2, జులై 2021, శుక్రవారం

మనస్సును - శుద్ధి చేసుకోవడం ఎలా...??

 *_నేటిమాట_*


*మనస్సును - శుద్ధి చేసుకోవడం ఎలా...???*


భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ ! తవాంఘ్రి పల్లవ యుగం _ సంస్థాప్య సంవిత్ఫలం,సత్త్వం మంత్ర ముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం _ కల్యాణ మాపాదయన్ !!


-- ఆదిశంకరుల వారు --


*విశేషం_ పుణ్యాహవాచనం :*


ఇది యొక శుద్ధి కర్మ , ఇది చేసేటప్పుడు కలశము పెట్టి , దానికి దారముౘుట్టి

కలశములో నీళ్ళు పోసి  మామిడి చిగుళ్ళూ, కొబ్బరికాయనూ దానిపై ఉంచి మంత్రములు ౘదువుతూ, ఆ నీటితో గృహమును శుద్ధి చేసి, మంగళాన్ని పొందుతారు...


*తాత్పర్యము :*

ಓ సాంబమూర్తీ ! శివా ! నేను భక్తుడనై నా శరీరము అనే గృహాన్ని 

నిర్దుష్టంగా శుద్ధి చేసుకొని , మనస్సునకు ఇష్టమైన మంగళమును చేయడానికి పూనుకొని, దానికొఱకై భక్తి అనే నూలుపోగులను చుట్టి , సంతోషము అనే నీటితో నింపిన నామనస్సు అనే కలశంలో  నీ పాదములనే చిగుళ్ళనూ, 

జ్ఞానము అనే కొబ్బరి కాయను ఉంచి , కలశస్థాపనము చేసి , సత్త్వగుణ

రూపమైన తారకమంత్రాన్ని ఉచ్ఛరిస్తూ, పుణ్యాహవాచనమును నెరవేరుస్తాను.

*( అన్ని వేళలా మీ పాదపద్మములను స్మరిస్తానని భావం )*


*వివరణ:*

సామాన్యంగా మైలగానీ,పురుడుగానీ వచ్చి , ఇల్లూ ఇంట్లోని వారూ,

అశౌచంగా వుంటే , శుద్ధి రోజున తప్పకుండా గణపతి పూజ తోపాటు 

పుణ్యాహవాచనం చేసి ఆ కలశాలలోని పవిత్ర జలాన్ని  ఇల్లంతా చల్లాలి... ఇంటిలోని వారి శిరస్సులపైనా ౘల్లాలి. అప్పుడు ఆ ఇల్లూ ఇంటి యజమానీ , ఇంటిలోనివారూ నిర్మలులవుతారు...

 అలాగే భక్తుల,హృదయాలు అరిషడ్వర్గాలతో, అసూయాద్వేషాలతో , అపవిత్ర కార్య

క్రమాలతో మలినములైనపుడు ఏ విధంగా వారు తమ దేహాలను శుద్ధి

చేసుకోవాలో  ఈ శ్లోకంలో శంకరులు చెప్పారు...


శంకరులు ఇలా అన్నారు...

ಓ ఈశ్వరా ! నా శరీరం పాడుపడిన కొంప, దానిని శుద్ధి చేసుకోవాలి. తరువాత కల్యాణాన్ని ౘక్కగా సంపాదించాలి...

దానికై  పుణ్యాహం అనే శుద్ధి కర్మను చేసుకోవాలి, పుణ్యాహవాచన

కర్మకు కావలసిన సామగ్రిని నేను ఇలా సంపాదింౘుకుంటాను. 

ముందుగా కలశ స్థాపన చెయ్యాలి,  నామనస్సే ఆ కలశం.  

నామనస్సనే కలశం ప్రసన్నంగా 

స్వచ్ఛంగా వుంది... 

కలశానికి దారాలు ఛుట్టాలి, నేను నాభక్తి అనే దారాలు ఆ కలశానికి చుడతాను. 

నా సంతోషమనే నీటితో కలశాన్ని నింపుతాను...

కలశంలో లేత మామిడి చిగుళ్ళు వేయాలి కదా ! నీ పాదపద్మాలే నాకు 

దొరికిన ఆ చిగుళ్ళు...

అందుచేత నామనస్సనే కలశంలో  ఈశ్వరా ! 

నీ పాదాలనే చిగుళ్ళను వేస్తాను, ఇంక కలశంపై ఒక ఫలం ఉంచాలి...

నేను ఙ్ఞానం అనేే కొబ్బరికాయను కలశంపై ఉంౘుతాను. 

తరువాత మంత్రాలు చదవాలి.  

నేను సత్త్వగుణ ప్రధానమైన తారకమంత్రాన్ని చదువుతాను. 

ఈ పుణ్యాహవాచనం వల్ల నా శరీరమూ, మనస్సూ, వాక్కూ పవిత్రమవుతాయి. 

ఉజ్జయినీ మహాకాలుని పంచామృత అభిషేకం మనం కూడా మనశరీర శుద్ధి, ఇలాగే  ఈశ్వర పాద ద్వంద్వాన్ని మన 

చిత్తంలో నిలిపి వాక్కుతో శివనామాన్ని జపించాలని,  

ఈ శ్లోకం ద్వారా శంకరులు మనకు సూచించారని మనం గ్రహించాలి, ఆచరించాలి.


                           *_🌷శుభమస్తు🌷_*

                   🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

కామెంట్‌లు లేవు: