1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

శ్రీశైలం ఉబ్బలి బసవన్న కధ...

 శ్రీశైలం ఉబ్బలి బసవన్న కధ....


పూర్వం శ్రీశైల ప్రాంతం లోని బ్రహ్మగిరి సమీపం లో ఒక మహా శివభక్తుడైన శిల్పి వుండేవాడు.ఆయన ఒకసారి మల్లికార్జున స్వామి ని సేవించ డానికి శ్రీశైలం వచ్చాడు.అలా స్వామిని పూజించి యింటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించే ఆలోచించడం ప్రారంభించాడు.


తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణం లోనూ బయటా కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలనే అనుకున్నాడు.

ఉత్సాహంతో పని ప్రారంభించాడు.


శిల్పి నక్త వ్రతాన్ని(పొద్దున్నించీ భోజనం చేయకుండా రాత్రి శివపూజ చేసి భుజించడాన్ని నక్తం అంటారు) పాటిస్తూ నలభై రోజులలో రెండు మహత్తరమైన నందులను తయారు చేశాడు.


కవలపిల్లల్లా ఒకే రూపుతో ముచ్చటగా వున్న నందులను చూసి ఆనందించాడు.కానీ ఏమి లాభం?వెంటనే విచారం లో మునిగి పోయాడు.ఈ మహత్తర నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి? అన్నదే అతని బాధ.


మధ్యలో పాతాళగంగను కూడా దాటాలి మరి.నిద్రకూడా పట్టలేదు.అర్ధ రాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు శిల్పి.వెంటనే ఒక కల. కలలో స్వామి కరుణించాడు.స్వామి శిల్పి తో యిలా అన్నాడు.


భక్తా! నీ సంకల్పం మహత్తర మైనది. నీ శ్రమ ఫలించింది.ఇవిగో ఈ పలుపు త్రాళ్ళను తీసుకొని నందుల మెడలకు తగిలించు. వెనుతిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో..వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి.ఎదురుగా పలుపు త్రాళ్ళు కనిపించాయి.


సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు వెంటనే త్రాళ్ళను నందుల మెడలకుతగిలించాడు.

త్రాళ్ళను చేత బట్టి శ్రీశైలానికి బయల్దేరాడు. తెల్లవారు ఝాముకుపాతాళగంగను చేరుకున్నాడు. అలాగే కృష్ణానదిని దాట సాగాడు.


నీటిలో కొంత దూరం వెళ్ళాడు.రెండవ ఒడ్డుకు చేరబోతున్నాడు.ఒక నంది అతని ముందు వున్నది యింకొకటి వెనక వస్తున్నది. వెనక వస్తున్న నంది కాలు నీళ్ళలోని రాళ్ళ మధ్య యిరుక్కొని అది రావడం మానేసింది కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి.


అంతే కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి మళ్ళీ శిలగా మారిపోయింది.శిల్పి చేసేదేమీ లేక దానిని అక్కడే వదిలి ఒక నంది తోనే శ్రీశైలం చేరాడు. ఇప్పుడు. శ్రీశైలం లో వున్న నంది. ఆ శిల్పి చేసిన నందే నని చెప్తారు.. 


ఇదంతా కర్ణా కర్ణిగా వినపడుతున్న గాధ. ఊబినుండి కాలు పైకిలాక్కుంటూ శిలగా మారిపోయిన నంది ఉబ్బలి బసవన్న అని పిలువబడుతూ ఇటీవలి కాలం వరకూ భక్తులకు దర్శన మిచ్చేది. 


శ్రీశైలం ప్రాజెక్ట్ వల్ల పాతాళ గంగలో మునిగిపోయిన నంది 700 అడుగుల లోతున నీటిలో ఇప్పటికీ ఉందట..పెద్దోళ్లు ఆ నందిని అప్పుడు చూసినవాళ్లు యిప్పటికీ ఉన్నారు.

కామెంట్‌లు లేవు: