2, అక్టోబర్ 2020, శుక్రవారం

**త్రిపురారహస్య జ్ఞానఖండసారము**

**దశిక రాము**


అమ్మదయ గలవారు మాత్రమే దీనిని చదవగలరు 

PART-8

ఆశ్రమవాసు లందఱు ఆశ్చర్యముతో ఆనందముతో చుట్టును చేరి ''జయజయ'' ఘోషలు సలుపుచుండగా రాముఁడు తండ్రియొద్దకు పోయి నమస్కరించి యుద్ధవృత్తాంతమును వర్ణించి చెప్పెను. ఆ మహర్షియు అంతయును శాంతముగ విని యిట్లనెను. ''వత్సా! రామా! సర్వదేవమయుఁడైన మానవేంద్రుని వధించి మహాపాప మొనర్చితివి. తండ్రీ! మనము బ్రాహ్మణులము గదా! బ్రాహ్మణులు క్షమాగుణముచేత పూజింపఁబడుచున్నారు. లోకగురుఁడైన విధాతయు క్షమచేతనే పరమేష్ఠిపదమును పొందియున్నాఁడు. సూర్యుని యందు కాంతివలె మనయందు బ్రాహ్మియైన లక్ష్మి క్షమచేతనే వెలుఁగొందును. విష్ణుదేవుఁడును క్షమావంతుల విషయముననే సంతోషము నొందును. మూర్ధాభిషిక్తుఁడైన రాజును చంపుట బ్రహ్మహత్య కన్నను మించినపాతకము. కావున విష్ణుదేవుని ధ్యానించుచు తీర్థములను సేవించుచు ఈపాపమును పోఁగొట్టుకొనుము''. తండ్రియాదేశమున రాముఁడు అట్లే యొక్కసంవత్సరము తీర్థయాత్రలు గావించి పాపరహితుఁడై తిరిగివచ్చెను.
పలుదిక్కులకు పారియోయిన కార్తవీర్యుని కుమారులు మెల్లగా రాజధానికి చేరి తండ్రివధను తలంచుకొని రోషావిష్టులై ఎట్లయియనను పగఁదీర్చుకో వలయునని నిశ్చయించుకొని అవకాశము కొఱకై వేచియుండిరి. ఒకనాఁడు రాముఁడు అనుచరులతో కూడ ఆశ్రమము నుండి వెడలిపోవుటను గమనించి ఆరాజపుత్రులు వెంటనే ఆశ్రమము నంజొచ్చి అగ్నిహోత్రగృహమునందు పరమాత్మధ్యాననిష్ఠుఁడైయున్న జమదగ్ని శీర్షమును ఖండించి పారిపోయిరి. ఆయన భార్య రేణుక గుండెలపై కొట్టుకొనుచు ''ఓరామా! రామా! రమ్ము'' అని ఎలుగెత్తి ఏడ్చుచుండెను. తల్లి యొక్క ఆర్తనాదమును విని రాముఁడు పరువెత్తుకొని వచ్చి తండ్రిని జూచి విలపించి క్రోధవేగవిమోహితుఁడై క్షత్రియుల నంతమొందింపక తప్ప దని తలంచి యాకళేబరమును కాపాడుచుంచుఁడని సోదరుల కప్పగించి యుద్ధసన్నద్ధుఁడై పరశువును గైకొని మాహిష్మతివైపు పరుగిడెను.
కోటలో గుమికూడిన రాజకుమారులు అనంతరకృత్యమును గూర్చి ఆలోచించుచుండిరి. బ్రహ్మార్షిహత్యనుగూర్చి విని ప్రజలు భాధనొందుచుండిరి. నగరము విగతప్రభ##మై యుండెను. రాముఁడు ప్రళయకాలరుద్రునివలె నగరమున ప్రవేశించి రాజకుమారుల తలలను ఖండించి కుప్పవేయఁగా నగరమధ్యమున అది యొకకొండవలెనయ్యెను. రక్తము కొండవాగువలె భయంకరమై ప్రవహించెను. అంతటితో శమింపక ఆభార్గవుఁడు అనుచరులను అన్ని దిక్కులకుపంపి వీరులైన క్షత్రియులందఱును శమంతపంచకమునకు రావలసినదిగా ఘోషణము గావించెను. క్షత్రియులును ఆఘోషణమును సహింపఁజాలక భార్గవుని ఎట్లయినను నిర్మూలింపవలయు ననుతలంపుతో సన్నద్ధులై గుమికూడి దండెత్తిపోయిరి. రాముఁడు వారి నందఱును నిశ్శేషముగా వధించెను. అట్లు రాముఁడు వీరాహ్వానము గావించు చుండఁగా ఇరువదియొక్క పర్యాయములు క్షత్రయవీరులు సబాలవృద్ధముగా సన్నద్ధులై వచ్చి ఆతని వైష్ణవధనువునకు పరశువునకు బలియైపోయిరి. అతఁడుఇంక ఎచ్చటను క్షత్రియవీరులు లెరని తెలిసికొని శాంతించి తండ్రియొక్క తలను శరీరముతో కూర్చి పితృమేధమును గావించెను. జమదగ్ని తపోమహత్త్వమున సప్తర్షిమండలమునఁ జేరి విరాజిల్లెను.

 PART-8
🙏🙏🙏
సేకరణ
*ధర్మము-సంస్కృతి*


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**

**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏

కామెంట్‌లు లేవు: