2, జులై 2021, శుక్రవారం

ఎలుకలు తమకలుగులోని కేనుఁగుఁ దీసెన్

అవధాన ప్రక్రియ మన తెలుగు భాషలోని అత్యంత గొప్ప విషయం.  మన తెలుగు కవులు అనేకులు అవధానాలు చేసి వారి పాండితీ గరిమను చాటుకున్నారు. అవధానాలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అష్టావధానం.  అంటే ఎనిమిది మంది పృచ్ఛకుల మధ్యన ఒక అవధాని కూర్చొని వారు సంధించే ప్రశ్నల పరంపరకు ధీటుగా సమాధానం చెప్పి సభను మెప్పించటం సాధారణమైన విషయం కాదు.  అక్కడ కూర్చున్న అవధాని అత్యంత ప్రతిభాశాలి కావాలని వేరే చెప్పనవసరం లేదు.  

అష్టావధానంలో వున్న ఎనిమిది అంశాలలో సమస్య పురాణం ప్రముఖమైనది ఎందుకంటే పూర్తీ వ్యతిరేకంగా అసాధ్యంగా కనపడే సమస్యను భావ యుక్తంగా పృచ్ఛకుడు ఇచ్చిన ఛందస్సులోనే పూరించటం నిజంగా కత్తిమీద సాము లాంటిదే. మనం రోజు ఒక సమస్య దాని పురాణాన్ని తెలుసుకుందాము. 

ఈ పరంపరలో మొట్ట మొదటిగా కంద పద్యంతో వున్న సమస్య దాని పురాణ తెలుసు కుందాము. 

ముందుగా కంద పద్యాన్ని గూర్చి కొంత తెలుసుకుందాము. ఇది దేశీయ ఛందస్సుకు చెందిన పద్య ప్రక్రియ.  పూర్వం కందం వ్రాసిన వాడూ కావేనా అని అనేవారు.  అంటే కంద పద్యం స్వల్ప కృషితో వ్రాయగల ఛందస్సు.  ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి.  వృత్త చెందస్సు, దేశీయ ఛందస్సు వివరాలు ఇంకొక సారి తెలుసుకుందాము. 

ఈ నాటి సమస్య ఇది: 

 ఎలుకలు తమకలుగులోని కేనుఁగుఁ దీసెన్

దీని భావముఎలుకలు తమ కలుగు అంటే కన్నంలోకి ఏనుగును తీసుకొని వెళ్లాయి.  మనం సాధారణ దృష్టితో చుస్తే ఏనుగు చాలా పెద్ద జంతువు ఎలుకలు చాలా చిన్న జంతువులూ మరి ఎలుకలు ఏనుగును యెట్లా తీసుకొని పోగలుగుతాయి అది ఒక ప్రశ్న అయితే అదికూడా ఎలుక కన్నంలోకి అంటే ఎట్టి పరిస్థితిలోను ఎలుకల కన్నంలో ఏనుగు పట్టదు. మరి కవి ప్రతిభ చుడండి. 


క. ఇలలో నిద్దఱురాజులు

మలయుచుఁ జదరంగమాడి మాపటివేళన్
బలమెత్తి కట్ట మఱచిన
ఎలుకలు తమకలుగులోని కేనుఁగుఁ దీసెన్

దీని భావం. ఒకచోట ఇద్దరు రాజులు రాత్రిపూట చదరంగం (చెస్ బోర్డు) ఆడి ఆ పావులను దాచి పెట్టటం మరచినారట అప్పుడు చదరంగంలోని ఏనుగును ఎలుకలు వాటి కన్నంలోకి తీసుకొని పోయాయట . ఇక్కడ పూర్తిగా ఔచిత్యం కనపడుతున్నది. ఎందుకంటె చదరంగంలోని ఏనుగు సాదారణ ఎలుకల కన్నా చాలా చిన్నది కాబట్టి దానిని అవి వాటి కన్నంలోకి తీసుకొని పోగలవు. 
ఇంకా మరిన్ని పురాణాలలో మళ్ళీ కలుదాము. 
మీ బుధ జన విధేయుడు 
సి. భార్గవ శర్మ 

కామెంట్‌లు లేవు: