8, సెప్టెంబర్ 2020, మంగళవారం

తలుపులమ్మ తల్లి,

చల్లగా చూసే తలుపులమ్మ తల్లి, తూర్పుగోదావరి జిల్లా*

అమ్మవారు అనేక రూపాలతో కొలువై అనేక నామాలతో పిలవబడుతూ పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. అలాంటి అమ్మవారు తలుపులమ్మ పేరుతో పూజలు అందుకనే క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా 'తుని' సమీపంలోని 'లోవ'లో కనిపిస్తుంది. అగస్త్య మహర్షికి ప్రత్యక్షమైన అమ్మవారు, ఆయన అభ్యర్థన మేరకు ఇక్కడ వెలిసిందని స్థల పురాణం చెబుతోంది.

లలితాంబికాదేవి మరో రూపమే 'తలుపులమ్మ తల్లి'గా భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ తల్లిని ఆరాధిస్తే ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుందని అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఇక ఇక్కడి మరో విశేషం ఏమిటంటే వాహన ప్రమాదాల నుంచి అమ్మవారు రక్షిస్తుందని నమ్ముతుంటారు. అందువలన చుట్టుపక్కల ప్రాంతాల వారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగానే, ఇక్కడికి వచ్చి పూజ చేయిస్తారు.

అంతే కాకుండా ఇక్కడి రాళ్లపై తమ వాహనాల నెంబర్ రాస్తుంటారు. ఇలా చేయడం వలన అమ్మవారు తమ వాహనానికి ఎలాంటి ప్రమాదం జరక్కుండా కాపాడుతూ ఉంటుందని చెబుతుంటారు. ఈ ప్రాంతంలో వాహనాలపై అమ్మవారి పేరు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తల్లి పట్ల భక్తులకి గల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుంటుంది.

తలుపులమ్మ లోవ... తూర్పు గోదావరి జిల్లా, తుని పట్టణానికి సమీపాన ఉన్న ప్రాచీన దేవస్థానం. తీగ కొండ, ధార కొండ...అనే రెండు గిరుల నడుమ రాతినే ఆలయంగా చేసుకుని అమ్మ కొలువైంది. మధ్యలో తలుపులమ్మ, ఒకవైపు సోదరుడు పోతురాజు...మరోవైపు అమ్మవారి ప్రతిరూపం! భక్తులు చెల్లించే ముడుపులూ మొక్కుబడులతో తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరం తర్వాత అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న దేవస్థానంగా ఈ క్షేత్రం సర్కారువారి రికార్డులకెక్కింది.

*స్థల పురాణం.*

లలితాంబికాదేవి మరో రూపమే తలుపులమ్మ తల్లి అని భావిస్తారు. కృతయుగంలో అగస్త్య మహర్షి అమ్మవారిని ఇక్కడ పూజించినట్టు పురాణ కథనం. పర్వతరూపుడైన మేరువు తన శరీరాన్ని పెంచుకుంటూ పొతాడు. అలా, సూర్యభగవానుడి రథ మార్గానికి అడ్డుతగిలేంతగా పెరుగుతాడు. అదే కనుక జరిగితే అల్లకల్లోలమే. మహర్షులూ దేవతలూ ఆ పరిస్థితిని గమనిస్తారు. అగస్త్య మహాముని అంటే మేరువుకు మహాగౌరవం. దీంతో రుషులంతా అగస్త్యుడిని అశ్రయిస్తారు. ఎలాగైనా మేరువు రూపాన్ని తగ్గించమని మొరపెట్టుకుంటారు. అగస్త్యుడు ఆ కోరికను మన్నిస్తాడు. మహర్షిని చూడగానే మేరువు శిరసు వంచి నమస్కరిస్తాడు. ‘ఓ మేరునగధీరుడా! నేను తీర్థయాత్రలకు వెళ్తున్నా. తిరిగి వచ్చేంతవరకూ అలానే శిరసు వంచుకుని ఉండగలవా...’ అని అడిగాడు అగస్త్యుడు. మేరువు కాదంటాడా? ‘శిరోధార్యం!’ అంటూ దించిన తల ఎత్తలేదు. అతనిపై నుంచి నడుచుకుంటూ అగస్త్యుడు యాత్రలకు బయల్దేరతాడు. మహర్షి మార్గశిర బహుళ అమావాస్యనాడు కీకారణ్యంలోంచి ప్రయాణిస్తుండగా... సంధ్యాసమయం సమీపిస్తుంది. ఆహ్నిక విధుల కోసం జలవనరులేమైనా ఉన్నాయేమో అని వెదుకుతాడు. ఆ జాడే కనిపించదు. వెంటనే పాతాళ గంగను ప్రార్థిస్తాడు. గంగ పర్వత శిఖరాల మీద పెల్లుబికి ఒక లోయగుండా ప్రవహిస్తుంది. అగస్త్యుడు నిర్విఘ్నంగా సంధ్యావందనాన్ని పూర్తిచేసుకుంటాడు. అమాస చీకటి కమ్ముకోవడంతో, రాత్రికి అక్కడే విశ్రమిస్తాడు. గాఢనిద్రలో ఉండగా...కొండలోయలో దివ్య కాంతి ప్రసరిస్తుంది. వెనువెంటనే, జగజ్జనని లలితాంబికాదేవి ప్రత్యక్షం అవుతుంది. శిష్టరక్షణే ధ్యేయంగా తానీ ప్రాంతంలో సంచరిస్తున్నానని చెబుతుంది. ఆయురారోగ్యాలు ప్రసాదించే తల్లిగా ఇక్కడే కొలువుదీరమని వేడుకుంటాడు అగస్త్యుడు. కాలక్రమంలో ‘లోయ’ అన్నమాట ‘లోవ’గా మారింది. తలంపులను తీర్చే తల్లిగా, తలుపులమ్మగా అమ్మవారు పేరుతెచ్చుకున్నారు. ఇదీ స్థల పురాణం. మరో కథనం ప్రకారం - ఎన్నో సంవత్సరాల క్రితం... ఈ ప్రాంతంలో ఓ యువతి సంచరించేది. తలుచుకోగానే...ప్రత్యక్షమయ్యేది. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేది. ఆమె పేరేమిటో ఎవరికీ తెలియదు. అంతా తలుపులమ్మ అనే పిలిచేవారు. కొన్నాళ్లకు ఆ దైవస్వరూపురాలు శిలారూపం దాల్చిందట!

*ఎన్నో నమ్మకాలు...*

తలుపులమ్మను ప్రయాణ అధిదేవతగా భావిస్తారు. ఆలయానికి కిలోమీటరు దూరం నుంచే వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లు రాళ్ల మీదా పరిసర నిర్మాణాల గోడల మీదా కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా కొత్త వాహనం కొంటే అమ్మవారి సన్నిధిలో బండి పూజ చేయించాల్సిందే. లారీ డ్రైవర్లకైతే మరింత నమ్మకం. పలు లారీలమీద అమ్మవారి పేరు కనిపిస్తూ ఉంటుంది. ప్రమాదాల నుంచి వాహనాల్నీ వాహన చోదకుల్నీ తలుపులమ్మ తల్లి కంటికి రెప్పలా కాపాడుతుందని ఓ నమ్మకం. కొందరైతే కొండ మీద ఎత్తయిన ప్రాంతాల్లో వాహనాల నంబర్లు రాయిస్తుంటారు. ఎంత ఎత్తున రాస్తే, తల్లి అంత ఎత్తుకు తీసుకెళ్తుందని విశ్వాసం. మరో విశేషం ఏమిటంటే, తీగ కొండ-ధార కొండల మధ్య నిత్యం పాతాళం నుంచి వచ్చే నీరే భక్తుల దాహార్తిని తీరుస్తుంది. ఇందుకు దేవస్థానం లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న ట్యాంకుల్ని ఏర్పాటు చేసింది. ఏటా పది నుంచి పదిహేను లక్షల మంది ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసిన సుమారు 50 అడుగుల అమ్మవారి విగ్రహం భక్తుల్ని ఆకర్షిస్తుంది. ప్రధాన ఆలయం దగ్గరున్న సుమారు 40 అడుగుల ఈశ్వరుని విగ్రహమూ చూపు తిప్పుకోనివ్వదు. ప్రసాదంగా ఇచ్చే గోధుమ రవ్వ లడ్డూ ఇక్కడి ప్రత్యేకత. భక్తుల సౌకర్యార్థం కొండపై కాటేజీలు నిర్మించారు.

*ప్రత్యేక పూజలు....*

అమ్మవారి జన్మ నక్షత్రమైన స్వాతి రోజున పంచామృతాభిషేకాలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమినాడూ వేద మహాచండీ హోమం జరుగుతుంది. ఆషాఢ మాసంలో లక్ష కుంకుమార్చన చేస్తారు. ఒక ఆదివారం శాకాంబరిగా అలంకరిస్తారు. చివరి రెండ్రోజులు సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. లోవ క్షేత్రం అన్నవరానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. తుని వెళ్లే మార్గంలో జగన్నాథగిరి గ్రామ కూడలి వద్ద దిగి, ఆరు కిలోమీటర్లు ప్రయాణిస్తే తలుపులమ్మ లోవ చేరుకోవచ్చు. తుని ఆర్టీసీ కాంప్లెక్సుకు సరిగ్గా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అమ్మవారి ఆలయం ఉంది.

కామెంట్‌లు లేవు: