31, జులై 2023, సోమవారం

శివాలయంలో

 *నిత్యాన్వేషణ:*


శివాలయంలో నందీశ్వరునికి ఉన్న ప్రాధాన్యత మిగిలిన దేవాలయాల్లో ఆయా దేవుళ్ళు వాహనాలకు ఉండదు, ఎందుకని? 



*నందీశ్వర నమస్తుభ్యం, సాంబానంద ప్రదాయకం౹*

*ఉమామహేశ్వర పూజార్ధం, అనుజ్ఞామ్ దాతుమర్హసి॥*

శివ దర్శనం చేసుకునేముందు నందీశ్వర దర్శనం తప్పనిసరి అని చెప్తారు.. మొదటగా నందీశ్వరుని పృష్ట భాగాన్ని స్పృశించి , అయన శృంగములు (కొమ్ములు) మధ్యనుంచి శివ దర్శనం చేసుకోవాలి అని చెప్తారు.. మన కోరికలు కూడా మొదట నందీశ్వరుని చెవిలోని విన్పించాలి అంటుంటారు..


అసలు నందికి అంత ప్రాముఖ్యత ఎలా లభించింది? అంటే పురాణపరంగా, శాస్త్రపరంగా అనేక రకాలైన ఆసక్తికర విశ్లేషణలు ఉన్నాయి.. మొదట పురాణపరమైన కారణాలు..

*శిలాదుడు అనే మహర్షి కి నంది శివ ప్రసాదంగా లభిస్తాడు.. అయితే నంది అల్పాయాష్కుడు అని కొంత మంది మునుల ద్వారా తెలుసుకున్న శిలాదుడు ఆందోళన చెందుతాడు.. అయితే నంది మాత్రం శివానుగ్రహం వల్ల తన తలరాతను మార్చుకోదలచి తపస్సుకి పూనుకుంటాడు.. నంది తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, ఆ మహానుభావుని దివ్యదర్శనానికి పులకరించి పోయిన నంది, ఆయుష్షు కాకుండా నిరంతరం శివసాన్నిధ్యం అని గొప్ప వరాన్ని అడుగుతాడు*


*శివుడు తధాస్తు అని నిరంతరం తనతోపాటు ఉండి , తనకి వాహనంగా ఉండే వరాన్ని అనుగ్రహిస్తాడు.. అంతే కాకుండా నందిని ప్రమథ గణాలకి అధిపతిగా కూడా నియమిస్తాడు.. ఈ విధంగా నిరంతరం శివుడిని అంటిపెట్టుకుని ఉండే అవకాశాన్ని నంది తన తఫఫలంగా పొందాడు* అని చెప్పవచ్చు..


ఇక విజ్ఞాన పరమైన విశ్లేషణ:


*ఇక వృషభం(ఎద్దు) అపరిమితమైన బలానికి, అంతులేని సహనానికి, లైంగిక పటుత్వానికి ప్రతీక.. నిజం చెప్పాలంటే ఈ మూడు గుణాలు ఒకే వ్యక్తిలో ఉండడం అసాధ్యం (సాధారణ వ్యక్తులకి).. ఎంత బలమున్నా ,ఎదిగి ఉండాలి అని చెప్పడం, కామం ఉన్నా ధర్మంగా ,సంతానోత్పత్తికి మాత్రమే ఉపయోగించుకోవాలని నంది విగ్రహం ఒక సందేశం ఇస్తుంది* అని నా భావన..


*ఇక వృషభం యొక్క నాలుగు పాదాలు సత్యం, ధర్మం, శాంతి ,ప్రేమకు చిహ్నాలుగా చెపుతారు.. ఒక జీవుడు ముక్తి పొందడనికి ఈ నాలుగు పాటించడం తప్పనిసరి* అని చెప్పడం..


*మీరు సరిగ్గా గమనిస్తే శివాలయంలో నంది ఎక్కువగా ధ్యాన ముద్రలో దర్శనమిస్తాడు.. అయన శివుడితో ఏమీ చెప్పుకోడు.. కళ్ళ ముందే ఉంటూ ఆయన్నే ధ్యానిస్తూ ఉంటాడు.. అలాగే మనం కూడా గుడిలో శివుడిని వరాల కోసం విసిగించకుండా, కేవలం ధ్యానిస్తే చాలు, ఈశ్వరుడే ఐశ్వర్యాలను అందిస్తాడు అని ఒక సందేశం.* ప్రార్ధన, ధ్యానం రెండూ వేరు వేరు అని చదివాను.. ప్రార్ధన అంటే దేవుడితో మనం మాట్లాడడం, ధ్యానం అంటే దైవం చెప్పేది మనం వినడం.. కాబట్టి ధ్యానానికి ఉన్న ప్రాశస్త్యాన్ని నంది విగ్రహం ద్వారా వివరించారు అని ఒక విశ్లేషణ..


*ఇక నందికి , శివునికి మధ్యలో ఎవర్ని నిలబడవద్దు అని పూజారి వారిస్తారు .. దానికి అర్ధం మీరు నిరంతరం శివ ధ్యానంలో ఉండాలి, మీకు, ఆ శివునికి మధ్యలో ఎటువంటి అడ్డు ఉండకూడదు, అంటే రకరకాల ఆకర్షణలు, వ్యామోహాలు లాంటివి లేకుండా, చట్టంలో శివుడిని ఉంచుకోవాలి* అని చెప్పఁడం..

అలాగే శ్రీ మహావిష్ణువు కి గరుత్మంతుడు, వినాయకునికి మూషికుడు , సుబ్రహ్మణ్యుడికి కుక్కుటం , దుర్గాదేవికి సింహం.. ఇలా వేరు వేరు దేవతా రూపాలకి వేరు వేరు జంతువులు, పక్షులు వాహనాలుగా ఉన్నాయి.. ఒక్కో వాహనానికి ఒక్కో విశిష్టత, ఎంతో మహోత్తరమైన సందేశాలు ఉన్నాయి.. హిందూ ధర్మం లోని గొప్పతనం అదే..

కామెంట్‌లు లేవు: