11, అక్టోబర్ 2023, బుధవారం

సంపూర్ణ శ్రీ శివమహాపురాణం

 సంపూర్ణ శ్రీ శివమహాపురాణం - ఉమా సంహిత - అధ్యాయం - 17  


జంబూద్వీప వర్ణనము


సనత్కుమారుడు ఇట్లు పలికెను-


ఓ పరాశరపుత్రా! ఏడు ద్వీపములు మొదలగు వాటితో కూడియున్న భూమండలమును గురించి చక్కగా నేను సంగ్రహముగా చెప్పెదను. నీవు వినుము (1). జంబూ-ప్లక్ష-శాల్మలి -కుశ -క్రౌంచ -శాకక-పుష్పకములను ఏడు ద్వీపములను గలవు. ఇవి ఏడు సముద్రములచే చుట్టువారబడి యున్నవి (2). అవి క్రమముగా ఉప్పునీరు, చెరుకు రసము, నెయ్యి, పెరుగు, పాలు, మంచి నీరు అను వాటితో నిండియుండును. ఈ ఏడు ద్వీపములలో జంబూద్వీపము మధ్యలో నున్నది (3). ఓ వ్యాసా! దానికి మధ్యలో బంగరు మేరు పర్వతము గలదు. అది భూమి లోపలికి పదునారు, పైకి ఎనభై నాలుగు యోజనములు వ్యాపించి యున్నది. అగ్రమునందు దాని నిడివి ముప్పది రెండు యోజనములు గలదు. భూమిపై చాల ఎత్తులో ఉన్న ఈ పర్వతము అన్ని వైపులకు విస్తరించి యున్నది (4, 5). అది మూలమునందు పదునార వేల యోజనముల విస్తారమును కలిగియున్నది. అది పద్మముయొక్క బీజకోశమును పోలియున్నది. దానికి దక్షిణములో హిమవాన్‌, హేమకూటము మరియు నిషధము అను పర్వతములు గలవు (6). ఉత్తరమునందు నీలము, శ్వేతము మరియు శృంగీ అనే వర్ష(భూఖండమును నిర్దేశించే) పర్వతములు గలవు. పదివేల యోజనముల విస్తీర్ణము గల ఈ పర్వతములు రత్నములతో నిండి ఎర్రని కాంతులు కలిగి యుండును (7). ఇవి వేయి యోజనములు ఎత్తు, అంతే నిడివి కలిగి యున్నవి. మొదటి ఖండము భారతము. రెండవది కింపురుషమనబడును (8). ఓ మునీ! తరువాతిది హరివర్షము. అది మేరుపర్వతమునకు దక్షిణములో గలదు. మేరువునకు ఉత్తరభాగమునందు రమ్యకవర్షము గలదు. హిరణ్మయవర్షము దానిలో భాగమే (9). ఓ మహర్షీ! ఉత్తరమునందు కురుదేశము గలదు. భారతవర్షములో సహా ఈ భూభాగములు అన్నియు ఒక్కొక్కటి తొమ్మిదివేల యోజనముల నిడివి కలిగి యున్నవి (10).


దాని మధ్యలో ఇలావృతవర్షము గలదు. దాని మధ్యలో ఎత్తైన మేరు పర్వతము గలద. మేరువు అచట నాలుగు దిక్కులయందు తొమ్మిదివేల యోజనముల ఎత్తు ఉండును (11). ఓ మహర్షీ! ఇలావృతము ఇట్టిది. దీనియందు మేరువునకు నాలుగు వైపులయందు నాలగు ఎత్తైన పర్వతములు మేరువునకు బలమునిచ్చే స్తంభముల వలె నిలబడి దానితో జతగూడి యున్నవి (12). తూర్పునందు మందరము, దక్షిణములో గంధమాదనము, పశ్చిమదిక్కునందు విపులము, మరియు ఉత్తరమునందు సుపార్శ్వము అను పర్వతములు గలవు (13). కడిమి చెట్టు, జంబూవృక్షము, రావి చెట్టు మరియు మర్రిచెట్టు ఆ పర్వతమునకు ధ్వజముల వలె నున్నవి. వాటి ఎత్తు పదకొండు వందల మానములు గలదు (14). ఓ మహర్షీ! జంబూద్వీపము అను పేరు వచ్చుటకు గల కారణమును వినుము. అచట మహావృక్షములు ప్రకాశించుచున్నవి. వాటిస్వభావమును గురించి నీకు చెప్పెదను (15). జంబూవృక్షముయొక్క ఫలములు పెద్ద ఏనుగుయొక్క పరిమాణమును కలిగియుండును. అవి ఆ పర్వతముపై పడి పగిలి అంతటా చెల్లాచెదరు అగుచుండును (16). వాటి రసముచే అచట జంబు అని ప్రసిద్ధిని గాంచిన నదిఏర్పడి అచట పర్వతము చుట్టూ ప్రవహించుచున్నది. అచట నివసించు జనులు ఆ జలమును త్రాగుచుందురు (17). ఆ నదియొక్క తీరమునందు నివసించు జనులకు చెమట పట్టదు. శరీరమునకు దుర్గంధము ఉండదు. ముసలిదనము ఉండదు. వారికి ఇంద్రియముల పటుత్వము తగ్గదు (18). ఆ నదీతీరమనందలి మట్టిని తీసుకని నోటితో గాలి ఊది పొడిగా చేసినచో, అది బంగారమగును. సిద్ధులు ఆ బంగారము యొక్క ఆభరణములను ధరించెదరు. కావుననే, బంగారమునకు జాంబూనదము అను పేర వచ్చినది (19). ఓ మహర్షీ! మేరుపర్వతమునకు తూర్పునందు భద్రాశ్వము, పశ్చిమమమునందు కేతుమాలము అను రెండు భూఖండములు గలవు. ఇలావృతము వాటి మధ్యలో గలదు (20).


తూర్పు దిక్కునందు చైత్రరథము, దక్షిణమునందు గంధమాదనము, పశ్చిమమునందు విభ్రాజము, ఉత్తరమునుందు నందనము అనే ఉద్యానవనములు గలవు. (21). అరుణోదము, మహాభద్రము, శీతోదము, మానసము అనే ఈ నాలుగు సరస్సులయందు సర్వకాలములలో దేవతలు విహరించెదరు (22). పద్మాకారములోనున్న మేరుపర్వతమునకు కేసరముల స్థానములో తూర్పు దిక్కులో శీతాంజనము, కురుంగము, కురరము మరియు మాల్యవాన్‌ అనే పర్వతములు గలవు. ఇవి అన్నియు చాల ముఖ్యమైన పర్వతములు (23). త్రికూటము, శిశిరము, పతంగము, రుచకము, నిషధము, కపిలము మొదలైనవి దక్షిణదిక్కునందలి కేసరపర్వతములు (24). పద్మమునకు కేసరమువలె, మేరువునందు ఆ స్థానములో నుండే పర్వతములు కేసరపర్వతములనబడును. సినీవాసము, కుసుంభము, కపిలము, నారదము, నాగము మొదలైనవి పశ్చిమమునందలి కేసరపర్వతములు (25). శంఖచూడము, ఋషభము, హంసము, కాలంజరము మొదలగునవి ఉత్తరమునందలి కేసరపర్వతములు (26). మేరుపర్వతముయొక్క అగ్రభాగమునందు మధ్యలో బ్రహ్మపురము గలదు. బంగారముతో నిర్మించబడిన ఆ నగరము పదు నాలుగు వేల యోజనముల నిడివి కలిగియున్నది (27). దానిని చుట్టువారి అష్టదిక్పాలకుల నగరములు గలవు. ఆ ఎనిమిది నగరములు క్రమముగా ఆయా దిక్కులలో ఆ దిక్పాలకుల రూపములకు తగినట్లుగా ఉన్నవి (28). విష్ణువుయొక్క పాదములనుండి పుట్టిన గంగానది చంద్రమండలము గుండా ప్రవహించి ఆ బ్రహ్మపురములో పడుచుండును (29). ఆ గంగ అచట నాలుగు దిక్కులలో పడి వరుసగా సీత, అలకనంద, చక్షుస్సు, భద్ర అనే నాలుగు పాయలుగా ప్రవహించును(30). ఆ పర్వతమునకు తూర్పుదిక్కు గుండా సీత, దక్షిణములో నంద, పశ్చిమములో చక్షుస్సు, ఉత్తరదిక్కు గుండా భద్ర ప్రవహించుచున్నవి (31).ముల్లోకములో ప్రవహించే ఆ గంగానది ఈ విధముగా నాలుగు పాయలై నాలుగు దిక్కుల గుండా ప్రవహించి పర్వతములను అన్నింటినీ దాటి మహాసముద్రములో కలియుచున్నది (32).


సునీల-నిషధ-మాల్యవత్‌-గంధమాదన పర్వతముల మధ్యలో పద్మముయొక్క బీజకోశమును పోలి మేరుపర్వతము గలదు (33). పద్మమును పోలిన ఈ భువనమునకు భారత--కేతుమాల-భద్రాశ్వ-కురువర్షములు (భూభాగములు) రేకల వంటివి. ఈ లోకమునకు హద్దు లోకపర్వతములు (34). ఈ లోకమునకు జఠరస్థానములో దేవకూటము గలదు. ఈ లోకము దక్షిణమునుండి ఉత్తరము వరకు వ్యాపించి యున్నది. గంధమాదనకైలాసపర్వతములు తూర్పునుండి పశ్చిమము వరకు వ్యాపించి యున్నవి (35). మేరువునకు తూర్పునుండి పశ్చిమము వరకు నిషధనీలపర్వతములు వ్యాపించి యున్నవి. అవి దక్షిణమునుండి ఉత్తరము వరకు విస్తరించి బీజకోశము (పద్మమునకు మధ్యభాగము) అనదగిన స్థానములో కలియుచున్నవి (36). మేరువుయొక్క జఠరస్థానముతో మొదలిడి శ్వేతము మొదలైన జంట పర్వతములు పద్మకేసరముల వలె మిక్కిలి సుందరముగా నున్నవి (37). ఈ పర్వతములకు ఉత్తరమునందు సిద్ధులచే మరియు చారణులచే సేవించబడే జలాశయములు గలవు. ఆ జలాశయములను అనుకొని మిక్కిలి సుందరమగు అడవులు మరియు నగరములు గలవు (38). దేవతలు, యక్షులు, గంధర్వులు మరియు రాక్షసులు అందరికీ ఈ నగరములు చెంది యుండును. ఆ పర్వతప్రాంతములలో దేవతలు మరియు దైత్యులు రాత్రింబగళ్లు క్రీడించుచుందురు (39). ధర్మాత్ములకు నిలయమగు ఈ స్థానములు భూమిపై వెలసిన స్వర్గములని కీర్తించబడినవి. అచటకు పాపాత్ములు వెళ్లలేరు. వారు ఆ సమీపములో కానరాదు (40). ఓ మహర్షీ! కింపురుషము మొదలైన ఎనిమిది భూభాగములలో జనులకు శోకము, ఆపదలు, ఆదుర్దాలు, ఆకలిబాధ మరియు ఇతరభయములు లేవు (41). జనులు ఆరోగ్యవంతులై భయమునుండి మరియు సర్వదుఃఖములనుండి విముక్తులై, పది పన్నెండు వేల సంవత్సరముల ఆయుర్దాయము గలవారై ఉందురు (42). అచట జనులు కృతత్రేతాయుగములందలి జనులవలె ధర్మపరాయణులై ఉందురు. అచట చక్కగా ప్రకాశించే స్వచ్ఛ జలములతో నిండిన జలాశయములు అంతటా గలవు. అచట ఇంద్రుడు వర్షించడు. వర్షించనక్కరలేదు. అచటి సౌందర్యము ఊహాగోచరము మాత్రమే (43). ఈ ఏడు వర్షములయందు బంగరు ఇసుకతిన్నెలు గల అందమైన చిన్న నదులు వందల సంఖ్యలో గలవు. జనులు వాటియందు క్రీడించుటలో అభిరుచిని కలిగియుందురు (44).


శ్రీశివమహాపురాణములోని ఉమాసంహితయందు జంబూద్వీపవర్ణనమనే పదునేడవ అధ్యాయము ముగిసినది (17).

కామెంట్‌లు లేవు: