2, అక్టోబర్ 2020, శుక్రవారం

శివానందలహరి 14 వ శ్లోకం

 **దశిక రాము**



" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"


అవతారిక:”

" వేద శాస్త్ర ధర్మాలను ఉల్లంఘించి , నా ఆజ్ఞను నీవు అతిక్రమించావు. 

అందువల్ల నీవు అపరాధివి. నిన్ను రక్షింౘడం ఎలా ?" అని శివుడు 

ప్రశ్నిస్తాడేమో అని , తాను దీనుడననీ, ఈశ్వరుడు దీనజన బాంధవుడనీ,

కాబట్టి తనను రక్షింౘడం బంధు మర్యాద అనీ, శంకరులు శివునికి 

విన్నవించారు. 


        శ్లో" ప్రభుస్త్వం దీనానాం _ ఖలు పరమబంధుః పశుపతే 

                  ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వ మనయోః, 

                  త్వయైవ క్షంతవ్యాః శివ ! మదపరాధాశ్చ సకలాః

                  ప్రయత్నా త్కర్తవ్యం _ మదవన మియం బంధు సరణిః !!


పదవిభాగం: 

ప్రభుః _ త్వమ్ _ దీనానాం _ ఖలు _ పరమబంధుః _ పశుపతే _ 

ప్రముఖ్యః _ అహం _ తేషామ్ _ అపి _ కిముత _ బంధుత్వమ్ _ 

అనయోః _ త్వయా _ ఏవ _ క్షంతవ్యాః _ శివ _ మదపరాధాః _ 

చ _ సకలాః _ ప్రయత్నాత్ _ కర్తవ్యం _ మదవనమ్ _ ఇయం _ 

బంధు సరణిః .


తాత్పర్యం:  

పశుపతివైన ఓ ఈశ్వరా ! నీవు దీనులకు దగ్గఱ ౘుట్టమైన ప్రభుడవు.

నేను అటువంటి దీనులలో అగ్రగణ్యుడను. మన ఇద్దరికీ ఇంతకంటే 

ౘుట్టరికం ఇంకేమి కావాలి ? నా నేరము లన్నిటినీ , నీవు మన్నించి , 

నన్ను నీవే కరుణించి, రక్షింప వలసి యున్నది. ఇది బంధు మర్యాదా

లక్షణం.


వివరణ:


ఈశ్వరుడు దీనులకు పరమ బంధువు. భక్తుడు, దీనాతి దీనుడుగా

ఉన్నప్పుడు దైవానికి ఆభక్తుని ఆదుకోవలసిన బాధ్యత ఉంటుంది.

అందువల్ల భక్తుడు తెలియక పొరపాటు చేసినా , భక్తులను రక్షింౘడం 

లోకసహజం. కాబట్టి బంధు మర్యాదననుసరించి , దీనుడైన తనను 

దీనబాంధవుడైన పరమేశ్వరుడు తప్పక ఆదు కోవాలని శంకరులు 

నొక్కి చెప్పారు.

🙏🙏🙏


**ధర్మము - సంస్కృతి**

🙏🙏🙏



**ధర్మో రక్షతి రక్షితః**

కామెంట్‌లు లేవు: