9, సెప్టెంబర్ 2024, సోమవారం

ఒక తెలుగు వాడు.*!

 *శహభాష్ కోకనాడి* అనే కవి పేరు విన్నారా ఎప్పుడేనా?


అది ఆయన అసలు పేరు కాదు.. కలం పేరు!


ఆ కవికి ఆ కలం పేరు ఉందని తెలిసిన వారు బహు కొద్దిమందేనేమో!


ఎనిమిది భాషలలో ఆ కవి రెండు లక్షల యాభై వేలకు పైగా వచన, గద్య, పద్య, కవితా రచనలు చేశారు. పన్నెండు భాషలలో అనర్గళంగా మాట్లాడగల సమర్ధుడాయన.


*అందునా ఒక తెలుగు వాడు.*!


ఆయన సొంత ఊరైన కాకినాడని తన కలంపేరుగా పెట్టుకొన్న మహా మనిషి, అమరగాయకుడు " *ప్రతివాద భయంకర శ్రీనివాస్* గారు" కానీ అందరికి సుపరిచయం.. *"పి.బి. శ్రీనివాస్"* అనే!


తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పి. బి. శ్రీనివాస్ తన గానమాధుర్యాన్ని పంచి, తమిళనాడు ప్రభుత్వం నుండి 'కలైమామణి; పురస్కారాన్ని, అలాగే కర్ణాటక ప్రభుత్వ పురస్కారాన్ని, శ్రీ రాఘవేంద్ర మఠం వారి ప్రతిష్ఠాత్మకమైన 'సంగీత కళానిధి' పురస్కారాన్ని, కంచి జగద్గురుపీఠం శ్రీ జయేంద్ర సరస్వతుల నుంచి 'సంగీతరత్న', 'సంగీత నాథమణి' బిరుదాలను స్వీకరించారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి సంగీత సాహిత్యాలకు అందించిన సేవలకు గాను 'డాక్టరేట్' గౌరవాన్ని కూడా అందుకొన్నారు.(తెలుగు వారు ఏ బిరుదులూ ఇవ్వక వారి గొప్పదనం చాటుకున్నారు).


ఆయన హిందీ, ఇంగ్లీష్, తమిళమ్, మళయాళం, ఉర్దూ, తుళు, కొంకణి, కన్నడ, సంస్కృతం ఇలా చాలా భాషల్లో నిష్ణాతులు.


ఉర్దూ కవితలు రాసినప్పుడు *శహభాష్ కోకనాడీ* అనే పేరుతో రాసేవారు.


ఆయన హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మళయాళం, ఉర్ధు, తుళు, కోంకణి, కన్నడలో 3000 లకు పైగా పాటలు పాడారు. ఆకలి రాజ్యం సినిమాలో *'తూ హై రాజా మై హూ రాణి'* అనే హింది పాట వ్రాసింది పి.బి. శ్రీనివాస్ గారే!


ఒకసారి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పి.బి. శ్రీనివాస్ గారి పాట విని ఆయన కుమారుడైన పావన శాస్త్రి గారితో "ఈ పాట పాడిందెవరూ?" అని అడిగారుట.


"పి.బి. శ్రీనివాస్ అదే ప్రతివాద భయంకర శ్రీనివాస్ అని... " అని ఆయన కుమారుడు జవాబివ్వగా


*మగటిమి ఉన్న గాత్రం*.. "భలే ఉంది" అని అన్నారుట ఆ గంభీర గాత్రాన్ని విని.


'డైమాండ్-టి' అనే ప్రక్రియతో ఒక మేళకర్త రాగానికి ఆరోహణ, అవరోహణలు చెబుతూ ఆ రాగాన్ని సులువుగా గుర్తుపెట్టుకోగల నైపుణ్యాన్ని ఎందరో విద్యార్ధులకు బోధించారు పి.బి. శ్రీనివాస్ గారు. అలా 72 మేళకర్త రాగాలను సులువుగా గుర్తించగల ప్రక్రియ కనిపెట్టింది వారే! ఆయన కొన్ని రాగాలను సృష్టించారు కూడా!


ఆ రాగాలకు సాహిత్యం కూడా వారే రాసుకునేవారు. ఆయన మన సమకాలికులైన వాగ్గేయకారుడు.


వారు ఎక్కడకు వెళ్ళినా ఆయన కారు నిండా పుస్తకాలతో నిండి ఉంటుంది. వారు ఏ సభలకు వెళ్ళినా ఒక చంటి పిల్లాడిని చేతిలో ఎత్తుకున్నట్టు ఆయన చేతిలో ఎప్పుడూ కనీసంలో కనీసం నాలుగైదు పుస్తకాలు ఉండేవి. ఆయన జీవితంలో పుస్తకాలకి అంతటి స్థానం ఉందన్న మాట! వారి దగ్గర ఎక్కువ పుస్తకాలే కాదు, ఎక్కువ పెన్నులు కూడా ఎప్పుడూ ఉంటాయి. ఆయన దగ్గర ఉన్న *'ఫౌంటేన్ పెన్నులు'* మరే రచయిత దగ్గరా లేవేమో! ఆయన ఎక్కువగా రాసుకునే చోటు 'వుడ్ లాండ్స్'(డ్రైవ్ ఇన్) హోటల్.. అక్కడ వారికోసం ఒక బెంచి, కుర్చి ఆ *'వుడ్ లాండ్స్'* వారు ప్రత్యేకంగా ఉంచేవారుట.


ఒకసారి భువనచంద్రగారు "ఇంత వరకు మీరు కన్నడలో రాజ్ కుమార్ గారికి ఎక్కువ పాటలు పాడారు కదా? ఇప్పుడు ఆయన పాటలు ఆయనే పాడుకుంటున్నారు, దానిపై మీ స్పందన ఏంటీ?" అని అడుగగా...


*"అంత గొప్ప గాయకుడు ఏమాత్రమూ అతిశయోక్తి లేకుండా నాచేత పాడించుకోవడం నా అదృష్టం"* అని చేతులు పైకెత్తి నమస్కరిస్తూ అన్నారు. ఈ ఉదాహరణ చాలదూ వారి సంస్కారానికి, వినయానికి.

కామెంట్‌లు లేవు: