21, అక్టోబర్ 2020, బుధవారం

రామాయణమ్. 99

 రామాయణమ్. 99

..

వశిష్ఠ మహర్షిని అల్లంతదూరములో చూడగనే భరద్వాజమహర్షి ఒక్కుదుటున లేచి శిష్యులను అర్ఘ్యము అర్ఘ్యము అని తొందర పెడుతూ మహర్షికి ఎదురేగినాడు.

.

వశిష్ట మహర్షి భరతుని ఈతడు దశరధకుమారుడు అని పరిచయం చేసిన తరువాత వారందరి క్షేమం భరద్వాజుడు విచారించి భరతునితో ఇలా అన్నాడు...రాజ్యమును పరిపాలించుకొనే నీవు ఇచటికి ఎందుకు వచ్చావు ?

నా కేదో అనుమానముగా ఉన్నది నీ గురించి!

.

 తండ్రిమాటకోసమై అడవులుపట్టి వెళ్ళిపోయిన సీతారామలక్ష్మణుల విషయమై నీవేమీ పాపపుతలంపుతో ఇచటకు రాలేదుకదా! .

.

ఆ మాటలు భరతుని హృదయాన్ని ఈటెల్లాగా చీల్చివేయగా హృదయమందు అప్పటికే గంగానదిలా ప్రవహిస్తున్న దుఃఖము మరింతవేగంగా ఉబికి బయటకు వచ్చి కన్నీరుగా ప్రవహించగా ,తడబడేమాటలతో భరద్వాజుని చూసి ...

.

పూజ్యుడవైన నీవుకూడా నన్ను ఇలాగ భావించినచో నన్ను చంపివేసినట్లే! మహాత్మా నావలన ఏ దోషమూలేదు! నన్ను నీవు ఈ విధముగా తలంచకుమయ్యా!

.

నేను లేని సమయములో నా తల్లిపలికిన మాటలన్నీ నాకు ఇష్టములుకావు ,వాటిచే నాకు సంతోషముకలుగలేదు.వాటిని నేను సమ్మతించను.

.

నేను ఇప్పుడు పురుషశ్రేష్ఠుడైన రాముని పాదములకు నమస్కరించి ఆయనను అనుగ్రహింపచేసుకొని మరల అయోధ్యకు తీసుకు వెళ్ళటానికి వచ్చిఉన్నాను. మహర్షీ రాముడెక్కడున్నాడో ఎరుకపరుపుము!.

.

సత్ప్రవర్తన,వినయముతో కూడిన భరతుని ఆ మాటలు విని ప్రసన్నుడై రఘువంశములో పుట్టినవాడు మాట్లాడే విధంగానే మాట్లాడావు అవి నీకు తగి ఉన్నవి.

  నీ హృదయం తెలుసుకుందామనే అలా అన్నాను ! అని పలికి నీ సోదరుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు ..

.

రాముడు చిత్రకూటపర్వతమందు నివసిస్తున్నాడు ,నీవు రేపు అచటికి వెళ్ళవచ్చును ఈ రాత్రికి మాఆశ్రమమందే విశ్రమించు అన్న భరద్వాజుని కోరికమేరకు ఆ రాత్రికి అక్కడనే విడిదిచేసినాడు భరతుడు.

.

అప్పుడు భరద్వాజుడు భరతునితో నేనిచ్చే విందు స్వీకరించుము అని అడిగాడు.

.

 స్వామీ అరణ్యములో లభించేవాటిని మీరిప్పటికే నాకు అనుగ్రహించారుకదా ఇంక వేరే విందు ఏమివ్వగలరు ? అని బదులు పలికాడు భరతుడు.

.

మహర్షి చిరునవ్వుతో, భరతా !నీవు అల్పసంతోషివి అని నేనెరుగుదును. నీవు అన్నిసత్కారములకు అర్హుడవు ! నీకు నీసేనకు ఏమిచ్చినచో సంతుష్టులగుదురో ఆ విందు ఇవ్వవలెననే కోరిక నాకున్నది . 

అవునూ ! నీ సైన్యాన్నంతా దూరంగా వదిలి ఒక్కడవే ఇక్కడికి వచ్చావేమిటి? అని ప్రశ్నించాడు భరద్వాజుడు.

.

స్వామీ మీకు తెలియునుకదా రాజుకానీ ,రాజపుత్రుడు కానీ  ఎల్లవేళలా మునివాటికలకు దూరంగా సంచరించవలెను అని కదా నియమము! 

.

(( ఇది ఆనాటి ధర్మం! ఈ రోజున విశ్వవిద్యాలయాల గ్రౌండ్సు అన్నీ కూడా రాజకీయ సభలకు ఇవ్వాల్సిందే ,ఇవ్వకపోతే రచ్చరచ్చ ఏ కాలంలో నాగరికత ,మర్యాద ఉన్నదో గమనించండి ? 

We are modern but not civilized)).

.

నా సైన్యములో మదించిన ఏనుగులు సంచరిస్తున్నాయి అవి మీ ఆశ్రమప్రాంగణంలోని వనాన్ని ధ్వంసం చేయరాదనే తలంపుతో నేనొక్కడనే వచ్చినాను.అది విని సంతసించారు మహర్షి.

.

అప్పుడు మహర్షి అగ్నిగృహములో ప్రవేశించి దీక్షలో కూర్చొని విశ్వకర్మను ఆహ్వానించాడు ,దేవేంద్ర,యమ,వరుణ,కుబేర అనే లోకపాలకులని కూడా ఆహ్వానించి నేను భరతునకు ఆతిధ్యమివ్వదలుచుకున్నాను కావున మీరు వచ్చి తగు ఏర్పాట్లు గావించండి అని కోరినాడు. 

.

మహర్షి సంకల్పానికి అనుగుణంగా అక్కడ క్షణాల్లో ఒక మహానగరం ఏర్పాటయ్యింది.

.

గంధర్వులైన విశ్వావసు,హాహాహూహూలూ దేవజాతికి చెందిన అప్సరసలు .

వారిలో ఘృతాచి,విశ్వాచి,మిశ్రకేశి ,అలంబుస,నాగదంత,హేమ,

హిమ ...అనే స్త్రీలు ఉన్నారు.సకల దేవతా స్త్రీ లను అక్కడకు రావించాడు .

.

మైరేయము అనే మద్యము నదిగా పారింది ! 

బాగా తయారు చేయబడిన "సుర" మరొక నది అయ్యింది ,

చెరకురసాలు నదులుగా పారాయి.

.

చంద్రుడు చక్కని అన్నము తెచ్చాడు అది పంచభక్ష్యపరమాన్నాలతో కూడినటువంటుది.

.

భరద్వాజుడి సంకల్పానికి తగ్గట్లుగా అప్పటికప్పుడు అక్కడ ఒక సుందరమైన లోకం ఇంద్రభవనాలతో దేవేంద్ర వైభవంతో సృష్టింపబడింది. 

ఇదివున్నది, అదిలేదు అనిలేదక్కడ! ఎవరికి ఏది కావలిస్తే అది .

.

మహర్షి అనుమతితో భరతుడు రాజసభలోకి ప్రవేశించాడు..

ఆ సభలో ఒక సమున్నతమైన ఆసనం !

దానికెదురుగా మంత్రిసామంతదండనాధులు కూర్చునుటకు వీలుగా సముచిత సుఖాసనాలు అమర్చారు.

.

అక్కడి దివ్యమైన సమున్నత ఆసనానికి భరతుడు ప్రదక్షిణ చేశాడు అక్కడ రాముడున్నట్లు ఊహించుకొని ఆయనకు నమస్కారము చేసి ఆ ఆసనానికి వింజామరతో వీచి తాను మంత్రికూర్చునే ఆసనం మీద కూర్చున్నాడు.

.

( మనసా వాచా కర్మణా ఆయనకు రాముడే రాజు ఆయన పరోక్షంలో కూడ భరతుడికి సింహాసనం మీద మోహం లేదు!)

.

వూటుకూరు జానకిరామారావు 

.

కామెంట్‌లు లేవు: