ తల్లికి వివరించి, తమతో వచ్చి, సభలో సాక్ష్యం చెప్పవలసిందిగా కోరతారు. వారు కోరినట్లే తాను నందరాజు వద్దకు వచ్చి, సాక్ష్యం చెప్తాననీ, అయితే, మార్గంలో ముందు వెళ్లే విప్రులు ఎవ్వరూ జ్యోతి రూపంలో వచ్చే తనను వెనుదిరిగి చూడరాదని స్పష్టం చేస్తుంది. ఆ ప్రకారమే, నందరాజ్యం పొలిమేర వరకూ వచ్చిన విప్రులు, అక్కడ వెనుదిరిగి చూస్తారు. ఫలితంగా ఆ జగన్మాత జ్యోతి రూపంలో అక్కడ నిలిచిపోతుంది. ఈ వృత్తాంతం అంతా విప్రులు వచ్చి, నందరాజుకు విన్నవిస్తారు. ఆయన తన సతీమణి, బంధుమిత్ర పురజనపరివారసహితంగా వచ్చి, అందరిముందూ జరిగినదంతా తెలియజేసి, మహానుభావులైన విప్రుల పట్ల తను చేసిన తప్పును క్షమించమని జగన్మాతను ప్రార్థిస్తాడు. పశ్చాత్తాపం చెందుతున్న రాజును జగన్మాత క్షమించి, విప్రులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చమని ఆనతి ఇస్తుంది. ఆ ప్రకారమే, నందరాజు వెంటనే ఆ విప్రులకు నందవరాది అగ్రహారాలను దానం చేసి, తగిన వృత్తులను కలగజేస్తాడు. కాశీనుంచి విచ్చేసిన జగన్మాతను అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకోవలసిందిగా నందరాజు ప్రార్థిస్తాడు. తాను చౌడేశ్వరీ నామంతో అక్కడ వెలసి, విప్రులను, ఇతర చరాచరసృష్టినీ కాపాడతానని తల్లి అభయప్రదానం చేసి, అక్కడ జ్యోతిరూపంలో వెలుస్తుంది. నాటినుంచీ అక్కడి బ్రాహ్మణులు అందరూ 'నందవరీకులు'గా పేరొంది, నిత్యం వేదశాస్త్ర అభ్యాసంతోబాటు, అగ్నిష్టోమ్యాది యజ్ఞకర్మలను ఆచరిస్తూ,, తమ ఇళ్లలోని అన్ని శుభకార్యాలలోనూ చౌడేశ్వరీమాతను 'జ్యోతి' రూపంలో కొలుస్తూ, ఆ జగన్మాతను ఆరాధిస్తూ,


తల్లి కరుణతో జగద్విఖ్యాతిని పొందుతున్నారు - అని ప్రచారంలో ఉన్న గాథ. 


    శ్రీ చౌడేశ్వరీమాత ఆవిర్భావ చరిత్ర, చరిత్రరచనకు ముందునాటి భవిష్యత్పురాణం, భాగవతంలోని ద్వాదశ స్కంధములో ఉన్నట్లూ, ఆధునిక కాలంలో విన్నకోట సీమ, కొండవీడు, కొండపల్లిల దండకవిలెలలోనూ నమోదు అయిఉన్నట్లు శ్రీ గుంటుపల్లి సోమయ్య వివరించారు. వీరు 1914 ప్రాంతంలో 'ప్రబంధ కల్పవల్లి' అనే మాసపత్రికకు సంపాదకులుగానూ ఉండేవారు. చారిత్రక ఆధారాలనుబట్టి, శ్రీ చౌడేశ్వరీమాత అవతారం జరిగి, క్రీ.శ. 2013 నాటికి సుమారు 4134 సంవత్సరాలయిందని శ్రీ గోపానంద నాథులు రచించిన 'శ్రీ నందవర చౌడేశ్వరీ చరిత్ర' అనే పుస్తకం పేర్కొంటోంది. 


సీ. జన్మదేశంబశేష బ్రహ్మవిద్యల కాశ్వలాయన శాఖకాశ్రమంబు  


     సంకేత భవనంబు సకల శాస్త్రములకు ప్రథమాగమములకు పట్టుకొమ్మ,

     ఉపనిషత్తులకు నిత్యోత్సవస్థానంబు, యామళంబులకు సింహాసనంబు,

     ఆలయంబఖిల కావ్యాదికంబులకు గంధర్వలోకంబు గాంధర్వమునకు,

     కాశికాక్షేత్ర కళ్యాణ కటకనగర విప్ర పంచశతీ వృత్తి విస్తృతంబు,

     గుణపవిత్ర త్రయోదశ గోత్రయుతము నందభూవరదత్తంబు నందపురము.


సీ.శ్రీవత్సగోత్ర, వాశిష్ఠ సాత్రేయ, కౌశికస విశ్వామిత్ర, శ్రీ యగస్త్య,

    కాశ్యప, కుత్సస, గౌతమ, మౌనభార్గవ ఋషిగోత్ర మౌద్గల్య, వీత

    హవ్య, భరద్వాజ హరితస ముఖ్య త్రయోదశ గోత్రులౌ భూదివిజుల

    నాశ్వలాయన సూత్రులౌ విప్రవర్యుల సకత వేద శాస్త్ర పురాణవిదుల


          చముండ మాంబా ప్రసాద ప్రశస్త ఘనుల


          పూజ్యుల గణించి తనదు సామ్రాజ్యగరిమ 

          నగ్రహార క్షితిని వృత్తులారునేడు

          భూవరు డొసగె యానంద లీల.


     పైన చెప్పిన విధంగా నందవరీకులు ప్రధానంగా కాశీనుంచి ఇక్కడికి వచ్చినవారుగా అర్థమవుతోంది. అయితే, పైనగల మొదటి సీస పద్యం ఆరో పాదంలో 'కాశికాక్షేత్ర కల్యాణ కటకనగర...' అన్న పదాల ఆధారంగా వీరు కల్యాణ్‌ (నేటి మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది), కటకనగరం (నేటి ఒడిషా రాష్ట్రంలో ఉంది) వంటి ప్రాంతాలనుంచి కాశీకి చేరి ఉంటారనే భావనా ఉంది. 


అలాగే, రెండో సీస పద్యంలో పేర్కొన్న విధంగా వీరిలో 'శ్రీవత్సగోత్ర, వాశిష్ఠ సాత్రేయ, కౌశికస, విశ్వామిత్ర, శ్రీ యగస్త్య, కాశ్యప, కుత్సస, గౌతమ, మౌనభార్గవ, (ఋషిగోత్ర) మౌద్గల్య, వీతహవ్య, భరద్వాజ హరితస' అనే 13 గోత్రాలు ఉండేవనేదీ స్పష్టం. వీరు ఋక్శాఖ, ఆశ్వలాయన సూత్రులైన కరణకర్మ శాఖీయులు. అలాగే, మిగిలిన అందరు బ్రాహ్మణులకు మల్లేనే నందవరీకులు సైతం మొదట పూర్తిగా వైదికులేకాగా, తర్వాత కాలంలో వారిలోనూ వైదికి, నియోగి విభేదాలు ఏర్పడ్డాయి.


    నందవరీకులలో విశిష్టమైన ఖ్యాతి గడించిన ప్రముఖులు అనేకంగా ఉన్నారు. చాణక్యుడు, మహామంత్రి తిమ్మరుసు, విద్యానాథుడు, తాళ్లపాక అన్నమయ్య, తరిగొండ వేంగమాంబ, నన్నయ భట్టారకుడు, సంకుసాల నృసింహ కవి, రాయన భాస్కర మంత్రి వంటి ప్రముఖులు అందరూ నందవరీకులే.


లింగధారులు

    లింగధారణ అనేది శివారాధనకు చెందిన విశ్వాసచిహ్నం అన్నది స్పష్టం. 


    వీరశైవులకు వృషుడు, నంది, భృంగి (భృంగిరిటి), వీరుడు, స్కందుడు అనే అయిదుగురే గోత్రకర్తలు, పంచాచార్యులు. వీరికే యుగభేదాలనుబట్టి వేర్వేరు పేర్లు సమకూడాయి. అలా వచ్చిన పేర్లు (పైన చెప్పిన వరుస క్రమంలోనే): రేవణసిద్ధ, మరుళసిద్ధ, ఏకోరామ, పండితారాధ్య, విశ్వారాధ్య అనేవి. ఈ ఆరాధ్య మతధర్మాలను స్వీకరించినవారు మిగిలిన బ్రాహ్మణులనుంచి తాము భిన్నమని చెప్పుకోవడానికి 'ఆరాధ్య' పదస్వీకారం చేసి, 'ఆరాధ్యబ్రాహ్మణులు' అయ్యారని తెలుస్తోంది. 


        'ఆరాధ్య బ్రాహ్మణులు లింగధారణాది వీరశైవ ధర్మములను స్వీకరించినను లింగముతోబాటు యజ్ఞోపవీతమును ధరించి యుపనయన సంస్కారములు గ్రహింతురు. లింగధారులుగాని బ్రాహ్మణులు చెప్పికొను ఋషిగోత్ర సూత్రములనే వీరును జెప్పుకొందురు. వీరిలో నిప్పటికినిట్టి గోత్రసూత్రవ్యవహారమే జరుగుచున్నది.' అంటారు శ్రీ బండారు తమ్మయ్యగారు. (పాలకురికి సోమనాథ కవి, వ్యాసం, కాకతీయ సంచిక, 1991, పే. 214)  


ప్రథమ శాఖీయులు

    ప్రథమ శాఖీయులు అటు వైదీకులలోనూ, ఇటు నియోగులలోనూ ఉండటం గమనార్హం. 


    ప్రథమ శాఖీయులగురించి తెలుసుకోవాల్సిన విశేషాలు అనేకం ఉన్నాయి. ముందుగా వీరికి 'ప్రథమ శాఖ' అన్న పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం:


    వైశంపాయనుడి వద్ద వేదాభ్యాసం చేస్తున్న యాజ్ఞవల్క్యుడు, వైశంపాయనుని ఆగ్రహానికి గురై, తను అంతవరకూ నేర్చుకున్న వేదాలను కక్కివేయాల్సివస్తుంది. అప్పుడు, తీవ్రమైన నిరాశకు గురయిన యాజ్ఞవల్క్యుడు వేదాభ్యాసం కోసం సూర్యుడిని ప్రార్థిస్తాడు. సూర్యుడు ఒక గుర్రం రూపంలో ప్రత్యక్షమయి, యాజ్ఞవల్క్యునికి యజుర్వేదం నేర్పుతాడు. ఆయన నేర్పినవే 15 శాఖలు. యజుర్వేదంలోని ఆ మొదటి 15 శాఖలను 'శుక్ల యజుర్వేదం' అంటారు. వాటిని యాజ్ఞవల్క్యుడు తన శిష్యులైన కణ్వుడు, మధ్యందినుడు, కాత్యాయనుడు, వాజసనేయుడు-లకు నేర్పాడని భాగవతంలో ఉంది.


అయితే, సూర్యుడినుంచి వేదం నేర్చుకోవటం పాపమనీ, అధమమనీ వైశంపాయనుడు శపిస్తాడు. దానికి యాజ్ఞవల్క్యుడు, బాధపడి, తన గురువైన వైశంపాయనుడిని క్షమాపణ కోరతాడు. అప్పుడు సూర్యుడి వినతి మేరకు శాంతించిన వైశంపాయనుడు, తన శాపం తప్పదనీ, అయితే దానికి కొంత మినహాయింపు ఇవ్వగలననీ చెప్తూ, శుక్ల యజుర్వేదం నేర్చుకునేవారు ప్రతీదినం ఒక ముహూర్తకాలంపాటు (అంటే, 48 నిమిషాలపాటు) అధములుగా ఉంటారని చెప్పాడని వరాహ పురాణం పేర్కొంటోంది. ఈ శుక్ల యజుర్వేద (యజుర్వేదంలోని తొలి 15) శాఖలను అనుసరించేవారిని 'ప్రథమ శాఖీయులు' అంటారు. వీరినే 'వాజసనేయులు', 'కాత్యాయనులు' లేదా 'శుక్ల యజుస్‌'లనీ అనడమూ ఉంది. యాజ్ఞవల్క్యుని వద్ద వేదం నేర్చుకున్న కాత్యాయనుడు, వేదానికి సూత్రాలను రాశాడు కనుకనే, ఈ సూత్రాలను పాటించే వీరికి 'కాత్యాయనులు' అని పేరు వచ్చింది.  


    స్కంద పురాణం, 17, 18 అధ్యాయాలలో శుక్ల యజుర్వేదం గురించిన ప్రసక్తి ఉన్నా, ఈ శాపం గురించిన ప్రస్తావన లేదు. 


    యాజ్ఞవల్క్యుడు, సూర్యుని వద్ద నేర్చుకున్న యజుర్వేద శాఖలను ఏమాత్రం ఎవ్వరూ మార్చలేదు గనుక, ఇవి 'శుద్ధ'మైనవి గనుక, ఇవి 'శుక్ల యజుర్వేదం'గా పేరు పొందాయనీ అంటారు.

కామెంట్‌లు లేవు: