22, అక్టోబర్ 2023, ఆదివారం

అవ్యక్తము నుంచి వ్యక్తమయిన స్థితి

 ఓం నమః శివాయ 🧘‍♀️నవదుర్గలు /షట్చక్రాలు / శ్రీ చక్రం -మానవశరీరం🧘‍♂️

అవ్యక్తము నుంచి వ్యక్తమయిన స్థితినే అమ్మవారు లేక మూలప్రకృతి అంటారు.

ఆధ్యాత్మికత స్థితులు/చక్రాలు

ఆధ్యాత్మికత =ఇచ్ఛాశక్తి +జ్ఞానశక్తి +క్రియాశక్తి = పార్వతి + సరస్వతి + లక్ష్మీ= ధ్యానం + జ్ఞానం + సేవ = Starting + Middle + Ending stage.


నవ రాత్రులనగా:--

1) ☸️మూలాధారచక్రం - (శైలపుత్రీ)- Body consciousness / మొదటి రోజు పృధ్వీ🌎తత్త్వము:- అనగా అన్నమయ శరీరమునకు సంబంధించినది.


2)☸️స్వాధిష్టానచక్రం - (బ్రహ్మచారిణీ) - Family  consciousness / రెండవ రోజు జల 💦తత్త్వము:- ప్రాణమయ శరీరమునకు సంబంధించినది. రెండవ రోజు పూజ కోరికలు ధర్మయుక్తము అవడానికి.


3)☸️మణిపూరకచక్రం -  (చంద్రఘంట) Society consciousness  / మూడవ రోజు అగ్ని  🔥తత్త్వము:-  మనోమయ కోశమునకు సంబంధించినది. మనలో భావాలు అగ్నితో పునీతమవుతాయి. అక్కరలేని భావాలు ఉండవు.

 

4)☸️అనాహతచక్రం - (కూష్మాండ) Empty consciousness / నాల్గవ రోజు వాయు 🌬తత్త్వము:-  దైవీ పరమైన భావాలు కలుగుతాయి. పంచభూతముల యందు స్వామిత్వము వస్తుంది. అంతర్లోకాలకి తీసుకొని వెడుతుంది.


5)☸️విశుద్ధచక్రం - (స్కందమాత) Balanced  consciousness / అయిదవ రోజు ఆకాశ🎇తత్త్వము. మన హృదయము లోపల ఆకాశము దర్శనమిస్తుంది. అమ్మవారిని 'దహరాకాశరూపిణి' అంటాము గదా!


6)☸️ఆజ్ఞా చక్రం - (కాత్యాయనీ)Third  eye consciousness / ఆరవ రోజు  మనసు మీద గూడా స్వామిత్వము వస్తుంది. మనసు మృదువుగా తయారయితే సప్తమి రోజు పూజ అనుభూతి నిస్తుంది.


7)☸️సహస్రార చక్రం  - (కాలరాత్రీ) Sharing knowledge to Universe consciousness. ఏడవ రోజు మనసును దాటి బుద్ధి లోకాలలోకి ప్రవేశం జరుగుతుంది. అపుడు మూలా నక్షత్రము రోజు పూజ చేసుకోవాలి.


8) ☸ ఊర్ధ్వ సహస్రారచక్రము -(మహాగౌరీ) (బ్రహ్మరంధ్రము)All  type of  knowledge to Universe consciousness.-  ఎనిమిదవ రోజు దుర్గాష్టమి పూజ. అనగా అజ్ఞానాన్ని నిర్మూలిస్తుంది. మహిషాసురుడు అంటే అహం కారంతో కూడిన స్వభావము.

 

9)☸బిందు చక్రం - (సిద్ధిదాత్రీ)All  type of  knowledge to Universe consciousness.- అహంకారం తగ్గిపోతే  అమ్మవారి మహత్యం తొమ్మిదవ రోజు తెలుస్తుంది. తొమ్మిది, పది రోజులు పరమాత్మ  దివ్య చైతన్యంతో కూడి ఉంటుంది. అదే మహర్నవమి. విజయదశమి.


10)నిర్వాణచక్రం - (మహిషాసురమర్ధిని /దుర్గాదేవి /రాజరాజేశ్వరీ దేవి ) All  type of  knowledge to Complete Universe  consciousness / ☸️Every consciousness is need for our Life...

.

మానవుడు చేసిన కర్మలనునసరించి వారికి సద్గతులు అమ్మవారు కలిగిస్తుంది, సాధకుని యొక్క సాధనను బట్టి అన్నిరకాల ముక్తులను ప్రసాదించే తల్లి ఆ  ముక్తి 5 రకాలు గా వర్ణించ బడింది.


1.మణిపూరంలో దేవిని అర్చించే వారికి “సార్షిరూపముక్తి”.(మణిపూరంలో దేవిని అర్చించేవారు దేవి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకుని ఉంటారు. దీన్ని సార్షిరూపముక్తి అంటారు.)


2.అనాహతంలో దేవిని అర్చించేవారికి “సాలోక్యముక్తి”(అనాహతంలో దేవిని అర్చించేవారు దేవిపట్టణంలోనే నివసించగలుగుతారు.దీన్ని సాలోక్యముక్తి అంటారు.)


3.విశుద్ధిచక్రంలో దేవిని అర్చించే వారికి 'సామీప్యముక్తి” (విశుద్ధిచక్రంలో దేవిని అర్చించేవారు దేవికి అతిదగ్గరగా సేవకులుగా ఉంటారు. ఇది సామీప్యముక్తి.)


4.ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించే వారికి “సారూప్యముక్తి”(ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించేవారు వేరే దేహం ధరించి దేవితో సమానమైనరూపంలో ఉంటారు. ఇది సారూప్యముక్తి.)


5.సహస్రారంలో దేవిని అర్చించే వారికి “సాయుజ్యము”(సహస్రారంలో దేవిని అర్చించేవారు జన్మరాహిత్యం పొందుతారు. వీరికి మరుజన్మ.ఉండదు. ఇది శాశ్వతమైన ముక్తి. సాయుజ్యం.లభిస్తాయి.)


@@@@@@@@@@

శరన్నవరాత్రులు - శ్రీ త్రిపురసుందరి

@@@@@@@@@@

దైవీ ప్రవృత్తులను కలసి అఖండ విశ్వవ్యాపక చైతన్యశక్తిని జాగృతం చేసి, లోక హింసాకారకులైన రాక్షస శక్తులన్ని నశింపజేసే విజయమే నిజమైన విజయం. మన చుట్టూ ఉన్న జగత్తులో ఆ విజయం సంభవిస్తే లోక క్షేమకరం. వ్యక్తిలో దనుజ ప్రవృత్తిని దైవీ ప్రవృత్తి జయిస్తే అది వ్యక్తికి సార్ధకత. ఈ విజయానికి సంకేతంగా జరుపుకునే పర్వదినమే ‘విజయ దశమి’.


నవరాత్రుల పూజ తరవాత దశమితో పండగలు ముగుస్తాయి. ‘నవ’ సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. తొమ్మిది పూర్ణ శక్తి. నక్షత్రాలలో మొదటిదైన ‘అశ్వని’ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చే మాసం ‘ఆశ్వయుజం’. ఒక విధంగా – నక్షత్రగణనతో ఇది సంవత్సరానికి మొదటి మాసం. ఈ తొమ్మదిరోజులు విశ్వ చైతన్య శక్తిని (పరాశక్తని – ఆదిశక్తిని) ఆరాధించేవారు పూర్ణంగా సంవత్సరారాధన ఫలాన్ని పొందుతారు. యోగపరంగా అంతర్ముఖావలోకనమే రాత్రి. ఆ సాధనలో విశ్వమంతటా వ్యాపించిన అఖండ శక్తిని గమనించ గలుగుతాం. అదే మనలోనూ సంచరిస్తోందని తెలుసుకున్నాక – మన అహంకారాలు, సంకుచిత దృష్టులూ అంతరిస్తాయి. ఆ అపరమిత శక్తినే వైష్ణవి, జగజ్జనని, శ్రీమాత, దుర్గ, లక్ష్మీ, సరస్వతి మొదలైన వివిధ నామాలతో భావించడం ఈ సాధనల విశేషం. మనలోని పరమిత శక్తిని ఆ అఖండ శక్తితో అనుసంధానం చేస్తే – ఈ వ్యష్టి చైతన్యం వ్యాప్తమై అనంతమైన శక్తులను జాగృతం చేసుకుంటుంది. ఆ శక్తిని ‘త్రిపురసుందరి’ అన్నారు. ఈ నామంలో ఎంతో వైశిష్ట్యం ఉంది. ఈ ప్రపంచమంతా ‘త్రిపురం’, ‘పురం’ అంటే చోటు అని అర్ధం. ఈ చోటు అనేది దేశకాలాత్మకం. ‘దేశం’ (స్థానం) లోకం. అదికాలానికి నిబద్ధమై ఉంటుంది. లోకం, కాలం కలిపి పురం.


ఈ విశ్వమంతా త్రిపురమే. మనమున్న చోటు నడిమిభాగం. దానికిపైన ఊర్ధ్వలోకాలు ... కింద అధోలోకాలు. ఈ ఊర్ధ్వ, మధ్య, అధోలోకాలు – మూడు లోకాలు. అలాగే భూత, భవిష్య, వర్తమానాలు. వ్యాపించిన గుణాలు సత్త్వ, రజస్తమో గుణాలు. జరిగే పనులు – సృష్టి, స్థితి, లయలు. ముగ్గురు వేల్పులు – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఓంకారం మూడు అంగాలు – అ, ఉ, మ. వేదానికి ప్రధానంగా మూడు రకాల మంత్రాలు – ఋక్, యజు, స్సామములు.


ఇలా అన్నీ ‘త్రి’పురాలే. ఇక మనలో భౌతిక, ప్రాణిక, మానసిక శక్తులు మూడు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడు. జాగ్రత్, స్వప్త సుషుప్తులు మూడు. యోగపరమైన నాడులు మూడు – ఇడా పింగళ సుషుమ్న. ఇలా బైటా, లోపలా ఉన్న ప్రపంచమంతా మూడింటితో కూడినదే. ఈ మూడింటిలో వ్యాపించిన సౌందర్యమే – త్రిపుర సుందరి.


ఇంతకీ ఏమిటీ సౌందర్యం? చైతన్యమే సౌందర్యం. ఈ చైతన్యమనే సౌందర్యమున్నప్పుడే జీవిలో ‘నేను’ అనే స్ఫురణ. అటుపై బుద్ధిశక్తి, మనశ్శక్తి, ఇంద్రియశక్తి పనిచేస్తాయి. సర్వశక్తులకు మూలం ఈ చైతన్యమే. కనుక దీనిని ‘ఆదిశక్తి’, ‘పరాశక్తి’ అని భావించారు. ఆ సౌందర్యాన్ని అమ్మా అని పిలిస్తే ‘సుందరి’. ఆ శక్తి అనుగ్రహమే అంతా అని తెలియనివాడు అంతా తన నిర్వాకమే అనుకుంటాడు. మన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలలో వ్యాపించిన ఆ శక్తిని పరాశక్తిగా గుర్తించని అజ్ఞానమే త్రిపురాసుర లక్షణం. దీనిని తొలగించాలంటే జ్ఞానోదయం కావాలి. ఆ జ్ఞానం లభించడమే త్రిపురాసుర సంహారం. త్రిపురాసుర అజ్ఞానం నశిస్తేనే త్రిపురసుందరిని తెలుసుకోగలం.


త్రి-పురా, ఈ మాటా చాలా అద్భుత శబ్ధం. ‘పురా’ అంటే చోటు అనేకాకా ‘పూర్వము’ అని కూడా అర్ధం. ఈ మూడుచోట్లు (మూడు లోకాలు, మూడు స్థితులు, మూడు కాలాలు వగైరా) కలుగక ‘పూర్వమే’ ఉంది ఆ సౌందర్యం. మూడింటికీ పూర్వమున్నదీ, మూడు నశించినా తాను నశించనిది ‘త్రిపురం’. పదార్ధంకన్నా ముందున్నది శక్తి. అందుకే అది ‘త్రిపురా’, ‘పురాణాత్ పురా’ – ‘నిండినది’ అని కూడా ‘పురా’ శబ్ధానికి అర్ధం.


త్రి కూడిని విశ్వంలో నిండినది ఇదే. ముందున్నదీ, నిండినదీ అయిన ఆ శాశ్వత చిత్ శక్తియే నిజమైన లావణ్యం. అందుకే అది ‘లలిత’ జీవరాశి అంతా ఆ శక్తినే ‘ఆశ్రయించు కున్నది, ఆ శక్తినే ‘శ్రీ’ అంటారు. ఈ శబ్ధానికి ఆశ్రయమనేకాక, శోభ, కాంతి, ఐశ్వర్యం అనే అర్ధాలున్నాయి. ఈ వివరణను చూస్తే సౌందర్యానికన్నా ఐశ్వరమేమున్నది.


చైతన్యమే లేకపోతే శోభ, కాంతి ఉండవు. అందుకే సౌందర్యలహరియే శ్రీమాత. ఈ చైతన్య శక్తిని గ్రహించి అజ్ఞానాన్ని, దుష్టత్వాన్ని తొలగించడమే దుర్గారాధన. దుర్గతి, దుష్టత్వం వీటిని సమూలంగా నాశనంచేసే దివ్యత్వమే దుర్గాదేవి..


నవదుర్గల ధ్యాన స్తోత్ర0


శైలపుత్రీ:-

 వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరామ్| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ||*


బ్రహ్మ చారిణి:-

 దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలః|దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||


చంద్రఘంట:-

 పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా|  ప్రసాదం తనుతే మహ్యం చంద్ర ఘంటేతి విశ్రుతా ||


కూష్మాండ:-

 సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ|  దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||


స్కందమాత:-

 సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా |శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||


కాత్యాయని:-

 చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||


కాళరాత్రి:-

ఏకవేణీజపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా  లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||


మహాగౌరి:-

 శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరభరా శుచిః |:మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||


సిద్ధధాత్రి:-

సిద్ధ గంభర్వ యక్షాద్యైః అసురైర మరైరపి 

సేవ్యమానా సదా భూయత్ సిద్ధిదా సిద్ధిదాయినీ | సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే 

శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే ||.


హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.


గోవా, మహారాష్ట్రలలో అధికంగా ఉన్న గౌడ సారసజ్వత బ్రాహ్మణుల కులదేవత "నవదుర్గ".


గొవాలో మడికియమ్, పాలె, పోయింగ్వినిమ్, బోరిమ్‌లలోను, మహారాష్ట్రలోని రేడి, వెంగుర్ల లలోను నవదుర్గా మందిరాలున్నాయి. 16వ శతాబ్దిలో గోవా రేడి నవదురగ్ా మందిరం ప్రస్తుత మహారాష్ట్రలోని వెంగుర్లకు మార్చబడింది. నవరాత్రి ఉత్సవాలలో నవదుర్గలను పూజిస్తారు.


నవదుర్గలు:


సప్తశతీ మహా మంత్రానికి అంగభూతమైన దేవీకవచంలోనవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఇలా ఉంది.


ప్రథమం శైల పుత్రీతి


ద్వితీయం బ్రహ్మచారిణీ


తృతీయం చంద్ర ఘంటేతి


కూష్మాండేతి చతుర్థకం


పంచమం స్కందమాతేతి


షష్ఠం కాత్యాయనీతి చ


సప్తమం కాలరాత్రీతి


మహాగౌరీతి చాష్టమం


నవమం సిద్ధిదా ప్రోక్తా


నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా


ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని ఉంది. అయితే, సప్తశతీ గ్రంథంలో మాత్రం వీరి చరిత్రలను ప్రస్తావించలేదు.


నవదుర్గలు -మహిమలు


శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటేతి, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి.


1. శైలపుత్రి

' వందేవాంచితలాభాయ చంద్రార్ధకృత శేఖరమ్

వృషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్'


సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి.


2. బ్రహ్మ చారిణి

'దధనా కరపద్మాభ్యం అక్షమాలా కమండలా

దేవీ ప్రేదతు మయీ బ్రహ్మే చారిణ్యనుత్తమా '


'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రథము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.


3. చంద్రఘంట

'పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా

ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా'


ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు 'చంద్రఘంట' యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును.


ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.


4. కూష్మాండ


'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ

దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '


దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము లోని సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.


'అష్టభుజాదేవి' అని కూడా అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.


భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.


5. స్కందమాత


'సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా

శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ '


కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని 'స్కందమాత'పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొనియుండును. మరియొక కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, 'పద్మాసన' యనబడు ఈమెయు సింహవాహనయే.


స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు.


6. కాత్యాయని


'చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనా

కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ '


"కాత


్యాయనీ మాత" బాధ్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.

కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులములోని గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన.


ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును.


7. కాళరాత్రి


'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా

లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ

వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా

వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ '


"కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.


కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను "శుభంకరి" అనియు అందురు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు.

కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.


8. మహాగౌరి

'శ్వేతే వృషే సమారూఢా శ్వేతంబరధరా శుచిః

మహాగౌరి శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా!'


అష్టవర్షా భవేద్గౌరీ - "మహాగౌరి" అష్టవర్ష ప్రాయము గలది. ఈమె గౌర వర్ణ శోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును.ఈమె ధరించు వస్త్రములును, ఆభరణములును ధవళ కాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన. తన కుడిచేతులలో ఒకదానియందు అభయముద్రను, మఱియొకదానియందు త్రిశూలమును వహించియుండును. అట్లే ఎడమచేతులలో ఒకదానియందు డమరుకమును, వేఱొకదానియందు వరముద్రను కలిగియుండును. ఈమె దర్శనము ప్రశాంతము.


పార్వతి యవతారమున పరమశివుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేయగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేత వర్ణశోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముచు "మహాగౌరి" యని వాసిగాంచెను. ఈమె శక్తి అమోఘము. సద్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నియును ప్రక్షాళితమగును. వారి పూర్వ సంచిత పాపములును పూర్తిగా నశించును. భవిష్యత్తులో గూడ పాపతాపములుగాని, దైన్య దుఃఖములుగాని వారిని దరిజేరవు. వారు సర్వవిధముల పునీతులై, ఆక్షయముగా పుణ్యఫలములను పొందుదురు. ఈ దేవి పాదారవిందములను సేవించుటవలన కష్టములు మటుమాయమగును. ఈమె యుపాసన ప్రభావమున అసంభవములైన కార్యముల సైతము సంభవములే యగును... ఆదిత్యయోగి..


9. సిద్ధిధాత్రి

'సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి

సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ


సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము.


ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథములన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానందదాయకమైన అమృతపదము ప్రాప్తించును.


సప్తశతి:

సప్తశతిలో -


మహాలక్ష్మి


మహాకాళి


మహాసరస్వతి


నంద


శాకంభరి (శతాక్షి)


భీమ


రక్తదంతిక


దుర్గా


భ్రామరీ


అనే వారి చరిత్రలను చెప్పారు. కానీ, వీరిని నవదుర్గలని ప్రత్యేకంగా


వ్యవహరించలేదు.


సప్తసతీ దేవతలు:

సప్తసతీ దేవతలని మరో సంప్రదాయం ఉంది. దీనిలో


నందా


శతాక్షీ


శాకంభరీ


భీమా


రక్తదంతికా


దుర్గా


భ్రామరీ


అనే ఏడుగురు సప్తసతులు. వారిగురించి సప్తశతీ గ్రంథంలో ఉంది. దీనివల్లే ఈ గ్రంథానికి సప్తసతి అని మరొక పేరు వచ్చింది... ఆదిత్యయోగి...


☸️శ్రీ చక్రం మానవ దేహం


ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్న పరాశక్తిని కూడా దర్శించగలిగారు మన మహర్షులు. వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి. అయినా వేటికి అవి ప్రత్యేక పని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులన్నమాట. మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము, పని ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశించి ఉన్నాయి. ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే అట్టి దేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు. వేదమునకు మూలము నాదము. దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి, మంత్రములుగా శక్తిని సంతరించు కున్నాయి. యంత్రమంటే ఏమిటి ?యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క (శక్తి) స్వరూపమే. ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమ వుతుంది.మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు. అవి 1) ఇచ్ఛాశక్తి, 2) జ్ఞానశక్తి 3) క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే ‘ఇచ్ఛ’ (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే.


ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే. నేటి శాస్త్రజ్ఞులు కూడా, ఏ పదార్థమైనా శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు. నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తుజాలమంతా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరమే. విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే ‘ప్రకృతి’ అని, ‘పరాశక్తి’ అని, ‘అవ్యక్తం’, ‘శుద్ధమాయ’ అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి, వారికి అందిస్తోంది.


శ్రీ చక్ర ఆవిర్భావం ఉండేది బ్రహ్మమొక్కటే. ఈ బ్రహ్మం సత్‌, చిత్‌, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది, నిశ్చలమైనదైనప్పటికి,చేతనం అనే బీజం కలిగి ఉండుటం దానిలోని విశేషం. కేవలం కాంతి (ప్రకాశ) రూపముగానున్న బ్రహ్మమునందు ఏర్పడిన మొదటి కదలికను ‘విమర్శ’ (ఆలోచన) అన్నారు. కాంతిని పరమశివుడుగాను, విమర్శను పరాశక్తిగాను భావించారు. కాంతి (ప్రకాశ) స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలికవల్ల నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది. ఈ బిందువు నందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు. దీనినే ”పరాబిందువు” అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి. దీనికే సర్వానందమయ చక్రమని పేరు. ఈ బిందువే శ్రీచక్రమునకు ఆధారము. ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది. సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము (గింజ) లో రెండు పప్పులు (బద్దలు) ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈ పరాబిందువు నందు శివశక్తులొకటిగా ఉంటాయి.


శ్రీ చక్రం – పరాశక్తి వేర్వేరు కాదు, అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువు లేర్పడినవి.1) శివశక్తులొకటిగా నున్న ‘బిందువు’, 2) అచేతనంగా ఉన్న ‘శివుడు’, 3) ‘చేతనా స్వరూపమైన శక్తి’. ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వరతత్వాన్ని సూచిస్తోంది. మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేం, కనీసం ఊహించలేం. కనుక శక్తి మాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది.  తదుపరి అనేక దేవీరూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీచక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థము లకు సమన్వయం కలుగుచున్నది. పరాశక్తికి శ్రీ చక్రానికి ఏ మాత్రం భేదం లేదు. శ్రీ దేవియే శ్రీచక్రము.శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది. శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది.


ఇటువంటి శ్రీవిద్యను, శ్రీచక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుమంది, పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవము  తెలుపుచున్నది.


శ్రీ చక్ర నిర్మాణం బిందువు, త్రికోణము, అష్టకోణచక్రము, అంతర్దశారము- బహిర్దశారమను దశత్రికోణ చక్రము, చతుర్దశారము, అష్ట దళ పద్మము, షోడశ దళ పద్మము, భూపురము అను తొమ్మిది ఆవరణము లతో కూడినది శ్రీచక్రం. శ్రీచక్రంలో ఉన్న మొత్తము త్రిభుజాల సంఖ్య 43. మొత్తము పద్మముల సంఖ్య 24. మొత్తము వృత్తముల సంఖ్య 7 (బిందువుతో కలిపి). ఈ శ్రీచక్రములోని తొమ్మిది చక్రములను (శివచక్ర, శక్తిచక్రములను) నవయోనులని వ్యవహరిస్తారు.


త్రికోణ, అష్ట కోణ, దశ కోణద్వయము, చతుర్దశ కోణములు ఐదూ శక్తి కోణములు. బిందువు, అష్ట దళము, షోడశ దళము, చతురస్రము అను నాలుగూ శివచక్రాలు. ఈ చక్రంలోని బహిర్దశార, అంతర్ద శారములను కలిపితే శ్రీచక్రము అష్టాచక్రా అవుతుంది. నవద్వారా అంటే తొమ్మిది త్రికోణములు. వాటిలో నాలుగు శివాత్మకం, ఐదు శక్త్యాత్మకం. శ్రీచక్రంలోని నవావరణములు ఆరోహణ క్రమంలో ఇలా ఉన్నాయి.


1. భూపుర త్రయం – త్రైలోక్య మోహన చక్రం,


2. షోడశ దళ పద్మం – సర్వాశా పరిపూర చక్రం,


3. అష్ట దళ పద్మం – సర్వ సంక్షోభిణీ చక్రం,


4. చతుర్దశారము – సర్వ సౌభాగ్య చక్రం,


5. బహిర్దశారము – సర్వార్థ సాధక చక్రం,


6. అంతర్దశారము – సర్వ రక్షాకర చక్రం,


7. అష్ట కోణము – సర్వ రోగహర చక్రం,


8. త్రి కోణము – సర్వ సిద్ధిప్రదా చక్రం,


9. బిందువు – సర్వానందమయ చక్రం,


ఒక్కొక్క ఆవరణలోని దేవతలను సాక్షాత్కరించు కొనుటకు కొన్ని ప్రత్యేక బీజ మంత్రములు కలవు. శ్రీదేవీ ఖడ్గమాల స్తోత్రమునందు, శ్రీదేవీ బీజాక్షర సంబోధనమ్‌, న్యాసాంగ దేవతలు, దివ్యౌఘ గురువులు, సిద్ధౌఘ గురువులు, మానవౌఘ గురువులు, తొమ్మిద ఆవరణములలోని వివిధ దేవతలు నమస్కార నవాక్షరి దేవతల పేర్లు, విడివిడిగా, విపులముగా ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు మొదటి ఆవరణలో త్రైలోక్యమోహన చక్రం, అచ్చటి దేవతలు అణిమాది సిద్ధులు. ఇవి మనలోని వివిధ రకములైన మానసిక ప్రవృత్తులు.


ఆదిపరాశక్తి శ్రీ చక్రం – మానవ శరీరం గమనించవలసిన విషయమేమంటే, ఈ జగత్తులోని సకల తత్వాలు, సకల భువనాలు, పరమశివుడు, పరాశక్తి మానవునియందు కూడా కలవు. మానవ శరీరమును రెండు భాగములుగా చూస్తే – నాభి నుండి పైభాగము ఊర్థ్వలోకమని, క్రింది భాగం అధోలోకమని, ఈ రెండింటిని కలిపే వెన్నెముకను మేరుదండమని అంటారు. శ్రీ చక్రమును కూడా మేరువు అంటాము. మేరుపర్వతము కూడా భూమికి ఇరుసు వంటిది. ఏ రకంగా పరాశక్తి దివ్యస్వరూప కాంతులచేత జగత్తంతా ప్రకాశవంత మవుతుందో, మన మేరుదండములోని కుండలినీ శక్తిచేత శరీరమంతా చైతన్యమవుతుంది.మనలో ఆత్మ ఉన్నదని అంగీకరించినట్లే మన శరీర నిర్మాణ ప్రాధాన్యం కూడా గుర్తించాలి. నవావరణాత్మకమైన శ్రీచక్రానికి, మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రం చెబుతోంది. శ్రీచక్రాన్ని ఆరాధిస్తే అన్ని దేవతా మూర్తులను ఆరాధించినట్లేనని తంత్రశాస్త్రం తెలుపుతోంది. శ్రీ అంటే శుభకర మైనది. దీనిని నవచక్రమని, వియత్‌చక్రమని, నవయోనిచక్రమని అంటారు. చక్రము ఎప్పుడూ పరిభ్రమిస్తుంది. దీనికి ఆద్యంతము లుండవు. కేంద్ర బిందువు నుండి పరిధి వరకు ఎక్కడ కొలిచిననూ సమానంగా ఉంటుంది. చక్రారాధనము ప్రతిమారాధన కన్న శక్తివంతం. మంత్రం వలె యంత్రం కూడా మహిమ గలదే.


దేహో దేవాలయః ప్రోక్తో   జీవో దేవస్సనాతనః త్యేజేదజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్‌ !


శరీరమే దేవాలయము. జీవుడే అక్కడి దేవుడు, అజ్ఞానమనే మాలిన్యాన్ని త్యజించాలి. ఆ దేవుడే నేననే భావమే పూజ. ఆ భావనతోనే అర్పించాలి. కాబట్టి సాధకుని ధ్యానము, పూజ, భావన బాహ్యము నుండి లోనికి చొచ్చుకొని పోయి ఆత్మను చేరుకోవాలి. విశ్వంలోని శక్తులన్ని ఈ నవావరణముల ద్వారా ద్యోతకమై మానవుని పంచకోశములందు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు ఇమిడి ఉన్నవి.


నిరంతర సాధన మార్గం శ్రీచక్రాన్ని మన శరీరంతో పోల్చి పరిశీలిస్తే ఆ జగన్మాత శ్రీ లలితాదేవి దర్శనం ఎంత దుర్లభమో అనిపిస్తుంది. మనలోని కర్మ, జ్ఞానేంద్రియాల వెంటపడి పరిగెత్తే మనస్సు, బుద్ధి, అహంకార, మమకారాలు, కామోద్రేకాలు, శృంగారాది నవరసాలు, జాగ్రద, స్వప్న, సుషుప్తాది అవస్థలు వీటిని నడిపే సత్వరజస్తమోగుణాలు – వీటిన్నిటిని ఆ శ్రీదేవి విభూతులుగా గ్రహించి, వీటన్నింటినీ దాటి బిందుస్థానమునకు చేరుకోగానే అచట అద్వితీయమైన, సచ్చిదానంద రూపమైన, సస్వరూపానుభవము కలుగుతుంది. అదే శ్రీమాత దర్శనం. ఇది ఎన్ని జన్మలకు సాధ్యమో!


త్రైలోక్య మోహన చక్రం నుండి సర్వానందమయ చక్రం వరకు మనం ఎక్కవల?....

కామెంట్‌లు లేవు: