29, జులై 2023, శనివారం

పద్మినిఏకాదశి

 *పద్మినిఏకాదశి*


_పద్మపురాణంలోని శ్రీకృష్ణ  -  యుధిష్ఠిర సంవాదము:_


అధిక మాసములో శుద్ధ ఏకాదశికి "పద్మినీ ఏకాదశి" అని పేరు. 

ఈ వ్రతము పాటించిన యెడల పద్మనాభుడైన భగవంతుని యందు భక్తి కలుగును.

దశమినాడు ఏకభుక్తముతో యుండి నేలపై శయనించవలనెను. 

ఏకాదశి నాడు ప్రాతః స్నానమాచరించి గంధ - పుష్ప - ధూప - దీప - నైవేద్యములతో భగవానుని పూజ చేయవలెను. 

గ్రామ్యకథలు అనగా సంసారమునకు సంబంధించిన కథలు చెప్పుట, వినుట చేయరాదు. 

రాత్రియంబవళ్ళు కృష్ణకథలనే శ్రవణము, కీర్తనము చేయవలెను. 

మరునాడు భగవదర్చన చేసి నివేదన సమర్పించి ఆ భగవత్ప్రసాదాన్ని సాధు, బ్రాహ్మణులచే తినిపించి పారణము చేయవలెను.


*ఈ వ్రతమును గురించి పులస్త్యుడు - నారదునితో నిట్లు చెప్పెను!!*...


'ఓ నారదా ! ఒకానొకప్పుడు కార్తవీర్యార్జునుడు రావణుని జయించి కారాగృహమున బంధించెను, దీనికి సంబంధించిన కథ వినుము...


పూర్వము త్రేతాయుగమున హైహేయ వంశమున కార్తవీర్యార్జునుడికి వేయిమంది భార్యలు కలరు. 

వారి యందు సంతానము కలుగకపోవుటచే రాజ్యభారమును మంత్రికి అప్పగించి తపస్సు చేయటకు మందగిరికి వెళ్ళెను.

పట్టమనిషి అయిన పద్మినీ దేవిని వెంట తోడ్కొని వెళ్లి ఆ పర్వతము పై పదివేల సంవత్సరములు తపస్సు చేసిరి. 

పద్మినీదేవి ఇక్ష్వాకు వంశంలోని రాజు సత్యహరిశ్చంద్రుని కుమార్తె. 

అనేక సంవత్సరములు సుదీర్గతపస్సు చేయుటకే కార్తవీర్యార్జుని బలము క్షీణించి ఉండెను. 


అప్పుడు పద్మినీ దేవి 'అత్రి' మహర్షి భార్యయైన 'అనసూయాదేవి' సన్నిధిలో శరణాగతయై తన భర్త సుందరాకృతి పొందవలెనని మరియు మహాపరాక్రమశాలి, వీర్యవంతుడైన కుమారుడుకలుగుటకు మార్గము తెలుపమని ప్రార్ధించగా ఆమె 'ఓ పద్మినీ ! నీవు, నీ భర్త కలిసి అధిక మాసంలో శుద్ధ ఏకాదశి తిథి యందు ఉపవాసముండి శ్రీ కృష్ణారాధన చేయవలెను. 


ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది. 

దీనికి 'పద్మినీ ఏకాదశీ' అను వేరొక శుభనామము కలదు, ఈ వ్రతమును ఆచరించిన మహాపరాక్రమశాలియగు కుమారుడు జన్మించును.' అని తెల్పగా ఆమె అట్లే చేసి మహాబలశాలియై కుమారుని పొందెను.


'ఓ దేవర్షి! పూర్వము కార్తవీర్యార్జుని తండ్రి కూడా ఎంతో నిష్ఠతో ఈ వ్రతాచరణము చేసి అతిపరాక్రమవంతుడైన కార్తవీర్యార్జుని పుత్రునిగా పొందెను' అని పులస్త్యుడు నారదునికి వివరించెను.

శ్రీ కృష్ణుడు కూడా యుధిష్ఠిర మహారాజుతో ఈ విషయమును చెప్పెను.


పద్మపురాణంలో ఉత్తర ఖండంలో 29 వ అధ్యాయము నుండి 37 వ అధ్యాయములలో ఈ అధిక మాస మహిమను గురించి చెప్పబడినది. 

ఈ ఏకాదశిని 'కమలా' ఏకాదశి అని కూడా అందురు. 

భక్తి నిష్టలతో ఉపవాసము యుండి పురుషోత్తమ పూజాసల్పి భోగరాగముతోను, నైవేద్యము ద్వారా భగవంతుని సంతృప్తి పరచి వారి యొక్క నామ రూప - గుణ - లీలా మహిమలును శ్రవణ - కీర్తనములు చేసిన తప్పక భగవత్సాన్నిధానము, పాదకమలముల సేవా భాగ్యము శాశ్వతముగా పొందగలరు.


🔯

కామెంట్‌లు లేవు: